4.డబ్బు పెట్టుబడి : పూర్తి వలయం
మొదటి దశ డ-స (శ్ర.శ +ఉ.సా) ముగిశాక
చలామణీ ప్రక్రియ అప్పటికి ఆగుతుంది. ఉత్పత్తి ప్రక్రియ మొదలవుతుంది. కొన్న
సరుకుల వినియోగం వల్ల ఏర్పడే ఉత్పాదితం ఒక కొత్త సరుకు స'. డ-స చర్యతో ఆగిపోయిన చలామణీ,
స-డ చర్యతో పూర్తికావాలి. డబ్బులోకి మారవలసిన సరుకు కొత్తది స’. ఇది పదార్ధరీత్యానూ, విలువ రీత్యానూ
మొదటి స కంటే భిన్నమైనది.
కాబట్టి చలామణీ వరస ఇలా కనబడుతుంది:
1. డ-స1 ; 2.. స‘2 -డ’. ఇక్కడ మొదటి సరుకు స1 యొక్క రెండో దశలో, మరింత విలువగల భిన్నమైన ఉపయోగపు విలువ రూపం స'2 వస్తుంది. ఉత్పాదక పెట్టుబడి చర్య వల్ల కల్గిన అంతరాయంలో, ఉత్పాదక పెట్టుబడి రూపాలయిన స అంశాలనుండి కొత్తరకం సరుకు స1 ఉత్పత్తయింది. పెట్టుబడి మనకి మొదట కనబడ్డ మొదటి రూపం: డ-స-డ'.
దాని విస్తారిత రూపం 1) డ-స1 2) స1-
డ'. ఒకే సరుకుని రెండుసార్లు చూపిస్తుంది. తొలిదశలో రెండుసార్లూ, డబ్బు అదే సరుకుతో మారుతుంది. రెండో
దశలో తిరిగి మరింత డబ్బులోకి మారుతుంది. మొదటిదశలో ఖర్చుపెట్టిన డబ్బు, రెండో
దశలో వెనక్కి వస్తుంది. ఒక పక్క, రెండు దశల్లోనూ డబ్బు బయలుదేరిన చోటికే తిరిగి
వస్తుంది. మరొకపక్క, పెట్టిన దానికంటే, ఎక్కువ
డబ్బు తిరిగి వస్తుంది. ఆమేరకు, డ-స…స'-డ' అనే ఫార్ములా
డ-స-డ' అనే సాధారణ ఫార్ములాలో ఇమిడి ఉంది. ఈ రెండు పరివర్తనల్లోనూ సమాన విలువలే మారతాయి. విలువలో మార్పు
పూర్తిగా ఉత్పత్తి ప్రక్రియలో జరుగుతుంది. చలామణీ చర్యల్లో సమాన విలువలు చోటు
మారతాయి. డ-స సమానవిలువలు. అలాగే స'-డ' కూడా సమాన విలువలే.
ఇప్పుడు విస్తరించిన చలన రూపం: డ-స...ఉ.పె...స'-డ'.
ఇంకొంత విస్తరించిన ఫార్ములా రూపం: డ-స (శ్ర.శ+ఉ.సా)...ఉ.పె... స' (స+స.ఫె) - డ' (డ+డ.ఫె).
ఇక్కడ పెట్టుబడి వరస మార్పులకు గురయ్యే
విలువగా కనబడుతుంది. ఆమార్పులు మొత్తం ప్రక్రియలో అన్ని దశల్నీ రూపొందిస్తాయి. వాటిలో
రెండు చలామణీకి చెందినవి. ఒకటి ఉత్పత్తికి సంబంధించినది. ప్రతి దశలోనూ పెట్టుబడి
విలువకి ఒక భిన్నమైన రూపం ఉంటుంది. అలాగే అది చేసే చర్య,
ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఈ చలనం లోపల, మదుపు పెట్టిన విలువ భద్రంగా ఉంటుంది.
అంతే కాదు, ఆ విలువ పరిమాణం పెరుగుతుంది కూడా. ముగింపు దశలో విలువ ప్రక్రియ ప్రారంభంలో ఉన్న రూపం (డబ్బు) లోకి తిరిగి
వస్తుంది. కాబట్టి, ఈ మొత్తం ప్రక్రియ, వలయాల్లో నడిచే
ప్రక్రియగా ఉంటుంది.
చలామణీలో పెట్టుబడి విలువ తీసుకునే
రెండు రూపాలూ డబ్బు పెట్టుబడికీ,
సరుకు పెట్టుబడికీ సంబంధించినవి. ఉత్పత్తి దశకి
సంబంధించిన రూపం ఉత్పాదక పెట్టుబడి రూపం. పూర్తి వలయంలో పెట్టుబడి ఈ రూపాల్ని
తీసుకుంటుంది, తిరిగి వదిలేస్తుంది. ఏ రూపంలో ఉన్నప్పుడు ఆ రూపం చేసే చర్య
చేస్తుంది.అలాంటి పెట్టుబడే పారిశ్రామిక పెట్టుబడి. ఇక్కడ పారిశ్రామిక అనే మాట
పెట్టుబడిదారీ ప్రాతిపదికన నడిచే ప్రతి ఉత్పత్తి శాఖకీ వర్తిస్తుంది. పారిశ్రామిక పెట్టుబడి ఈ మూడు రూపాల్నీ, ఒకదాని తర్వాత
మరొకదాన్ని, తీసుకుంటుంది.మూడు దశలూ ఆలశ్యం లేకుండా ఒకదాన్నుంచి, మరొకదాన్లోకి
పోతున్నంతవరకూ పెట్టుబడి వలయం సజావుగా సాగుతుంది.
ఆలస్యం జరిగితే:
1. తొలిదశ స-డ లో పెట్టుబడి కదలకపోతే, డబ్బు పెట్టుబడి నిల్వ (hoard) గాఉండిపోతుంది.
2. ఇదే గనక ఉత్పత్తి దశలో జరిగితే, ఉత్పత్తి సాధనాలు వినియోగం కావు. శ్రమ
శక్తీ వినియోగం అవదు.
3. మూడో దశ అయిన స’-
డ’ నిలిచిపోతే, సరుకులు
అమ్ముడవవు. పొగుపడి ఉంటాయి.
మరొక పక్క, వివిధదశల్లో కొంతకాలం పాటు పెట్టుబడి కదలకుండా ఉంటుంది. ఈ పరిస్థితి
అసలు వలయం వల్లనే అవసరమవుతుంది. ప్రతి దశలోనూ పారిశ్రామిక పెట్టుబడి ఒక నిర్దిష్ట
రూపానికి కట్టుబడి ఉంటుంది. అది డబ్బు పెట్టుబడి గానో, ఉత్పాదక
పెట్టుబడిగానో, సరుకు పెట్టుబడిగానో ఉంటుంది. ఏ రూపంలో ఏచర్య చెయ్యాలో ఆచర్య
చేస్తుంది. చేశాకనే అది కొత్త పరివర్తన దశలోకి పోగలదు. ఈ విషయం స్పష్టంగా
తెలియడానికి, మన ఉదాహరణలో ఇలా అనుకున్నాం: ఉత్పత్తి దశలో తయారయిన సరుకుల పరిమాణం
యొక్క పెట్టుబడి విలువ, మొదట మదుపుపెట్టిన డబ్బు విలువకి సమానం; వేరే మాటల్లో, డబ్బు రూపంలో
మదుపు పెట్టిన పెట్టుబడి విలువ, మొత్తంగా ఒక
దశనుంచి మరొక దశలోకి వెళుతుంది. అయితే, స్థిర పెట్టుబడిలో ఒక భాగమైన శ్రమ
సాధనాలు చాలా ఉత్పత్తి ప్రక్రియల్లో పాల్గొంటాయి. యంత్రాలు చాలా కాలం పని చేస్తాయి. అందువల్ల తమ విలువని కొద్దికొద్దిగా
ఉత్పాదితాలకు బదిలీ చేస్తాయి. ఈ పరిస్థితి పెట్టుబడి చక్రీయచలనాన్ని ఏమేరకు
మారుస్తుందో ముందుముందు చూస్తాము. ప్రస్తుతానికి ఈ క్రింది విషయం చాలు:
మన ఉదాహరణలో ఉత్పాదక పెట్టుబడి విలువ
రు.11,000. అందులో ఫాక్టరీ భవనాలు, యంత్రాలు వంటి వాటి సగటు అరుగుదలలో
కొంత భాగం మాత్రమే ఉంటుంది. అంటే,
1060 కిలోల పత్తితో 1000 కిలోల నూలు తియ్యడానికి ఒక వారంలో 60 గంటలపాటు
వడకాలి. కాబట్టి, ఆ నూలు వడకడానికి వాటి విలువలో కొంత ఖర్చవుతుంది. మిగిలినది
ఉంటుంది.మళ్ళీ మళ్ళీ పత్తిని వడికినప్పుడు కొంతకొంత పోతూ ఉంటుంది - వాటి విలువ అంతా అయిపోయేదాకా.
ఇక్కడ రెండు విషయాలు స్పష్టం:
1. మదుపు పెట్టిన పెట్టుబడి మొదట సాధనాల్లోకి మారాలి. అంటే, ఉత్పాదక
పెట్టుబడి చర్య మొదలవ్వాలంటే, ముందుగా మొదటి దశ అయిన డ-స జరిగి తీరాల్సి ఉంటుంది.
2. ఉత్పత్తి ప్రక్రియ జరిగేటప్పుడు నూలులో చేరిన
రు. 11000 పెట్టుబడి విలువ,
1000 కిలోల నూలు విలువలో భాగం కాలేదు. ఆ నూలు రెడీ అయ్యే వరకూ చలామణీ
దశ స’-డ’ లో ప్రవేశించ
జాలదు. వడకబడే వరకూ అమ్మకానికి రాదు.
విత్తనాలూ - ధాన్యమూ
పోతే, దీనికి భిన్నమైన, వ్యతిరేకమైన
సందర్భమూ ఉంటుంది. అదేమంటే: ఉత్పత్తి
నుండి ఉత్పాదితం వేరుగా ఉండదు. ఇక్కడ ఉత్పత్తి ప్రక్రియే అమ్ముడవుతుంది. సాధారణ
సూత్రంలో, ఉత్పాదితాన్ని ఉత్పాదక పెట్టుబడి అంశాలకు భిన్నమైన వస్తువుగా, ఉత్పత్తి ప్రక్రియకు బయట ఉన్న వస్తువుగా పరిగణిస్తున్నాము. ఉత్పత్తి ప్రక్రియ ఫలితం వస్తువు అయినప్పుడల్లా పరిస్థితి ఇదే - ఉత్పాదితంలో ఒక భాగం మళ్ళీ మొదలైన ఉత్పత్తిలో ఒక
అంశంగా తిరిగి ప్రవేశించినా సరే. ధాన్యం దాని సొంత ఉత్పత్తిలో విత్తనాలవుతాయి.
కాని ఉత్పాదితం ధాన్యమే.అందువల్ల ఇతర సంబంధిత అంశాలైన శ్రమ శక్తికీ, పరికరాలకూ, ఎరువుకూ
భిన్నమైన రూపంలో ఉంటుంది.
రవాణా పరిశ్రమ
కొన్ని స్వతంత్ర పరిశ్రమ శాఖల్లో
ఉత్పత్తయ్యేది పాదార్ధిక ఉత్పాదితం కాదు, సరుకు కాదు. ఇలాంటి వాటిల్లో ఒకచోటనుంచి మరొకచోటికి పంపే పరిశ్రమ -మనుషుల్ని, వస్తువుల్ని
పంపేది కావచ్చు, ఉత్తరాలు, టెలిగ్రాంలు
పంపేది కావచ్చు. ఈ పరిశ్రమ ఆర్ధికంగా ముఖ్యమైనదే.
మాన్యుఫాక్చరర్ ముందు వస్తువులు
ఉత్పత్తిచేస్తాడు. ఆ తర్వాతనే వినియోగదారుల కోసం చూస్తాడు. ఉత్పత్తి ప్రక్రియ
పూర్తయ్యాకనే, ఆ ప్రక్రియనుండి వేరుపడి, ఒక సరుకుగా చలామణీలోకొస్తుంది. ఉత్పత్తీ, వినియోగమూ స్థల కాలాల్లో వేరుపడిన రెండు చర్యలుగా కనబడతాయి. రవాణా
పరిశ్రమ కొత్త ఉత్పాదితాన్ని తయారు చెయ్యదు. అది కేవలం మనుషుల్నీ, వస్తువుల్నీ ఒక
తావు నించీ మరొక తావుకి చేరవేస్తుంది. ఉత్పత్తీ, వినియోగమూ ఏక కాలంలో జరుగుతాయి.
ఉత్పత్తయిన క్షణంలోనే వినియోగమవుతాయి. ఫలితం చోటు మార్పిడి. ఉదాహరణకి, ఇంగ్లండ్ లో ఉత్ప్త్తయిన
నూలు, ఇప్పుడు ఇండియాలో ఉండవచ్చు.
రవాణ పరిశ్రమ అమ్మేది చోటు
మార్పుని. రవాణ ప్రక్రియతో దాని ఫలితం కలిసి
ఉంటుంది. రెంటినీ విడదీయడం వీలవదు.
మనుషులూ, వస్తువులూ రవాణా సాధనాలతో కలిసి ప్రయాణం చేస్తారు. దాని ప్రయోజన
ప్రభావం ఉత్పత్తి ప్రక్రియ జరిగే సమయంలోనే వినియోగం కాగలుగుతుంది. ఈ ప్రక్రియ బయట
వినియోగం ఉండదు. వర్తక వస్తువులు అలా
కాదు. ప్రక్రియ ముగిసేదాకా చలామణీ లోకి రావు.
దీని మారకం విలువ ఎలా
నిర్ణయమవుతుంది?
అన్ని ఇతర సరుకుల విలువల్లాగే -
ఉత్పత్తిలో వినియోగమయిన అంశాల విలువ
(శ్రమశక్తి విలువ+ ఉత్పత్తి సాధనాల విలువ)చేతా, రవాణా కార్మికుల
అదనపు శ్రమ సృజించిన అదనపు విలువ చేతా నిర్ణయమవుతుంది. రవాణా పరిశ్రమకి సూత్రం:
డ-స (శ్ర.శ+ఉ.సా)...ఉ.పె-డ’. ఇక్కడ చెల్లింపూ,
వినియోగమూ ఉత్పత్తి ప్రక్రియకే. కనుక, ఈ సూత్రం, అమూల్య లోహాల
ఉత్పత్తి రూపం వంటిదే. తేడా ఒక్కటే: డ’ అనేది ఉత్పత్తి ప్రక్రియలో ఏర్పడ్డ
ప్రయోజనకర ఫలితం, పరివర్తన చెందిన రూపానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.
పారిశ్రామిక పెట్టుబడీ - వర్గ వైరుధ్యమూ
పారిశ్రామిక పెట్టుబడి స్థితిలో
ఉన్నప్పుడు మాత్రమే, పెట్టుబడి అదనపు ఉత్పాదితాన్ని లేక అదనపు విలువని సృజించి, దాన్ని
స్వాయత్తం చేసుకుంటుంది. పారిశ్రామిక ఉత్పత్తికి పెట్టుబడిదారీ స్వభావం
ఉండితీరాలి. అది ఉన్నదంటే, పెట్టుబడిదారులకీ,
వేతనకార్మికులకీ వర్గ వైరుధ్యం ఉన్నట్లే. పెట్టుబడి సామాజిక ఉత్పత్తిని ఏ మేరకు
పట్టుకుంటుందో ఆ మేరకు, శ్రమప్రక్రియ యొక్క సాంకేతికతా, సామాజిక నిర్వహణా విప్లవీకరించబడతాయి. అంటే వాటిలో పెను మార్పులు సంభవిస్తాయి. దాంతోపాటుగా ఆర్ధిక-చారిత్రక
సమాజ తీరూ మారుతుంది.
పారిశ్రామిక, వర్తక, ద్రవ్య పెట్టుబడుల తేడా
పారిశ్రామిక పెట్టుబడి కంటే ముందే, కనపడ్డ పెట్టుబడి రకాల గురించి చెబుతాడు. అవి ఆసామాజిక ఉత్పత్తి జరిగిన పాత పరిస్థితుల్లో కనపడ్డవి, లేదా అది
క్షీణిస్తున్న పరిస్థితుల్లో కనపడ్డవి. అవి (ఆ పెట్టుబడి రకాలు) పారిశ్రామిక
పెట్టుబడికి లోబడ్డాయి.
కనుక అందుకు తగ్గట్టుగా అవి పనిచేసే పద్ధతిని
మార్చుకున్నాయి. ఇప్పుడు అవి పారిశ్రామిక పెట్టుబడి ప్రాతిపదిక మీద మాత్రమే
నడుస్తాయి. ఆ ప్రాతిపదికతో మాత్రమే బతుకుతాయి, నశిస్తాయి. ఆ ప్రాతిపదికతో పాటే కలిసి నిలబడతాయి,
కలిసే అంతరిస్తాయి. డబ్బు పెట్టుబడీ, సరుకు పెట్టుబడీ
ప్రత్యేక వ్యాపార శాఖలుగా, పారిశ్రామిక పెట్టుబడి పక్కనే పని చేస్తున్న మేరకు,
అవి
ఇప్పుడు పారిశ్రామిక పెట్టుబడి చలామణీ రంగంలో నిరంతరం/నిర్విరామంగా
తీసుకుంటూ తిరిగి వదిలేస్తూ ఉండే వివిధ క్రియా రూపాల మనుగడ రీతులు మాత్రమే; సామాజిక శ్రమవిభజన కారణంగా ఆ రీతులు స్వతంత్ర మనుగడ సాధించి, ఒకేవైపు అభివృద్ధయ్యాయి.
వ్యష్టి పెట్టుబడి
డ-డ’ వలయం ఒకవైపు సరుకుల సాధారణ చలామణీతో కలిసిపోతుంది; దాన్నుండి
బయలుదేరి తిరిగి దానిలోకే వచ్చి చేరుతుంది. దానిలో భాగమవుతుంది. మరొకపక్క, వ్యష్టి
పెట్టుబడి దారుడికి అతని పెట్టుబడి విలువ యొక్క ప్రత్యేకమైన స్వతంత్ర చలనం
అవుతుంది. ఈ చలనం సరుకుల
సాధారణ చలామణీ లోపల ఒక భాగంగా
బయలుదేరుతుంది; ఒక భాగం దాని బయట స్వతంత్ర స్వభావాన్ని ఎప్పుడూ నిలుపుకుంటుంది. ఎందువల్లంటే,
1. డ-స, స’-డ’- చలామణీ రంగంలో జరుగుతాయి. ఈ రెండు దశలూ, పెట్టుబడి చలనపు
దశలు అయినందువల్ల, వాటికి నిర్దిష్టమైన క్రియాత్మక స్వభావం ఉంటుంది. డ-స లో స
అనేది శ్రమశక్తి గానూ, ఉత్పత్తిసాధనాలుగానూ
పాదార్ధికంగా నిర్ణయమైనది; స’-డ’ లో పెట్టుబడి విలువా,
అదనపు విలువా డబ్బయ్యాయి.
2. ఉత్పత్తి ప్రక్రియ ఉత్పాదక వినియోగాన్ని ఇముడ్చుకొని ఉంటుంది.
3. మొదలు పెట్టిన చోటికే డబ్బు తిరిగి వస్తుంది. ఇలా రావడం మూలంగా, డ-డ’ చలనం దానికదిగా
పూర్తి వలయం అవుతుంది.
అందువల్ల, ప్రతి వ్యష్టి
పెట్టుబడీ, ఒకపక్క, డ-స, స'-డ', రెండు చలామణీ భాగాల్లోనూ, సాధారణ సరుకుల
చలామణీలో ఒక ఏజెంట్ గా ఉంటుంది. సాధారణ సరుకుల చలామణీలో వ్యష్టి పెట్టుబడి
డబ్బుగానో, సరుకుగానో చెర్య చేస్తుంది.
ఆవిధంగా అది సరుకుల లోకంలో జరిగే పరివర్తనల గొలుసులో లింకుని ఏర్పరుస్తుంది. మరొకపక్క, అది (వ్యష్టి పెట్టుబడి) సాధారణ చలామణీలో తన
సొంత స్వతంత్ర వలయాన్ని వివరిస్తుంది. తన వలయంలో ఉత్పత్తి రంగం ఒక పరివర్తన దశని
ఏర్పరుస్తుంది. ఈ పెట్టుబడి మొదట ఎక్కడ బయలుదేరిందో అక్కడకే తిరిగి వస్తుంది.
ఏ రూపంలో బయలుదేరిందో, అదే రూపంలో తిరిగి వస్తుంది.
తన సొంత వలయం ఉత్పత్తి ప్రక్రియలో తన నిజ
పరివర్తనని ఇముడ్చుకొని ఉంటుంది. అదే సమయంలో తన వలయం లోపల తన విలువ పరిమాణాన్ని మార్చుకుంటుంది. అది తిరిగి వచ్చేది డబ్బు విలువగా మాత్రమే కాదు, పెరిగిన డబ్బు
విలువగా కూడా.
డ-స...ఉ.పె...స’-డ’ పరిశీలన
దీన్ని పెట్టుబడి వలయం యొక్క ప్రత్యేక
రూపంగా, దాని ఇతర రూపాలతో పాటు పరిశీలిస్తాడు మార్క్స్. ఇతర రూపాల్ని తర్వాత విశ్లేషిద్దాం అంటాడు. ఈ వలయానికి ప్రత్యేక లక్షణాలు
ఉన్నాయి. ఇతర పెట్టుబడి వలయాలనుంచి ఈ వలయాన్ని వేరుపరిచే లక్షణాలు:
1. అది డబ్బు పెట్టుబడి వలయంగా కనబడుతుంది. ఎందువల్లంటే: పారిశ్రామిక
పెట్టుబడి డబ్బు (రూపంలో ఉన్న) పెట్టుబడిగా మొత్తం ప్రక్రియకు ఆరంభ బిందువు గానూ
ఉంటుంది, తిరిగి వచ్చే బిందువుగానూ ఉంటుంది. ఈ సూత్రం వ్యక్తపరిచే వాస్తవం:
డబ్బు ఇక్కడ డబ్బుగా ఖర్చవదు, కేవలం మదుపు
పెట్టబడుతుంది. కాబట్టి అది డబ్బు(రూపంలో ఉన్న) పెట్టుబడి. ఇది మరొక విషయాన్ని కూడా
తెలుపుతుంది: ఈ చలనం యొక్క లక్ష్యం మారకం విలువ, ఉపయోగపు విలువ కాదు.
విలువ కనబడే విస్పష్ట రూపం, స్వతంత్ర రూపం
నిజమైన డబ్బు. కాబట్టి డ...డ’ అనేవి మొదటి, చివరి బిందువులు. ఇవి
పెట్టుబడి దారీ ఉత్పత్తి లక్ష్యం డబ్బు పెంచుకోవడమే అని తెలుపుతాయి.
డబ్బు పెంచుకోవడం కోసం ఉత్పత్తి ప్రక్రియ ఒక అనివార్యమైన మధ్యంతర కొలికిగా
కనిపిస్తుంది. అందువల్ల పెట్టుబడిదారీ
ఉత్పత్తి విధానం నడుస్తున్న అన్ని దేశాలనూ, ఉత్పత్తి ప్రక్రియ ప్రమేయం లేకుండానే
డబ్బు సంపాదించాలనే పిచ్చి అప్పుడప్పుడు పట్టుకుంటుంది.
2. ఈవలయంలో ఉత్పత్తి దశ రెండు చలామణీ దశలైన డ-స... స'-డ' ల మధ్య
అంతరాయాన్ని సూచిస్తుంది.
అది తిరిగి సాధారణ చలామణీ అయిన డ-స-డ' లో ఒక మధ్యంతర
లింకుని తెలుపుతుంది. ఉత్పత్తి ప్రక్రియ ఒక వలయాన్ని వివరించే రూపంగా కనబడుతుంది. మదుపు పెట్టిన విలువని
పెంచేసాధనంగా కనబడుతుంది. అందువల్ల అసలు ఉత్పత్తి ప్రక్రియ లక్ష్యమే ధనార్జన
అయినట్లు అగపడుతుంది.
3. దశల వరస స -స తో
మొదలవుతుంది. కాబట్టి చలామణీ రెండో లింకు స'-డ'. వేరేమాటల్లో: ఆరంభ బిందువు
డబ్బు-దానికదే పెరగాల్సిన డబ్బు పెట్టుబడి; చివరి బిందువు డ’,దానికదే పెరిగిన
డబ్బు పెట్టుబడి, డ+డ.ఫె.ఇందులో డ దాని బిడ్డ డ.ఫె తో సహా చేతికందినదిగా
వ్యక్తమవుతుంది. ఇదే డ వలయాన్ని, ఉ.పె వలయం నుంచీ, స‘ వలయం నించీ వేరుపరచి చూపించేది. ఇది ఆపని రెండు మార్గాల్లో చేస్తుంది:
A. ఒకపక్క, ఆచివరా, ఈ చివరా ఉండే డబ్బు రూపం ద్వారా. డబ్బు అనేది విలువ మనుగడ యొక్క
స్వతంత్రమైన రూపం, గ్రహించగలిగిన రూపం.
స్వతంత్ర రూపంలో ఉత్పాదితం విలువ. అందులో సరుకుల ఉపయోగపు విలువ జాడే
లేకుండా పోతుంది.
B. మరొక పక్క, ఉ....ఉ రూపం తప్పనిసరిగా ఉ...ఉ.పె '(ఉ+ఉ.పె) అవాలి అనేదేమీ లేదు. స-స’ రూపంలో రెండు
చివరలకూ మధ్య విలువకి సంబంధించి ఏ తేడా కనబడదు. అందువల్ల డ-డ’ సూత్రం లక్షణమైన
పెట్టుబడి విలువ దాని ఆరంభ బిందువు, పెరిగి, తిరిగి వచ్చే పెట్టుబడి విలువ అంతిమ
బిందువు. దీన్ని బట్టి, ఈ మొత్తం చర్యకి,
మదుపు పెట్టిన పెట్టుబడి విలువ సాధనంగానూ, పెరిగిన
పెట్టుబడి విలువ ఫలితంగానూ కనబడతాయి; మరొకవైపు ఈ సంబంధం కనపడేది డబ్బురూపంలో, స్వతంత్ర విలువ
రూపంలో; అందువల్ల, డబ్బు పెట్టుబడి డబ్బుని తెచ్చే డబ్బుగా వ్యక్తం అవుతుంది. ఈ మొత్తం చర్యకు
విలువచేత అదనపువిలువని ఏర్పరడం పరమార్ధం అని
తెలుస్తుంది; అంతే కాక,ఆ విలువ మిలమిలమెరిసే డబ్బు రూపంలో ఉంటుందని కూడా వ్యక్తమవుతుంది.
4. డ’ పెరిగిన డబ్బు మొత్తం. దాని రూపం వలయాన్ని మొదలుపెట్టిన డ రూపమే. అదీ డబ్బే, ఇదీ డబ్బే. అయితే డ కన్నా డ’ మరింత డబ్బు. కాని రూపం అదే. అందువల్ల డ’ కూడా అలాంటి
మరొక వలయాన్ని మొదలుబెట్టగలుగుతుంది. డబ్బు పెట్టుబడి వలయం, డబ్బు దానికదే
పెరిగే ప్రక్రియని, సంచయన ప్రక్రియని తెలుపుతుంది. దానిలో వినియోగం ఉత్పాదక వినియోగం
మాత్రమే.
వినియోగం గురించి
డబ్బు పెట్టుబడి వలయంలోవినియోగం, డ-స ద్వారా
ఉత్పాదక వినియోగంగా వ్యక్తమవుతుంది. వ్యష్టి పెట్టుబడిలో చేర్చబడింది ఈ వినియోగం
మాత్రమే. ఈవిషయాన్ని డ-స
(శ్ర.శ+ఉ.సా) తెలుపుతుంది.
శ్రామికుని వినియోగం
డ-శ్ర.శ శ్రామికుని వైపు నించి చూస్తే:
శ్ర.శ-డ. కార్మికుని సొంత వాడకం శ్ర.శ-డ-స (జీవితావసర వస్తువులు).ఇది మొదటి చలామణీ
దశ. రెండో దశ అయిన డ-స వ్యష్టి పెట్టుబడి
వలయంలో ఉండదు. అయితే ఈ రెండో దశని మొదలు పెట్టేదీ, దానికి ఆధారంగా ఉండేదీ వ్యష్టి
పెట్టుబడి వలయమే. ఎందుకంటే, శ్రామికుడు బతకాలి;
అందుకు వ్యక్తిగత వినియోగం ద్వారా తన్ను తాను బతికేట్లు చూసుకోవాలి. ఎప్పుడూ అతను పెట్టుబడిదారుడు
దోచుకోడానికి మార్కెట్లో ఉండాలికదా!
పెట్టుబడిదారుడి వినియోగం
కాని పెట్టుబడి వలయంలో ప్రవేశించే సరుకులైన ఉత్పత్తి సాధనాలు, ఉత్పాదక వినియోగానికి మాత్రమే పోషకాలు. శ్ర.శ-డ చర్య కార్మికుని
సొంత వియోగానికి తోడ్పడుతుంది.జీవితావసర వస్తువుల్ని అతని రక్త మాంసాలుగా
మారుస్తుంది.
అలాగే పెట్టుబడి దారుడు కూడా ఉండాలికదా! పెట్టుబడిదారుడిగా చర్య
చెయ్యాలంటే అతను బతికి ఉండడానికి వినియోగం అవసరం. అందుకోసమే అయితే, బతికి ఉండడంకోసమే అయితే, కార్మికుడు ఎంత వినియోగిస్తాడో, అంతే వినియోగించాల్సి
ఉంటుంది. ఈ చలామణీ ప్రక్రియ రూపం ఊహించేదంతా అంతమాత్రమే.అయితే ఇదయినా వ్యక్తం
కాదు-కారణం ఈ ఫార్ములా డ' తో ముగుస్తుంది. అంటే, ఇప్పుడు పెరిగిన డబ్బు
పెట్టుబడిగా తన చర్యని వెంటనే మళ్ళీ మొదలెట్టగలదు.
స’-డ’ చర్యలో స’ అమ్మకం ఇమిడి ఉంటుంది. అదే అటు వైపు డ’-స’ కొనుగోలు. అంతిమ విశ్లేషణలో ఏ సరుకునయినా కొనేది దాని ఉపయోగపు విలువ కోసమే, వినియోగం కోసమే.ఆ వినియోగం వ్యక్తిగతం కావచ్చు, లేక, ఉత్పత్తి ప్రక్రియలో కావచ్చు.అయితే ఈ వినియోగం వ్యష్టి పెట్టుబడివలయంలో ప్రవేశించదు- దాని ఉత్పాదితం స’. ఈ ఉత్పాదితం వలయంనించి బయటకు పంపబడుతుంది. ఎందుకంటే అది అమ్మకానికి తయారైన సరుకు. స’ ఉత్పత్తిదారుని వాడకం కంటే, ఇతరుల వాడకం కోసం తయారైన సరుకు. ఆవిధంగా డ-స...ఉత్పత్తి...స’- డ’ ప్రాతిపదికగా గల మర్కెంటలిష్టు వ్యవస్థ సమర్ధకులు సుదీర్ఘోపన్యాసాలు చేస్తారు-
ఏమనంటే:
- వ్యష్టి పెట్టుబడిదారుడు, శ్రామికుడు ఎంత వాడుకుంటాడో అంతే వాడు కోవాలి అని;
- పెట్టుబడి దారుల దేశం వాళ్ళ సొంత సరుకుల వినియోగాన్ని, తక్కువ తెలివైన ఇతర దేశాలకు వదిలి పెట్టాలి అని;
- అయితే ఉత్పాదక వినియోగాన్ని తమ జీవితాశయంగా పెట్టుకోవాలి అని;
-------
పెట్టుబడి వలయం చలామణీ, ఉత్పత్తుల
ఐక్యత. రెంటినీ ఇముడ్చుకొని ఉంటుంది. డ-స దశా, స'-డ' దశా రెండూ చలామణీకి సంబంధించిన మేరకు, పెట్టుబడి చలామణీ సరుకుల సాధారణ చలామణీయే. అయితే కేవలం చలామణీ రంగానికి మాత్రమే సంబంధించని, ఉత్పత్తి
రంగానికి కూడా సంబంధించిన పెట్టుబడి వలయంలోని దశల్లో పాల్గొనడం ద్వారా, పెట్టుబడి సాధారణ
సరుకుల చలామణీ లోపల తన సొంతదైన వలయాన్ని పూర్తిచేస్తుంది. దాన్ని ఈ సాధారణ చలామణీ, తొలిదశలో
ఉత్పాదక పెట్టుబడిగా వ్యవహరించగల రూపం పొందేట్లు చేస్తుంది; రెండో దశలో
సరుకు తన చర్యని వదిలి పెట్టేట్లు చేస్తుంది. అంటే, తన వలయాన్ని కొనసాగించలేనిదిగా
చేస్తుంది; అదేసమయంలో తనసొంత పెట్టుబడి వలయాన్ని, పెట్టుబడికి
కలిసిన అదనపువిలువ చలామణీ నుండి వేరుచేసే అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి,డబ్బు పెట్టుబడి చేసే వలయం, ఏక ముఖమైనది(one-sided). ఆవిధంగా అది అత్యంత ప్రస్పుటమైనది. పారిశ్రామిక పెట్టుబడి అగపడే
సాధారణ రూపం. దాని లక్ష్యమూ, ఉద్దేశమూ విలువ తనకుతాను పెరగడం, డబ్బు చేసుకోడం, సంచయనం – అని స్పష్టంగా వెల్లడవుతుంది (ప్రియంగా అమ్మడం కోసం కొనడం). తొలిదశ డ-స తెలిపేది ఏమంటే: ఉత్పాదక పెట్టుబడిలోని
అంశాలు సరుకుల మార్కెట్లో నించి వస్తాయని; సాధారణంగా పెట్టుబడిదారీ
ఉత్పత్తి ప్రక్రియ చలామణీ మీద, వాణిజ్యం మీద ఆధారపడి
ఉంటుందని. డబ్బు పెట్టుబడి వలయం కేవలం
సరుకుల ఉత్పత్తి మాత్రమే కాదు; అది చలామణీ ద్వారా మాత్రమే
సాధ్యపడుతుంది,అది చలామణీ ముందుగానే
ఉన్నట్లు భావిస్తుంది. తొలి దశ డ-స లో డ రూపం చలామణీలో మదుపుపెట్టిన పెట్టుబడి
యొక్క మొదటి, స్వచ్ఛ రూపం అనే వాస్తవాన్ని
బట్టి, ఇది స్పష్టమవుతుంది. మిగిలిన రెండు వలయాల
రూపాల్లో ఈవిషయం స్పష్టమవదు. డబ్బు పెట్టుబడి వలయం పారిశ్రామిక పెట్టుబడికి, సాధారణ వ్యక్తీకరణగా ఉంటుంది. ఎందువల్లంటే, అది ఎప్పుడూ మదుపు పెట్టిన విలువ తనంత తాను పెరగడాన్ని ఇముడ్చుకొని ఉంటుంది కనుక. ఉ.పె...ఉ.పె వలయంలో, పెట్టుబడి యొక్క డబ్బు రూపం
ఉత్పత్తి అంశాల ధరగా మాత్రమే కనబడుతుంది. అందువల్ల, అది లెక్కలో చూపించే డబ్బులో వ్యక్తమయ్యే విలువగా కనబడుతుంది. ఈ రూపంలో జమాఖర్చుల
పుస్తకంలో నమోదవుతుంది.
కొత్త పెట్టుబడి డబ్బు రూపంలో మొదటిదఫా మదుపు పెట్టబడి, తర్వాత అదేరూపంలో తిరిగి వెనక్కి తీసుకోబడ్డప్పుడు, డ...డ'
పారిశ్రామిక పెట్టుబడి వలయం యొక్కప్రత్యేక రూపం అవుతుంది. అలా ఉపసంహరించడం ఒక
పారిశ్రామిక శాఖ నుంచి మరొక శాఖలోకి పోతూ కావచ్చు,లేక ఒక వ్యాపారం నించి
పారిశ్రామిక పెట్టుబడిని విరమించడంలో కావచ్చు. ఇది అదనపు విలువ తొలితూరి
డబ్బు రూపంలో మదుపు పెట్టిన పెట్టుబడిగా, చర్య చెయ్యడాన్ని
ఇముడ్చుకొని ఉంటుంది. ఆదనపు విలువ ఏర్పడ్డ వ్యాపారంలో కాకుండా, మరొక వ్యాపారంలో అది చర్య చేసేటప్పుడు ప్రస్పుటంగా రుజువవుతుంది. డ...డ'
ఒక పెట్టుబడి తొలి వలయం కావచ్చు; చివరది కావచ్చు;మొత్తం సామాజిక పెట్టుబడి రూపం కావచ్చు; అది కొత్తగా పెట్టిన పెట్టుబడి రూపం-అది డబ్బు రూపంలో ఇటీవలే
సంచయనమైన పెట్టుబడి కావచ్చు. లేదా మొత్తం పాతపెట్టుబడి మరొక కొత్త పారిశ్రామిక
శాఖలోకి తరలించడానికి పూర్తిగా డబ్బులోకి మార్చిన పెట్టుబడి కావచ్చు.
ఉత్పాదక పెట్టుబడిలో ఉండే అంశాలు ఉత్పత్తిసాధనాలూ, శ్రమశక్తీ.
అయితే అవి ఉన్నంత మాత్రాన్నే ఉత్పాదక పెట్టుబడి అవదు. అవి ఎల్లప్పుడూ ఉత్పత్తి ప్రక్రయలో అంశాలే – ఉత్పత్తి ప్రక్రయ యొక్క సామాజిక రూపం ఏదయినా
సరే. అయితే అవి పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియలో మాత్రమే ఉత్పాదక పెట్టుబడి
అవుతాయి. పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియ ఫలితం: కొత్త పరిమాణంలో సరుకులు; విలువ పెరిగిన
పెట్టుబడి రూపంగా, ఈ సరుకుల పరిమాణం సరుకు పెట్టుబడి స’. ఇందులో ఉండే సరుకులు మొదట పెట్టిన
(ఉత్పత్తిసాధనాలూ, శ్రమశక్తీ) సరుకులకంటే గుణాత్మకంగా భిన్నమైనవి. అమ్మితే పెట్టిన
విలువకంటే మరింత విలువ (పెట్టిన పెట్టుబడి విలువ+అదనపు విలువ ) కలవి.
డ.స...ఉ.పె...స
'- డ ' ఫార్ములా ఫలితం:
డ '=డ+డ.ఫె. ఈ ఫార్ములా రూపం నిజాన్ని
దాస్తుంది. దాని స్వభావం భ్రాంతి కలిగిస్తుంది. మదుపు
పెట్టిన విలువ దానికది పెరిగి దానికి సమానమైన డబ్బు రూపంలో ఉంది. ఇక్కడ ముఖ్యమైనది
విలువ తనంతతాను పెరగడానికి కాదు. ఈ ప్రక్రియ రూపానికి, డబ్బు
రూపానికి. చలామణీలో మొదట పెట్టిన దానికంటే, ఎక్కువ డబ్బును చివర్లో లాగడం
జరిగిందన్న దానికే ప్రాముఖ్యత. అందువల్ల, పెట్టుబడి దారుడి
వెండి బంగారాలు అంతకంతకూ పెరగడం ఇక్కడ ముఖ్యం.
ద్రవ్య వ్యవస్థ అనబడేది (so-called monetary
system) కేవలం డ-స-డ' అనే
అసంబద్ధ (irrational) రూపం యొక్క
వ్యక్తీకరణ మాత్రమే. ఇది చలామణీలో మాత్రమే జరిగే చలనం. చలామణీలో
ఉండేది రెండు చర్యలే డ-స, స-డ. కనుక రెండో చర్యలో స తన
విలువకన్నా ఎక్కువకు అమ్ముడయిందనీ, స కొనుగోలు వల్ల
చలామణీలో పెట్టిన విలువకన్నా ఎక్కువ విలువని రాబట్టడం సాధ్యమయిందనీ ద్రవ్య వ్యవస్థ
చెబుతుంది. అలాతప్ప మరే విధంగానూ ఈ చర్యల్ని వివరించలేదు. మరొకపక్క, డ-స...ఉ.పె...స
'-డ 'అనేది ఒకేఒక రూపంగా స్థిరపడ్డది.
అది అభివృద్ధి చెందిన వాణిజ్య వ్యవస్థకు పునాదిగా ఉంది. అందులో
సరుకుల చలామణీయే కాక, ఆ సరుకుల ఉత్పత్తి కూడా అవసరమైన అంశంగా
కనబడుతుంది.
భ్రమాత్మక స్వభావం
ఈ
చలనం చలామణీలో మాత్రమే జరిగేది కనుక భ్రమాత్మక స్వభావం
ఎప్పుడుందంటే: ఈ రూపం ఒకే ఒకసారి మాత్రమే జరుగుతుంది, మరలమరల జరగదు
అనుకున్నప్పుడు. అంటే,
ఈ
రూపాన్నివలయ రూపాల్లో ఒకరూపంగా కాక ఒకే ఒక రూపంగా పరిగణించినప్పుడు. కాని
ఆరూపం దానికదే ఇతర రూపాలను సూచిస్తుంది.
మొదటి విషయం. మొత్తం వలయం ఉత్పత్తి ప్రక్రియ యొక్క పెట్టుబడిదారీ స్వభావం
మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల, ఈ ప్రక్రియని అది
తనతోపాటు ప్రాతిపదికగా, తెచ్చిన ప్రత్యేక సామాజిక పరిస్థితులతో
పాటు పరిగణిస్తుంది. డ-స=డ-స (శ్ర.శ-ఉ.సా); కాని డ-శ్ర.శ వేతన కార్మికుడు ఉన్నాడని
అనుకుంటుంది. అందువల్ల ఉత్పత్తి సాధనాలు ఉత్పాదక పెట్టుబడిలో భాగం అని
అనుకుంటుంది. కాబట్టి,
శ్రమ
ప్రక్రియా,
స్వయంవిస్తరణా, ఉత్పత్తి ప్రక్రియ
పెట్టుబడి చేసే చర్య అని అనుకుంటుంది.
రెండో విషయం. డ...డ ' చర్య మళ్ళీ జరిగితే, డబ్బు రూపంలోకి
తిరిగిరావడం క్షణంలోనే జరిగినట్లు కనబడుతుంది -
మొదటి దశలో డబ్బు రూపం క్షణం పాటే ఉన్నట్లుగా. డ-స, ఉ.పె కి చోటివ్వడానికి తను అదృశ్యమై పోతుంది. డబ్బు రూపంలో మళ్ళీ మళ్ళీ మదుపూ, దబ్బురూపంలోనే మళ్ళీ
మళ్ళీ వెనక్కి రావడమూ వలయంలో కాసేపు మాత్రమే ఉండి దాటిపోయే,
ఇట్లావచ్చి అట్లా పోయే ఘటనలుగా కనిపిస్తాయి.
మూడో విషయం. డ-స...ఉ.పె...స'-డ. డ.-స...ఉ.పె...స'-డ'. డ-స...ఉ.పె... వగయిరా.
వలయం రెండోసారి తిరిగి మొదలైనప్పటినించీ, ఉ.పె...స '-డ '. డ-స...ఉ.పె అనే వలయం, డ యొక్క రెండో వలయం ముగియకముందే కనబడుతుంది. ఇక తదుపరి వలయాలన్నిటినీ, ఉ.పె...స'-డ-స...ఉ.పె రూపం కింద పరిగణించవచ్చు దీని ఫలితం ఏమంటే: మొదటి వలయంలోడ-స తొలిదశ అయినందువల్ల, అది ఉత్పాదక పెట్టుబడి నిరంతరం పునరావృతం అవడానికి జరిగే తాత్కాలిక సన్నహం మాత్రమే. డబ్బు పెట్టుబడి రూపంలో తొలిసారి మదుపు పెట్టే పారిశ్రామిక పెట్టుబడి విషయంలో నిజంగా జరిగేది ఇదే.
మరొకపక్క, ఉ.పె యొక్క రెండో
వలయం పూర్తికాక ముందే,
మొదటి
వలయం స'-డ'. డ-స...ఉ.పె... స', క్లుప్తంగా స'-స' పూర్తయి ఉంటుంది. ఆ విధంగా, తొలి రూపం అప్పటికే
ఇతర రెండు రూపాల్నీ ఇముడ్చుకొని ఉంటుంది; డబ్బు రూపం అదృశ్యమై పోతుంది - అది కేవలం విలువ వ్యక్తీకరణ మాత్రమే కాక, దాని సమానకమైన డబ్బులో విలువ వ్యక్తీకరణ అయిన
మేరకు.
చివరి విషయం. కొత్తగా పెట్టే
వ్యష్టి పెట్టుబడి. దాని వలయం డ-స...ఉ.పె...స'- డ'.ఇందులో
మొదటి దశ డ-స సన్నాహక దశ. ఇది ఉత్పత్తి ప్రక్రియకి ముందు అవసరం.అయితే ఇది ఈ వ్యష్టి
పెట్టుబడికి మాత్రమే వర్తిస్తుంది. పెట్టుబడి దారీ విధానమే ఉన్నదనీ, అందువల్ల
సామాజిక పరిస్థితులు పెట్టుబడిదారీ ఉత్పత్తి చేత నిర్ణయమవుతాయనీ అనుకుంటే, పారిశ్రామిక
పెట్టుబడి వలయం యొక్క సాధారణ రూపం, డబ్బు పెట్టుబడి
వలయమే. కాబట్టి, పెట్టుబడిదారీ
ఉత్పత్తి ప్రక్రియ ముందస్తు షరతు అని అనుకోవాల్సి ఉంటుంది. కొత్తగా
పెట్టిన పారిశ్రామిక పెట్టుబడి యొక్క మొదటి డబ్బు పెట్టుబడి వలయంలో కాకపోయినా, అప్పుడు
దాని బయట. ఉ.పె...ఉ.పె వలయం నిరంతరం మళ్ళీ మళ్ళీ
జరుగుతుంటేనే, ఈ ఉత్పత్తి ప్రక్రియ కొనసాగుతుంటుంది. ఈ
ఉత్పత్తి ప్రక్రియకి ఉ.పె...ఉ.పె వలయం ఉండాలి. తొలి దశలో డ-స (శ్ర.శ+ఉ.సా)లో సైతం
ఈ ఊహ కు
కొంత పాత్ర
ఉంటుంది. ఎందుకంటే: ఇది ఒకపక్క, వేతన
కార్మికుల వర్గం ఉన్నదని అనుకుంటుంది; మరొకపక్క, మొదటి
దశ ఉత్పత్తి సాధనాలు కొనేవానికి,
డ-స అయితే, అదే వాటిని అమ్మేవానికి స'-డ'; అందువల్ల
స' ఉన్నదంటే సరుకు
పెట్టుబడి అప్పటికే ఉన్నట్లు. ఆ విధంగా అసలు
సరుకులే పెట్టుబడిదారీ ఉత్పత్తి ఫలితం, ఉత్పాదకపెట్టుబడి
చర్య.అందువల్ల ఉత్పాదక పెట్టుబడి ఉన్నట్లు అనుకోవాలి.
సరుకు - స
విలువ పెరిగిన సరుకు - స'
కొత్తగా పెరిగిన విలువ సరుకు రూపంలో- స.ఫె. ఇప్పుడు స'= స+స.ఫె
కొత్త సరుకు - స1, స 2….
డబ్బు - డ
పెరిగిన విలువ కలిసిన డబ్బు మొత్తం - డ'
ఉత్పాదక పెట్టుబడి - ఉ.పె
కొత్తగా పెరిగిన విలువ డబ్బురూపంలో - డ. ఫె (అదనపువిలువ)
వచ్చే పోస్ట్: రెండో అధ్యాయం. ఉత్పాదక పెట్టుబడి వలయం
ఒకటో విభాగం - సామాన్య పునరుత్పత్తి