3. మూడోదశ. స’ - డ’
ఉత్పత్తి ప్రక్రియలో సరుకులు సరుకు పెట్టుబడి అవుతాయి. ఆ ఉత్పత్తి ప్రక్రియ ఆ సరికే అదనపు విలువని ఉత్పత్తి చేసి ఉంటుంది. అది సరుకు పెట్టుబడి. ఎందువల్లనంటే, అది అదనపువిలువను డబ్బులోకి మార్చాల్సి ఉంది. మార్చే దాకా అది సరుకుపెట్టుబడి. సరుకుల రూపంలో ఉన్నపెట్టుబడి, స.పె
సరుకుపెట్టుబడి చర్యలు
సరుకుల రూపంలో ఉన్నపెట్టుబడి సరుకులు చేసే చర్యలే చేస్తుంది. సరుకులు మార్కెట్ కోసం ఉత్పత్తయినవి, కనుక అమ్ముడవాలి. డబ్బులోకి మారాలి. అంటే, స - డ చర్య జరగాలి.
ఉదాహరణకి, పెట్టుబడిదారుడి సరుకు 1000 కిలోల నూలు అనుకుందాం. వడికే పనిలో వ్యయమయిన ఉత్పత్తిసాధనాల విలువ 10,000 రూపాయలు. ఉత్పత్తిచర్యలో కొత్తగా కలిసిన విలువ 2000. నూలు విలువ 12,000 రూపాయలు అనుకుందాం. అమ్మకంద్వారా ఆ ధర వచ్చింది అని కూడా అనుకుందాం. ఇది మామూలు మారక చర్యే కదా!
మరి దీన్ని పెట్టుబడి చర్యగా చేసింది ఏమిటి?
అది మారక చర్యలో వచ్చిన మార్పు కానేరదు. నూలు ఉపయోగపు స్వభావంలో మార్పు కాదు. ఎందుకంటే, ఆ నూలు అమ్మినవాని చేతుల్లో నుంచి నూలు గానే, ఒక ఉపయోగకర వస్తువుగా, కొన్నవాని చేతుల్లోకి వెళుతుంది. దాని విలువ పరిమాణంలోనూ ఎలాంటి మార్పూ లేదు. ఎందుకంటే, ఇచ్చిన ఆ నూలులో ఎంత విలువ ఉందో, కచ్చితంగా అంతే విలువ వచ్చిన ఆ డబ్బులోనూ ఉంది.
మరి మార్పు ఉన్నది ఎక్కడ? మార్పు ఉన్నది రూపంలో మాత్రమే. మొదట అది నూలులో ఉన్నది. ఇప్పుడు డబ్బులో ఉన్నది. ఆ విధంగా మొదటి దశ అయిన డ-స కీ, రెండోదశ అయిన స-డ కీ సారభూతమైన భేదం ఉంది. ముందు మదుపుపెట్టిన డబ్బు, చలామణీ ద్వారా సరుకుల్లోకి మారడంతో, డబ్బు పెట్టుబడిగా వ్యవహరించింది. ఇప్పుడు దాని చలామణీ మొదలవకముందే, ఉత్పత్తి ప్రక్రియనుండి సరుకు పెట్టుబడి స్వభావాన్ని పొందింది; సరుకు పెట్టుబడిగా వ్యవహరిస్తుంది.
పై ఉదాహరణకు సంబంధించి మొదటి విషయం
వడికేటప్పుడు పనివాళ్ళు కలిపిన కొత్తవిలువ 2000 రూపాయలు. దీంట్లో శ్రమశక్తికి పెట్టినది 1000. దోపిడీ రేటు 100 శాతం అనుకుంటే, అదనపు విలువ 1000 రూపాయలు. పెట్టిన పెట్టుబడి రు.11,000. వినియోగమైన ఈ ఉత్పాదక పెట్టుబడి, రెండు భాగాలుగా ఉంటుంది:
1. స్థిర భాగం 10,000.
2. అస్థిర భాగం 1000.
వెరసి రు.11,000. ఇది సుమారు 917 కిలోల నూలు విలువకు సమానం. ఇప్పుడు ఉత్పాదక పెట్టుబడి (ఉ.పె) విలువ, మొదటిదశలో పెట్టుబడిదారుడు మార్కెట్లో అమ్మేవాని వద్ద కొన్న సరుకుల విలువకి సమానం. ఉత్పత్తిసాధనాల విలువ 10,000+ శ్రమశక్తి విలువ 1000=11,000.
రెండోవిషయం. నూలు విలువలో రు.1000 అదనపువిలువ కలిసి ఉంటుంది. అది 83 కిలోల నూలు విలువకి సమానం. 1000 కిలోల నూలు విలువ వ్యక్తీకరణని స' అందాం. అప్పుడు స' = స+ స సరుకు విలువ పెరుగుదల (1000 రూపాయలకు సమానం). ఈ పెరిగిన విలువ సరుకు రూపంలో ఉంటే స. ఫె అందాం. రూపంలోఉంటే డ.ఫె అందాం. ఈ మొత్తం విలువని స' అందాం. మొత్తం విలువ రు.12000. స+స. ఫె=స'. 1000 కిలోల నూలు విలువ వ్యక్తీకరణ అయిన స ని స' గా చేసేది దాని పరమ పరిమాణం అయిన 12000 కాదు. ఎందుకంటే, ఏ యితర సరుకు విలువ అయినా దానిలో ఉన్న శ్రమ పరిమాణం చేత వ్యక్తమవుతుంది. కాబట్టి ఈ స ప్రత్యేకతేమీ లేదు. స ని స' గా చేసేది దాని సాపేక్ష విలువ పరిమాణం. దాని ఉత్పత్తిలో వినియోగమైన ఉ.పె తో పోల్చబడిన విలువ పరిమాణం. స విలువ 11000, స' విలువ 12,000. స' విలువలో స విలువ కలిసే ఉంటుంది. దీనికి తోడు ఉత్పాదక పెట్టుబడి సరఫరా చేసిన అదనపు విలువ 1000 కూడా ఉంటుంది. 1000 కిలోల నూలు అదనపువిలువ కలిసి పెరిగిన పెట్టుబడి విలువకు వాహిక. అలా పెరగడానికి కారణం: అది పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియ యొక్క ఉత్పాదితం అవడమే. దాని విలువ ఉ.పె విలువ కంటే ఎక్కువ.
ఎంత ఎక్కువ? అదనపు విలువ ఎంతో, సరిగ్గా అంత ఎక్కువ. స' పెట్టిన పెట్టుబడి విలువనీ, అదనపు విలువనీ కలిపి చూపిస్తుంది. ఇప్పుడు ఈ పెరిగిన పెట్టుబడి సరుకు పెట్టుబడి రూపంలో ఉంటుంది.
కాబట్టి ఉత్పత్తి ప్రక్రియ విశ్రాంతి తీసుకుంటుంది. అది ఇక ఎంతమాత్రమూ ఉత్పాదితాన్ని గానీ, విలువను గానీ సృజించేదిగా ఉండదు. ఏదైనా పెట్టుబడివిలువ ఉత్పాదితాల్నీ, విలువనీ సృజిస్తుంది. అయితే భిన్న స్థాయిల్లో. పునరుత్పత్తి స్థాయి విస్తరించవచ్చు, కుంచించుకుపోవచ్చు. ఇది ఆ పెట్టుబడి సరుకురూపాన్ని వదలి ఎంత వేగంగా డబ్బు రూపం తీసుకుంటుంది అనే దాన్నిబట్టి ఉంటుంది. అంటే ఆ సరుకు అమ్ముడుబోయే వేగాన్ని బట్టి అన్నమాట.
స'- డ' సరుకు రూపం నించి డబ్బు రూపం లోకి పరివర్తన.
ఉత్పత్తయిన సరుకు మొత్తమే పెరిగి ఉన్న పెట్టుబడి స' . ఆ సరుకు మొత్తం డబ్బులోకి మారాలి. అంటే, స '-డ ' చర్య జరగాలి. అమ్మిన సరుకు పరిమాణం ఇక్కడ నిర్ణాయకమైనది. 1000 కిలోల నూలూ అమ్ముడయితే, మొత్తం సరుకు డబ్బులోకి మారి 12000 అతని చేతిలో పడతాయి. ఒకవేళ 833 కిలోలే అమ్మితే, స్థిరపెట్టుబడి వరకే వస్తుంది. 917 కిలోలు అమ్మగలిగితే, మొత్తం పెట్టిన పెట్టుబడి (స్థిర 10000+అస్థిర 1000) తేలుతుంది. అయితే, అదనపు విలువ ఏమాత్రమూ డబ్బురూపంలో రాదు. కొంత అదనపువిలువ అయినా డబ్బవాలంటే, 917 కిలోలకు మించి అమ్మాలి. మొత్తం అదనపు విలువని పొందాలంటే, మొత్తం 1000 కిలోల నూలూ అమ్మితీరాలి. రు.12000 డబ్బులో అతను అమ్మిన సరుక్కి సమానకాన్ని మాత్రమే పొందుతాడు. కాబట్టి, చలామణీలో అతని లావాదేవీ మామూలు స-డ యే. అతని పనివాళ్ళకి రు.1000 కాకుండా రు.1200 ఇచ్చివుంటే, అదనపువిలువ రు.1000 కి బదులు రు.800 ఉండేది. దోపిడీ రేటు 100 శాతం బదులు 66.6 శాతం ఉండేది. అయితే నూలు విలువ మారదు; దానిలోని భాగాల విలువలు మాత్రమే మారతాయి. చలామణీ చర్య స-డ వల్ల జరిగేది 1000 కిలోల నూలు దాని విలువకు, అంటే, రు.12000 కు అమ్ముడవడమే.
విస్తరించిన వలయం రూపం
స' = స+స.ఫె (11,000+1000). స ఉ.పె కి సమానం. ఇది డ-స లో మదుపు పెట్టిన డ కి (11,000) సమానం. సరుకుల రాసి దాని విలువకు అమ్ముడయినట్లయితే స 11000 + పెరుగుదల 1000 (అదనపు ఉత్పాదితం 83 కిలోల నూలు విలువ). డబ్బులో వ్యక్తమయిన పెరిగిన ఉత్పాదితాన్ని డ.పె అందాం. అప్పుడు ఆ వలయం స'-డ' =స + స. ఫె - (డ+డ. ఫె) అవుతుంది. స - డ...ఉ.పె...స' - డ' తన విస్తారిత రూపంలో ఇలా ఉంటుంది:
డ- స (శ్ర.శ+ఉ.సా)...ఉ.పె...(స+స.ఫె)-(డ + డ.ఫె)
రెండూ సమాన మారకాలే
మొదటిదశలో పెట్టుబడిదారుడు ఉత్పత్తి సాధనాల్ని ఒక మార్కెట్లోనూ, శ్రమశక్తిని మరొక మార్కెట్లోనూ కొంటాడు. మూడో దశలో సరుకుల్ని తిరిగి మార్కెట్లో వేస్తాడు - ఇప్పుడు ఒకే మార్కెట్లోనే, సరుకుల మార్కెట్లోనే. అతను మొదట మార్కెట్లలో సరుకులు కొనడానికి పెట్టిన విలువకంటే ఎక్కువ విలువని మార్కెట్ నించి లాగుతాడనేది వాస్తవం. ఎందువల్లంటే, పెట్టిన దానికంటే ఎక్కువ విలువ వున్న సరుకుని మార్కెట్ కి తేవడం వల్ల. అతను విలువను డ ను మార్కెట్లో పెట్టాడు. దానికి సమానమైన స ని పొందాడు. ఇప్పుడు స+స.ఫె ని తిరిగితెచ్చాడు. దానికి సమానమైన డ+డ.ఫె ని పొందాడు.
మన ఉదాహరణలో, అతను పెట్టిన డబ్బు 917 కిలోల నూలు విలువకి సమానం. కాని మార్కెట్ కి 1000 కిలోల నూలు తెస్తాడు. అంటే మార్కెట్లో కొన్నదానికంటె ఎక్కువ విలువని తిరిగి తెస్తాడు. ఉత్పత్తి ప్రక్రియలో శ్రమశక్తి దోపిడీ ద్వారా అదనపు విలువని సృజించాడు. అది అదనపు ఉత్పాదితంలో వ్యక్తమవుతుంది. ఈప్రక్రియ యొక్క ఉత్పాదితం కనుకనే సరుకులరాసి సరుకు పెట్టుబడి - పెరిగిన పెట్టుబడి విలువకు వాహిక - అయింది. స' - డ' చర్య ద్వారా పెట్టిన పెట్టుబడీ, అదనపు విలువా డబ్బయ్యాయి.
అదనపువిలువ స.ఫె మొదటి సారి ఉత్పత్తిప్రక్రియలో వచ్చింది. సరుకు మార్కెట్లో తొలిసారి సరుకుల రూపంలో కనపడ్డది. అది దాని ప్రధమ చలామణీ రూపం. అందువల్ల స.ఫె-డ.ఫె అనేది దాని మొదటి చలామణీ చర్య లేక తొలి పరివర్తన. దీనికి వ్యతిరేకమైన చలామణీ చర్య డ. ఫె -స.
ఫె తో అనుసంధానం కావాల్సి ఉంటుంది
పెట్టిన పెట్టుబడి విలువా - కొత్తగా ఏర్పడ్డ అదనపు విలువా
ఈ రెంటి చలామణీని వేరువేరుగా పరిశీలిస్తాడు మార్క్స్. పెట్టిన పెట్టుబడీ, దానికి సరిపోయే అమ్మకాల భాగాన్ని గురించి చెబుతాడు. పెట్టిన పెట్టుబడి ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగపు రూపంలో మారిపోయింది. మొదట రూ.11000 విలువగల ఉత్పత్తి సాధనాలుగానూ, శ్రమశక్తిగానూ ఉంది. ఇప్పుడు అది రూ.11000 విలువగల నూలు రూపంలో ఉంది. ఇప్పుడు మనం గనక అదనపు విలువని పక్కనబెట్టి, పెట్టుబడి విలువ చేసే రెండు చలామణీ దశల్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే: 1. డ-స 2. స-డ చర్యలు ఉంటాయి. రెండో దాంట్లో స మొదటి దాంట్లో స కి భిన్నమైన ఉపయోగపు రూపంలో ఉంటుంది. అయితే విలువ మాత్రం అంతే ఉంటుంది. ఏమాత్రం మారదు. కాబట్టి, అది డ-స-డ రూపంలో నడుస్తుంది. ఎందుకంటే, ఇక్కడ సరుకు రెండుసార్లు చోటు మారుతుంది. అదీ వ్యతిరేక దశలో:
1. డబ్బు సరుకుల్లోకి మారడం 2. సరుకులు డబ్బుల్లోకి మారడం.
కాబట్టి ఇది డ-స-డ చలనం.
అదనపు విలువ
అదనపు విలువ స' లో భాగంగా ఉంటుంది. స'- డ' చలామణీ వల్ల అదనపువిలువ కూడా డబ్బవుతుంది. అదనపు విలువకు సంబంధించి ఇది తొలి పరివర్తన - సరుకు రూపం నించి డబ్బు రూపానికి. దాని మొదటి చలామణీ దశ స-డ.
రెండు వ్యాఖ్యలు
1. పెట్టిన పెట్టుబడి విలువ మొదటి రూపం అయిన డబ్బు లోకి తిరిగి మారడం అనేది సరుకు పెట్టుబడి చర్య.
2. ఇదే చర్యలో అదనపు విలువ దాని మొదటిరూపమైన సరుకురూపం నించి డబ్బులోకి మారడం అనేది ఇమిడి ఉంటుంది.
సరుకు పెట్టుబడిగాఉన్న సరుకులన్నీ, మనం అనుకున్నట్లు వాటి విలువలకే అమ్ముడయితే, స+స.ఫె దానికి సమానమైన డ+డ.ఫె లోకి మారుతుంది. డబ్బులోకి మారిన సరుకు పెట్టుబడి, ఇప్పుడు పెట్టుబడిదారుడి చేతిలో ఉంటుంది: డ+డ.ఫె (11000+1000=12000). ఇప్పుడు పెట్టిన పెట్టుబడి విలువా, అదనపువిలువా రెండూ అతనిదగ్గర ఉన్నాయి- డబ్బు రూపంలో, అంటే సార్వత్రిక సమానకం రూపంలో.
ప్రక్రియ ముగింపులో పెట్టుబడి విలువ మొదట ప్రక్రియలో ఏ రూపంలో ప్రవేశించిందో, తిరిగి అదే రూపం అంటే డబ్బు రూపం తీసుకుంటుంది. ఇప్పుడది డబ్బు కాబట్టి, డబ్బు పెట్టుబడిగా మరొక ప్రక్రియని ప్రారంభించగలదు. ప్రక్రియ మొదటిరూపమూ చివరి రూపమూ రెండూ డబ్బు పెట్టుబడే, డ. కనుక మనం ఈ చలామణీ ప్రక్రియ రూపాన్ని డబ్బు పెట్టుబడి వలయం అంటాం. చివరలో మారింది ఏమిటి? మారింది రూపం కాదు, మదుపు పెట్టిన విలువ పరిమాణం మాత్రమే.
ఆ విలువలు రెండూ నూలులో ఉన్నట్లు, కలిసి ఉండవు. పక్కపక్కనే ఉంటాయి. అమ్మకం ఆ రెంటికీ స్వతంత్ర డబ్బు రూపం ఇచ్చింది. మొత్తం విలువలో పెట్టుబడి విలువ (రు.11,000) పన్నెండింట 11 వంతులు(11/12). అదనపువిలువ (రు.1000) పన్నెండింట ఒక వంతు. సరుకు పెట్టుబడి డబ్బులోకి మారడం వల్ల ఈ వేర్పాటు జరిగింది. ఇది పెట్టుబడి పునరుత్పత్తి ప్రక్రియలో ముఖ్యమైనది. పెట్టుబడి విలువలో అదనపు విలువ మొత్తం కలుస్తుందా, లేక కొంతమాత్రమే కలుస్తుందా, అసలే కలవదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.
డ' లో దాని మొదటి రూపం అయిన డ రూపానికి తిరిగి వస్తుంది. అయితే ఆ డబ్బు పెట్టుబడిగా సిద్ధించిన రూపం.
మొదటి విషయం. పరిమాణంలో తేడా. మొదట డ, రు.11000. ఇప్పుడు అది డ', రు. 12,000 . ఈ తేడా డ..డ' చేత వ్యక్తమవుతుంది. వలయం యొక్క పరిమాణత్మకంగా భిన్నమైన రెండు చివరల చేతా. వీటి చలనం మూడు చుక్కలచేత సూచించబడుతుంది. డ' డ కన్న పరిమాణంలో పెద్దది. డ'-(మైనస్) డ= అదనపు విలువ, డ.ఫె . డ-డ' అనే చక్రీయ చలనం ఫలితంగా ఇప్పుడున్నది కేవలం డ'మాత్రమే. దాన్ని రూపొందిన ప్రక్రియ తయారయిన ఉత్పాదితంలో అంతరించిపోయింది. డ' ఇప్పుడు దాన్ని ఉనికిలోకి తెచ్చిన చలనం నుండి స్వతంత్రంగా ఉంది. ఆ చలనం వెళ్ళిపోయింది. దాని స్థానంలో డ' ఉంది. డ' ఒక గుణాత్మక సంబంధాన్ని కూడా చూపిస్తుంది. అయితే ఈ గుణాత్మక సంబంధం ఒకే మొత్తం లోని భాగాల మధ్య సంబంధంగా ఉంటుంది. అందువల్ల అది పరిమాణాత్మక సంబంధంగా ఉంటుంది. ఇప్పుడు పెట్టిన పెట్టుబడి (రు.11000), డబ్బులోకి మారిన పెట్టుబడిగా ప్రదర్శితమవుతుంది. అది తనను తాను చెక్కు చెదరకుండా చూసుకుంటుంది. అంతే కాక, డ.ఫె (రు.1000) కి భిన్నమైనదిగా ఉండడం వల్ల పెట్టుబడిగా డబ్బురూపం పొందింది. అది దానికదిగా పెరిగిన విలువ. దాని సొంత ఫలం. అదే కన్న పెరుగుదల. అది పెట్టుబడిగా ఎందుకు సిద్ధించిందంటే, విలువని సృజించిన విలువ అయినందువల్ల.
డ' అనేది పెట్టుబడి సంబంధంగా ఉంటుంది. డ అనేది ఇంకెంత మాత్రమూ కేవలం డబ్బుగా మాత్రమే ఉండదు. డబ్బు పెట్టుబడి పాత్ర పోషిస్తుంది. స్వయం విస్తృత విలువగా, అంటే తనంత తానే పెరిగే విలువగా, వ్యక్తమవుతుంది. తనంత తాను పెరిగే, అంటే, తన విలువ కంటే ఎక్కువ విలువని పొదిగే లక్షణం కలిగి ఉన్నవిలువ. డ కి డ’ లోని రెండో భాగంతో గల సంబంధంవల్ల డబ్బు పెట్టుబడి అయింది.
డబ్బు పెట్టుబడి వలయం డ' తో మొదలవదు. ఎప్పుడయినా డ తోనే మొదలవుతుంది. డ గా ఉన్నది డ' అయినా కావచ్చు. మదుపు పెట్టిన పెట్టుబడి విలువగానే మొదలవుతుంది; పెట్టుబడి సంబంధం యొక్క వ్యక్తీకరణగాకాదు. మరల అదనపు విలువని ఉత్పత్తిచెయ్యడానికి రు.12000 కొత్తగా పెట్టుబడిగా మదుపు పెట్టగానే, అది ఆరంభ బిందువు అవుతుంది. ట్టుబడిగా రు.11000 కిబదులు ఇప్పుడు రు. 12,000 ఉంది. అంతకు ముందు కంటే, ఎక్కువ డబ్బు, ఎక్కువ పెట్టుబడి విలువ ఉంది. అయితే, రెండు భాగాలమధ్య సంబంధం అదృశ్యం అయింది.
11000 కి బదులు ఇప్పుడు 12000 పెట్టుబడిగా పనిచేస్తుంది
మొదటి దశలో డ డబ్బుగా చలామణీ అవుతుంది. డబ్బుపెట్టుబడిగా చర్యలు చేస్తుంది. ఎందుకంటే, డబ్బు స్థితిలో మాత్రమే అది డబ్బు చేసే చర్యలు చేస్తుంది. అది ఉ.పె (ఉత్పాదక పెట్టుబడి) లోని అంశాలుగా మారుతుంది. అంటే ఉ.సా గానూ శ్ర.శ గానూ మారుతుంది. ఈ చలామణీ చర్యలో అది డబ్బు చేసే పనులే చేస్తుంది. అయితే ఇది పెట్టుబడి విలువ ప్రక్రియలో మొదటి దశ. అందువల్ల అదేసమయంలో డబ్బు పెట్టుబడి చర్య కూడా. ఎందువల్లంటే, కొన్న శ్ర.శ, ఉ.సా యొక్క ప్రత్యేక ఉపయోగపు రూపం వల్ల.
మరొకపక్క, డ' పెట్టిన పెట్టుబడి విలువ డ + (ఆ డ వల్ల వచ్చిన) అదనపు విలువ. డ' తనకు తాను పెరిగిన పెట్టుబడి విలువ - అదే పెట్టుబడి పూర్తి వలయపు చర్య. దాని లక్ష్యమూ, ఫలితమూ. ఈ ఫలితం డబ్బు రూపంలో, డబ్బులోకి మారిన డబ్బు పెట్టుబడిగా వ్యక్తమవుతుంది. డ కీ డ' కీ ఉన్న తేడా: డ.ఫె అనేది, స.ఫె యొక్క డబ్బు రూపం. డ' అనేది డ + డ.ఫె. ఎందువల్లంటే: స' అనేది స+స.ఫె. కాబట్టి స' లో పెట్టుబడి విలువకీ, అదనపువిలువకీ ఉన్న ఈ తేడా, వాటికున్న సంబంధమూ అవి డ' లోకి మారక ముందే వ్యక్త మవుతాయి. ఆ డబ్బుమొత్తంలో రెండు విలువ భాగాలూ ఒకదానికొకటి స్వతంత్రంగా ఎదురవుతాయి. అందువల్ల అవి రెండూ వేర్వేరు చర్యలకు నియోగించబడవచ్చు. స' డబ్బుగామారిన ఫలితమే డ'. ఇవి రెండూ పెరిగి ఉన్న పెట్టుబడి విలువకు భిన్న రూపాలు: ఒకటి సరుకు రూపం. రెండోది డబ్బు రూపం. అదయినా, ఇదయినా సిద్ధించిన పెట్టుబడే. ఎందువల్లంటే, పెట్టుబడి విలువ దాని ఫలమయిన అదనపు విలువతో కలిసి ఒకటై ఉంటుంది. అయితే, అదనపువిలువ పెట్టుబడి విలువనుంచి ఏర్పడినా, దాన్నించి వేరుగా ఉంటుంది. ఈ సంబంధం ఒకే మొత్తం డబ్బు విలువ యొక్క లేక సరుకు విలువ యొక్క రెండు భాగాలమధ్య సంబంధానికి, హేతువిరుద్ధమైన రూపంగా వ్యక్తం అయినప్పటికీ. అయితే, తనకు తాను పెరిగే విలువ వ్యక్తీకరణలుగా, డ' స' రెండూ ఒకే విషయాన్ని, రెండు భిన్న రూపాల్లో వ్యక్తం చేస్తాయి. అవి డబ్బు పెట్టుబడిగా, సరుకు పెట్టుబడిగా భిన్నమైనవి కావు. కాని డబ్బుగా, సరుకులుగా భిన్నమైనవి.
అవి స్వయం విస్తృత విలువగా, అంటే పెట్టుబడిగా పనిచేస్తున్నప్పుడు ఉత్పాదక పెట్టుబడి చర్య యొక్క ఫలితాన్ని మాత్రమే వ్యక్తం చేస్తాయి. పెట్టుబడి విలువ విలువని సృజించేది ఉత్పాదక పెట్టుబడి చర్యలో మాత్రమే. రెంటిలోనూ ఉన్న అంశం: డబ్బు పెట్టుబడీ, సరుకు పెట్టుబడీ రెండూ పెట్టుబడి ఉండే వైఖరులే. ఒకటేమో డబ్బు రూపంలో పెట్టుబడి, రెండోది సరుకు రూపంలో పెట్టుబడి. వాటిని వేరుచేసి చూపించే విశిష్ట చర్యలు డబ్బు చర్యలకూ, సరుకుల చర్యలకూ ఉండే తేడాలు మాత్రమే. సరుకు పెట్టుబడి ఉత్పత్తి ప్రక్రియ ఫలితమైన ఉత్పాదితం. అది దాని మూలాన్ని గుర్తుకు తెస్తుంది. అందువల్ల అది రూపంలో డబ్బు పెట్టుబడి కంటే ఎక్కువ హేతుబద్ధమైనది, అర్ధం అవడంలో తక్కువ ఇబ్బందికరమైనది.
ఉదాహరణికి, బంగారం ఉత్పత్తిలో సూత్రం: డ-స(శ్ర.శ+ఉ.సా) ....ఉ.పె....డ'(డ+డ.ఫె). ఇందులో డ' అనేది ఉత్పత్తి అయిన సరుకుగా లెక్కకొస్తుంది. ఎందువల్లంటే, మొదటి డ.పె లోబంగారం ఉత్పత్తికి కావలసిన అంశాల కోసం అడ్వాన్స్ చేసిన దానికంటే ఎక్కువ బంగారాన్నిఉ.పె చేకూరుస్తుంది. ఈ సందర్భంలో డ...డ'(డ+డ.ఫె) అనే సూత్రాని కున్న హేతువిరుద్ధ స్వభావం కనపడకుండా పోతుంది. ఇక్కడ డబ్బు మొత్తంలో కొంత భాగం, అదే మొత్తంలోని మరొక భాగాన్ని కన్న తల్లిలా కనబడుతుంది.
వచ్చే పోస్ట్: 4. పూర్తి వలయం