అధ్యాయం 2. ఉత్పాదక పెట్టుబడి వలయం
విభాగం 2. సంచయనమూ - విస్తృత స్థాయి పునరుత్పత్తీ
ఉత్పత్తి
ప్రక్రియ ఏ స్థాయిలో బడితే ఆ స్థాయిలో విస్తరించదు. ఆ విస్తరణ సాంకేతికత చేత
నిర్ణయమవుతుంది. కాబట్టి, సిద్ధించిన అదనపు విలువ పెట్టుబడిగా
ఉపయోగించడానికి ఉద్దేశించినదే అయినప్పటికీ, తరచూ అనేక వరుస వలయాల కారణంగా ఒక పరిమాణానికి చేరుతుంది. ఎంత
పరిమాణానికి అంటే, అది అదనపు పెట్టుబడిగా పనిచెయ్యడానికి సరిపోయేటంత.
అంత అయ్యేదాకా అది కూడాలి, సంచయనమై తీరాలి. ఆ విధంగా అదనపు విలువ, నిల్వగా పేరుకుంటుంది, ముద్ద అవుతుంది. ఈ రూపంలో డబ్బు చలనం లేని పెట్టుబడిగా, గుప్త పెట్టుబడిగా ఉంటుంది.
గుప్త పెట్టుబడి
గుప్త పెట్టుబడి అనడం ఎందుకంటే, డబ్బు రూపంలో ఉన్నంతవరకూ, అది పెట్టుబడిగా పనిచెయ్యజాలదు. ఆ విధంగా నిల్వ ఏర్పడడం ఇక్కడ సంచయన
ప్రక్రియలో ఒక అంశంగా ఇమిడి ఉన్నట్లు,
దాని వెంటనంటి
ఉన్నట్లు కనిపిస్తుంది.
అయినాగాని, ఈ అంశం సంచయన ప్రక్రియనించి భిన్నమైనది; ఎందుకంటే, పునరుత్పత్తి
ప్రక్రియ విస్తరించేది, గుప్త డబ్బు పెట్టుబడి ఏర్పడడం వల్ల కాదు. అందుకు భిన్నంగా పెట్టుబడిదారుడు తన ఉత్పత్తి స్థాయిని పెంచలేక పోయినందువల్ల, గుప్త పెట్టుబడి ఏర్పడుతుంది. అతను తన అదనపు ఉత్పాదితాన్ని కొత్త బంగారాన్నో,
వెండినో చలామణీలో
పెట్టే వ్యాపారికి అమ్మినట్లయితే,
లేక, కొంత దేశీయ అదనపు ఉత్పాదితాన్ని ఇచ్చి,
విదేశాలనించి అదనపు బంగారాన్నో వెండినో దిగుమతి చేసుకునే వర్తకుడికి అమ్మినట్లయితే, (రెండూ ఒకటే) అప్పుడు అతని గుప్త డబ్బు పెట్టుబడి దేశీయ
బంగారు, వెండి నిల్వలని పెంచుతుంది. మిగిలిన అన్ని సందర్భాలలోనూ, కొనేవాని చేతిలో చలామణీ సాధనంగా ఉండే డబ్బు, పెట్టుబడి దారుడి చేతిలో కేవలం నిల్వ రూపం మాత్రమే
పొందుతుంది. మన ఉదాహరణలో, కొన్నవాని చేతిలో చలామణీసాధనంగా ఉన్న రూ.1000 పెట్టుబడి దారుడి చేతిలో నిల్వరూపం పొందుతుంది. కాబట్టి
జరిగిందంతా: దేశీయ బంగారు, వెండి నిల్వల భిన్న పంపిణీ మాత్రమే.
చెల్లింపు సాధనంగా డబ్బు
పెట్టుబడి దారుడి లావాదేవీల్లో డబ్బు చెల్లింపు సాధనంగా పనిచెయ్యవచ్చు. అంటే కొన్న సరుక్కి అతను తర్వాత డబ్బు ఇవ్వవచ్చు. అలాంటప్పుడు, పెట్టుబడిగా మారల్సిన అదనపు ఉత్పాదితం డబ్బులోకి మారదు. అప్పిచ్చినవాడికి దానిమీద యాజమాన్యపు హక్కుగా మారుతుంది. అది వలయం యొక్క పునరుత్పత్తి ప్రక్రియలో ప్రవేశించదు.
సంచయనం
పెట్టుబడిదారీ ఉత్పత్తి యొక్క స్వభావం యావత్తూ, పెట్టిన పెట్టుబడి విలువ విస్తరణచేత నిర్ణయమవుతుంది. అంటే, సాధ్యమైనంత అదనపు విలువ ఉత్పత్తి చేతా, పెట్టుబడి ఉత్పత్తి చేతా. అందువల్ల, అదనపు విలువని పెట్టుబడిగా మార్చడం చేతా. సంచయనం, లేక విస్తృతస్థాయి ఉత్పత్తి ప్రతి వ్యష్ఠి పెట్టుబడిదారుడికీ అవసరమవుతుంది. అది నిరంతరం మరింత, మరీ మరింత అదనపువిలువ ఉత్పత్తికి సాధనంగా కనబడుతుంది. కాబట్టి పెట్టుబడిదారుడు సంపన్నుడవడానికి సాధనం. అదే అతని లక్ష్యం. అది పెట్టుబడిదారీ విధానపు సాధారణ ధోరణి. తర్వాత్తర్వాత, దాని అభివృద్ధివల్ల, ప్రతి వ్యష్ఠి పెట్టుబడిదారుడికీ అవసరమవుతుంది. అతని పెట్టుబడి నిరంతరం పెరుగుతూ ఉండడం దాని సంరక్షణకి షరతు. ఇదంతా ఒకసారి కాపిటల్ మొదటి సంపుటం 22 వ అధ్యాయంలో తేల్చిన విషయమే. కాబట్టి దీన్ని గురించి ఇంకా ఇక్కడ మళ్ళీ తరచాల్సిన అవసరంలేదు.
ఇంతదాకా, సరళ
పునరుత్పత్తి గురించి చర్చించాము. అదనపు విలువ అంతా ఆదాయంగా ఖర్చయినట్లు అనుకుని
దాన్ని పరిశీలించాం. అయితే వాస్తవం అలా ఉండదు. మామూలు పరిస్థితుల్లో, అదనపువిలువలో
కొంత ఆదాయంగా ఖర్చవుతుంది; కొంతేమో పెట్టుబడికి కలుస్తుంది. తరచుగా రెండు పద్ధతులూ నడుస్తుంటాయి. సూత్రాన్ని చిక్కుపరచకుండా ఉండడానికి, అదనపు విలువ
అంతా సంచయనమైనదనే అనుకుందాం.
ఉత్పాదక పెట్టుబడి ఫార్ములా
ఉ.పె...స'-డ'-స'(శ్ర.శ+ఉ.సా)...ఉ.పె'
అనే ఫార్ములా
విస్తృత స్థాయిలో పునరుత్పత్తయ్యే ఉత్పాదక పెట్టుబడిని సూచిస్తుంది. అది పెరిగిన
విలువతో ఉంటుంది. హెచ్చిన ఉత్పాదక పెట్టుబడిగా రెండవ వలయాన్ని మొదలు పెడుతుంది.
రెండో వలయం మొదలవగానే, ఉ.పె ఆరంభ బిందువు
అవుతుంది; మొదటి ఉ.పె
కంటే రెండో ఉ.పె ఎక్కువ, అంతే తేడా. అందువల్ల డ...డ'
ఫార్ములాలో, రెండో వలయం డ' తో మొదలవుతుంది.
అయితే డ' ఇప్పుడు డ లాగా చర్య చేస్తుంది. అంటే, మదుపు పెట్టిన నిర్దిష్ట పరిమాణంలో
ఉన్న డబ్బు పెట్టుబడిగా అన్నమాట. మొదటి చక్రీయ చలనం మొదలెట్టిన డబ్బు పెట్టుబడి
కంటే ఇది పెద్దది. అయితే అది మదుపు పెట్టిన డబ్బు పెట్టుబడి చర్యకు పూనుకోగానే, అది అదనపు
విలువను కలుపుకొని పెరిగి ఉన్నదనే ప్రస్తావనలకు ఇక అవకాశం ఉండదు. తన వలయాన్ని
మొదలుపెడుతున్న డబ్బు పెట్టుబడిగా,
దాని రూపంలో దాని మూలం పత్తాలేకుండా పోతుంది.
డ...డ' కీ, ఉ.పె...ఉ.పె' కీ తేడా
డ...డ' అదనపు విలువ ఉత్పత్తిని మాత్రమే తెలుపుతుంది. ఉ.పె...ఉ.పె' అదనపు విలువ సంచయనమైనదని తెలుపుతుంది.
తొలి వలయం అయిన డ...డ' ని, ఉ.పె...ఉ.పె' తో పొల్చి చూస్తే రెంటి భావమూ ఒకటి కానే కాదు అని తేలుతుంది. డ...డ' ని విడి వలయంగా చూస్తే, అది డబ్బు పెట్టుబడి అయిన డ, డబ్బుని పుట్టించే డబ్బు, విలువని పుట్టించే విలువ, మరోమాటల్లో అదనపు విలువని పుట్టించే విలువ అనే విషయాన్ని వ్యక్తపరుస్తుంది. కాని అందుకు భిన్నంగా ఉ.పె వలయంలో మొదటిదశ అయిన ఉత్పత్తి ప్రక్రియ ముగియడం వల్ల, అప్పటికే అదనపు విలువని ఉత్పత్తిచేసే ప్రక్రియ అయిపోయి ఉంటుంది. రెండో దశ (చలామణీ యొక్క మొదటిదశ) అయిన స'- డ' ని గడిచాక స'- డ', పెట్టుబడి విలువా, అదనపువిలువా కలిసి చేతిలోపడ్డ డబ్బు పెట్టుబడిగా, మొదటి వలయంలో చివర స్థానంలో కనపడ్డ డ' గా, ఉన్నాయి. మొదట పరిశీలించిన ఉ.పె...ఉ.పె (విస్తరించిన ఫార్ములా చూడండి) ఫార్ములాలో అదనపు విలువ ఉత్పత్తయినట్లు తెలుస్తుంది.
స.ఫె -డ.ఫె -స.ఫె తన రెండోదశలో పెట్టుబడి చలామణీ నించి బయటపడుతుంది. అదనపువిలువ ఆదాయంగా వ్యయం అవడాన్ని సూచిస్తుంది. చలనం అంతా ఉ.పె...ఉ.పె చేత సూచితమవుతుంది. ఈ రూపంలో, ఆ చివరా ఈ చివరా ఉన్న విలువలకు తేడా ఉండదు. అందువల్ల, పెట్టిన విలువ విస్తరణ, అదనపు విలువ ఉత్పత్తి డ...డ' లో లాగే అదేవిధంగా సూచించబడుతుంది. తేడా అల్లా డ-డ' లో చివరిదశగానూ, వలయంలో రెండో దశగానూ కనబడే స'-డ' చర్య, ఉ.పె...ఉ.పె లో చలామణీ తొలిదశగా ఉంటుంది.
ఉత్పత్తి ప్రక్రియే పారిశ్రామిక పెట్టుబడి చర్యగా కనబడుతుంది కాని ఉత్పత్తయిన అదనపువిలువ పెట్టుబడిలో కలిసిందనీ, అందువల్ల పెట్టుబడి సంచయనం జరిగిందనీ, ఆకారణంగా, ఉ.పె' ఉ.పె కి భిన్నంగా పెట్టుబడి చలనం వల్ల, ఉ.పె' పెట్టిన పెట్టుబడి విలువనీ, సంచితమయిన పెట్టుబడి విలువనీ ఇముడ్చుకొని ఉన్నదని సూచిస్తుంది.
డ...డ' చివరదయిన డ' గానీ, అన్ని వలయాల్లో కనపడే స' గానీ వాటికవిగా
చూస్తే చలనాన్ని సూచించవు. ఆ చలనపు ఫలితాన్ని సూచిస్తాయి. ఆ ఫలితం: సరుకు రూపంలోనో,
డబ్బురూపంలోనో సిద్ధించిన పెట్టుబడివిలువ
విస్తరణ; అందువల్ల పెట్టుబడి విలువ డ+డ.ఫె గానో, లేక స+స.ఫె గానో, అంటే పెట్టుబడి విలువకి, దాని బిడ్డ అదనపు విలువతో సంబంధంగా
కనబడుతుంది. అవి ఈ ఫలితాన్ని స్వయంవిస్తరణ చెందిన పెట్టుబడి విలువ యొక్క వివిధ
చలామణీ రూపాలుగా వ్యక్తం చేస్తాయి. అయితే, స' రూపంలో గానీ, డ' రూపంలోగానీ, దానికదిగా
జరిగిన స్వయం విస్తరణ, డబ్బుపెట్టుబడి చర్యా కాదు, సరుకు పెట్టుబడి చర్యాకాదు. పారిశ్రామిక
పెట్టుబడి చర్యలకు అనుగుణమైన ప్రత్యేక రూపంగా, డబ్బు పెట్టుబడి డబ్బు చర్యలు మాత్రమే
చేయ్యగలదు; సరుకు పెట్టుబడి సరుకు చర్యలు మాత్రమే చేయ్యగలదు; వాటి రెంటికీ
ఉన్న తేడా డబ్బుకీ సరుక్కీ మధ్య ఉన్న తేడాయే. అదే విధంగా తన ఉత్పాదక పెట్టుబడి రూపంలో ఉండే పారిశ్రామిక పెట్టుబడిలో
ఇతర శ్రమ ప్రక్రియల్లో ఉండే ఉత్పాదితాన్ని తయారుచేసే మూలకాలు మాత్రమే ఉండగలవు:
ఒక పక్క, శ్రమకి అవసరైన ఉత్పత్తి సాధనాల యొక్క భౌతిక పరిస్థితులు, మరొకపక్క, ఉత్పాదకంగా క్రియాశీలకంగా పనిచేసే శ్రమశక్తి. ఉత్పాదక రంగంలోపల పారిశ్రామిక పెట్టుబడి,సాధారణ ఉత్పత్తి
ప్రక్రియకి, అందువల్ల
పెట్టుబడి దారీ ఉత్పత్తికి భిన్నమైన ఉత్పత్తి ప్రక్రియకు కూడా ,అనుగుణమైన అంతర్నిర్మాణంలో మాత్రమే ఉండగలదు.
అలాగే, చలామణీ రంగంలో దీనికి సరిపడే రెండురూపాల్లో మాత్రమే ఉండగలుగుతుంది. ఆ రూపాలు: 1. డబ్బు 2. సరుకు.
ఉత్పత్తి ప్రక్రియే పారిశ్రామిక
పెట్టుబడి చర్యగా కనబడుతుంది
అయితే, ఉత్పత్తి మూలకాలు
అన్నీ కలిసిన మొత్తం తన్ను తాను ఉత్పాదక పెట్టుబడిగా మొదట్లోనే ప్రకటించుకుంది. పెట్టుబడి
దారుడు కొన్న శ్రమశక్తి ఇతరులది. ఇతర సరుకుల ఓనర్లనించి ఉత్పత్తి సాధనాల్ని
కొన్నట్లే శ్రమశక్తినీ కొంటాడు. అందువల్ల, అసలు ఉత్పత్తి ప్రక్రియే పారిశ్రామిక
పెట్టుబడి చర్యగా కనబడుతుంది. కాబట్టి, డబ్బూ, సరుకులూ అదే పారిశ్రామిక ప్రక్రియ
యొక్క చలామణీ రూపాలుగా కనబడతాయి. అందువల్ల వాటి చర్యలు చలామణీ చర్యలుగా
కనబడతాయి. ఈ చలామణీ చర్యలు ఉత్పాదక పెట్టుబడి చర్యలకి దారితీస్తాయి, లేక వాటినించి ఉత్పన్నమవుతాయి. ఇక్కడ అదేసమయంలో డబ్బు చర్యా, సరుకు చర్యా రెండూ,
సరుకు పెట్టుబడి చర్యలే. అయితే, అందుకు కారణం, పారిశ్రామిక పెట్టుబడి తన వలయంలోని
భిన్నదశల్లో చేసే చర్యల రూపాలు, ఒకదానితో మరొకటి ముడిబడి ఉండడమే.
రెండు తప్పులు
కాబట్టి, డబ్బుకి డబ్బుగానూ,
సరుకులకి సరుకులుగానూ ఉన్న ప్రత్యేక లక్షణాలూ, చర్యలూ పెట్టుబడిగా వాటి స్వభావం నించి రాబట్టే
ప్రయత్నం చెయ్యడం తప్పు. అందుకు భిన్నంగా ఉత్పాదక పెట్టుబడి లక్షణాల్ని అది
ఉత్పత్తి సాధనాలుగా ఉండడం వల్ల అనడం కూడా అంతే తప్పు.
డ' తన వలయాన్ని మొదలుబెడితే, అది డ చేసిన చర్యనే చేస్తుంది
డ' డ+డ.ఫె గానూ, స' స+స. ఫె గానూ, అంటే, పెట్టుబడి విలువకూ, దాని బిడ్డ అయిన అదనపువిలువకూ సంబంధంగా,
స్థిరపడ్డాక, ఆ సంబంధం రెంటిలోనూ వ్యక్తమవుతుంది - మొదటి
సందర్భంలో డబ్బు రూపంలో, రెండో సందర్భంలో సరుకు రూపంలో. అయితే
ఇందువల్ల అసలు విషయాలు ఏమాత్రం మారవు. ఫలితం ఏమంటే: ఈసంబంధానికి మూలం డబ్బుగా
డబ్బుకున్న లక్షణాల్లో గానీ, డబ్బు చేసే చర్యల్లో గానీ లేదు. అలాగే సరుకులుగా సరుకులకున్న లక్షణాల్లో గానీ, అవిచేసే చర్యల్లోగానీ లేదు. రెండు సందర్భాల్లోనూ, పెట్టుబడి విశిష్ట లక్షణం: విలువని ఉత్పత్తి చేసే విలువగా ఉండడం
అనేది ఫలితంగా వ్యక్తం కావడమే. స' ఎప్పుడూ ఉ.పె చర్య వల్ల వచ్చేదే. డ' ఎప్పుడూ
పారిశ్రామిక పెట్టుబడి వలయంలో స'
కి మరొకరూపమే. అందువల్ల, సిద్ధించిన
డబ్బుగా అది డబ్బు పెట్టుబడి చర్యకు పూనుకోగానే, డ'=డ+డ.ఫె లో ఇమిడి ఉన్నపెట్టుబడి
సంబంధాన్ని వ్యక్తం చెయ్యదు. డ...డ'
అయిపోయి, డ' కొత్తగా వలయాన్ని మొదలెడితే, అది డ' గా ఉండదు, డ గా ఉంటుంది. డ' లో ఇమిడి ఉన్న అదనపు విలువ నంతటినీ పెట్టుబడిగా మార్చినా సరే, అది డ గానే
ఉంటుంది. మన ఉదాహరణలో, మొదటి వలయం మొదలయింది రూ.11000 డబ్బు పెట్టుబడితో. అయితే, రెండో వలయం
మొదలయ్యేది రూ.11000 కాదు, రూ.12, 000 తో. ఎందుకంటే, ఇప్పుడు దానికి రూ.1000
అదనపు విలువ
కలిసి 12,000 అయింది. ఇది మునుపటికంటే రూ1000 పెద్దది. ఈ తేడా ఒక వలయాన్ని వేరొక వలయంతో పోల్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అయితే ఒకే వలయంలోపల ఇలా పోల్చడం
ఉండదు. ఇప్పుడు పెట్టిన డబ్బు పెట్టుబడి
రూ.12,000 లో మునుపు అదనపు విలువగా ఉన్న రూ.1000 కూడా ఉంది. మరొక పెట్టుబడి
దారుడెవరైనా మొదటి వలయంలో రూ.12,000 పెడితే ఆడబ్బు పోషించే పాత్రనే ఈ రూ.12, 000 కూడా
నిర్వర్తిస్తుంది. అంటే, డ గానే పనిచేస్తుంది. ఉత్పాదక పెట్టుబడి వలయంలో కూడా ఇదే జరుగుతుంది.
ఉ.పె గానే పనిచేస్తుంది.
పెరిగిన ఉ.పె’ ఇప్పుడు ఉ.పె ఎలా పనిచేసిందో, అలాగే పనిచేస్తుంది.
డ’-స (శ్ర..శ+ఉ.సా) సూత్రం మారదు
అయితే డ’-స (శ్ర..శ+ఉ.సా) సూత్రం మాత్రం అలానే ఉంటుంది. డ’-స (శ్ర..శ’+ఉ.సా’) అవదు. ఎందుకంటే, ఒక్కోసారి పెట్టుబడి అంతర్నిర్మాణం పెరిగి, శ్రమశక్తి తగ్గుతుంది. డ’-స’ (శ్ర..శ+ఉ.సా) దశలో పెరిగిన పరిమాణం స’ చేత సూచితమవుతుంది. శ్ర.శ‘ చేతనో ఉ .సా’ చేతనో కాదు. ఎందుకంటే, స శ్ర.శ’+ఉ.సా’ ల మొత్తం కనుక, మొదటి ఉ. పె లో ఉన్నదాని కంటే స’లో ఎక్కువ ఉన్నదని తెలుపుతుంది. రెండోది: శ్ర..శ’, ఉ.సా’ అనే మాటలే తప్పు. ఎందుకంటే, పెట్టుబడి పెరిగేటప్పుడు పెట్టుబడి అంతర్నిర్మాణంలో మార్పు వస్తుందనీ, ఈమార్పుజరిగేకొద్దీ, ఉ.సా విలువపెరుగుతూ శ్ర..శ విలువ సాపేక్షంగానూ, తరచూ నిరపేక్షంగానూ తగ్గుతూఉంటుందనీ మనకుతెలిసిన విషయమే.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి