అధ్యాయం 2 ఉత్పాదక
పెట్టుబడి వలయం
విభాగం 1 సామాన్య పునరుత్పత్తి
ఈ అధ్యాయం రెండు అంశాల్ని చర్చిస్తుంది:
1. సామాన్య పునరుత్పత్తి
2. సంచయనం
ఈ రెండు సందర్భాల్లో వలయాల ఫార్ములాలు భిన్నంగా ఉంటాయి.
ఉత్పాదక పెట్టుబడి వలయం సాధారణ ఫార్ములా : ఉ.పె...స'- డ'- స...ఉ.పె.
ఈ ఫార్ములా ఉత్పాదక పెట్టుబడి
చర్య నియమిత
కాలాల్లో మళ్ళీ మళ్ళీ జరగడాన్ని సూచిస్తుంది.
దాని లక్ష్యం: విలువ తనంత తాను పెరగడం; అదనపు విలువని
ఉత్పత్తిచెయ్యడం, అంతే కాదు, నియమిత కాలాల్లో అదనపు విలువని పునరుత్పత్తి చెయ్యడం.
చలామణీలో ప్రవేశించని విలువలు
కొన్ని సందర్భాల్లో,
వివిధ పారిశ్రామిక పెట్టుబడి శాఖల్లో స' లో కొంత భాగం, అదే శ్రమ ప్రక్రియలో ఉత్పత్తి సాధనాలుగా తిరిగి చేరవచ్చు. ఆ భాగం విలువ డబ్బులోకి మారే పని ఉండదు. లేదా ఆ సరుకు చిట్టాకెక్కే
డబ్బుగా ఉండవచ్చు. స్వతంత్ర వ్యక్తీకరణ పొందవచ్చు. ఈ భాగం విలువ చలామణీలోకి
రానేరాదు. స' లో కొంత భాగాన్ని పెట్టుబడిదారుడు
అదనపు ఉత్పాదితంలో భాగంగా, వస్తురూపంలో వినియోగించుకుంటాడు. ఈ భాగానికి కూడా అదే వర్తిస్తుంది. ఈ భాగం కూడా చలామణీ లోకి రాదు. అవి చలామణీలో ప్రవేశించని
విలువలు.
ఉదాహరణ: వరి ఉత్పత్తిని తీసుకుందాం.50,000 డబ్బు పెట్టుబడి. ఉత్పత్తయింది 50 బస్తాల ఒడ్లు.అందులో 2 బస్తాలు మరో
పంటకు విత్తనాలు అవుతాయి. తిరిగి
ఉత్పత్తిలో ప్రవేశిస్తాయి. కాబట్టి ఈ భాగం సరుకు చలామణీలో చేరదు. డబ్బవదు. అలాగె
పెట్టిన విలువ కంటే, 10 బస్తాల సరుకు విలువ కలిసి ఉంది. ఇది అదనపు
ఉత్పాదితం. దీన్ని కుటుంబానికి వాడుకుంటాడు. ఈ భాగం కూడా చలామణీలో చేరదు. డబ్బవదు.
ఇవి చలామణీ లో చేరని విలువలు.
అయితే, పెట్టుబడిదారీ ఉత్పత్తిలో, ఇది కొద్దిపాటిది మాత్రమే. పట్టించుకోవాల్సినంతటిది కాదు. దీన్ని పట్టించుకొవాల్సి వస్తే, అది కేవలం వ్యవసాయంలో మాత్రమే.
ఈ రూపంలో రెండు విషయాలు స్పష్టం:
1. మొదటి విషయం. మొదటి రూపం అయిన డ-డ' లో, ఉ.పె చర్య డబ్బు చలామణీని నిలిపివేస్తుంది; డ-స, స' -డ' ల మధ్య మధ్యవర్తిగా మాత్రమే పనిచేస్తుంది. ఉ.పె వలయాన్ని ఆరంభించిన
రూపంలోనే దాన్ని పూర్తిచేస్తుంది. అందువల్ల, అదే రూపంలో మళ్ళీ వలయాన్ని
మొదలుపెడుతుంది. చలామణీ, నియమిత కాలాల్లో పునరుత్పత్తికి దోహదం చేసే సాధనంగా కనిపిస్తుంది. పునరుత్పత్తిని నిరంతరం కొనసాగేట్లు చేస్తుంది.
2. రెండో విషయం. చలామణీ యావత్తూ, డబ్బు పెట్టుబడి
వలయం లో చలామణీకి ఉండే రూపానికి వ్యతిరేకమైన రూపంలో తన్నుతాను ప్రదర్శించుకుంటుంది. డబ్బు పెట్టుబడి వలయంలో చలామణీకి ఉండే రూపం: అక్కడ డ-స-డ (డ-స.స-డ).విలువ నిర్ధారణని పక్కన బెట్టాం; ఇక్కడ మళ్ళీ
విలువ నిర్ణయాన్ని పక్కన బెడితే ఆ రూపం: స-డ-స(స-డ. డ-స). ఇది సరుకుల సాధారణ
చలామణీ రూపమే.
1.సామాన్య పునరుత్పత్తి
ఉత్పాదక పెట్టుబడి వలయం యొక్క సాధారణ ఫార్ములా : ఉ.పె...స'- డ'- స...ఉ.పె.
ఆ చివరా ఈ
చివరా ఉన్న ఉ.పె ...ఉ.పె ల మధ్య చలామణీ రంగంలో
జరిగే ప్రక్రియని ముందు చూద్దాం. ఆ ప్రక్రియ: స'-డ'- స. ఈ చలామణీకి ఆరంభ బిందువు సరుకు
పెట్టుబడి స'; స'= స+స.ఫె (సరుకు
రూపంలో అదనపు విలువ)= ఉ.పె+ స.ఫె. సరుకు పెట్టుబడి చర్య, వలయం మొదటిరూపంలో పరిశీలించబడింది. ఆ చర్య: అందులో
ఉన్న పెట్టుబడి విలువ, చేతిలో పడ్డప్పుడు, అది ఉ.పె కి సమానం. ఇప్పుడు ఉ.పె స' లో ఉన్న స + స' లో ఉన్న అదనపు విలువ. ఈ అదనపు విలువ
స' లో అంతర్భాగంగా ఉంటుంది. అయితే అక్కడ ఈ చర్య ఆగిపోయిన చలామణీ
యొక్క రెండో దశని - మొత్తం వలయం యొక్క ముగింపు దశని - ఏర్పరచింది. ఇక్కడ అది వలయం యొక్క
రెండో దశని, అయితే చలామణీలో మొదటి దశని ఏర్పరచింది. మొదటి వలయం డ' తో ముగుస్తుంది.
డ', మొదటి డ
రెండూ డబ్బు పెట్టుబడిగా మరో వలయాన్ని మొదలెట్టగలుగుతాయి. అందువల్ల డ, డ' లో ఉన్న డ. ఫె (డబ్బు రూపంలో అదనపు విలువ) రెండూ కలిసికట్టుగా నడుస్తాయా? లేక దేనికదిగా
విడివిడిగా చర్యను కొనసాగిస్తాయా?
అనేదాన్ని తేల్చాల్సిన అవసరం అప్పుడు కలగలేదు. మొదటి వలయం మళ్ళీ మొదలైనప్పుడు, దాని చలనాన్ని గమనించి ఉన్నట్లయితేనే, ఇది అవసరమై
ఉండేది. కాని ఈ పాయింట్ ని ఉత్పాదక పెట్టుబడి వలయంలో
నిర్ణయించాలి. కారణం: దాని మొదటి వలయం నిర్ధారణే దానిమీద ఆధారపడి ఉంది; అందులో స' - డ' తొలిదశగా కనబడుతుంది; ఆ దశ డ-స తో ముగియవలసిన దశ. అది ఈ ఫార్ములా సామాన్య
పునరుత్పత్తిని సూచిస్తుందా? లేక విస్తృత పునరుత్పత్తిని సూచిస్తుందా? అనే నిర్ణయం మీద
ఆధారపడి ఉంటుంది. ఈ నిర్ణయాన్ని బట్టి, వలయం స్వభావం
మారుతుంది.
ఉత్పాదక పెట్టుబడి యొక్క సామాన్య
పునరుత్పత్తి
ఇప్పుడు ఉత్పాదక పెట్టుబడి యొక్క సామాన్య పునరుత్పత్తిని
పరిశీలిద్దాం. ఇక్కడ కూడా మొదటి అధ్యాయంలో
లాగానే, విషయాలు ఇలా ఉన్నట్లు అనుకొని ముందుకు
పోవాలి. అవి:
1. పరిస్థితులు మారకుండా స్థిరంగా, ఉన్నవి ఉన్నట్లే ఉన్నాయి.
2. సరుకులు వాటి విలువలకే కొనబడుతున్నాయి, అమ్ముడుబోతున్నాయి.
అలా అనుకున్నప్పుడు, అదనపువిలువ యావత్తూ
పెట్టుబడిదారుని వ్యక్తిగత వినియోగంలో చేరుతుంది. సరుకు పెట్టుబడి స' డబ్బులోకి మారీ మారగానే, ఆ డబ్బులో పెట్టుబడి విలువగా ఉన్న భాగం, పారిశ్రామిక పెట్టుబడి వలయంలో చలామణీ అవుతూనే ఉంటుంది. మరోభాగం, అంటే డబ్బులోకి మారిన అదనపు విలువ, సరుకుల సాధారణ చలామణీలో చేరుతుంది. ఆ డబ్బు చలామణీ పెట్టుబడి దారుడి నించి వస్తుంది; కాని, అది అతని వ్యష్టి
పెట్టుబడి చలామణీలో జరగదు. దానికి బయట జరుగుతుంది.
మన ఉదాహరణలో, స' (పెట్టుబడిదారుడి
సరుకు) 1000 కిలోల
నూలు. ఆ
నూలు విలువ రూ.12,000. వడికే పనిలో వ్యయమయిన ఉత్పత్తిసాధనాల విలువ రూ.10,000. ఉత్పత్తిచర్యలో కొత్తగా కలిసిన విలువ 2000. అంటే, వడికేటప్పుడు
పనివాళ్ళు కలిపిన కొత్తవిలువ రూ.2000. దీంట్లో శ్రమశక్తికి పెట్టినది, రూ.1000. అదనపు విలువ రూ.1000. పెట్టిన పెట్టుబడి రు.11,000. ఉత్పాదక పెట్టుబడి 11,000.
స' తో
మొదలయ్యే పెట్టుబడి గమనం 917
కిలోల నూలు యొక్క డబ్బు రూపంతో,
రూ.11,000 తో
కొనసాగుతుంది. అదే సమయంలో అదనపు విలువ రూ.1000, అంటే, 83 కిలోల నూలు విలువ, చలామణీ నించి తప్పుకుంటుంది. సరుకుల సాధారణ
చలామణీ నించి వేరవుతుంది. అయితే
సాధారణసరుకుల చలామణీలోనే మరోదారిలో నడుస్తుంది.
స' (స+స.ఫె) - డ' (డ+డ.ఫె)- స (శ్ర.శ+ఉ.సా)
డ.ఫె - స.ఫెగురించి. పెట్టుబడి దారుడు డ. ఫె ని తనకూ, తనకుటుంబానికీ ఖర్చు చేసేస్తాడు. సరుకులో, సేవలో కొంటాడు. అప్పుడప్పుడు అవసరం మేరకు- ఏది అవసరమైతే దాన్ని ఎంత అవసరమైతే అంత- కొంటుంటాడు. కాబట్టి తాత్కాలికంగా కొంత నిల్వ రూపంలో అతని దగ్గర ఉంటుంది. అది చలామణీ సాధనంగా పనిచెయ్యదు. డబ్బుగా పెట్టుబడి చలామణీలో చేరదు. ఈ డబ్బు మదుపు పెట్టబడింది కాదు, ఖర్చు పెట్టబడింది.
మదుపు పెట్టిన పెట్టుబడి ఒకే మొత్తంగా ఒక
దశనుంచి మరొక దశలోకి చేరుతుందని అనుకున్నాం. అందువల్ల ఈ సందర్భంలో ఉత్పత్తయిన
సరుకుల విలువ = ఉత్పాదక పెట్టుబడి 11,000+అదనపు విలువ 1000. మన ఉదాహరణలో అదనపువిలువ 83 కిలోల నూలు రూపంలో ఉంటుంది. ఒక కిలో నూలులో
ఉండే అదనపు ఉత్పాదితం 83
గ్రాములు. దీన్ని మొత్తం నూలు
నించి వేరు పరచవచ్చు. అయితే ఒకవేళ ఆ సరుకు 12,000
చేసే
యంత్రం అనుకుందాం. దాని విలువ యంత్రం అంతటా పరుచుకొని ఉంటుంది. రూ. 1000 అదనపు విలువ కూడా మొత్తం యంత్రంలో ఇమిడి
ఉంటుంది. మరి దీన్ని పెట్టుబడి విలువగానూ, అదనపు విలువగానూ
వేరుపరచడం సాధ్యమా? దాన్ని ముక్కలు
చేస్తేనే గాని సాధ్యం కాదు. అప్పుడు దాని ఉపయోగపు విలువా, దాంతో పాటు విలువా నాశనం అవుతాయి. అందువల్ల, మొత్తం సరుకు లోని రెండుభాగాల్నీ రెండుగా ఊహించుకునే
వీలుంది. అంతే కాని 1000
కిలోల
నూలు నించి ఒక కిలో నూలుని వేరుపరచినట్లు, యంత్రాన్ని వేరుపరచడం
వీలవదు.
మొదటి
సందర్భంలో మొత్తం సరుకుని, మొత్తం సరుకు పెట్టుబడిని, అంటే యంత్రాన్ని
పూర్తిగా అమ్మితే తప్ప, అదనపు విలువ తన ప్రత్యేక చలామణీ మొదలు పెట్టలేదు. అయితే
పెట్టుబడిదారుడు 917
కిలోల
నూలు అమ్మగలిగితే,
రెండో
సందర్భంలో,
అప్పుడిక
83 కిలోల నూలు వేరుగా, అదనపు విలువ
చలామణీని ప్రదర్శించగలుగుతుంది. ఏరూపంలోనంటే: స.ఫె (83 కిలోల నూలు)- డ.ఫె (రూ.1000)- స(వినియోగ
వస్తువులు). ఇది అదనపు విలువ వేరుగా జరిపే చలామణీ.
1000 కిలోల నూలుని స్థిర పెట్టుబడి (స్థి.పె) 834 కిలోల నూలు గానూ, అస్థిర పెట్టుబడి
(అస్థి.పె) 83కిలోల నూలు గానూ , అదనపు విలువని (అ.వి) 83 కిలోల నూలు గానూ
విడగొట్టవచ్చు. డబ్బులో స్థిర పెట్టుబడి విలువ రూ.10,000 అస్థిర పెట్టుబడి
విలువ రూ.1000
అదనపు
విలువ రూ.1000. కాబట్టి, ప్రతి కిలో నూలును
మూడు భాగాలుగా విడగొట్టవచ్చు. అందులో స్థిర పెట్టుబడి నూలు రూపంలో 834 గ్రాములు. డబ్బులో 10
రూపాయలు. అస్థిర పెట్టుబడి నూలులో 83 గ్రాములు. డబ్బులో 1 రూపాయి. అదనపు విలువ నూలులో
83 గ్రాములు. డబ్బులో 1 రూపాయి. కిలో నూలు విలువ డబ్బులో = స్థిర.పె+
అస్థిర.పె+అ.వి=10+1+1= 12. నూలు రీత్యా స్థిర.పె+ అస్థిర.పె+అ.వి= 834+83+83= 1000 గ్రాములు= ఒక కిలోగ్రాము. పెట్టుబడిదారుడు 1000 కిలోల నూలుని
భాగాలుగా అమ్ముకోవచ్చు. ఒకేసారి కాకుండా పలుమార్లు వరసగా అమ్మవచ్చు. వాటిలో ఉన్న అదనపు
విలువను కూడా భాగాలుగా వినియోగించుకోవచ్చు. ఆ విధంగా
స్థిర.పె+అస్థిర.పె మొత్తాన్నీ సొమ్ముచేసుకోవచ్చు. అయితే ఈ చర్యలో సైతం నూలు అంతా
అమ్ముడవుతుందనీ,
అందువల్ల
స్థి.పె+అ.పె విలువ మొత్తం 917 కిలోల నూలు అమ్మడం ద్వారా భర్తీ అవుతుందనీ ముందే
అనుకున్నాము.
అంటే
ఆ
మొత్తం
తిరిగి యధాతధంగా మొదట్లో ఎంత ఉందో అంతే ఉంటుంది.
స' -డ' చర్య
ద్వారా స' లో ఉన్న పెట్టుబడి విలువా, అదనపువిలువా రెండూ వేరు వేరు డబ్బు మొత్తాలుగా, దేనికది
స్వతంత్రంగా ఉండగలుగుతాయి. పెట్టుబడి
విలువా(స), అదనపు విలువా (స.ఫె) దేనికదిగా విడిపోతాయి.
అందువల్ల, తేలే విషయాలు:
1. మొదటి విషయం. సరుకు పెట్టుబడి స' - డ' చర్య ద్వారా- స' - డ'= స' – (డ+డ.ఫె)- చర్య ద్వారా, పెట్టుబడి విలువ చలనం వల్లా అదనపు విలువ
చలనం వల్లా డబ్బవుతుంది. స' - డ' లో ఒకే మొత్తంగా ఉన్న సరుకుల వల్ల, ఇంకా ఐక్యంగా ఉంటున్న పెట్టుబడి విలువ చలనమూ, అదనపు విలువ చలనమూ, దేనికదిగా విడిపోవడానికి వీలు
కుదురుతుంది-
రెండు డబ్బు మొత్తాలుగా విడివిడిగా ఉన్నందువల్ల. కాబట్టి అవి వేర్వేరు డబ్బు మొత్తాలుగా
స్వతంత్ర రూపాల్ని పొందుతాయి.
2.రెండో విషయం. ఈ విభజన జరిగితే, డ.ఫె (పెరిగిన డబ్బు) పెట్టుబడిదారుడి ఆదాయంగా ఖర్చవుతుంది.
డ పెట్టుబడి విలువగా తన గమనాన్ని కొనసాగిస్తుంది. కాబట్టి, మొదటి చర్య స' -డ' దాని తదుపరి చర్యలయిన
డ-స, డ.ఫె -
స. ఫె లతో సంబంధం వల్ల, రెండు భిన్నమైన చలామణీలు అవుతాయి:
1. స-డ-స
2. స.ఫె
-డ.ఫె -స.ఫె
ఈ రెండూ, వాటి సాధారణ రూపానికి సంబంధించినంత వరకూ, మామూలు సరుకుల చలామణీకి చెందినవే.
విభజించడం వీలుకాని సరుకుల విషయంలో, విలువ భాగాల్ని మనసులో వేరుపరచడం ఆచరణలో
ఉంది.
ఇందుకొక ఉదాహరణ:
లండన్లో, ఎక్కువగా అప్పుతో జరిగే భవనాల
వ్యాపారంలో, కాంట్రాక్టర్
నిర్మాణం పూర్తయిన దశని బట్టి అడ్వాన్స్ పొందుతాడు. ఈ దశల్లో ఏదీ ఇల్లు కాదు.
పూర్తికాని ఇంటిలో, భవిష్యత్తులో ఉండబోయే ఇంటిలో ఇప్పుడు
నిజంగా ఉన్న భాగం మాత్రమే; అందువల్ల,వాస్తవం అదయినా, అది మొత్తం ఇంటియొక్క భావాత్మక భాగం.
అయినాగాని, అదనపు
అడ్వాన్స్ కి పూచీకత్తుగా ఉండ గలదు.
3.మూడో విషయం. స లోనూ, డ లోనూ, ఇంకా కలిసే సాగుతున్న పెట్టుబడి విలువ, అదనపు విలువల చలనం పాక్షికంగా మాత్రమే
వేరుపడిపోవచ్చు. అంటే, అదనపు
విలువలో కొంత భాగం ఆదాయంగా ఖర్చుబడక పోవచ్చు. లేక మొత్తంగానే ఖర్చవకపోవచ్చు. అలా
జరిగితే, అసలు
పెట్టుబడి విలువలోనే,
దాని వలయంలోపలే వలయం పూర్తయ్యే లోపే మార్పు వస్తుంది. మన ఉదాహరణలో
ఉత్పాదకపెట్టుబడి విలువ 11,000. అది డ-స ని 11,500 గానో, 12,000 గానో కొనసాగిస్తే, అప్పుడది
వలయం తదుపరి దశల్లో,అది
తన మొదటి విలువ కంటే 500 లేక
1000 ఎక్కువతో
నడుస్తుంది. ఇది
దాని విలువ అంతర్నిర్మాణంలోమార్పుతో కలిసి జరగవచ్చు.
స' -డ' వలయం 1 (డ...డ') చలామణీలో రెండో దశ, ముగింపు దశ.అది సరుకు చలామణీలో మొదటి దశ. చలామణీని దృష్టిలో పెట్టుకుంటే, అది డ'-స' తో పూర్తి కావాల్సి ఉంది. అయితే స్వయం విస్తరణ ప్రక్రియ స'-డ' చర్య కంటే ముందే జరిగి ఉంది (ఈ సందర్భంలో ఉ.పె చర్య, తొలి చర్య). అంతేకాదు, దాని ఫలితమైన స' అప్పటికే డబ్బయింది. అందువల్ల, పెట్టుబడి విస్తరణని సూచించే పెట్టుబడి స్వయం విస్తరణ ప్రక్రియా, సరుకులు డబ్బుగావడమూ, స'-డ' లో పూర్తయినాయి.
కాబట్టి, మనం సామాన్య పునరుత్పత్తి
జరుగుతున్నట్లు భావించాము. అంటే, డ.పె-స.పె
అనేది డ-స నుంచి పూర్తిగా వేరైందని అనుకున్నాము. స. ఫె
-డ. ఫె -స.ఫె చలామణీ, అలాగే స-డ-స చలామణీ రెండూ సాధారణ రూపానికి సంబంధించిన వరకూ సరుకుల
చలామణీలే. అందువల్ల, మొదటా చివరా విలువలో తేడా ఉండదు. ఎక్కువా తక్కువా ఉండదు.
అశాస్త్రీయ ఆర్ధికవేత్తల తప్పు అభిప్రాయం
కాబట్టి, అశాస్త్రీయ ఆర్ధికవేత్తలు (vulgar
economists) అనుకున్నట్లు
పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియని, సామాన్య
సరుకుల ఉత్పత్తిగా, ఏదో
ఒక రకం వినియోగం కోసం ఉద్దేశించబడిన ఉపయోగపు విలువల ఉత్పత్తిగా భావించడం సులువే.
వాటి బదులు వేరే ఉపయోగపు విలువలు గలిగిన సరుకుల్ని పొందడం తప్ప వేరే ఉద్దేశం లేదని
ఆ అశాస్త్రీయ ఆర్ధికవేత్తలు పొరపాటుగా చెప్పారు.
స' మొదట్నించీ
సరుకు పెట్టుబడిగా పనిచేస్తుంది. మొత్తం
ప్రక్రియ ఉద్దేశం ధనార్జన,
అదనపు విలువ ఉత్పత్తి.
పెట్టుబడిదారుని
ఆదాయం అదనపు విలువ.
అది ఉత్పత్తయిన స.ఫె.
స' లో
భాగం. స.ఫె ముందుగా డబ్బులోకి మారాలి. తర్వాత అతని
సొంత వినియోగం కోసం ఎన్నో సరుకులుగా మారాలి. చిన్నదే అయినా, ఇక్కడ మనం వదిలిపెట్టకూడని విషయం
ఒకటుంది. అది: స.ఫె అనేది పెట్టుబడి దారుడికి ఎమీ
ఖర్చుకాకుండా, ఊరకే
వచ్చే సరుకు విలువ. అదనపు శ్రమకి
భౌతిక రూపం. ఆ
కారణంగానే, స.ఫె సరుకు పెట్టుబడి స' లో భాగంగా మొదట రంగం మీదికొచ్చింది. ఈ స.ఫె
దాని స్వభావరీత్యానే
ప్రక్రియలో పెట్టుబడి
విలువ వలయానికి కట్టుబడి ఉంటుంది. ఒకవేళ
ఈ వలయం కదలకుండా ఉండడం మొదలయితే, స.ఫె వినియోగం పరిమితం అవుతుంది లేదా
పూర్తిగా ఆగిపోతుంది. అంతేకాదు, స.ఫె స్థానంలోకి వచ్చే సరుకుల అమ్మకం కూడా
పరిమితమవుతుంది, లేదా
అసలే ఆగిపోతుంది. స'- డ' చర్య జరగకపొయినా, లేక కొంతగానే జరిగినా పై ఫలితమే వస్తుంది.
స. ఫె
-డ. ఫె -స. ఫె- పెట్టుబడిదారుడి ఆదాయం యొక్క చలామణీని సూచిస్తుంది. స.ఫె అనేది స' విలువలో భాగంగా ఉన్నంత కాలమే, సరుకు పెట్టుబడియొక్క క్రియాత్మరూపంగా
ఉన్నంతవరకూ మాత్రమే, పెట్టుబడి
చలామణీలో చేరి ఉంటుంది. అయితే అది డ.
ఫె -స. ఫె
నుండి వేరవగానే, అందువల్ల, స. ఫె
-డ. ఫె -స. ఫె
అంతటా ఆ ఆదాయం చలామణీ పెట్టుబడిదారుడు మదుపు పెట్టిన పెట్టుబడి చలనంలో
చేరదు - అది అందులోనుంచే మొగ్గతొడిగినప్పటికీ. ఈ చలామణీ మదుపు
పెట్టిన
పెట్టుబడి చలనంతో
సంబంధంలో ఉంటుంది. ఎందుకంటే: పెట్టుబడి ఉన్నదంటే, పెట్టుబడి దారుడు అప్పటికే ఉండి ఉండాలి. అతను ఉండాలంటే, అతను
అదనపు విలువను వినియోగించుకోవాలి. ఇది తప్పనిసరి షరతు. ఈ చలామణి ఉద్దేశం పెట్టుబడిదారుడు సొంత
వినియోగం.
అశాస్త్రీయ అర్ధశాస్త్రజ్ఞుల తప్పు అభిప్రాయం
అశాస్త్రీయ అర్ధశాస్త్రజ్ఞులు, పెట్టుబడి చలామణీలో చేరని, ఆదాయంగా ఖర్చయ్యే ఉత్పాదిత విలువ భాగం
చలామణీని,
పెట్టుబడి యొక్క లాక్షణిక వలయంగా చెప్పారు. ఇలా చెప్పడం వాళ్ళ అజ్ఞానం.
రెండోదశ డ-స లో పెట్టుబడి విలువ డ ఉ.పె
కి సమానం.ఇక్కడ ఉ.పె అంటే, పారిశ్రామిక
పెట్టుబడి వలయాన్ని ప్రారంభించే ఉత్పాదక పెట్టుబడి విలువ. ఆ పెట్టుబడి విలువ డ తన
అదనపు విలువను వదిలించుకొని,
తిరిగి అలాగే ఉంటుంది. కాబట్టి, మొదట డ-స దశలో ఎంత పరిమాణంలో ఉందో, ఇప్పుడూ అంతే పరిమాణంలో ఉంటుంది.
అది అప్పుడేం చేసిందో
ఇప్పుడూ అదే చేస్తుంది. ఉ.సా గానూ, శ్ర.శ
గానూ ఆ డబ్బు
మారుతుంది.
సరుకు పెట్టుబడి స' -డ' చర్యలో పెట్టుబడి విలువ, స.పె-డ.పె తో పాటే స-డ దశను గడచి, దాన్ని పూర్తిచేసే దశ అయిన డ- స
(శ్ర.శ+ఉ.సా)లోకి నడుస్తుంది; ఆ
విధంగా, దాని
పూర్తి చలామణీ రూపం:
స-డ- స (శ్ర.శ+ఉ.సా).
దీన్నించి
తెలిసే విషయాలు
మొదటి విషయం.
ఒకటో రూపంలో, డ...డ' వలయంలో డబ్బు పెట్టుబడి డ మదుపు పెట్టిన
పెట్టుబడి విలువగా కనబడుతుంది; అదిక్కడ
ఆది నించీ మొదటి చలామణీ దశ స'-డ' లో
సరుకు పెట్టుబడి మారిన డబ్బులో భాగంగా ఉంటుంది. అందువల్ల మొదటినించీ ఉ.పె
యొక్క పరివర్తనగా, ఉత్పాదక పెట్టుబడి సరుకుల అమ్మకం ద్వారా, డబ్బు
రూపంలోకి మారడంగా కనిపిస్తుంది. ఇక్కడ
డబ్బు పెట్టుబడి మొదట్నించీ పెట్టుబడి విలువ యొక్క తొలి రూపమూ, తుదిరూపమూ కాని రూపంలో ఉంటుంది.
ఎందుకంటే, స-డ దశని పూర్తిచేసే డ-స దశ మళ్ళీ డబ్బు
రూపాన్ని వదిలిపెట్టడం ద్వారా మాత్రమే జరుగుతుంది. అందువల్ల, డ-స యొక్క ఆ భాగం, అదేసమయంలో డ- శ్ర.శ శ్రమ శక్తిని కొనడానికి పెట్టిన బయానా
డబ్బుగా మాత్రమే కనబడదు;
1000 రూపాయల
విలువ చేసే ఎనిమిదిన్నర కిలోల నూలును డబ్బు రూపంలో శ్రమశక్తి కోసం పెట్టే బయానాకు
సాధనంగా కనబడుతుంది. ఈ
బయానా డబ్బు
శ్రమశక్తి ఉత్పత్తి చేసిన
సరుకు విలువలో భాగం.
ఇందువల్లనే డ-స చర్య,
డ-శ్ర.శ చర్య అయిన మేరకు, డబ్బు
రూపంలో ఉన్న సరుకుల స్థానంలో, ఉపయోగపు
విలువ రూపంలో ఉన్న సరుకుల్ని పెట్టడం మాత్రమే కాదు. అందులో సరుకుల సాధారణ చలామణీకి
సంబంధించని అంశాలు కూడా ఉన్నాయి.
డబ్బులో గత శ్రమ వ్యక్తీకరణే-డ'
డ' స' మారిన
రూపం. విలువ పెరిగిన సరుకు యొక్క డబ్బు రూపం. స', ఉ.పె యొక్క గత చర్య
ఫలితం, గత ఉత్పత్తి ప్రక్రియ ఫలితం.
అందువల్ల మొత్తం
డబ్బు డ' గత
శ్రమయొక్క డబ్బు రూప వ్యక్తీకరణ. మన
ఉదాహరణలో వడికే
ప్రక్రియ ఉత్పాదితం 1000 కిలోల నూలు రూ.12,000; స్థిర పెట్టుబడి
భాగం రూ.10,000 కు
సమానమైన నూలు 833 కిలోలు.
అస్థిర పెట్టుబడి
భాగం రూ.1000 కి
83 కిలోలు.
అదనపువిలువ 83 కిలోలు.
ఇప్పుడు డ' నుంచి కొత్తగా మదుపు పెట్టే పెట్టుబడి, వెనకటి లాగే రూ.11,000
అనుకుందాం.
అన్నిపరిస్థితులూ అలాగే ఉన్నాయనీ అనుకుందాం. అప్పుడు పనివాడు డ-శ్ర.శ లో ఈ వారంలో ఉత్పత్తయిన 1000
కిలోలలో ఒక భాగాన్ని, డబ్బు రూపంలో వచ్చే వారపు అడ్వాన్స్ గా
పొందుతాడు. స-డ
చర్య ఫలితంగా, డబ్బు
ఎప్పుడయినా గతశ్రమ వ్యక్తీకరణే. వలయాన్ని పూర్తి చేసే డ-స చర్య సరుకుల మార్కెట్లో ఒకేసారి జరిగితే, మార్కెట్లో ఉన్న సరుకులకు డబ్బు చెల్లించబడితే, ఇది మళ్ళీ గత శ్రమ డబ్బు రూపం నుంచి
సరుకుల రూపానికి పరివర్తనే. అంటే ఒక రూపాన్నించి మరొక రూపానికి మారడమే. అయితే కాలం విషయంలో
స-డ కీ డ-స కీ తేడా ఉంది. రెండు చర్యలూ ఏకకాలంలో అరుదుగా మాత్రమే జరుగుతాయి.
డ-స చర్య జరిగేదానికీ, స-డ
చర్య జరిగేదానికీ మధ్య కాల వ్యవధి అంతో ఇంతో ఉండవచ్చు. స-డ ఫలితం డ. అది గత శ్రమకి
ప్రతీక. అయినా, డ-స
చర్యలో డ ఇంకా మార్కెట్లోకి రాని, కాని
భవిష్యత్తులో రాబోయే సరుకుల మారిన
రూపానికి ప్రతీక కావచ్చు. ఎందుకంటే, స కొత్తగా ఉత్పత్తయ్యేదాకా డ-స చర్య
జరగదు. అలాగే
డ స తో పాటు ఉత్పత్తయిన సరుకులకు డ గుర్తు
కావచ్చు. డబ్బులో ఆ సరుకుల వ్యక్తీకరణే డ. ఉదాహరణకి, డ-స మారకంలో, ఉత్పత్తి సాధనాల కొనుగోలులో గనుల్లో నుండి తవ్వకముందే, బొగ్గు కొనవచ్చు. డ.పె, ఆదాయంగా ఖర్చవకుండా, డబ్బు సంచయనంగా ఉన్న మేరకు, ఆ డ.పె వచ్చే ఏడాది వరకు ఉత్పత్తి
అవబోని పత్తికి ప్రతీక అవచ్చు. పెట్టుబడిదారుడి ఆదాయం ఖర్చవడం, డ.పె-స.పె విషయం కూడా సరిగ్గా అంతే.
వేతనాలకు, శ్ర.శ=1000
కు అదే వర్తిస్తుంది. ఈ
డబ్బు శ్రామికుల గత
శ్రమ డబ్బు రూపం మాత్రమే కాదు, అప్పుడు
జరుతున్న, భవిష్యత్తులో
జరగబోయే శ్రమకు డ్రాఫ్ట్, అంటే, డబ్బు చెల్లింపు పత్రం. ఇప్పుడు డబ్బవుతున్న లేక ముందుముందు డబ్బు కాబోయే పత్రం.
దాన్ని శ్రామికుడు ఒక వారం తర్వాత కుట్టే, కోటు కొనడానికి వాడవచ్చు. చెడిపోకుండా ఉండడానికి,
ఉత్పత్తయిన
వెంటనే వినియోగించవలసిన అనేక జీవితావసర వస్తువులకు ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది.
ఆ విధంగా
శ్రామికుడికి వేతనంగా అందేది,
ఆ శ్రామికుని లేక
ఇతర శ్రామికుల భవిష్య శ్రమ మారిన రూపమే. శ్రామికుడి గత శ్రమలో భాగాన్నే శ్రామికుడికి
ఇవ్వడం ద్వారా, పెట్టుబడిదారుడు శ్రామికుడు చెయ్యబోయే సొంత శ్రమ మీదే పత్రం ఇస్తాడు. అది
అతను చెసిన, చెయ్యబోయే
శ్రమ ఏర్పరచే, అయితే
అప్పటికి ఉనికిలో ఉండని నిల్వ. దాని నించే
శ్రామికుని గతశ్రమకు చెల్లింపు జరుగుతుంది. ఈ సందర్భంలో నిల్వ అనే భావమే పూర్తిగా
అదృశ్యం అవుతుంది.
రెండో విషయం: స-డ-స (శ్ర.శ+ఉ.సా) చలామణీలో ఒకే
డబ్బు రెండుసార్లు చోటు మారుతుంది; పెట్టుబడి
దారుడు మొదట అమ్మేవాడుగా దాన్ని తీసుకుంటాడు, తర్వాత
దాన్ని కొనేవాడుగా తిరిగి ఇచ్చేస్తాడు. సరుకు డబ్బు రూపంలోకి మారడం అనేది
ఆడబ్బురూపం తిరిగి సరుకు రూపంలోకి, కాబట్టి పెట్టుబడి యొక్క డబ్బు రూపంలోకి మారడానికి
ఉపకరిస్తుంది. డబ్బు పెట్టుబడిగా దాని మనుగడ ఈ చలనంలో కొద్దికాలం ఉండేది మాత్రమే; లేక, ఆ చలనం ధారాళంగా ఉన్నంత వరకూ, డబ్బు పెట్టుబడి, కొనుగోలు సాధనంగా ఉపకరించినప్పుడు, చలామణీ మాధ్యమంగా కనబడుతుంది; పెట్టుబడిదారులు ఒకరినుంచి మరొకరు
కొన్నప్పుడు, అందువల్ల
లెక్క తేల్చి ఇచ్చేటప్పుడు డబ్బు పెట్టుబడి చెల్లింపు సాధనంగా పనిచేస్తుంది.
మూడో విషయం. డబ్బు పెట్టుబడి చర్య వల్ల, స స్థానంలో శ్ర.శ ,ఉ.సా వస్తాయి. అంటే, నూలు ఉత్పత్తికి కావలసిన మూలకాలు అవుతాయి.
అంతిమ విశ్లేషణలో, డబ్బు పెట్టుబడి చర్య సరుకు పెట్టుబడిని
ఉత్పాదక పెట్టుబడిలోకి తిరిగి మారుస్తుంది.
వలయం మామూలుగా పూర్తవాలంటే, స' దాని
విలువకే అమ్ముడయి తీరాలి, అది
మొత్తమూ అమ్ముడయి తీరాలి. అంతేకాక, స-డ-స
లో ఒక సరుకు పోయి,
మరొక సరుకు వస్తుంది. అది
మాత్రమే కాదు. అలా జరగడంలో, అవే
విలువ సంబంధాలు మళ్ళీ ఏర్పడతాయి. ఇక్కడ అలాగే జరుగుతుందని అనుకుంటాము.
వాస్తవానికి, ఉత్పత్తిసాధనాల విలువ మారుతూ ఉంటుంది; పెట్టుబడి దారీ ఉత్పత్తి, విలువ సంబంధాల్లో నిరంతర మార్పుని
తెస్తుంది. ఇది
ఆ ఉత్పత్తి
ప్రత్యేకత. కారణం : శ్రమ ఉత్పాదకత నిరంతరం మారుతూ ఉండడమే. ఉత్పాదకత మారితే, ఉత్పత్తయ్యే సరుకు విలువ మారుతుంది.
దీని గురించి తర్వాత చర్చిద్దాం. ఇక్కడ అది ఉన్నట్లు చెప్పాము. ఉత్పత్తి మూలకాలు
సరుకు ఉత్పాదితాలుగా అంటే, ఉ.పె, స' గా
పరివర్తనచెందడం అనేది ఉత్పత్తి రంగంలో జరుగుతుంది; స' ఉ.పె
గా మారడం చలామణీ రంగంలో జరుగుతుంది. ఇది మామూలు సరుకుల రూపపరివర్తన ద్వారా
జరుగుతుంది.
కాని, దాని
సారం మొత్తంగా పరిగణించబడ్డ పునరుత్పత్తి ప్రక్రియలో ఒక దశ. పెట్టుబడి చలామణీ
యొక్క ఒక రూపం అయినందువల్ల స-డ-స ప్రత్యేకంగా క్రియా నిర్ణయమయిన పదార్ధ పరస్పర
మార్పిడిని ఇముడ్చుకొని ఉంటుంది. స-డ-స పరివర్తన సాగాలంటే, స' సరుకు
రాశి మొత్తపు ఉత్పత్తి మూలకాలకు స సమానంగా
ఉండాలి. వీటి
విలువ సంబంధాలు మొదట్లో ఉన్నట్లే ఉండాలి. అందువల్ల, సరుకులు వాటి విలువలకే కొనబడతాయి
అనేకాకుండా, వలయం
నడిచే సమయంలో ఆ విలువలు మారవు అనికూడా అనుకున్నట్లు; పరిస్థితి అలా కాకపోతే, ప్రక్రియ మామూలుగా సాగదు.
డ...డ' లో డ మొదటి పెట్టుబడి విలువ రూపం. ఈ
రూపాన్ని వదిలివేసేది, తిరిగి
తీసుకోవడానికే. ఉ.పె...స'-డ'-స...ఉ.పె లో డ అనేది ప్రక్రియలో
తీసుకొని, ఆ
ప్రక్రియముగియకముందే వదిలేసే రూపం మాత్రమే.
ఇక్కడ డబ్బు రూపం పెట్టుబడి యొక్క తాత్కాలిక,
స్వతంత్ర రూపంగా కనబడుతుంది. స' రూపంలో
పెట్టుబడి డబ్బు రూపం పొందడానికి
అరాట పడుతుంది. అయితే డ' గా
పెట్టుబడి ఆ రూపాన్ని వదిలించుకునేందుకు ఆరాట పడుతుంది- మళ్ళీ ఉత్పాదక పెట్టుబడిలోకి
మారడానికి. డబ్బు రూపంలో ఉన్నంతవరకూ, అది
పెట్టుబడిగా పనిచెయ్యదు.అందువల్ల దాని విలువ పెరగదు. పెట్టుబడి బీడు పడుతుంది, వ్యర్ధంగా పడి ఉంటుంది.
ఇక్కడ డ చలామణీ
మాధ్యమంగా, అయితే, పెట్టుబడి యొక్క చలామణీ మాధ్యమంగా
ఉపకరిస్తుంది. వలయం
యొక్క మొదటి రూపంలో,
డబ్బు పెట్టుబడి రూపంలో, పెట్టుబడి
విలువ యొక్క డబ్బు రూపం స్వతంత్రమైనది అయినట్లు కనబడుతుంది. కాని, రెండో రూపంలో స్వతంత్రత కనపడదు, అదృశ్యం అవుతుంది. ఆవిధంగా అది రూపం1
కి విమర్శ అవుతుంది, దాన్ని కేవలం ఒక ప్రత్యేక రూపంగా
తేల్చిపడేస్తుంది.
రెండో పరివర్తన డ-స కి అడ్డంకులు ఎదురైతే, ఉదాహరణకు
ఉత్పత్తి సాధనాలు మార్కెట్లో దొరకక పోతే, అప్పుడు పునరుత్పత్తి ప్రక్రియ యొక్క
చక్రచలనానికి అంతరాయం ఏర్పడుతుంది. పెట్టుబడి
సరుకు రూపంలో కదలకుండా కట్టేసినట్లవుతుంది. తేడా ఏమంటే: వెనకటి సరుకు రూపంలో కంటే, డబ్బు రూపంలో పెట్టుబడి ఎక్కువ కాలం
మనగలుగుతుంది. డబ్బు
పెట్టుబడిగా విధులు నిర్వర్తించక పొయినప్పటికీ, డబ్బు డబ్బుగా ఉండడం ఆగిపోదు, అంటే డబ్బుగానే ఉంటుంది; అయితే, సరుకు పెట్టుబడిగా పనిచెయ్యడంలో ఎంతకాలం
ఆలశ్యం అయితే, అంతకాలం
సరుకు సరుకుగా, లేక
ఉపయోగపు విలువగా ఉండదు. ఇంకొకటి, డబ్బు
రూపంలో అది దాని మొదటి రూపమైన ఉత్పాదకపెట్టుబడి రూపం కాకుండా, వేరొక రూపం పొందగలుగుతుంది. అది స' రూపంలో
ఉన్నట్లయితే,
అలాంటి వెసులుబాటు ఏమాత్రమూ ఉండదు.
చలామణీ నించి ఉత్పత్తికి
మారడం
స'-డ'-స స' యొక్క పునరుత్పత్తి మూలకాల్ని
ఇముడ్చుకొని ఉంటుంది.
స'-డ'-స లో స' కి సంబంధించి, దాని రూపానికి అనుగుణమైన చలామణీ చర్యలు మాత్రమే
ఇమిడి ఉంటాయి. ఆ
చర్యలు దాని పునరుత్పత్తి దశలు. అయితే స' లోకి
మారిన స యొక్క వాస్తవ పునరుత్పత్తి స'-డ'-స చర్యకి అవసరం; ఏమైనా, ఇది స' లో వివరించిన వ్యష్టి పెట్టుబడి
ప్రక్రియ పునరుత్పత్తి బయట జరిగే పునరుత్పత్తి ప్రక్రియలమీద ఆధారపడి ఉంటుంది.
రూపం1 లో, డ-స(శ్ర.శ+ఉ.సా)
డబ్బు పెట్టుబడి ఉత్పాదక పెట్టుబడి లోకి మొదటి పరివర్తనకి సిద్ధంచేసింది;
రూపం2 లో
అది సరుకు
పెట్టుబడిని
తిరిగి ఉత్పాదక
పెట్టుబడిలోకి పరివర్తనని సిద్ధం చేసింది; ఆవిధంగా, పారిశ్రామిక
పెట్టుబడి అదే వ్యాపారంలో ఉన్నంతవరకూ, సరుకు
పెట్టుబడిని అది వేటినుంచి రూపొందిందో ఆ ఉత్పత్తి అంశాలలోకి సరుకు పెట్టుబడి
తిరిగి పరివర్తనకి సిద్ధం చేస్తుంది. కాబట్టి అది రూపం 1 లో లాగే, ఉత్పత్తి ప్రక్రియకి సిద్ధంచేసే దశగా
కనబడుతుంది. అయితే, ఆ
ప్రక్రియకు
తిరిగిరావడంగా, దాన్ని
మళ్ళీ మొదలెట్టడంగా కనబడుతుంది. అందువల్ల ఉత్పత్తి ప్రక్రియకు ముందు వచ్చేదిగా, అందువల్ల విలువ స్వయం
విస్తరణ ప్రక్రియ మళ్ళీ జరగడంగా కనబడుతుంది.
మళ్ళీ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది: డ-శ్ర సామాన్య సరుకుల మారకం
కాదు. అదనపు
విలువ ఉత్పత్తికి ఉపకరించే
శ్రమశక్తి అనే సరుకు కొనుగోలు - డ-ఉ.సా కేవలం ఈ లక్ష్యసాధనకి భౌతికంగాతప్పనిసరి
అయినట్లుగానే.
డ-స(శ్ర.శ+ఉ.సా) పూర్తవగానే డ తిరిగి ఉ.పె గా
మారుతుంది. ఈ వలయం మళ్ళీ మొదలవుతుంది. అందువల్ల,
ఉ.పె...స'- డ' -స...స...ఉ.పె
విస్తృత రూపం:
ఉ.పె...స' (స+స.ఫె)-డ' (డ+డ.ఫె)- స (శ్ర.శ+ఉ.సా)...ఉ.పె
డబ్బు పెట్టుబడి ఉత్పాదక పెట్టుబడిలోకి
మారడం అంటే,
సరుకుల ఉత్పత్తి కోసం సరుకులు
కొనడమే. ఉత్పాదక
వినియోగం మాత్రమే పెట్టుబడి వలయంలో ఉంటుంది. ఆ విధంగా వినియోగమైన సరుకుల ద్వారానే
అదనపు విలువ ఉత్పత్తవుతుంది గనుక. ఇది
ఉత్పత్తి నుండి,
సరుకుల ఉత్పత్తి నుండి కూడా ఎంతో భిన్నమైనది. ఉత్పత్తికి, ఉత్పత్తిదారుల ఉనికి లక్ష్యంగా
గల సరుకుల ఉత్పత్తికి
కూడా ఎంతో భిన్నమైనది; ఒక
సరుకు అదనపు విలువ ఉత్పత్తి వల్ల,
సరుకు బదులు సరుకు రావడం అనేది కేవలం డబ్బుతో ఉత్పాదితాల మారకం నుండి భిన్నమైన విషయం.
అయితే ఆర్ధికవేత్తలు దీన్ని అమితోత్పత్తి అసాధ్యం అనేందుకు
రుజువుగా తీసుకుంటారు.
ఈ వలయంలో డ, శ్ర.శ గానూ, ఉ.సా గానూ మారుతుంది. అందులో మొదటి లింకు డ- శ్ర.శ. అది శ్రామికుడి వైపునించి శ్ర.శ-డ = స-డ. అతని వినియోగాన్ని ఇముడ్చుకున్న శ్ర.శ-డ-స చలామణీ డ-శ్ర.శ ఫలితంగా మొదటి భాగం మాత్రమే పెట్టుబడి వలయంలోకి వస్తుంది. రెండో చర్య డ-స వ్యష్టి పెట్టుబడి చలామణీలో చేరదు- అది దానిలోనించే వచ్చినప్పటికీ. శ్రామికవర్గం ఎల్లప్పుడూ ఉండడం పెట్టుబడిదారీ వర్గానికి అవసరం. అందువల్ల శ్రామికుని సొంత వినియోగం అవసరం. డ-స చర్య జరుగుతుంది.
పెట్టుబడి విలువ తన వలయాన్ని నడపడానికీ, అదనపు విలువని పెట్టుబడిదారుడు
వినియోగించు కోవడానికీ
స'- డ' పెట్టే షరతు ఒక్కటే: స' డబ్బులోకి మారి ఉండాలి, అంటే స'
అమ్ముడై ఉండాలి. స' అనే
వస్తువు ఒక ఉపయోగపు విలువ అంటే ఏదో ఒక
వినియోగానికి ఉపకరిస్తుంది. అది ఉత్పాదక వినియోగం కావచ్చు, వ్యక్తిగత వినియోగం కావచ్చు.
ఏదైనా ఒకటే. ఏదో
ఉపయోగపు విలువ కనుకనే కొనబడుతుంది. ఉదాహరణకి, నూలుని
కొన్న వర్తకుని చేతిలో స’చలామణీ
సాగినా, అది
ఆ నూలుని ఉత్పత్తిచేసి వర్తకునికి అమ్మిన వ్యష్టి పెట్టుబడి వలయపు కొనసాగింపు మీద
ఇసుమంతైనా ప్రభావం చూపదు. ప్రక్రియ అంతా కొనసాగుతుంది. దాంతోపాటే, దానివల్ల తప్పనిసరి అయిన పెట్టుబడి దారుడి
వినియోగమూ,కార్మికుని
వినియోగమూ కొనసాగుతాయి. సంక్షోభాలకు సంబంధించిన చర్చలో ఈ
పాయింట్ ముఖ్యమైనది.
కారణం: స' డబ్బుగా మారితే, అది
శ్రమప్రక్రియకు, ఆవిధంగా
పునరుత్పత్తి ప్రక్రియకు కావలసిన వాస్తవ
అంశాల్లోకి, మళ్ళీ
మారగలదు. స' ని
కొన్నది వాడుకునే తుది వినియోగదారుడా, లేక
ఇతరులకు మళ్ళీ అమ్మే వర్తకుడా అనేది పరిస్థితిని ఏమాత్రం ప్రభావితం చేయ్యదు. పెట్టుబడిదారీ
ఉత్పత్తిలో పెద్దమొత్తాల్లో తయారయ్యే సరుకుల పరిమాణం, ఉత్పత్తి స్థాయిని బట్టీ, ఈ ఉత్పత్తిని నిరంతరం పెంచాల్సిన
అవసరాన్ని బట్టీ,
ఉంటుంది. అంతేకాని సరఫరా గిరాకీ వలయాన్నిబట్టికాదు; తీర్చబడవలసిన అవసరాలను బట్టికాదు. భారీ
స్థాయి ఉత్పత్తిని నేరుగా కొనేవాడు, ఇతర
పారిశ్రామిక పెట్టుబడిదారుడు కాక, టోకు
వ్యాపారి మాత్రమే, వేరొకడు
ఉండడు. కొన్ని
పరిమితుల్లో, పునరుత్పత్తి
ప్రక్రియ అదేస్థాయిలోనో, అంతకు
మించిన స్థాయి లోనో జరగవచ్చు - బయటకొచ్చిన సరుకులు వ్యక్తిగత, ఉత్పాదక వినియోగాల్లోకి నిజంగా
చేరనప్పటికీ. సరుకుల వినియోగం, ఆసరుకుల్ని
ఉత్పత్తిచేసిన పెట్టుబడి వలయంలో చేరదు.
ఉదాహరణకి,
ఆ నూలు అమ్ముడయిన వెంటనే, నూలు
ప్రతినిధిగా ఉన్న పెట్టుబడి విలువ, కొత్త
వలయాన్ని మొదలెట్టవచ్చు- అమ్మిన నూలు ఏమవుతుందో పట్టించుకోకుండానే.
ఉత్పాదితం అమ్ముడవుతున్నంత
వరకూ, పెట్టుబడిదారుడికి
సంబంధించి ప్రతిదీ సజావుగా సాగుతున్నట్లే. అతడు మమేకమై ఉన్న పెట్టుబడి విలువ వలయానికి
అంతరాయం ఏర్పడలేదు . ఈ ప్రక్రియ విస్తరిస్తే - అందులో పెరిగిన ఉత్పత్తిసాధనాల
ఉత్పాదక వినియోగం ఇమిడి ఉంటుంది - పెట్టుబడి పునరుత్పత్తిని కార్మికుల వ్యక్తిగత
వినియోగం అనుసరించవచ్చు.
గిరాకీ- సరఫరా వినియోగమూ ఉత్పత్తీ
అందువల్ల గిరాకీ పెరగవచ్చు.ఎందుకంటే, ఈ ప్రక్రియ ఉత్పాదక వినియోగం వల్ల
మొదలవుతుంది, ప్రభావితమవుతుంది.
ఆ
విధంగా అదనపు విలువ
ఉత్పత్తీ, దానితో
పాటు పెట్టుబడిదారుడి వినియోగమూ హెచ్చవచ్చు. మొత్తం పునరుత్పత్తి ప్రక్రియ వృద్ధి
చెందవచ్చు. అయినాగాని, సరుకుల్లో పెద్ద భాగం వినియోగంలో
చేరినట్లు పైకి మాత్రమే కనిపిస్తుంది. కాని నిజానికి ఆ సరుకులు అమ్ముడుబోకుండా
వర్తకుడి దగ్గరే ఉండవచ్చు. మార్కెట్లోనే పడి ఉండవచ్చు. ఇప్పుడు సరుకుల ప్రవాహాలు, ఒకదాని వెన్నంటి మరొకటిగా, వస్తూనే ఉంటాయి.
చెల్లింపుకి ఉన్న గిరాకీ- మార్కెట్లో పోటీ
అయితే, ఇంతకు
ముందొచ్చినవి వినియోగమయినట్లు కనిపించేది పైకి మాత్రమే. సరుకు పెట్టుబడులు ఇప్పుడు ఒకదానితో మరొకటి మార్కెట్లో చోటు కోసం పోటీ పడతాయి. ఆలశ్యంగా వెనక
వచ్చిన పెట్టుబడిదారులు అమ్ముకోడానికి,
ధరలకంటే తక్కువకు అమ్ముతారు. మునుపటి సరుకుల ప్రవాహాలు డబ్బులోకి ఇంకా మారలేదు.
అయితే వాటికి
చెల్లించాల్సిన సమయం ఆసన్నమవుతున్నది. వాటి ఓనర్లు దివాలా ప్రకటించక తప్పదు.
లేదా చెల్లించడం కోసం
సరుకుల్ని వచ్చినకాడికి అమ్మి అప్పులు కట్టాలి. ఈ స్థితికీ, సరుకుల వాస్తవ గిరాకీ స్థితికీ అసలు సంబంధం
లేదు. ఇది కేవలం చెల్లింపుకి
ఉన్న గిరాకీకి సంబంధించిన విషయం. సరుకుల్ని డబ్బుగా మార్చాల్సిన అనివార్య అవసరం.
సంక్షోభం
ఇక్కడే సంక్షోభం తలెత్తుతుంది. ఇది మొదట
వ్యక్తిగత వినియోగదారుడి గిరాకీ నేరుగా తగ్గడంలో కనబడదు. పెట్టుబడుల మధ్య జరిగే మారకాల తగ్గుదలలో
కనబడుతుంది. పెట్టుబడి పునరుత్పత్తి ప్రక్రియ క్షీణతలో కనబడుతుంది.
తాత్కాలిక నిల్వరూపంలో డబ్బు పెట్టుబడి
డబ్బు పెట్టుబడిగా చర్య చెయ్యడానికి, తిరిగి ఉత్పాదక పెట్టుబడిలోకి మారాలి.
అందుకు డబ్బు ఉ.సా గానూ శ్ర.శ గానూ మారుతుంది. ఆ సరుకులు ఉత్పాదక పెట్టుబడిలోకి
పరివర్తన చెందాలి. అయితే వాటిని ఒకేసారి అవసరం ఉండకపోవచ్చు. వేర్వేరు కాలాల్లో
కొనవచ్చు. అలాంటప్పుడు డ-స చర్య, ఒకేమారు
కాకుండా పలుమార్లుగా జరగవచ్చు. అందువల్ల డ లో కొంత భాగం డ-స చర్య చేస్తుంది. కాగా, మిగిలిన డబ్బు, ఆప్రక్రియ పరిస్థితుల్ని బట్టి డ-స చర్య
మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ భాగం తాత్కాలికంగా మాత్రమే చలామణీలో ఉండదు.
ఎంతకాలం అంటే,
మళ్ళీ
ఆ చర్యతో అవసరం కలిగేదాకా. దీన్ని బిగబట్టడం, తిరిగి చలామణీలో పెట్టడం కొసమే.
తాత్కాలికంగా నిశ్చలంగా ఉన్నప్పటికీ, అది డబ్బు పెట్టుబడే. ఇలా నిలిపి ఉంచడం
అనేది దాని చలామణీ చేత నిర్ణయమైన చర్యే, దాని చలామణీ కొరకు ఉద్దేశించబడిన చర్యే.
అది ఉండడం, దాని చలనం ఆగడం, డబ్బు పెట్టుబడిగా
డబ్బు తన విధుల్లో ఒకదాన్ని నిర్వర్తించే స్థితి. డబ్బు పెట్టుబడిగా; ఈసందర్భంలో నిశ్చలంగా
ఉన్న డబ్బు, డబ్బు పెట్టుబడి డ లో
భాగమే (డ'─ మైనస్ డ.ఫె =
డ); అది ఉ.పె కి సమానమైన సరుకు పెట్టుబడి విలువ భాగం. వలయం
మొదలయ్యే ఉత్పాదక పెట్టుబడి విలువ భాగం. మరొక పక్క, చలామణీ నించి
పక్కనబెట్టిన డబ్బు నిల్వరూపంలో ఉంటుంది. అందువల్ల నిల్వరూపం, ఇక్కడ డబ్బు పెట్టుబడి విధి అవుతుంది. డ-స లో కొనుగోలు సాధనంగా, లేక చెల్లింపు
సాధనంగా డబ్బు చర్య,
డబ్బు పెట్టుబడి చర్య ఎలా అవుతుందో, ఇదీ అలాగే డబ్బు పెట్టుబడి చర్య అవుతుంది- ఎందుకంటే, ఇక్కడ పెట్టుబడి
విలువ ఉన్నది డబ్బు రూపంలో. కారణం: ఇక్కడ డబ్బు స్థితి, పారిశ్రామిక
పెట్టుబడి ఉండే ఒకానొక దశ. ఇది వలయంలోపల అంతస్సంబంధాల చేత నిర్దేశితమవుతుంది.
డబ్బు చర్యలూ - పెట్టుబడి చర్యలూ
అదే సమయంలో ఇక్కడ ఒక విషయం నిజమని
మరొకమారు రుజువవుతున్నది: పారిశ్రామిక పెట్టుబడిలో డబ్బు పెట్టుబడి డబ్బు చేసే
పనులు తప్ప మరే ఇతర పనులూ చెయ్యదు; ఈ
డబ్బు చర్యలు వలయంలోని ఇతర దశలతో ఉన్న పరస్పర సంబంధాలవల్ల మాత్రమే, పెట్టుబడి చర్యలుగా చలాయిస్తాయి, ప్రాముఖ్యత పొందుతాయి.
అమ్మడానికి అడ్డంకులు ఏర్పడితే
డ' డ
తో డ.పె సంబంధంగా, పెట్టుబడి సంబంధంగా ప్రత్యక్షంగా డబ్బు
పెట్టుబడి చర్య కాదు, సరుకు
పెట్టుబడి స' చర్య.
స' అనేది
స, స.పె
ల సంబంధంగా ఉత్పాదకప్రక్రియ ఫలితాన్ని, ఆ
ప్రక్రియలో జరిగిన
పెట్టుబడి విలువ యొక్క
స్వయం విస్తరణ ఫలితాన్ని
వ్యక్తపరుస్తుంది.
ఒకవేళ చలామణీ ప్రక్రియ కొనసాగడానికి
అడ్డంకులు ఏవైనా ఏర్పడి, మార్కెట్
పరిస్థితుల వంటి బయట కారణల వల్ల,
డ-స చర్యని డ అప్పటికి ఆపెయ్యాల్సి రావచ్చు. డబ్బు తన రూపంలోనే డబ్బుగా కొద్ది
కాలమో, ఎక్కువ
కాలమో ఉండాల్సి రావచ్చు. అప్పుడు డబ్బు నిల్వ రూపంలో ఉంటుంది. సరళ సరుకు చలామణీలో
కూడా ఇలా జరగుతుంటుంది. ఎప్పుడంటే: స-డ
నించి డ-స కి పరివర్తనకి బయట పరిస్థితులవల్ల అంతరాయం ఏర్పడినప్పుడు. ఇది
అనుకోకుండానే, అసంకల్పితంగా
నిల్వ ఏరడడం. ఇప్పటి సందర్భంలో, డబ్బు
గుప్త పెట్టుబడి రూపంలో ఉంది. అయితే
ప్రస్తుతం దీన్ని గురించి ఇంతకు మించి ఇక్కడ చర్చించం.
ఏది ఏమైనప్పటికీ రెండు సందర్భాల్లోనూ, పెట్టుబడి డబ్బు స్థితిని
అంటిపెట్టుకొని ఉండడం అనేది ఆగిన చలనపు ఫలితమే - అది ఆవశ్యకమైనా కాకున్నా, సంకల్పితమైనా లేకున్నా, దాని విధులకు అనుగుణమైనా, వ్యతిరేకమైనా సంబంధం ఉండదు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి