29, నవంబర్ 2023, బుధవారం

టర్నోవర్ కాలమూ- టర్నోవర్ల సంఖ్యా

 

కాపిటల్  రెండో సంపుటం  రెండో భాగం

పెట్టుబడి టర్నోవర్

అధ్యాయం 7 : టర్నోవర్ కాలమూ- టర్నోవర్ల సంఖ్యా

(కాపిటల్ రెండో సంపుటంలో రెండో భాగం అతి తక్కువ చర్చించబడిన భాగం. చదవడానికి అంత సుకరంగా ఉండదు.    అయినా, ఇది ముఖ్యమైనదే. అందుకు రెండు కారణాలు ఉన్నాయి:

1. మార్క్స్ ఇందులో, పెట్టుబడి వలయం అంశాన్ని పొడిగిస్తాడు - నిశ్చల పెట్టుబడికీ, చంచల పెట్టుబడికీ (చలనంలో ఉండే పెట్టుబడికీ) తేడా ఏమిటో చెబుతాడు. ఈ తేడా వల్ల కలిగే ఫలితాల్ని తేలుస్తాడు.

2. ఇతర అర్థికవేత్తల రచనల్లో ఉన్న గందరగోళాన్ని వివరిస్తాడు)


ఒక నిర్ణీత పెట్టుబడి చలామణీ కాలమూ, ఉత్పత్తి కాలమూ రెండూ కలిస్తే టర్నోవర్ కాలం అవుతుంది.

టర్నోవర్ కాలం = చలామణీ కాలం + ఉత్పత్తి కాలం.

పెట్టుబడి మొదట ఏరూపంలో ఉందో,  అదే రూపంలోకి తిరిగి వచ్చే దాకా పట్టే సమయం అన్నమాట.

పెట్టుబడిదారీ ఉత్పత్తి లక్ష్యం:  పెట్టుబడి పెట్టి, అదనపువిలువను ఉత్పత్తిచెయ్యడమే. పెట్టుబడిగా పెట్టిన విలువ యొక్క రూపం డబ్బు అయినా ఒకటే, సరుకు అయినా ఒకటే. తేడా ఉండదు. సరుకులయితే, ఆ పెట్టుబడి విలువరూపం వాటి ధరలో ఊహాత్మక స్వతంత్రతని కలిగి ఉంటుంది. రెండుసందర్భాలలోనూ, పెట్టిన పెట్టుబడి విలువ తన చక్రీయ చలనంలో భిన్న రూపాలగుండా నడుస్తుంది. ఏరూపంలో నడుస్తున్నా, అది పెట్టుబడిగానే ఉంటుంది. అలాగని పెట్టుబడిదారుల ఖాతా పుస్తకాల్లో నమోదై ఉంటుంది.

విలువ రెండు రూపాల్లో ఉంటుంది:

1.డబ్బు

2. సరుకులు

ఏమైనా, వాస్తవానికి విలువ అనేది ప్రక్రియలో క్రియాశీలమైన అంశం. అది ప్రక్రియలో ఒకసారి డబ్బురూపాన్నీ, మరొకసారి సరుకుల రూపాన్నీ నిరంతరం తీసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో తన పరిమాణాన్ని మార్చుకుంటుంది. తననుంచి అదనపువిలువని బయటకు నెడుతూ, తన్నుతాను వేరుపరుచుకుంటుంది. మరోమాటల్లో చెప్పాలంటే, పెట్టిన విలువ పెరుగుతుంది. అదనపు విలువను కలిపే ఆ చలనం దాని సొంత/స్వయం చలనం. కాబట్టి దాని వృద్ధి స్వయంవృద్ధి. ఆటోమాటిక్ వ్యాకోచం. ఈ వృద్ధి జరగడానికి ఏ ఇతర అంశమూ కారణంగాదు. దానికదే వృద్ధవుతుంది.

డబ్బనేది విలువకున్న రెండురూపాల్లో ఒక రూపం మాత్రమే. ఏదో ఒక సరుకు రూపం తీసుకోనిదే డబ్బు పెట్టుబడి అవదు.

పెట్టుబడి వలయం రూపాలు రెండు: 1. డ...డ' రూపం     2. ఉ.పె....ఉ.పె రూపం

డ... డ' రూపం తీసుకున్నా, ఉ.పె....ఉ.పె రూపం తీసుకున్నా వాస్తవాలు ఇవే:

1. పెట్టిన విలువ పెట్టుబడిగా వ్యవహరిస్తుంది; అదనపువిలువని సృజిస్తుంది.  అదనపువిలువతో  కలిసి మొదట పెట్టిన పెట్టుబడి విలువ పెరుగుతుంది.

2.తన ప్రక్రియ అయ్యాక, అది తన తొలిరూపానికి తిరిగి వస్తుంది.  అంటే, డబ్బు రూపంలో పెడితే డబ్బుగా, సరుకురూపంలో పెడితే సరుకుగా తిరిగి వస్తుంది.

క్లుప్తంగా: పెట్టిన విలువ పెరగడమూ, పెట్టిన రూపంలోనే తిరిగిరావడమూ

1. డ... ' రూపం.   డబ్బుతో మొదలై డబ్బుతో ముగుస్తుంది. 

ఉదాహరణ: ఒక పెట్టుబడిదారుడు 1 లక్ష రూపాయల పత్తికొంటాడు.20,000 రూపాయలిచ్చి వేతన కార్మికుల్ని పెట్టి, తన పరికరాలతో దారం తయారుచేయిస్తాడు. దాని విలువ 1,40,000 రూపాయలు ఉంటుంది.అమ్మి డబ్బు చేసుకుంటాడు.

1.పెట్టిన విలువ రూపం డబ్బు. చివరకి ఆ విలువ అదే రూపంలో తిరిగి చేతికొచ్చింది.

2.పెట్టిన విలువ (1,20,000).అది 20,000 పెరిగి 1,40,000 అయింది. పెట్టుబడి స్వయంవృద్ధి చెందింది

రెండూ డ....డ' లో కొట్టొచ్చినట్టు కానొస్తాయి:

2.ఉ.పె....ఉ.పె రూపం

.పె ....స' – ' – …..పె

రెండో రూపంలో ఆరంభస్థానం ఉత్పత్తి అంశాలు. - కొంత విలువ ఉన్నసరుకులు. ఉత్పత్తి ప్రక్రియలో వాటికున్న విలువ పెరుగుతుంది. స్వయం వృద్ధి చెందుతుంది. వలయం సరుకుల రూపంలో ముగుస్తుంది. ఇందులో విలువ పెరగడమూ 

('- ') ఉంది. తొలి రూపానికి రావడమూ ఉంది. ఎందుకంటే, రెండో ఉ.పె లో పెట్టిన విలువ, మొదట్లో పెట్టిన ఉత్పత్తి అంశాల రూపంలోనే, సరుకుల రూపంలోనే ఉంటుంది.

ఉత్పత్తి పెట్టుబడిదారీ రూపంలో ఉంటే, పునరుత్పత్తి కూడా పెట్టుబడిదారీ రూపంలోనే ఉంటుంది - అని మనకు ఇంతకుముందే తెలుసు. మొదటి దానిలో శ్రమప్రక్రియ పెట్టుబడి స్వయం వృద్ధికి సాధనం అయినట్లే, రెండోదానిలో, పునరుత్పత్తిలో పెట్టుబడిగా - అంటే ముందు పెట్టిన విలువని స్వయంగా వృద్ధయ్యే విలువగా -  పునరుత్పత్తిచేసే సాధనం గా వ్యవహరిస్తుంది.

మూడు రూపాలు

(I) డ .... డ'

(II) ఉ.పె....ఉ.పె

(III)'.... '

మూడు రూపాలకీ ఉన్న తేడాలు

రెండో రూపం ఉ.పె....ఉ.పె లో పునరుత్పత్తి ప్రక్రియ ఒక వాస్తవం అని తెలుస్తుంది. మొదటి రూపం డ-డ' లో పునరుత్పత్తి ప్రక్రియ సాధ్యత గురించి తెలుస్తుంది. ఇవి రెండూ, మూడో రూపం అయిన ' - ' కి భిన్నంగా ఉంటాయి. ఎందులోనంటే: ఆ రెంటిలోనూ పెట్టిన పెట్టుబడి విలువ - అది డబ్బు రూపంలో ఉన్నా, ఉత్పత్తిలో వాడే భౌతిక అంశాల రూపంలో ఉన్నా - తిరిగి వచ్చే రూపమూ అదే. పెట్టింది డబ్బయితే డబ్బు, సరుకయితే సరుకు.

డ-డ' లో తిరిగొచ్చేది ఇలా వ్యక్తమవుతుంది:

             '= డ+డ.ఫె. 

ఆ ప్రక్రియ అదే స్థాయిలో మళ్ళీ జరిగితే, డ యే ఆరంభస్థానం అవుతుంది; డ.ఫె అందులో కలవదు. కాని డ పెట్టుబడిగా పెరిగి, అదనపువిలువని ఏర్పరచినప్పటికీ, ఆ అదనపువిలువని వదిలివేసిందని మాత్రమే చూపుతుంది.

ఉ.పె - ఉ.పె రూపంలో  ఉత్పత్తి అంశాల రూపంలో పెట్టిన పెట్టుబడి విలువ ఉ.పె. ఆరంభస్థానం. ఈ రూపం దాని స్వయం వృద్ధిని ఇముడ్చుకొని ఉంటుంది.

సామాన్య పునరుత్పత్తిలో అదే పెట్టుబడి విలువ అదే రూపంలో తిరిగి మళ్ళీ అదే ప్రక్రియని మొదలు పెడుతుంది. సంచయనం సందర్భంలో డ' లేక స'  అంత విలువ వున్న ఉ.పె', ఇప్పుడు పెరిగిన పెట్టుబడితో ప్రక్రియని పునః ప్రారంభిస్తుంది. అయితే, ఇంతకు ముందుకంటే ఎక్కువ విలువతో అయినప్పటికీ,  ప్రక్రియ  తొలిరూపంలోనే మొదలవుతుంది. మూడో రూపం అలా మొదలవదు. పెట్టుబడి విలువ, మొదట పెట్టిన పెట్టుబడి విలువగా మొదలవదు. అప్పటికే పెరిగిన విలువగా, సరుకుల రూపంలో ఉన్న  మొత్తం సంపదగా  మొదలవుతుంది. అంటే మొదట పెట్టిన పెట్టుబడి విలువ ఇప్పుడు పెట్టిన మొత్తంలో కొంత భాగం మాత్రమే. ఈ చివరి రూపం  ఈ సంపుటం లోని మూడో భాగానికి ముఖ్యమైనది. ఎందుకంటే, ఆ భాగంలో  మొత్తం సమాజపెట్టుబడి చలనంతో, విడివిడి పెట్టుబడుల చలనం యొక్క సంబంధాన్ని గురించిన చర్చ ఉంటుంది.

అయితే ఈ మూడో రూపాన్నిపెట్టుబడి టర్నోవర్ విషయంలో ఉపయోగించకూడదు.

అది ఎప్పుడూ పెట్టుబడి విలువని (డబ్బుగానో, సరుకులుగానో) అడ్వాన్స్ పెట్టడంతో మొదలవుతుంది.  ఆ విలువని, పెట్టిన రూపంలోనే తప్పనిసరిగా తిరిగి రప్పిస్తుంది. ఒకటి, రెండు వలయాల్లో:

 మొదటిది దనపువిలువ ఉత్పత్తి మీద టర్నోవర్ ప్రభావాన్ని అధ్యయనం చెయ్యడంలో ప్రధానంగా ఉపయోగపడుతుంది.

రెండోది ఉత్పాదితాన్ని తయారుచెయ్యడం మీద టర్నోవర్ ప్రభావాన్ని అధ్యనం చెయ్యడంలో ముఖ్యంగా ఉపకరిస్తుంది.

ఆర్థికవేత్తలు భిన్న వలయాల  మధ్య భేదాల్ని స్వల్పంగా పట్టించుకున్నారు. అందువల్ల పెట్టుబడి టర్నోవర్  సంబంధంలో వాటిని విడివిడిగా పరిశీలించలేదు. వాళ్ళు డ ... డ'  రూపం మీద కేంద్రీకరించారు. కారణం: ఆ రూపం పెట్టుబడిదారుడి మీద పెత్తనం చెలాయిస్తుంది. అతను లెక్కలు రాసుకోవడంలో ఉపకరిస్తుంది - మొదట పెట్టిన డబ్బు ఖాతా డబ్బు అయినప్పటికీ.

మరికొందరేమో ఉత్పత్తి అంశాలతో మొదలుపెట్టి, ఫలితాలు తిరివచ్చేదాకా చూసి ముగిస్తారు. అంతేగాని తిరిగి వచ్చిన ఫలితం రూపాన్ని గురించి చెప్పరు. అది సరుకుల రూపంలోఉందో, డబ్బు రూపంలోఉందో చెప్పరు. ఉదాహరణకు:

అమెరికన్ మతగురువు, రచయిత S. P. Newman (1797-1842) తన Elements of Political Economy  ఆర్థిక వలయాన్ని ఇలా నిర్వచించాడు: ఉత్పత్తి అంశాల్ని పెట్టినప్పటినించీ, వాటి ఫలితం తిరిగి వచ్చే వరకూ జరిగే ఉత్పత్తి ప్రక్రియ మొత్తం. వ్యవసాయంలో  విత్తనాలు నాటడం దాని ఆరంభం, పంటకోత దాని ముగింపు (పేజి81).

ఇతర ఆర్థికవేత్తలు కొందరు మూడో రూపం ' తో మొదలెట్టారు.

ఉదాహరణకు:

స్కాట్ లాండ్ ఆర్థికవేత్త Thomas Chalmers (1780-1847) On Political Economy లో ఇలారాశాడు:

మనం ఆర్థిక చక్రం అంటామే, దానిలో వాణిజ్య ప్రపంచం తిరుగుతూ ఉంటుందని అనుకోవచ్చు. వ్యాపారచక్రం ఒక వర్తకవలయాన్ని పూర్తిచేసి,  వరస లావాదేవీలద్వారా అది ఎక్కడ మొదలైనదో తిరిగి అదే స్థానాన్ని చేరుతుంది. పెట్టుబడిదారుడు పెట్టిన విలువ తిరిగి వచ్చీరాగానే, చక్రం మళ్ళీ మొదలైంది అనవచ్చు. అప్పటినించీ పనివాళ్ళని పెట్టుకోవడం మొదలుపెడతాడు. వాళ్ళ పోషణకి వేతనాలు పంచుతాడు. సరిగా చెప్పాలంటే, దాన్ని ఎత్తే శక్తిని పంచుతాడు -వాళ్ళనించి తను వ్యాపారం చేసే వస్తువుల్ని తయారుచేయిస్తాడు.వాటిని  మార్కెట్లో పెట్టి, అమ్మి, ఆకాలంలో తానుపెట్టిన మొత్తం మదుపుకి ప్రతిఫలాన్ని పొందుతాడు. అంతటితో, ఒక  చలన సముదాయం యొక్క కక్ష్యని ముగిస్తాడు. (పేజి85)

 

ఏ ఉత్పత్తి శాఖలోనైనా సరే, పెట్టుబడి దారుడు పెట్టిన పెట్టుబడి విలువ తిరిగి అతని చేతిలో పడీపడగానే, అది మళ్ళీ అతను ఏరూపంలో పెట్టాడో అదేరూపంలో ఉంటుంది. అది  అదే ఉత్పత్తి ప్రక్రియని మళ్ళీ చెయ్యగలదు.ఆ విలువ అలాగే నిలుపుకుంటూ, అదనపు విలువను ఉత్పత్తిచెయ్యాలంటే అది ఆచర్యని పదేపదే చేస్తూనే ఉండాలి. ఒక విడి వలయం అనేది ఒక పెట్టుబడి జీవితకాలంలో నిరంతరం మళ్ళీమళ్ళీ జరిగే ఒక విభాగం. అంటే అది మళ్ళీ మళ్ళీ జరిగే చర్య నిర్ణయించే కాలవ్యవధి(period).

అందువల్ల, డ...డ' కాలం చివరలో పెట్టుబడి తిరిగి డబ్బు రూపం పొందుతుంది. అది కొత్తగా వరస రూపం మార్పుల్ని గడుస్తుంది. అందులో దాని పునరుత్పత్తి లేక స్వయం వృద్ధి ఇమిడి ఉంటుంది. ఉ.పె...ఉ.పె చివరలో పెట్టుబడి ఉత్పత్తి అంశాల రూపాన్ని తిరిగి పొందుతుంది.

అవి (ఉత్పత్తి అంశాలు) వలయం మళ్ళీ మొదలవడానికి ముందు ఉండాల్సినవి. పెట్టుబడి వలయాన్ని విడి చర్యగా కాకుండా, నియత కాలవ్యవధుల్లో జరిగే ప్రక్రియగా తీసుకుంటే, అది దాని టర్నోవర్.

అన్ని రంగాల్లోనూ ఒకటే ఉండదు.

ఈ వలయమే టర్నోవర్. ఇందుకు పట్టే మొత్తం సమయమే పెట్టుబడి టర్నోవర్ టైం. కొన్ని రంగాలలో టర్నోవర్ టైం ఎక్కువ గానూ, కొన్ని రంగాల్లో తక్కువగానూ ఉంటుంది. ఒకే రంగంలో కొందరు పెట్టుబడిదారులకు ఎక్కువగానూ, కొందరికి తక్కువగానూ ఉండవచ్చు.

టర్నోవర్ లని సంవత్సరానికి ఇన్ని అని చెప్పడం ఆనవాయితీ

 n=T/t          n అంటే టర్నోవర్ల సంఖ్య      T అంటే టైం          t అంటే ఒక టర్నోవర్ కి పట్టే టైం

ఒక టర్నోవర్ కి పట్టే టైం (t) 3 నెలలయితే, n=12/3=4. పెట్టుబడి ఏడాదిలో 4 సార్లు టర్నోవర్ అయినట్లు.

ఒకవేళ ఒక టర్నోవర్ కి పట్టే టైం(t) 18 నెలలయితే, n=12/18 = ⅔. అంటే, పెట్టుబడి టర్నోవర్లో మూడింట రెండొంతులు మాత్రమే పూర్తిచేస్తుంది. పెట్టుబడిదారుడికి, తన పెట్టుబడి టర్నోవర్ టైం అనేది, తన పెట్టుబడితో అదనపు విలువ ఉత్పత్తిచెయ్యడానికీ, దాన్ని పెట్టిన రూపంలోనే తిరిగి తీసుకోడానికీ పట్టే కాలం.

ఉత్పత్తి ప్రక్రియమీదా, స్వయం విస్తరణమీదా టర్నోవర్ ప్రభావాన్ని గురించి మరింత దగ్గరగా పరిశీలించే ముందు  రెండు కొత్త రూపాల్ని పరిశోధించాల్సి ఉంది. చలామణీ ప్రక్రియ ఫలితంగా పెట్టుబడి పొందే రూపాల్ని, పెట్టుబడి టర్నోవర్ రూపాన్ని ప్రభావితం చేసే రూపాల్ని పరిశీలించాల్సి ఉంది.

 వచ్చే పోస్ట్: నిశ్చల పెట్టుబడీ - చలామణీ అయ్యే పెట్టుబడీ

 


16, నవంబర్ 2023, గురువారం

కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు?

కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు?  pdf

Copy the following link and paste it in a browser 

https://drive.google.com/file/d/131jeCm7dooMdRwyeKpOSKpIQWVQ_QZeR/view?usp=drive_link

11, నవంబర్ 2023, శనివారం

III రవాణా ఖర్చులు

 

III రవాణా ఖర్చులు

సాధారణ నియమం: సరుకు రూపం మారేందుకు అయ్యే చలామణీ ఖర్చులు సరుక్కి విలువని కలపవు. అవి కేవలం విలువని ఒక రూపం నించి మరొకరూపానికి - డబ్బురూపం నించి సరుకురూపానికి, సరుకు రూపం నించి డబ్బురూపానికి - మార్చడానికి  అయ్యేఖర్చులు. పెట్టుబడిదారీ ఉత్పత్తిలో ఇవి వృధా ఖర్చులు. సరుకు అమ్మినప్పుడు ఇవి చేతికిరావు.

పెట్టుబడి దారుల వర్గం మొత్తం వైపునించి చూస్తే, ఈఖర్చులు అదనపు ఉత్పాదితం లేక అదనపు విలువ నించి కోసివేతే. ఒక కార్మికుడికి జీవితావసర వస్తువులు కొనుక్కోడానికి పట్టే సమయం, అతనికి పోయిన సమయం ఎట్లాగో, అట్లాగే.

అయితే రవాణా ఖర్చులు అలాంటివి కావు. చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఇక్కడ క్లుప్తంగా చెప్పాల్సి ఉంది. ఇక్కడ సరుకుల్ని వేరుపరచడం, పాక్ చెయ్యడం వంటి పనులకు అయ్యే చలామణీ ఖర్చుల వివరాల్లోకి పోవాల్సిన అవసరం లేదు.

 చలామణీలో సరుకులు ఒకచోటునించి మరొకచోటికి చేరాలి

అంటే ఉత్పత్తయిన చోటునించి వాడుకునే చోటికి రవాణా అవాలి. వినియోగదారుడి చేతికి అందాలి.  సరుకులు భౌతికంగా చోటు మారాలి. దేశ విదేశాల్లో తయారైన వస్తువులు మన మార్కెట్లలో ఉంటాయి. ఇందుకు సరుకుల భౌతిక చలనం కారణం.

భౌతిక చలనం లేకుండా కూడా సరుకుల చలామణీ జరగవచ్చు.

ఒకడు మరొకడికి అమ్మిన ఇల్లు అక్కడే ఉంటుంది.ఎక్కడికీ పోదు. పొలమూ, స్థలమూ కూడా అంతే. మారేది ఆస్తి హక్కుదారుడి పేరు మాత్రమే. * హెన్రి స్టార్చ్ (1766-1835) దీన్ని కృత్రిమ చలామణీ (fictious circulation) అన్నాడు.

సట్టా వ్యాపారంలో ఒక గోడౌన్లో ఉన్న పత్తి, దుక్క ఇనుం లాంటివి  అక్కడే ఉంటూ, అనేక మార్లు అమ్ముడవుతుంటాయి, కొనుగోలు అవుతుంటాయి. ఈ సందర్భాల్లో కదిలేది సరుకులమీద హక్కేగాని, సరుకులు కాదు.

మరొకవైపు 'ఇంకా'* అనే కొండ తెగవాళ్ళ పెద్ద  సామ్రాజ్యంలో(1438 - 1533) ఉత్పాదితం  సరుకుగా చలామణీ కాలేదు; వస్తుమార్పిడి పద్ధతిలో నైనా పంపకం లేదు. అయినప్పటికీ, రవాణా పరిశ్రమ ప్రముఖపాత్ర పోషించింది. అప్పట్లో అక్కడ మార్కెట్ వ్యవస్థ లేదు. డబ్బు తెలియదు. అయీఅ ఉత్పాత్తైన వస్తువులు అన్ని ప్రాంతాలకూ చేరాలి. అందుకోసం మంచి రవాణా సదుపాయాలు ఉండేవి.

పెట్టుబడిదారీ విధానంలో, రవాణాపరిశ్రమ చలామణీ ఖర్చులకు మూలం అయినట్లు అగుపిస్తుంది. కాని, కనపడే ఈ ప్రత్యేకరూపం సారాంశాన్ని ఇసుమంతైనా మార్చదు. అంటే రవాణా వాటి విలువకు ఏమాత్రం జతచెయ్యదు. రవాణా చార్జీ అదనంగా ఉంటుంది. అంతే. సరుకు విలువ మారదు. అంతకుముందు ఎంత ఉందో అంతే ఉంటుంది.


రవాణావల్ల సరుకుల పరిమాణాలు పెరగవు. అయితే  సరుకుల సహజ లక్షణాల్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఆ మార్పు, అరుదుగా తప్ప, ఆశించిన ప్రయోజనకర ఫలితం కాదు. అది అనివార్యమైన చెడుగు. ఉదాహరణకు, పళ్ళు, కూరగాయలు చెడవచ్చు. గాజు వస్తువులు పగిలిపోవచ్చు. ఇవి ఆశించిన ఫలితాలు కావు. ఆశించని చెడుగు. అలాగని అన్ని వస్తువులూ చెడవు. కొన్ని మినహాయింపులుంటాయి. ఉదాహరణకి, ఇనపసామాన్లు, స్టీల్ పాత్రలు వగయిరా.

వస్తువుల ఉపయోగపు విలువ, వినియోగంలో మాత్రమే సిద్ధిస్తుంది. వినినియోగమవాలంటే, అవి ఉత్పత్తైన చోటునించి వినియోగమయ్యే చోటుకి చేరాలి. అందుకు అదనపు ఉత్పత్తి ప్రక్రియ అవసరపడుతుంది. అదే రవాణా పరిశ్రమ. ఈ పరిశ్రమలో పెట్టిన ఉత్పాదక పెట్టుబడి రవాణా అయిన ఉత్పాదితాలకి విలువని ఏర్పరుస్తుంది - ఉత్పత్తి సాధనాల విలువనించి బదిలీ చేయడంద్వారా కొంతా, రవాణాలో జరిగిన శ్రమ కలిపిన విలువ ద్వారా కొంతా.

రవాణా ద్వారా పెరిగిన విలువలో వేతనాల భర్తీ, అదనపు విలువ భర్తీ ఉంటాయి - మొత్తం పెట్టుబడిదారీ ఉత్పత్తిలో ఉన్నట్లే. ఉదాహరణకి, 100 మంచాల రవాణాకి 2000 రూపాయల ఖర్చు అయిందనుకుందాం. ఈమొత్తం రెండు భాగాల కలయిక: 1.కార్మికుల వేతనాలు 1000 రూపాయలు

2.అదనపు విలువ 1000 రూపాయలు. 

ప్రతి ఉత్పత్తి ప్రక్రియలోనూ, శ్రమ పదార్ధాలూ, పనిముట్లూ, శ్రమశక్తీ చోటు మారుతుంటాయి

ఇందుకు మార్క్స్ రెండు ఉదారణలిస్తాడు:

1.  ఏకే గదినించి, వడికే గదిలోకి ట్రక్కులో చేరవేసే పత్తి

2.  గని అడుగు నించి పైకి తెచ్చే బొగ్గు

తయారైన వస్తువులు ఉత్పత్తైన చోటునించి, దూరంగా ఉన్న మరో చోటుకి చేర్చడం కూడ ఇలాంటిదే- కాకపోతే దీని స్థాయి పెద్దది, అంతే. అప్పుడు అవి ఉత్పత్తి రంగం నించి వినియోగరంగంలోకి ప్రవేశిస్తాయి. ఈ చలనాలు గడిస్తేనే గాని, ఉత్పాదితం వినియోగానికి రెడీ అవదు.

పైన చూపినట్లు సరుకు ఉత్పత్తికి సంబంధించిన సాధారణ నియమం వర్తిస్తుంది.ఆ నియమం ఇది: 

                  శ్రమ ఉత్పత్తిచేసే విలువకి, ఆ శ్రమ ఉత్పాదకత విలోమానుపాతంలో ఉంటుంది*

*ఒకే శ్రమ ఒకే కాలవ్యవధిలో భిన్న పరిమాణాల్లో ఉపయోగపువిలువల్ని ఉత్పత్తి చేస్తుంది. ఉత్పాదకతపెరిగితే ఎక్కువ పరిమాణంలో, తగ్గితే తక్కువ పరిమాణంలో.కాని అంతే  విలువని ఏర్పరుస్తుంది.

సాధారణంగా: శ్రమ ఉత్పాదకశక్తి పెరిగితే, ఒకవస్తువు తయారీకి పట్టే శ్రమ తగ్గి, దాని విలువ తగ్గుతుంది.అందుకు భిన్నంగా శ్రమ ఉత్పాదకశక్తి తగ్గితే, ఒకవస్తువు తయారీకి పట్టే శ్రమ పెరిగి, ఆవస్తువు విలువ పెరుగుతుంది.

ఒకసరుకు విలువ పరిమాణం ఆసరుకులో ఇమిడివున్న శ్రమ మొత్తానికి అనులోమంగానూ, ఆశ్రమ ఉత్పాదకశక్తికి విలోమంగానూ మారుతుంది. అంటే శ్రమ ఎంత పెరిగితే విలువ అంత పెరుగుతుంది.  ఉత్పాదకత ఎంత పెరిగితే సరుకు విలువ అంత తగ్గుతుంది.-Cap 1 p48

 

 ఇది రవాణా పరిశ్రమకి కూడ వర్తిస్తుంది. ఏ ఇతర పరిశ్రమకైనా వర్తిస్తుంది. కాబట్టి ఇది సాధారణ నియమం. దీనర్ధం:

ఒకానొక దూరానికి సరుకుల రవాణా ఖర్చు తగ్గితే, అంటే, రవాణాకి పట్టే సజీవ నిర్జీవ శ్రమ తగ్గితే, శ్రమ ఉత్పాదకత పెరిగినట్లు; అది పెరిగితే ఇది తగ్గినట్లు.

        మిగిలిన విషయాలన్నీ మారకుండా ఉన్నప్పుడు:

1. సరుకు విలువకు రవాణా కలిపే విలువపరిమాణం, ఆ పరిశ్రమ ఉత్పాదక శక్తికి విలోమానుపాతంలో ఉంటుంది; అంటే పరిశ్రమ ఉత్పాదకత పెరిగితే సరుకు విలువ తగ్గుతుంది. ఉత్పాదకత తగ్గితే సరుకు విలువ పెరుగుతుంది.

2. సరుకుల్ని తరలించే దూరానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే అది పెరిగితే ఇదీ పెరుగుతుంది, అది తగ్గితే ఇదీ తగ్గుతుంది.

3. రవాణావల్ల సరుకుల ధరలకు కలిసేది:

A. ఆ సరుకుల పరిమాణానికీ, బరువుకీ అనులోమానుపాతంలో ఉంటుంది. బరువూ, పరిమాణమూ పెరిగితే రవాణావల్ల సరుకులకు కలిసే విలువ పెరుగుతుంది; అవి తగ్గితే ఇదీ తగ్గుతుంది.

B. వాటి విలువకి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే వాటి విలువ పెరిగితే రవాణావల్ల సరుకులకు కలిసే విలువ తగ్గుతుంది. వాటి విలువ తగ్గితే రవాణావల్ల సరుకులకు కలిసే విలువ పెరుగుతుంది.

అయితే వీటిని సవరించే అంశాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి రవాణా విషయంలో కొద్దో గొప్పో ముఖ్యమైన ముందు జాగ్రత్తలు అవసరం. రవాణా అయ్యే వస్తువులు ఎంత బలహీనమైనవి, ఎంత త్వరగా చెడిపోతాయి, ఎంత పేలే స్వభావం ఉన్నవి వంటి అంశాల్ని బట్టి శ్రమశక్తీ, శ్రమ సాధనాలూ ఖర్చవుతాయి.

 ఈ విషయంలో ఇంగ్లిష్ రైల్వే కంపెనీలు చేసిన సరుకుల వర్గీకరణకు కొన్ని పుస్తకాలు నిండాయి.ఆ వర్గీకరణ కి ఆధారమైన సూత్రం: సరుకుల వైవిధ్యభరితమైన సహజధర్మాల్ని వాటి రవాణాకి కలిగే  చెడుగులుగా మార్చాయి. వాటిని మోసపూరితంగా అధిక చార్జీలు వసూలు చెయ్యడానికి సాకులుగా పెట్టుకున్నాయి.

ఉదాహరణ: రవాణాకోసం ఒక పెట్టెలో పట్టే గాజు సామాగ్రి మునుపు 11 పౌన్లు అయ్యేది.వాటి తయారీలో మెరుగుదలలొచ్చాకా, వాటిమీద సుంకం (duty) తొలిగించాకా, అదే గాజు సామాగ్రి 2 పౌన్లకి దిగింది. అయితే రవాణా చార్జీ అప్పుడున్నంతే ఉంది. అంతకుముందు కాలవ ద్వారా రవాణా అయినప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ ఉంది

బర్మింగ్ హాం కి 50 మైళ్ళ చుట్టులో  గాజు, ప్లంబర్లు ఉపయోగించే గాజు సామాను టన్నుకి ఇంతకుముందు  10 షిల్లింగులు రవాణా చార్జీ ఉండేది అని మాన్యుఫాక్చరర్లు చెప్పారు. ఇప్పుడు పగిలిపోయే రిస్క్  తగ్గించేందుకంటూ అంతకు మూడింతలు తీసుకుంటున్నారు.. అయితే పగిలిన సామానుకి పరిహారం ఇవ్వడానికి మాత్రం కంపెనీలు ససేమిరా అంటున్నాయి.
రవాణా ఖర్చులవల్ల వస్తువుకి కలిసే విలువ భాగం దాని విలువకి విలోమానుపాతంలో ఉంటుంది. ఈ వాస్తవం రైల్వే వాళ్ళకి వస్తువుల విలువకి అనులోమానుపాతంలో చార్జీ వేసేందుకు ప్రత్యేక ఆధారాన్ని సమకూరుస్తుంది.

టెన్నిస్ రాకెట్ రూ. 2000 దీ ఉంటుంది. రూ. 20,000 దీ ఉంటుంది. రెంటికీ రవాణా ఖర్చులో తేడా ఉండదు. అది 200 అనుకుందాం. మొదటిదాని విలువలో రవాణా ఖర్చు 10% . రెండోదాని విలువలో అది 1%  మాత్రమే. అంటే, దాని మొత్తంవిలువలో రవాణా చార్జీ శాతం తగ్గుతుంది.

పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం విడి సరుకు రవాణా చార్జీల్ని తగ్గిస్తుంది, ఎలాగంటే:  

1. రవాణా సాధనాల, వార్తా ప్రసార సాధనాల అభివృద్ధి ద్వారా. ఆవిరి ఓడలు  రాకముందు తెరచాప ఓడల్లో వారాలు పట్టే రవాణా కాలం అవి వచ్చాక రోజులకి దిగింది. వాటి వేగం బాగా పెరగడమే కారణం.

దూర ప్రాతాలకి వార్త పంపాలంటే వారాలు పట్టేది. టెలిగ్రాఫ్ మెరుగయ్యాక అదే దూరానికి   మెసేజ్ పోవడానికి కొన్ని నిమిషాల సమయమే సరిపోయేది.

సముద్రంలో ఓడలమీద అయ్యే రవాణా చార్జీలు 1950 తొ పొల్చి చూస్తే 90 శాతం తగ్గాయి. ఫొన్ చార్జీలు 20 ఏళ్ళలో ఎంత తగ్గాయో అందరికీ తెలిసిందే. తీవ్రంగా చౌక పడ్డాయి కాబట్టే  ఇండియాలో 110 కోట్ల సెల్ ఫొన్లు వాడకంలో ఉన్నాయి.

2. రవాణా సాంద్రీకరణ ద్వారా. అంటే దాని స్థాయి పెంచడం ద్వారా. పరిశ్రమలో భారీస్తాయి కంపెనీలు ఏర్పడతాయి. వాటికి చిన్నకంపెనీల కయ్యే ఖర్చులకంటే ఖర్చులు తక్కువ ఉంటాయి. అధునాతన సాధనాలని ఉపయోగిస్తాయి. కాబట్టి రవాణా చౌకబడుతుంది.

సమాజ శ్రమలో, సరుకుల రవాణాకి ఖర్చయ్యే భాగాన్ని పెంచుతుంది, ఎలాగంటే:

1.అత్యధిక ఉత్పాదితాల్ని సరుకులుగా మార్చడం ద్వారా.

వెనకటి వ్యవస్థల్లో తయారైన వస్తువుల్లో అత్యధికభాగం మారకం లేకుండానే వాడకంలోకి వచ్చేవి. అంటే అల్ప భాగం మాత్రమే సరుకులు అయ్యేవి. పెట్టుబడిదారీ విధానం అభివృద్ధయ్యేకొద్దీ,  అత్యధికభాగం ఉత్పాదితాలు సరుకులుగా మార్చబడతాయి. మారకంలోకొస్తాయి.అందువల్ల వాటి రవాణాకి అయ్యే శ్రమ పెరుగుతుంది.

2. స్థానిక మార్కెట్ల బదులు దూరప్రాంత మార్కెట్లను ఏర్పరచడం ద్వారా.

మునుపు స్థానికంగానే వాడిన ఆహార సరుకులు ఇప్పుడు వివిధ ప్రాంతాలకూ అవసరమవుతున్నాయి. వాటి రవాణా దూరాలు పెరిగాయి. దూరాన్ని బట్టి ఎక్కువ శ్రమ పడుతుంది.

సరుకుల రవాణా అంటే సరుకులు వాస్తవంగా ఒక చోటు నించి మరొక చోటుకి చేరడమే. రవాణా పరిశ్రమ ఒకపక్క, ఒక స్వతంత్ర ఉత్పత్తి రంగం. ఆవిధంగా అది ఉత్పాదక పెట్టుబడి పెట్టే వేరే రంగం. మరొకపక్క, దాని విశిష్ట లక్షణం ఏమంటే: అది చలామణీ ప్రక్రియ లోపల, చలామణీ ప్రక్రియ కొరకు ఉత్పత్తి ప్రక్రియ యొక్క కొనసాగింపుగా కనబడుతుంది.

దీంతో రెండో సంపుటంలోని 3 భాగాల్లో మొదటిది ముగిసింది.

వచ్చే పోస్ట్: రెండో భాగం 'పెట్టుబడి టర్నోవర్ ' లోని మొదటి అధ్యాయం:

        'టర్నోవర్ కాలమూ, టర్నోవర్ల సంఖ్యా'