23, అక్టోబర్ 2018, మంగళవారం

విస్తృతస్థాయి పునరుత్పత్తి


అధ్యాయం 24: అదనపువిలువ పెట్టుబడిలోకి మారడం.
విస్తృతస్థాయి పునరుత్పత్తి.
సరుకుల ఉత్పత్తికి లక్షణాలైన ఆస్థి నియమాలు పెట్టుబడిదారీ స్వాయత్త నియమాలుగా మారడం.
******    
పెట్టుబడి సంచయనం అంటే
పెట్టుబడి నుండి అదనపువిలువ ఎలా వస్తుందో ఇప్పటిదాకా పరిశీలించాం. ఇప్పుడిక అదనపు విలువనుంచి పెట్టుబడి ఎలా తలెత్తుతుందో చూడాల్సి ఉంది. అదనపు విలువని పెట్టుబడిగా నియోగించి, దాన్ని పెట్టుబడిలోకి తిరిగి మార్చడాన్నే పెట్టుబడి సంచయనం అంటారు. మాల్థూస్ ఇచ్చిన నిర్వచనాన్ని కోట్ చేస్తాడు: పెట్టుబడి సంచయనం అంటే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడిగా నియోగించడమే, ఆదాయాన్ని పెట్టుబడిలోకి మార్చడమే.
లావాదేవీని ముందుగా ఒక విడి పెట్టుబడిదారుడి వైపునుంచి చూద్దాం. ఒక నూలు ఉత్పత్తి చేసే పెట్టుబడిదారుడు 10,000 పౌన్లూ పెట్టుబడి పెట్టాడనీ, అందులో అయిదింట నాలుగోవంతు, 8,000 పౌన్లు యంత్రాలూ, దూదీ వగయిరాలకూ, ఒక వంతు, 2,000 పౌన్లు వేతనాలకూ వెచ్చించడని అనుకుందాం. ఏటా 240,000 పౌన్ల నూలుని ఉత్పత్తి చేస్తాడు.దాని విలువ 2,000 పౌన్లు. అదనపు విలువ రేటు 100 శాతం అయితే, అదనపువిలువ 40,000 పౌన్ల నూలులో ఉంటుంది. దాన్ని అమ్మితే వచ్చే 2,000 పౌన్లలో సిద్ధిస్తుంది. 2,000 పౌన్లు 2,000 పౌన్లే. మొత్తంలో అదనపు విలువ జాడ ఏమాత్రం చూడలేం, వాసన పట్టలేం. ఒక నిశ్చిత విలువ అదనపు విలువ అని తెలిసినప్పుడు, అది దాని ఓనర్ కీ ఎలా వచ్చిందో మనకు తెలుసు; అయితే అంతమాత్రాన, అది విలువ స్వభావాన్ని గానీ, డబ్బు స్వభావాన్నిగానీ మార్చదు.
2,000 పౌన్ల అదనపు విలువని పెట్టుబడిలోకి మార్చడానికి, ఇంతకు ముందు లాగే దాన్ని 5 భాగాలు చేసి నాలుగు భాగాల్ని, అంటే 1,600 పౌన్లని దూదీ, యంత్రాలూ వగయిరాలకూ, ఒక భాగాన్ని అంటే  400 పౌన్లని వడికే కార్మికుల్ని కొత్తగా కొనడానికీ అడ్వాన్స్ చెయ్యాలి.అదనపు విలువ రేటు 100 శాతం గనక  400 పౌన్ల కొత్త పెట్టుబడి 400 పౌన్ల అదనపు విలువని ఇస్తుంది. 
మొదట అడ్వాన్స్ చేసిన పెట్టుబడి విలువ డబ్బు రూపంలో ఉంటుంది. ఇందుకు భిన్నంగా అదనపువిలువ ఆరంభం నుండీ మొత్తం ఉత్పాదితంలో ఒక నిశ్చిత భాగం యొక్క విలువ. మొత్తం ఉత్పాదితం అమ్ముడయి, డబ్బులోకి మారితే, పెట్టుబడి విలువ మొదటిరూపాన్ని తిరిగి పొందుతుంది. ఆక్షణం నుండీ పెట్టుబడి విలువా, అదనపువిలువా రెండూ కూడా డబ్బు మొత్తాలే. అవి మళ్ళీ పెట్టుబడిలోకి మారడం అచ్చం అదేవిధంగా జరుగుతుంది.  దాన్నీ దీన్నీ రెంటినీ పెట్టుబడిదారుడు సరుకులు కొనడానికి వెచ్చిస్తాడు. కొనుగొలు వల్ల అతను తిరిగి సరుకులు తయారు చేసే స్థితికొస్తాడు. ఈసారి ఉత్పత్తి ఎక్కువ స్థాయిలో చెయ్యగలుగుతాడు.అయితే సరుకులు కొనాలంటే, అవి మార్కెట్లో రెడీగా ఉండాలి. 
మార్కెట్ లావాదేవీలు 
తన నూలుని మార్కెట్ కి తెస్తాడు . అలాగే ఇతరులు ఎవరి వార్షిక ఉత్పత్తుల్ని వాళ్ళు తెస్తారు.  కనకనే అతని నూలు చలామణీ అవుతుంది, ఇతర సరుకులతో మారుతుంది.  అయితే  మార్కెట్ కి వచ్చే ముందు సరుకులు సాధారణ వార్షిక ఉత్పాదితంలో భాగం. అంటే, అన్నిరకాల సరుకుల రాశిలో ఒక భాగం. ఆరాశి -  ఆసంవత్సర కాలంలో సరుకుల్లోకి మార్చబడిన విడివిడి పెట్టుబడుల మొత్తం- అంటే, సమాజ పెట్టుబడి అంతా. ఆమొత్తం సరుకుల్లో  ప్రతిపెట్టుబడిదారుడి చేతిలోనూ కొంత భాగం ఉంటుంది.
మార్కెట్ లావాదేవీలు  ఆసరుకుల మారకాన్ని ప్రభావితం చేస్తాయి. అక్కడ సరుకులు ఒకదానితో మరొకటి మారకం అవుతాయి, చేతులు మారతాయి. అంత మాత్రమే. లావాదేవీలు ఉత్పాదితం విలువని పెంచ లేవు, ఉత్పత్తయిన సరుకుల స్వభావాన్ని మార్చనూలేవు.   అందువల్ల, మొత్తం వార్షిక ఉత్పాదితాన్ని వినియోగించడం అనేది వార్షిక ఉత్పాదితం కూర్పు (composition)ని బట్టి ఉంటుంది,కాని ఏవిధంగానూ  దాని చలామణీని బట్టి కాదు.
అదనపు విలువమొత్తాన్ని సొంతానికి వాడుకుంటే
సంవత్సరంలో ఖర్చయిన పెట్టుబడి అంశాలు ముందు భర్తీ చెయ్యాలి. వీటిని తీసేస్తే అదనపు ఉత్పాదితం మిగులుతుంది. అందులో అదనపు విలువ ఉంటుంది. అదనపు ఉత్పాదితంలో ఉండే వస్తువులు ఏవి?  పెట్టుబడిదారీ వర్గపు అవసరాల్నీ, కోర్కెల్నీ తెర్చే వస్తువులు మాత్రమే ఉంటాయా? అలా అయితే అదనపు విలువ పాత్రలో చివరకి ఏమీ మిగలదు. మడ్దితో సహా హరించబడుతుంది. అప్పుడిక సామాన్య పునరుత్పత్తి మాత్రమే జరుగుతుంది.

కొంత అదనపు విలువని పెట్టుబడిలోకి మారిస్తే

సంచయనం చేయ్యాలంటే అదనపు విలువలో కొంత భాగాన్ని పెట్టుబడిలోకి మార్చాలి. శ్రమ ప్రక్రియకు కావలసిన ఉత్పత్తి సాధనాల్నీ, జీవితావసర సాధనాల్నీ మాత్రమే పెట్టుబడిలోకి మార్చగలం. మరే ఇతర వస్తువుల్నీ పెట్టుబడిలోకి మార్చలేము - ఏదైనా ఇంద్రజాలంతో తప్ప.ఆకారణంగా అదనంగా ఉత్పత్తి చెయ్యడానికి వార్షిక అదనపు శ్రమలో కొంత భాగాన్ని అదనపు ఉత్పత్తి సాధనాలకూ, జీవితావసర వస్తువులకూ వెచ్చించాల్సి వస్తుంది - అడ్వాన్స్ చేసిన పెట్టుబడి స్థానంలో, దాన్ని మించి వెచ్చించాల్సి ఉంటుంది. ఒక్క ముక్కలో, అదనపు విలువ పెట్టుబడిలోకి మార్చబడుతుంది; ఎందుకంటే, అదనపు ఉత్పాదితం కొత్త పెట్టుబడి యొక్క భౌతికాంశాల్ని కలిగి ఉంటుంది. అందువల్ల దాని విలువ అయిన అదనపు విలువ పెట్టుబడిలోకి మార్చబడుతుంది.
సంచయనం చేయ్యాలంటే కొత్త శ్రమ అవసరం
అంశాలు పెట్టుబడిగా వ్యవహరించాలంటే, పెట్టుబడిదారీ వర్గానికి కొత్త శ్రమ అవసరం. ఇప్పటికే ఉన్న కార్మికుల మీద చేస్తున్న దోపిడీ తీవ్రతగానీ, విస్తృతిగానీ  పెరగకపోతే, అప్పుడు కొత్తశ్రమశక్తిని వెదుక్కోవాలి. ఇందుకు పెట్తుబడిదారీ ఉత్పత్తి యంత్రాంగం ముందుగానే మార్గం ఏర్పరిచి ఉంచింది - కార్మికవర్గాన్ని వేతనాలమీద ఆధారపడేదిగా మార్చడం ద్వారా. మామూలు వేతనాలు ఆవర్గం పోషణకే కాక, దాని వ్యాప్తికి కూడా సరిపోతాయి.అన్ని వయస్సుల శ్రామికుల్ని కార్మికవర్గం ఏటేటా సరఫరా  చేస్తుంటుంది. ఇక పెట్టుబడి పని ఏమంటే: కొత్త శ్రమశక్తిని కొత్త ఉత్పత్తిసాధనాలతో  అనుసంధానం చెయ్యడమే. చేస్తే, అదనపువిలువ పెట్టుబడిలోకి మారడం పూర్తయినట్లే. నిర్దిష్ట దృక్పధంతో చూస్తే, సంచయనం అనేది క్రమంగా అంతకంతకూ పెరిగే స్థాయిలో జరిగే  పెట్టుబడి పునరుత్పత్తి. వలయాకారంలో సాగే సామాన్య పునరుత్పత్తి దాని రూపం మార్చుకుంటుంది. సీస్మాండీ మాటాల్లో, సర్పిలాకారంలోకి మారుతుంది.
ఒకసారి మన ఉదాహరణ దగ్గరికి పోదాం. 10,000 పౌన్ల తొలిపెట్టుబడి 2,000  పౌన్ల అదనపు విలువని తెచ్చింది. అదనపువిలువ పెట్టుబడిలోకి మార్చబడింది.  2,000 కొత్త పెట్టుబడి 400 పౌన్ల అదనపు విలువనిచ్చింది. 400 పౌన్ల అదనపువిలువకూడా పెట్టుబడిలోకి-రెండో కొత్త పెట్టుబడికి- మార్చబడింది. ఇది దాని వంతుగా 80 పౌన్ల అదనపువిలువని ఉత్పత్తి చేస్తుంది. ఆవిధంగా సాగిపోతూనే ఉంటుంది.
ఆస్థికి మూలం
నిజ ప్రపంచంలో పెట్టుబడిదారులు వచ్చిన అదనపువిలువని అంతా పెట్టుబడిలోకి మార్చజాలరు. అందులోనే తమ పోషణకి ఖర్చు పెట్టుకోవాలి. అందుకే పెట్టుబడి దారుడు అదనపువిలువలో సొంతానికి వాడుకునే భాగాన్ని పరిగగణించకుండా పక్కన పెడదాం.
అలాగే, ప్రస్తుతానికి కొత్తపెట్టుబడి మొదటి పెట్టుబడితో కలుస్తుందో లేక దాన్నుండి విడిగా స్వతంత్రంగా వ్యవహరిస్తుందో పట్టించుకోము; దాన్ని అదే పెట్టుబడి దారుడు నియోగిస్తాడో, మరొకరికి ఇస్తాడో పట్టించుకోము. ఈకొత్త పెట్టుబడి పక్కనే మొదటి పెట్టుబడి ఉత్పత్తి కొనసాగిస్తుందనీ, అదనపువిలువని ఉత్పత్తి చేస్తూనే ఉంటుందనీ, ఇది సంచనమయిన పెట్టుబడి విషయంలోనూ, అది సృజించిన కొత్త పెట్టుబడి విషయంలోనూ  వాస్తవమనీ మరచిపోకూడదు. 
మొదటి అడ్వాన్స్ చేసిన పెట్టుబడి  10,000 పౌన్లు యజమానికి ఎలా వచ్చాయి?
వాళ్ళ శ్రమ వల్ల, వాళ్ళ పూర్వీకుల శ్రమవల్ల - అని రాజకీయ ఆర్ధికవేత్తలు ఏకగ్రీవంగా జవాబిస్తారు. అయితే 2,000  పౌన్ల కొత్త పెట్టుబడి విషయం వేరు. అదెలా ఏర్పడిందో మనకు స్పష్టంగా తెలుసు. చెల్లింపులేని శ్రమ వల్ల ఏర్పడింది. దానివిలువలో చెల్లింపులేని శ్రమ కానిది అణుమాత్రమైనా లేదు.
కొత్త శ్రమశక్తిని ఇముడ్చుకున్న ఉత్పత్తి సాధనాలూ, శ్రామికులు పోషణకు కావలసిన జీవితావసరాలూ అదనపు ఉత్పాదితంలో భాగాలే. కార్మికవర్గం నుండి ఏటా బలవంతంగా రాబట్టే కప్పంలో భాగాలే. పెట్టుబడిదారులు కప్పంలో కొంతభాగంతో కొత్త శ్రమశక్తిని దాని విలువకే కొంటాడు.సమానకానికి సమానకమే మారకం అయింది. అయినాగాని, లావాదేవీ తతంగం అంతా పూర్వం ప్రతి విజేతా పరాజితులనుండి కొల్లగొట్టిన డబ్బుతోనే వాళ్లనుండి వర్తకపు సరుకులుకొనే వ్యవహారం వంటిదే.
పెట్టుబడి నుండి పెట్టుబడిని సృజించడం
పెట్టుబడిదారీ వర్గానికీ, కార్మికవర్గానికీ మధ్య లావాదేవీగా చూస్తే, అదనపు శ్రామికులు గత శ్రామికులకు చెల్లించని శ్రమచేత నియోగించబడ్డారు అనే విషయం వల్ల కలిగే తేడా ఏమీ ఉండదు. పెట్టుబడిదారుడు అదనపు పెట్టుబడిని ఉత్పత్తిచేసిన వాళ్ళని తొలిగించే యంత్రం లోకి అయినా మార్చవచ్చు. అది వాళ్ళ స్థానంలో కొద్దిమంది పిల్లల్ని నియమించవచ్చు.ప్రతి సందర్భంలోనూ శ్రామికవర్గం ఒక ఏడాది అదనపుశ్రమ చేత ఏర్పడిన పెట్టుబడి, పై ఏడాది కొత్త శ్రామికుల్ని నియమించే పెట్టుబడిని సృజిస్తుంది. పెట్టుబడి నుండి పెట్టుబడిని సృజించడం అంటే ఇదే.
తనశ్రమ లేని ఉత్పాదితాన్ని ఎలా సొంతం చేసుకుంటాడు?
సొంత పెట్టుబడి
మన ఉదాహరణలో మొదటి అదనపు పెట్టుబడి 2,000 పౌన్లు. దీన్ని సంచయనం చెయ్యాలంటే, ముందుగా అతనిదగ్గర 10,000 పౌన్ల  సొంత పెట్టుబడి ఉండి ఉండాలి. అది అతని శ్రమ వల్ల ఏర్పడినదై ఉండాలి. అతనిదై, అతను అడ్వాన్స్ చేసేదై ఉండాలి.అయితే, ఇందుకు భిన్నంగా, 400 పౌన్ల రెండో అదనపు పెట్టుబడికి 2,000 పౌన్ల సంచయనమయిన పెట్టుబడి ఉండి ఉంటే చాలు.అందులో 400 పౌన్లు పెట్టుబడి లోకి మార్చబడిన అదనపు విలువ. అప్పటినుండి, చెల్లించబడని సజీవశ్రమని అంతకంతకూ ఎక్కువ స్థాయిలో స్వాయత్తం చేసుకో గలుగుతాడు. అందుకు కారణం: చెల్లింపులేని గత శ్రమ మీద పెట్టుబడిదారుడికి యాజమాన్యం ఉండడమే. పెట్టుబడిదారుడు ఎంత ఎక్కువ సంచయనం చేస్తే, అంతకంటే ఎక్కువ సంచయనం చెయ్యగలుగుతాడు.
మొదటి అదనపు పెట్టుబడి
మొదటి అదనపు పెట్టుబడి అదనపు విలువలో భాగం. అదనపు విలువ తొలి పెట్టుబడితో లో ఒక భాగంతో కొన్న శ్రమశక్తి ఫలితం. శ్రమశక్తి కొనుగోలు సరుకుల మారక నియమాకు అనుగుణమైనదే. అది చట్టరీత్యా, కార్మికుని వైపునించి తన శక్తి సామర్ధ్యాని స్వేచ్చగా వదులుకోవడమే; పెట్టుబడిదారుడి వైపునించి తన సొంతమైన విలువని స్వేచ్చగా వదులుకోవడమే.
రెండో  అదనపు పెట్టుబడి
రెండో  అదనపు పెట్టుబడికి సంబంధించి, అది మొదటి అదనపు పెట్టుబడి యొక్క ఫలితం మాత్రమే.అందువల్ల అది పై పరిస్థితుల పర్యవసానమే; ప్రతి విడి లావాదేవీ సరుకుల మారక నియామాలకు అనుగుణంగా ఉంటుంది.  అంటే శ్రమశక్తిని కొనే పెట్టుబడిదారుడు పూర్తివిలువ చెల్లిస్తాడనీ, అమ్ము కునే కార్మికుడు పూర్తి విలువ పొందుతాడనీ అనుకుంటాం. ఇదంతా నిజమైన మేరకు, సరుకుల ఉత్పత్తీ, చలామణీ లమీద ఆధారపడ్డ  స్వాయత్తనియమాలు లేక వ్యక్తిగత ఆస్థి నియమాలు, వాటి స్వీయ అంతర్గతమైన, అనివార్యమైన గతితర్కం ద్వారా వాటికి వ్యతిరేకమైనవిగా మారిపోతాయి-అన్నది స్పష్టమే
ఇక్కడ ఒక గతితర్కం ఉంది. ఎందుకంటే,ప్రతిదీ సరుకుల మారక నియమాల్ని పాటిస్తుంది.అయినాగాని సరుకుని పాలించే నియమాలకు వ్యతిరేకమైన ఫలితం వస్తుంది
ఆస్థి నియమాలు తిరగబడడం
సమానకాల మారకం తో మొదలు పెట్టాం. ఇప్పుడది తిరగబడింది - కేవలం అది అగపడే మారకం మాత్రమే ఉన్నది అనేటంతగా తిరగబడింది. ఎందువల్లంటే,
1. శ్రమ శక్తితో మారకమైన పెట్టుబడి, సమానకం చెల్లించకుండా సొంతం చేసుకున్న  ఇతరుల శ్రమ ఉత్పాదితంలో మాత్రమే ఒక భాగం కావడం
2.ఈపెట్టుబడి దాని ఉత్పత్తిదారుడైన కార్మికుని చేత భర్తీ చెయ్యబడాలి; అంతేకాదు, దానితో పాటు అదనపు విలువ కూడా కలిపి భర్తీ చెయ్యబడాలి.
పెట్టుబడిదారుడికీ, కార్మికుడికీ మధ్య మారకసంబంధం, చలామణీ ప్రక్రియకు మాత్రమే చెందిన బాహ్యరూపం(semblance)/ తెచ్చిపెట్టుకున్న రూపం అవుతుంది. ఆ లావాదేవీ సారానికి పరాయిదైన రూపం అవుతుంది. అసలు సారాన్ని మరుగు పరుస్తుంది. శ్రమ శక్తి యొక్క నిరంతర అమ్మకమూ, కొనుగోలూ అనేది ఇప్పుడు కేవలం  రూపం మాత్రమే;  నిజంగా జరిగేది ఏమంటే:  పెట్టుబడిదారుడు గతంలో పాదార్ధీకృతమైన, చెల్లింపులేని , ఇతరుల శ్రమని మళ్ళీమళ్ళీ స్వాయత్తం చేసుకుంటుంటాడు, దాన్ని మరింత ఎక్కువ సజీవ శ్రమకు మారకం చేస్తుంటాడు.
శ్రమ నుండి ఆస్థిని వేరు చెయ్యడం
ఆస్థి హక్కులు మొదట మనిషి సొంత శ్రమ మీద ఆధారపడి ఉన్నట్లు అనిపించింది. కనీసం అటువంటి ఊహ అవసరం. ఎందుకంటే, సమాన హక్కులున్న సరుకు యజమానులు మాత్రమే ఒకరికొకరు ఎదురవగలరు. ఒక మనిషి ఇతరుల సరుకుల్ని పొందాలంటే, తన సరుకుల్ని పరాధీనం చెయ్యడం ఒక్కటే మార్గం; సరుకులు శ్రమచేత మాత్రమే భర్తీ అవుతాయి. ఎమైనప్పటికీ, ఇప్పుడు పెట్టుబడిదారుడికి సంబంధించి, ఆస్థి అనేది చెల్లించబడని శ్రమని లేక శ్రమ ఉత్పాదితాన్ని స్వాయత్తం చేసుకునే హక్కు.  శ్రామికునికి సంబంధించి,తన సొంత ఉత్పాదితాన్ని సొంతం చేసుకోవడం అసంభవం. శ్రమ నుండి ఆస్థిని వేరు చెయ్యడం వాటి ఐక్యతలో ఏర్పడ్డ నియమం యొక్క తప్పనిసరి పర్యవసానమే.
పెట్టుబడిదారీ స్వాయత్త విధానం మారక సూత్రాల్ని ఉల్లఘించదు
అందువల్ల, పెట్టుబడిదారీ స్వాయత్త విధానం సరుకుల ఉత్పత్తి మూల సూత్రాలనించి ఎంతగా దూరం పోయినప్పటికీ,  సూత్రాల్ని ఉల్లఘించినందువల్లకాక, అందుకు భిన్నంగా, వాటిని వర్తింపచేసినందువల్లనే ఆవిధానం తలెత్తింది. పెట్టుబడిదారీ సంచయనానికి అత్యున్నత స్థాయి అయిన వరస దశల్ని  క్లుప్తంగా సమీక్షించడం ద్వారా దీన్ని మరొక మారు స్పష్టపరుచుకుందాం.
కొంత విలువ మొదట  మారక నియమాలకి పూర్తి అనుగుణంగా పెట్టుబడిలోకి మారడం గమనించాం. ఒప్పందంలో ఉన్న ఒక పార్టీ తన శ్రమశక్తిని అమ్ముతాడు. రెండో పార్టీ కొంటాడు.అమ్మినవాడు తన సరుకు విలువని పొందుతాడు. దాంతో అతని సరుకు ఉపయోగపు విలువ అయిన శ్రమ పరాధీనం అవుతుంది. ఉత్పత్తి సాధనాలు అప్పటికే శ్రమశక్తిని కొన్నవాడికి చెంది ఉంటాయి. అవి అతనికే చెందిన శ్రమ సహాయంతో కొత్త ఉత్పాదితంలోకి మార్చబడుతుంది. కొత్త ఉత్పాదితం కూడా చట్టరీత్యా అతనిదే, పెట్టుబడిదారుడిదే.
ఉత్పాదితం విలువలో ఉండే అంశాలు:
1. వినియోగమైన ఉత్పత్తి సాధనాల విలువ.
2. శ్రమశక్తి విలువకు సమానమైన విలువ
3. అదనపువిలువ
కార్మికుడు తన శ్రమశక్తి మారకం విలువను తీసుకున్నాడు.దాని ఉపయోగపువిలువను పరాధీనం చేశాడు. ప్రతి అమ్మకం కొనుగోలులోనూ జరిగేది ఇదే. ఈప్రత్యేకమైన సరుకు (శ్రమశక్తి) ఇతర సరుకుకూ లేని అసాధారణ ఉపయోగపు విలువని (శ్రమని) సరఫరా చేస్తుందనే వాస్తవం, అది విలువని సృజిస్తుందనే వాస్తవం సరుకూత్పత్తికి సంధించిన సాధారణ నియమాన్ని ఏమాత్రం మార్చదు. అందువల్ల వేతనాలకు అడ్వాన్స్ చేసిన విలువ పరిమాణం ఉత్పాదితంలో కనబడకుండా, అదనపు విలువలో పెరిగి కనబడినట్లయితే, అది కార్మికుణ్ణి మోసగించడం వల్ల కాదు -ఎందుకంటే, అతని సరుకు విలువని అతను వాస్తవంగా పొందాడు; అది కేవలం సరుకుని కొన్నవాడు వినియోగించుకున్నందువల్ల మాత్రమే.
వినియోగం అనేది మారకరంగం బయట జరిగే విషయం. కాబట్టి ఇది సరుకుల మారకనియమాల ఉల్లంఘన కాదు.
సమానత్వం విషయంలో మారక నియమానికి కావలసిన సమానత్వం ఒక్క విషయంలోనే: మారకంలో ఉన్న సరుకుల మారకం విలువల సమానత్వం మాత్రమే. వాటి ఉపయోగపువిలువ మధ్యమాత్రం వ్యత్యాసం ఉండాలి. మారకానికి సరుకుల వినియోగంతో ఎటువంటి సంబంధమూ ఉండదు. కారణం: వినియోగం మారక లావాదేవీ ముగిశాక మాత్రమే మొదలవుతుంది.
అందువల్ల సరుకుల మారక నియమాలు భంగం కావు.ఆవిధంగా  సరుకు ఉత్పత్తి నియమాలకీ, వాటినుంచి వచ్చిన ఆస్థి హక్కుకీ సరిగ్గా  అనుగుణంగా మొదటి డబ్బు పెట్టుబడిలోకి మారడం వీలయింది.
అయినప్పటికీ, దాని ఫలితాలు:
1.ఉత్పాదితం పెట్టుబడిదారుడికి చెందుతుంది, కార్మికుడికి చెందదు.
2. దాని (ఉత్పాదితం) విలువలో అడ్వాన్స్ చేసిన పెట్టుబడి విలువతో పాటు అదనపు విలువ ఉంటుంది. అదనపు విలువ ఉత్పత్తికి కార్మికుడికి శ్రమ ఖర్చవుతుంది, కానిపెట్టుబడిదారుడికి ఏమీ ఖర్చూ ఉండదు.అయినా అదనపు విలువ పెట్టుబడిదారుడికి  చట్టబద్ధమైన ఆస్థి అవుతుంది.
3.కార్మికుడు తన శ్రమశక్తిని ఉంచుంటాడు, కొనేవాడు దొరికితే కొత్తగా అమ్ముకో గలుగుతాడు
మొదటి చర్య నియమిత కాల వ్యవధుల్లో పునరావృతం అవుతుండడమే సామాన్య పునరుత్పత్తి. ప్రతిసారీ తాజాగా పెట్టుబడిలోకి మారుతుంది. ఆవిధంగా నియమం భంగం కాదు; అందుకు భిన్నంగా, అది నిరంతరాయంగా కొనసాగేట్లు చేస్తుంది. సామాన్య పునరుత్పత్తి స్థానంలో విస్తృతపునరుత్పత్తి, సంచయనం జరిగినా, విషయంలో తేడా ఏమీ ఉండదు.సామాన్య పునరుత్పత్తిలో పెట్టుబడిదారుడు అదనపువిలువనంతా దుబారాచేస్తాడు.విస్తృత పునరుత్పత్తిలో కొంత అదనపువిలువని సొంతానికి వాడుకొని, మిగిలినదాన్ని పెట్టుబడిలోకి మారుస్తాడు. తన బూర్జువా స్వభావాన్ని బయటపెట్టుకుంటాడు.
అదనపువిలువ పెట్టుబడిదారుడి ఆస్థి
అదనపువిలువ అతని (పెట్టుబడిదారుడి) ఆస్థి.అది ఏనాడూ మరెవ్వరికీ చెంది ఉండలేదు.అతను దాన్ని ఉత్పత్తికి అడ్వాన్స్ చేస్తే, అడ్వాన్సులు అతని సొంత నిధుల నుండి వచ్చినవే. సందర్భంలో నిధులు అతని కార్మికుల చెల్లించబడని శ్రమ నుండి ఏర్పడ్డాయి అనే వాస్తవం తేడానీ చూపించదు. A అనే కార్మికుడికి చెలించని శ్రమనుండి B అనే కార్మికుడికి చెల్లిస్తే, అప్పుడు:
1.మొదటి సంగతి-తనసరుకు న్యాయమైన విలువలో పావు పెన్నీ(farthing) అయినా తగ్గకుండానే, అదనపు విలువ సమకూర్చాడు
2.రెండో సంగతి. లావాదేవీతో B కి ఎట్టి సంబంధమూ ఉండదు. పెట్టుబడిదారుణ్ణి తన శ్రమశక్తి విలువ చెల్లించమని అతను అడగవచ్చు. ఆహక్కు అతనికి ఉంటుంది.
ఇద్దరూ లాభపడతారు. కార్మికుడు- తన శ్రమ ఫలాల్ని పనిచేయక ముందే(అతని శ్రమ ఫలాలని ఇవ్వక ముందే అని చదువుకోవాలి) అడ్వాన్స్ గా పొందినందువల్ల (చెల్లించబడని ఇతరుల శ్రమ అని చదవాలి); యజమాని:అతని కార్మికుడు చేసే శ్రమ  వేతనంకన్నా ఎక్కువ విలువ కలది అయినందువల్ల (అతని వేతనం విలువ కన్నా అతని శ్రమ ఎక్కువ విలువని ఉత్పత్తిచేసింది అని చదవాలి) లాభపడతాడు.  
పెట్టుబడిదారీ పునరుత్పత్తిని  పునరావృతుల నిరంతరాయ ప్రవాహంగానూ, వ్యష్టి పెట్టుబడిదారుని వ్యష్టి కార్మికుని స్తానాల్లో పరస్పరం ఎదుర్కునే మొత్తం పెట్టుబడిదారీ వర్గాన్నీ, మొత్తం కార్మికవర్గాన్నీ  చూస్తే, విషయం భిన్నంగా ఉంటుంది. అలా చూస్తున్నప్పుడు సరుకు ఉత్పత్తికి పూర్తిగా పరాయివైన ప్రమాణాల్ని/కొలబద్దల్ని వర్తింపచెయ్యాలి. సరుకు ఉత్పత్తిలో కొనేవాడూ, అమ్మే వాడూ మాత్రమే పరస్పరం స్వతంత్రంగా ఒకరికొకరు ఎదురుపడతారు. ఒప్పందకాలం ముగియగానే వాళ్ల మధ్య సంబంధాలు నిలిచిపోతాయి. లావాదేవీ మళ్ళీ జరిగితే, అదిమరొక కొత్త ఒప్పందం ఫలితంగా జరుగుతుంది. ఆ ఒప్పందానికి అంతకు ముందు దానితోగాని, ఆతవతదానితోగానేఏ సంబంధం ఉండదు.అది కేవలం అదే కొనుగోలుదారుడూ, అమ్మకందారుడూ యాదృచ్చికంగా కలిసినందువల్ల మాత్రమే.  
అందువల్ల సరుకు ఉత్పత్తిగానీ, దాని అనుబంధ ప్రక్రియల్లో ఏదైనా గానీ దాని సొంత నియమాలను బట్టి తీర్పు చెప్పాల్సివస్తే, ప్రతి మారక చర్యనీ దానికదిగా, దాని ముందు వెనక చర్యలతో సంబంధం లేకుండా చూడాలి.కొనుగోలూ, అమ్మకమూ ప్రత్యేక వ్యక్తుల మధ్య మాత్రమే జరుగుతున్నందువల్ల ఇక్కడ మొత్తం సామాజిక వర్గాల సంబధాల్ని చూడడం అంగీకరించదగింది కాదు. 
ఇవ్వాళ వ్యవహరిస్తున్న పెట్టుబడి పయనించిన నియమితకాల పునరుత్పత్తుల, గత సంచయనాల వరస ఎంతపొడవైనదైనా, అది తన మొదటి స్వచ్చతను కాపాడుకుంటూనే ఉంటుంది. మారక నియమాల్ని  ప్రతి ఒక్క విడి చర్యలో పాటించినంత కాలమూ, స్వాయత్త విధానాన్ని పూర్తిగా విప్లవీకరించ వచ్చు - సరుకు ఉత్పత్తికి అనుగుణమైన ఆస్థిహక్కుల్ని ఏవిధంగానూ భంగపచకుండానే. ఉత్పత్తిదారుడికి ఉత్పాదితం చెంది ఉన్న తొలిదశలో ఇవే హక్కులు అమల్లో ఉంటాయి. అప్పుడు ఉత్పత్తి దారుడు సమానకానికి సమానకాన్ని మారకం చేస్తూనే, తన సొంత శ్రమ ద్వారా మాత్రమే సంపన్నుడు కాగలుగుతాడు. ఆదశలో ఇవే హక్కులు వర్తిస్తాయి. పెట్టుబడిదారీ ఉత్పత్తి కాలంలో కూడా అవే అమలవుతాయి. ఆకాలంలో చెల్లింపు చెయ్యని  ఇతరుల శ్రమని నిర్విరామంగా/ అవిశ్రాంతంగా స్వాయత్తం చేసుకునేస్థితిలో ఎవరుంటే సామాజిక సంపదని నిరంతరం పెరిగే స్థాయిలో వాళ్ళ ఆస్థి అవుతుంది.
శ్రామికుడు తానే తన శ్రమశక్తిని స్వేచ్చగా అమ్ముకునే క్షణం నుంచీ ఫలితం అనివార్యం అవుతుంది. అయితే ఆక్షణం నుంచే సరుకు ఉత్పత్తి సర్వసాధరణమవుతుంది; ప్రత్యేక (typical) ఉత్పత్తి రూపం అవుతుంది; ఇక అప్పటినించీ మాత్రమే మొదటి నించీ ప్రతిసరుకూ అమ్మడం కోసమే ఉత్పత్తిచెయ్యబడుతుంది,సంపదంతా చలామణీ రంగం గుండా నడుస్తుంది.ఎప్పుడైతే, ఎక్కడైతే వేతన శ్రమ ప్రాతిపదికగా ఉంటుందో, అప్పుడు అక్కడ సరుకు ఉత్పత్తి మొత్తం సమాజం మీద పడుతుంది.అప్పుడు, అక్కడ మాత్రమే అది  గుప్తంగా ఉన్న తన సకల శక్తి సామర్ధ్యాల్ని ప్రదర్శిస్తుంది.  
వేతనశ్రమ రావడం సరుకు ఉత్పత్తిని కల్తీ చేస్తుంది అనడం కల్తీ లెకుండా ఉండాలంటే సరుకు ఉత్పత్తి అభివృద్ధి కాకూడదు అని చెప్పడమే. సరుకు ఉత్పత్తి తన అంతర్గత నియమాల్ని బట్టి  పెట్టుబడిదారీ ఉత్పత్తిలోకి అభివృద్ధి అయిన మేరకు సరుకు యొక్క ఆస్థి నియమాలు పెట్టుబడిదారీ స్వాయత్త నియమాల్లోకి మారతాయి.
పునరుత్పత్తిలో పెట్టుబడి  అనేది సంచయనమయిన అదనపువిలువే
సామాన్య పునరుత్పత్తిలో సైతం పెట్టుబడి అంతా దాని మూల వనరు ఏదయినా, సంచయనమైన పెట్టుబడిలోకి, పెట్టుబడీకరించబడిన అదనపువిలువలోకి పరివర్తన చెందుతుంది.అయితే ఉత్పత్తి ప్రవాహంలో మొడట అడ్వాన్స్ చేసిన పెట్టుబడి నేరుగా సంచయనమైన పెట్టుబడితో, అంటే పెట్టుబడిలోకి మారిన అదనపు విలువతో పోలిస్తే అదృశ్య పరిమాణం అవుతుంది- అదిసంచయనకర్త చేతిలో వ్యవహరించినా,  ఇతరుల చేతుల్లో వ్యవహరించినా.  కాబట్టి రాజకీయ అర్ధశాస్త్రం సాధారణ పెట్టుబడిని సంచయనమయిన సంపద (మార్చబడ్డ అదనపువిలువ లేక ఆదాయం) అంటుంది. అంటే అదనపు విలువ ఉత్పత్తి కోసం తిరిగి ఉత్పత్తిలో నియోగించబడినది. పెట్టుబడి దారుణ్ణి అదనపువిలువ ఓనర్ అంటుంది. ఇది ఉన్న పెట్టుబడి అంతా సంచయనం చేయబడ్డ/ పెట్టుబడీకరించబడ్డ వడ్డీ అనడం వంటిదే . ఎందుకంటే, వడ్డీ అదనపువిలువలో ఒక భాగం మాత్రమే.
.
వచ్చే పోస్ట్ : అర్ధశాస్త్రజ్ఞుల పొరపాటు అవగాహన

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి