16, ఏప్రిల్ 2016, శనివారం

మార్క్స్ చెప్పిందేమిటీ? రంగనాయకమ్మగారు రాసిందేమిటి?

మార్క్స్ చెప్పిందేమిటీ?
రంగనాయకమ్మగారు రాసిందేమిటి?
మామూలు విషయాల నుంచీ, మౌలికమైన విషయాలదాకా
తప్పులతో సాగిన కాపిటల్ 'పరిచయం'పై
ప్రామాణిక గ్రంధాల ఆధారంగా
చేసిన విమర్శ
బ్రహ్మాచారి
దిలీప్ కుమార్
1994 ఫిబ్రవరి
   "ఒక సైన్సుని నేర్చుకునే చోట చిన్న పొరపాటు అయినా పొరపాటే”*— రంగనాయకమ్మ
రంగనాయకమ్మ గారి 'కాపిటల్ పరిచయం' 5 భాగాలుగా ఉంది. చివరిభాగం కూడా మార్కెట్లోకి వచ్చి కొంతకాలం గడిచినా ఏపత్రికలోనూ సమీక్ష రాలేదు. ప్రకటనలు మాత్రం కొన్ని వచ్చాయి.
మార్క్సు కాపిటల్ సారాంశాన్ని శాస్త్రీయంగా, సులభంగా చెప్పాలని చేసినప్రయత్నమే ఈ 'కాపిటల్ పరిచయం'. కానీ సారాంశాన్ని శాస్త్రీయంగా చెప్పడం సంగతి అలా ఉంచి, ఎంతో సామాన్యమైన, సుపరిచితమైన విషయాలలో కూడా 'పరిచయం' లో పొరపాట్లు ఉన్నాయి.
1.కాపిటల్ పరిచయం 1వ భాగంలోని 1వ పేజీలోనే "1867 ఆగస్ట్ 16 రాత్రి 2 గంటలకు కాపిటల్ మొదటి సంపుటి రచన పూర్తి అయింది." అని వుంది.
కానీ, 1867 ఏప్రిల్ 29న [1] అంటే రంగనాయకమ్మగారు చెప్పే రచనా కాలానికి 3 నెలల కంటే ముందే, కాపిటల్ అచ్చుపని కూడా మొదలయింది.
ఆగస్ట్ 16 రాత్రి 2 గంటలకు, అంటే రంగనాయకమ్మగారు రచన పూర్తి అయిందని చెప్పే సమయానికి కాపిటల్ గురించి రాసిన ఉత్తరంలో [2] " ఈపుస్తకపు ఆఖరి షీట్ ను (49 వదాన్ని) సరిచూడడం ఇప్పుడే పూర్తయింది" అని రాశాడు. అంటే అప్పుడు పూర్తయింది రచన కాదు, ఆఖరి ప్రూఫ్ ను సరిచూడటం. కాపిటల్ మొదటి సంపుటి రచన పూర్తయింది మాత్రం 1867 ఏప్రిల్ 2 న [3].
2. ఆమొదటి భాగం లోనే 3వ పేజీలో -"కాపిటల్ రాయడానికి 20 సం IIల ముందే మార్క్సు 'రాజకీయార్ధికశాస్త్రంపై ఒకవిమర్శ 'పేరుతో పాత ఆర్ధిక శాస్త్రం గురించి ఒక పుస్తకం తాశాడు." -అని చూస్తాం.
కానీ, ఆపుస్తకాన్ని మార్క్స్ రాసింది కాపిటల్ రాయడానికి 20 సంవత్సరాల ముందుగా కాదు,దాదాపు 8 సంవత్సరాల ముందుగా. 1859 లో[4]
3."1844 సెప్టెంబర్ లో ఎంగెల్స్ పారిస్ వచ్చి మొట్టమొదటి సారిగా మార్క్సుని కలిశాడు."- పరిచయం-1-15 వ పేజీ. కాని నిజానికి ఎంగెల్స్ మార్క్సుని మొదటిసారి కలిసింది నవంబర్ 1842 లో [5]
4. కొన్ని నిర్దిష్ట కాలాల్లో వున్న పెన్నుల ధరల గురించి మార్క్సు ఇచ్చిన వివరాలు 'పరిచయం'లో కొచ్చెసరికి మారిపోయాయి.
పరిచయం ప్రకారం -"1820లో -చేతి వృత్తులద్వారా తయారైన స్టీలు పెన్ను ధర - 7 పౌండ్ల 4 షిల్లింగులు.
1830 లో మాన్యుఫాక్చర్ ద్వారా తయారైన అదేరకం పెన్నుధర- 8 షిల్లింగులు.
1861 లో - భారి పరిశ్రమద్వారా తయారైన అదేరకంపెన్ను ధర "2 పెన్నీలకూ, 6 పెన్నీలకూ మధ్య" -(పరిచయం-3-88, 89 పేజిలలో)
మార్క్సు దీన్ని గురించి రాసింది యిలావుంది:" మొదట్లో చేతివృత్తుల వ్యవస్థ ద్వారా సప్లై అయిన స్టీలు పెన్నులధర 1820వ సంవత్సరంలో గ్రోసు 7 పౌండ్ల 4 షిల్లింగులు; 1830 లో అవి మాన్యుఫక్చర్ ద్వారా 8 షిల్లింగులకు సప్లై అయినాయి. మరి ఈరోజున ఫాక్టరీ వ్యవస్థ వాటిని గ్రోసు 2 షిల్లింగులకూ 6 పెన్నీలకూ మధ్య....సప్లై చేస్తున్నది"[6]
మూడు సందర్భాలలోనూ మార్క్సు చెప్తున్నది గ్రోసు పెన్నుల గురించి.(గ్రోసు అంటే 12 డజన్లు. అంటే 144).. 1820 లో 144 పెన్నులధర 7 పొండ్ల 4 షిల్లింగులు అని మార్క్సు అంటే, ఒక పెన్నుధర 7 పొండ్ల 4 షిల్లింగులు అని -రంగనాయకమ్మగారు.
1830 లో 144 పెన్నులధర 8 షిల్లింగులు అని మార్క్సు చెప్తుంటే, 1830 లో ఒక పెన్నుధర 8 షిల్లింగులు అని అని -రంగనాయకమ్మగారు.
అలాగే ఫాక్టరీ సప్లై చేసిన పెన్నుల విషయంలో కూడా మార్క్సు గ్రోసు పెన్నుల ధర గురించి చెప్తుంటే రంగనాయకమ్మగారు ఒక పెన్నుగురించి చెప్పడమే కాకుండా, వాటిధర '2 షిల్లింగులకూ 6 పెన్నీలకూ మధ్య 'అని మార్క్సు చెప్తుంటే ' 2 పెన్నీలకూ 6 పెన్నీలకూ మధ్య 'అని రంగనాయకమ్మగారు చెప్తారు.
5."'విలువ అంటే శ్రమ " అనే సూత్రీకరణ రాజకీయార్ధికశాస్త్రానికే మూలస్తంభం లాంటిది. అయినా దాన్ని మొదట ఎవరు సూత్రీకరించారు, ఎప్పుడు సూత్రీకరించారు - అనే వాటిలో కూడా 'పరిచయం'లో తప్పే ఉంది.
"'విలువ అంటే శ్రమ ' అనేవిషయాన్ని, అరిస్టాటిల్ తర్వాత కూడా ఇంకా 2 వేల సంవత్సరాల వరకూ ఎవ్వరూ కనిపెట్టలేదు. చివరకి ఆవిషయాన్ని 1739 లో, ఒక పేరులేని (పేరు మనకి దొరకని) ఆర్ధికవేత్త కనుగొన్నాడని మార్క్స్ ఒక ఫుట్ నోట్ లో చెప్పాడు." (పరిచయం-1- 207 వ పేజీ). పరిచయం లో ఉన్నట్లుగా, విలువ అంటే శ్రమ అని మొదటిసారిగా 1739 లో ఈపేరు తెలియని ఆర్త్ధికవేత్త కనుగొన్నాడని మార్క్స్ చెప్పినట్లు ఎక్కడా కనబడలేదు. విలువ అంటే శ్రమ అని తెలియడం వరకయితే విలియం పెట్టీ కి చాలా ముందే తెలుసు. 1662లో వెలువడిన A Treatise of Taxes and Contributions అనే పెట్టీ రచన గురించి రాస్తూ " ఈపుస్తకంలో ఆయన సరుకుల విలువను వాటిలో యిమిడివున్న శ్రమ పరిమాణాన్ని పోల్చి నిర్ణయిస్తాడు [7]- అని మార్క్స్ రాశాడు.
"విలువ అంటే శ్రమ" అని మొదట సూత్రీకరించిన వాడు మాత్రం బెంజ్ మన్ ఫ్రాంక్లిన్."మొట్టమొదటసారి వుద్దేశ పుర్వకంగా, స్పష్టంగా ....మారకం విలువని శ్రమకాలంగా తేల్చిన" వ్యక్తిగా బెంజ్ మన్ ఫ్రాంక్లిన్ గురించి చెప్తూ"1729 లో రాసి, 1731 లో ప్రచురించిన రచనలో ఆధునికి రాజకీయార్ధికశాస్త్రపు ప్రాధమిక (basic)నియమాన్ని సూత్రీకరించిన వ్యక్తి... బెంజమిన్ ఫ్రాంక్లిన్[8]" అన్నాడు మార్క్సు.అదే రచన గురించి చెప్తూ, ఇంకో సందర్భంలో మార్క్స్ " ఈసమస్యను పరిశీలించిన ప్రధములలో ఒకడైన ఫ్రాక్లిన్, ఆరచనలో విలువయొక్క వాస్తవ స్వభావాన్ని కనుగొన్నాడు.[9]" -అని రాశాడు.
6."క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల క్రితం అరిస్టాటిల్ ద్వారా ప్రారంభమైన "విలువ పరిశోధన, క్రీస్తు తర్వాత 1864 నాటికి మార్క్స్ ద్వారా సమగ్రమయింది."- పరిచయం 1 పేజీ 210.
నిజానికి అరిస్టాటిల్ కాలం క్రీ.పూ 384. నుంచీ క్రీ.పూ.322 వరకు[10] అంటే రంగనాయకమ్మగారు అరిస్టాటిల్ పరిశోధన ప్రారంభించాడని చెప్పేనాటికి ఆయన చనిపోయి 22 సంవత్సరాలయింది.
7.క్రీస్తు తర్వాత 1864 అనడం కూడా తప్పే. 'క్రీస్తుశకం 1864' అనాలి.'క్రీస్తు తర్వాత’ అంటే క్రీస్తు మరణించిన తర్వాత అని అర్ధం. కాని క్రీస్తు శకాన్ని లెక్క కట్టేది క్రీస్తు  పుట్టినప్పటి నుంచీ. కాబట్టి క్రీస్తు శకం అనడానికీ క్రీస్తు తర్వాత అనడానికీ తేడా వుంటుంది.
*********
ఇక ఇప్పుడు లెక్కల సంగతి చూద్దాం.'కాపిటల్ 'లో వున్న లెక్కలన్నీ చిన్నవే. సాధారణంగా ఎవరికైనా తెలిసివుండేవే. అయినా ఈ లెక్కలలో కూడా పరిచయంలో తప్పులు ఉన్నాయి.
8. "100 కిలోల ధర -132 రూపాయలు అయితే
1 కిలోధర 1.32 పైసలు" అట. (పరిచయం-5, 70వ పేజీ)
1.32 'పైసలు 'కాదు 1.32 రూపాయలు అని రాయాలి.రూపాయల్ని భాగించినప్పుడు వచ్చేది కూడా రూపాయలే గానీ,  పైసలు కాదు.'1.32' పైసలు అంటే ఒకటిన్నర పైసల కంటే తక్కువ.'1.32 రూపాయలు' అంటే ఒక రూపాయి 32 పైసలు అని అర్ధం.
9. "200 కిలోల ధర- 154 రూ.లు అయితే 1కిలో ధర - 154/200=0.77 పైసలు"- (పరిచయం-5, 71వ పేజీ). ఇది కూడా 0.77 పైసలు అనికాకుండా, 0.77 రూపాయలు అని వుండాలి.'0.77 పైసలు ' అంటే ఒక పైసాకంటే తక్కువ. 0.77 రూపాయలు అంటే 77 పైసలతో సమానం. కానీ '0.77 పైసలు ' అని రాసిన తర్వాత, దాన్నే '77 పైసలు ' అనిరాశారు. 0.77 పైసలు 77 పైసలుగా ఎలావుతుందో తెలియదు. అదే, 0.77 రూపాయలు అని రాస్తే, 0.77 రూపాయలు =0.77100 పైసలు=77 పైసలు - అని రాయచ్చు. అప్పుడు సరిగా వుండేది.
10. 'పరిచయం-3'లోని, 390 పేజీ చివర్లో ఇచ్చిన లెక్క కూడా తప్పుగా వుంది. ఈలెక్కని చేసిన పద్ధతి సరిగానే వుంది. కానీ మొదటి స్టెప్ లో110 గా వున్న పెట్టుబడిని, 2వ స్టెప్ లో 120 గా వేసుకొని ఆతప్పు అంకెతోటే మిగతా లెక్క అంతా చేశారు. ఆవిధంగా చివరివరకూ ఆతప్పు కొనసాగింది.
11. ఒక విషయాన్ని 'తేలిగ్గా అర్ధం'అయ్యేట్లు చెప్పడానికి పోలిక కోసం స్కూలు విద్యార్ధుల మార్కుల సగటు కట్టే లెక్కని యిచ్చారు.'పరిచయం-4' ,163 వ పేజీలో-'
" లెక్కల పరీక్షలో, 5 తరగతుల్లోనూ సగటులు, 40%, 50%, 45%, 55%,35% -గా వున్నాయనుకుందాం. ఇప్పుడు స్కూలు సగటు=40%+50%+45%+55%+35%== 45%".  పరిచయం ప్రకారం 'ఇది స్కూలు సగటు. 'ఇలా చెయ్యడంలో వున్న తప్పేమిటో చూద్దాం.రంగనాయకమ్మగారు 162వ పేజీలో చెప్పినట్లుగా, 'ప్రతీ తరగతిలోనూ కొంతమంది విద్యార్ధులు వుంటారు 'కాబట్టి ఈ 5 తరగతులలో వరసగా 10 మందీ, 11 మందీ, 60 మందీ, 9 మందీ విద్యార్ధులు వున్నారనుకుందాం.అప్పుడు స్కూలు విద్యార్ధుల మార్కులు మొత్తం=
(4010)+(5011)+(4510)+(5560)+(359)=400+550+450+3300+315=5015.
మొత్తం స్కూలు విద్యార్ధుల సంఖ్య=10+11+10+60+9=100
స్కూలు సగటు  = = =50.15
అంటే సుమారుగా 50. శాతంగా చెప్పాలంటే 50%.(ప్రతి తరగతిలో, పరీక్ష 100 మార్కులకి అనుకుంటే)
కానీ రంగనాయకమ్మగారి ప్రకారం 45% రావాలి. తేడా ఎందుకువచ్చిందంటే రంగనాయకమ్మగారు ఒక్కో క్లాసులో ఎంతమంది ఉన్నారనే దానితో సంబంధం లేకుండా మొత్తం క్లాసు సగటుల్ని కలిపివేశారు కాబట్టి. కానీ, స్కూలు సగటు, క్లాసులలో వున్న విద్యార్ధుల సంఖ్య మీద కూడా ఆధారపడి వుంటుంది కాబట్టి, దాన్ని లెక్కలోకి తీసుకోకుండా చెయ్యడం తప్పు. ' ప్రతీ తరగతిలోనూ కొంతమంది విద్యార్ధులు వుంటారు ' అని తెలిసీ, ఏఏ క్లాసులో ఎంతమంది విద్యార్ధులు వున్నారనేదానితో సంబంధంలేకుండా స్కూలు సగటు కట్టడం తప్పు.
ఇంకో విషయం గమనించండి.
"40%+50%+45%+55%+35%="-అట. ఏమిటి దీనర్ధం?40%, 50%, 45%, 55%,35%-వీటన్నిటినీ కలిపితే”వస్తుందనేకదా! నిజానికి వీటన్నిటినీ కలిపినప్పుడు వచ్చేది 225 మాత్రమే. ఎంతో సులభమైన స్టెప్ లను కూడా సరిగా వేయకపోవడం వల్ల ఇలా అయ్యింది.
=  అని వేస్తే, కనీసం చెప్పాలనుకున్న విషయాన్ని సరిగ్గా చెప్పినట్లయ్యేది, ఆచెప్పాలనుకునేది కూడా తప్పుగా ఉందనేది వేరే సంగతనుకోండి.
12.పరిచయం-2 లోని 396వ పేజీలో ఇచ్చినలెక్క మొత్తం తప్పుగా ఉంది. అయితే ఇది రూపాయలూ,  పైసల లెక్కలాంటిదో, స్కూలు విద్యార్ధుల లెక్కలాంటిదో కాదు.
ఒక పనిస్థలంలో ఖర్చయ్యే ఫిక్స్డ్ సాధనాల విలువలనీ, వాటి జీవితకాలాల్నీ ఇచ్చినప్పుడు, ఒక సంవత్సరానికి ఖర్చయ్యే ఫిక్స్డ్ సాధనాల విలువని కనుక్కోవడానికి సంబంధించినది.
రంగనాయకమ్మగారు చేసిన లెక్క ఇలా ఉంది.
ఒక పనిస్థలంలో ఉండే ఫిక్స్డ్ సాధనాలు
వాటి జీవిత కాలాలు
వాటి విలువలు
1. బిల్డింగు
60 సం II
1200
2. శ్రమపరికరాలు
10 సం II
300
3.పాత్రలు
5 సం II
50
4. కుర్చీలూ,బల్లలూ వంటి ఇతర సాధనాలు
8 సం II
150
అంశాల మొత్తాలు
83 సం II
1,700
83 సంవత్సరాలకీ -1700 విలువ ఖర్చయితే, 1 సంవత్సరానికి -1700  83=21
ఈపనిస్థలంలో ప్రతీ సంవత్సరం 21 విలువగల ఫిక్స్డ్ సాధనాలు ఖర్చవుతాయి."
       --   ఇదీ రంగనాయకమ్మగారు లెక్కచేసినపద్ధతి               
ఇటువంటి లెక్కని ఈవిధంగా చెయ్యడం తప్పు. సరిగ్గా చేస్తే ఈలెక్క ఇలా ఉంటుంది.
                                                        
ఒక పనిస్థలంలో ఉండే ఫిక్స్డ్ సాధనాలు
వాటి జీవిత కాలాలు
వాటి విలువలు
1 సంవత్సరానికి ఖర్చయ్యే ఫిక్స్డ్ సాధనపు విలువ
1. బిల్డింగు
60 సం II
1200
1200/60=20
2. శ్రమపరికరాలు
10 సం II
300
300/10 =  30
3.పాత్రలు
5 సం II
50
50/ 5 =  10
4. కుర్చీలూ,బల్లలూ వంటి ఇతర సాధనాలు
8 సం II
150
150/8  =19 (సుమారుగా)
1సంవత్సరానికి ఖర్చయ్యే మొత్తం విలువ
79 (సుమారుగా)
మొత్తం సంవత్సరానికి ఖర్చయ్యే విలువ 79 రావాల్సింది, రంగనాయకమ్మగారికి, తప్పుగా చెయ్యడం వల్ల 21 వచ్చింది. దేనికి దానిని విడివిడిగా కూడి, సంవత్సరానికి ఖర్చయ్యే విలువ = +++ = 20+30+10+19=79 --     అనే పద్ధతిలో చెయ్యాల్సినదాన్ని, రంగనాయకమ్మగారు, అన్నింటినీ అమాంతంగా కలిపి, సంవత్సరానికి ఖర్చయ్యే విలువ =
== 21- అనే పద్ధతిలో చేశారు.
పైవన్నీ (లవాలన్నీ) కలిపి, కిందవన్నీ (హారాలన్నీ) కలిపి, భిన్నాల కూడికని చేస్తే లెక్కతప్పు వస్తుందనేది చాలా సాధారణ విషయం. కానీ, రంగనాయకమ్మగారు సరిగ్గా అదే చేశారు. అన్నిటినీ ఒక్కసారిగా కూడివేశారు.
ఎందుకంటే,రంగనాయకమ్మగారి ప్రకారం ఫిక్స్డ్ సాధనాల విలువలనీ, జీవితకాలాలనీ ఇచ్చినప్పుడు, " వాటి జీవితకలాలన్నిటినీ కలిపి, వాటి విలువలన్నిటినీ కూడా కలిపి, ఒక సంవత్సరానికి ఎంతవిలువ వుంటుందో చూస్తే, అంత విలువగల ఫిక్స్డ్ సాధనాలు ఆపనిస్థలంలో ప్రతీ సంవత్సరం ఖర్చవుతాయి - అని తెలుసుకొవచ్చు" (అదే పేజీ)
అంటే, ఈలెక్కని తప్పుగా చెయ్యడం, ఏదో లెక్కచేసే తొందర్లోనో, ఇంకేదో పొరపాటు వల్లనో జరిగింది కాదు. ఇటువంటి లెక్కని చేసే విధానం గురించి సరైన అవగాహన లేక పోవడం వల్లా, తప్పు అవగాహన వుండటం వల్లా జరిగింది.
విడివిడిగా చేస్తె 79 వచ్చే వాటిని ఏకంగా కలిపివేసి, 21 వచ్చేట్లు తప్పుగా చెయ్యడమే కాకుండా, "ఒక్కొక్క ఫిక్స్డ్ సాధనం ఖర్చునీ విడివిడిగా లెక్క కట్టి, ఆలెక్కలన్నిటినీ కలిపినా ఇదే లెక్క వస్తుంది"  అని గ్యారంటీ ఇస్తున్నారు (అదేపేజీ).
అలా చేసినా ఇలాచేసినా ఒకటే వస్తుందనటం తప్పు.
అంటే, ఇటువంటి లెక్క గురించి బొత్తిగా అవగాహన లేదని మళ్ళీ రుజువు చేసుకుంటున్నారు.
మొత్తం కలిపి చేసినా లెక్క సరిగ్గానే వస్తుందనుకోవడం వల్ల, చాప్టర్ చివర్లో రంగనాయకమ్మగారు ఒక లెక్క ఇచ్చారు, పాఠకులు చెయ్యడానికి. " ఒక పనిస్థలంలో ఫిక్స్డ్ సాధనాల జీవితకాలాల మొత్తం 350 సం IIలు. వాటి విలువలమొత్తం 1,05,000 రూ.లు. ఆపనిస్థలంలో తయారయ్యే సరుకు కోసం ప్రతీ నెలా ఎంతవిలువగల ఫిక్స్డ్ సాధనాలు ఖర్చవుతాయి?"- అనేది లెక్క.  ప్రతి ఒక్క సాధనానికీ, దేనికి దానికి విడివిడిగా వివరాలు ఇస్తే తప్ప ఈలెక్కని చెయ్యడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇప్పటికి చూచినదాన్ని బట్టే ఆవిషయం తెలుసుకోవచ్చు.
                                                                                                       
                                                                                     
In translating one must venture to the edge of what is untranslatable   -Goethe
                  ఇక అనువాదాల గురించి. పరిచయం కాపిటల్ కి అనువాదం కాదు. అందులో కొన్ని కొటేషన్లున్నాయి. కాపిటల్ నుంచే కాదు మార్క్స్ ఇతర రచనల నుండి కూడా కోట్ చేశారు. వాటిలో తప్పులున్నాయి - సామాన్యమైనవీ, సారాంశాన్ని మార్చివేసినవీ.
మార్క్సు 'గొర్రెలు '(lambs) [11]అని రాసినవి అనువాదంలో 'మేకలు ' [12]అయినాయి. 'సొరచేపలు '(sharks)[13] 'తిమింగిలాలు '[14]అయినాయి. 'మనసు '(mind)[15] 'మెదడు ' [16]గా మారిపోయింది. ఇలాంటివేకాదు మార్క్స్ 'కొన్నింటిలో ఒకదాన్నీ ప్రస్తావిస్తున్నప్పుడు రంగనాయకమ్మగారు అసలున్నదే ఒకటైనట్లు రాశారు. అలాగే ఒకదాన్ని గురించి చెప్పిన విషయాన్ని ఇతరవాటికి అన్వయించారు. 'జరిగే అవకాశం వుంది ' అనే అర్ధంలో 'ఉండచ్చు ' అని రాస్తే జరిగేదంతా అదే అయినట్లు 'ఉంటాయి' అని రాసిన సందర్భాలున్నాయి. 'ఊహిద్దాం' (assume) అన్నవాటిని వాస్తవాలుగా కొన్నిచోట్ల రాశారు. కీలక పదాలు తొలగించిన సందర్భాలూ వున్నాయి. కొత్తపదాలు ప్రవేశపెట్టినవీ ఉన్నాయి. కొన్ని మాటల అర్ధాలు తప్పుగా రాయడమూ ఉంది. మూలంలో ఒక అర్ధంలో వాడిన పదానికున్న మరొక అర్ధంలో రాయడమూ ఉంది.
1.                 “ -----not only as one of the methods of adding to the efficiency of production” – Capital 1 page 454
పరిచయం 3వ భాగం 120వ పేజిలో దీని అనువాదం ఇలా ఉంది: " ...వుత్పత్తి కార్యంలో సామర్ధ్యానికి దోహదం చేసే పద్ధతిగానే కాక". మూలంలో 'పద్ధతుల్లో ఒకటిగానే కాక' అని ఉంది. అంటే కొన్ని పద్ధతులు వున్నాయి. వాటిలో ఇదొకటి అని మార్క్సు అంటున్నాడు. ఉన్నపద్ధతే ఒకటనట్లు రంగనాయకమ్మగారు చెబుతున్నారు.
2. “As one of the most vital principles of communism” – German Ideology, page 566.                         దీన్నిలా అనువదించారు: "కమ్యూనిస్ట్ సూత్రాలలో అత్యంత ప్రధానమైన సూత్రం" -పరిచయం 5 పేజీ 616. తప్పేమిటో స్పష్టంగానే తెలుస్తోంది.
మార్క్సు ప్రకారం: అత్యంత ప్రధానమైన సూత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిలొ ఇదొకటి.. రంగనాయకమ్మగారి ప్రకారం అత్యంత ప్రధానమైన సూత్రం ఇదొక్కటే. అంత ప్రధానమైన సూత్రాలు లేనే లేవు. కొన్నిట్లో ఒకటి అనే మార్క్స్ భావం అనువాదంలో లేదు .
3. మార్క్సు ఒక పరిస్తితిని ప్రస్తావిస్తే, రంగనాయకమ్మగారు అలాంటివాటన్నింటినీ ఒకేగాటన కట్టేశారు. ఇది పరిచయం 5 వ భాగం 453వ పేజీలో ఉన్న వాక్యం: "గతంలో సాగిన సంక్షోభాల తర్వాత ఒక మార్పు జరిగింది". ఇది ఈక్రింది వాక్యానికి తెలుగుసేత:
“ A change has taken place here since the major general crisis” – Capital vol III page 489.
రెండింటినీ పోల్చి చూస్తే తేడా తేలిగ్గానే తెలుస్తుంది. మార్క్సు 'పెద్ద జనరల్ సంక్షోభాన్ని 'దృష్టిలో పెట్టుకున్నాడు. మార్పు జరిగింది ఆసంక్షోభం తర్వాత అని చెబుతున్నాడు. రంగనాయకమ్మగారి ప్రకారం మార్పు జరిగింది అప్పటివరకూ సాగిన అన్ని సంక్షోభాల తర్వాత.
4. ఇలాంటి ధోరణే పరిచయం 3 లో 367 పేజీలో కనబడుతుంది:
" అనుత్పాదక శ్రామికుల సర్వీసుల విలువ వుత్పాదక శ్రామికుల శ్రమల విలువ లాగా గానీ, దాన్ని పోలివుండే విధంగాగానీ ఏర్పడడాన్ని ఏదీ నివారించదు"
మార్క్స్ 'ఏదీ'అని రాయలేదు, ‘ఇది’ అని రాశాడు.
“ This does not prevent, as Adam  Smith remarks, the value of the services of these unproductive labourers being determined, and determinable in the same way as that of the productive labourers” – Theories of Surplus Value1, page 159.
This అంటే 'ఇది '. 'ఏదీ 'కాదు. మార్క్స్ చెప్తున్న 'ఇది ' ఏదో తెలుసుకొవాలంటే ఈకొటేషన్ కి ముందు వాక్యం చదవాలి.
“ They participate in it only through the exchange of their services against revenue”
“వాళ్ళ (అనుత్పాదకశ్రమికుల -మాది) సర్వీసులు రెవిన్యూతో మారటం ద్వారా మాత్రమే వాళ్ళు దానిలో (పాదార్ధిక ఉత్పత్తిలో-మాది) పాల్గొంటారు.”
పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందిందంటే, అనుత్పాదక శ్రామికుల్లో బహుకొద్దిమంది మాత్రమే పాదార్ధిక ఉత్పత్తిలో (material production)  ప్రత్యక్షంగా పాల్గొనగలుగుతారు. వాళ్ళ సర్వీసులు రెవిన్యూతో మారటం ద్వా రా మాత్రమే పాదార్ధిక వుత్పత్తిలో పాల్గొంటారు. ఈవిషయం చెప్పాక అనుత్పాదక శ్రామికుల సర్వీసుల విలువ, ఉత్పాదక శ్రామికుల సర్వీసుల విలువలాగానో, దాన్నిపోలివుండే సరళిలోనో నిర్ణయింపబడాడాన్నీ, నిర్ణయింప తగి వుండడాన్నీ ఇది నివారించదు అని రాశాడు. ’ఇది’ అంటే, ముందు చెప్పిన పరిస్తితి. సర్వీసులవిలువ రెవిన్యూతో మారటం. ఒక్క అంశాన్ని గురించి మార్క్స్ చెప్పినదాన్ని అన్ని అంశాలకూ వర్తింపచేయటం తప్పు.
5. పరిచయం 3వ భాగం 377 వ పేజీలోకి పోదాం.
"పారిశ్రామిక కార్మికులలో అతి తక్కువ జీతాలు గల (వరస్ట్ పెయిడ్) వారూ వ్యవసాయ కార్మికులూ కలిసి కార్మికవర్గంలో మెజారిటీగా ఉంటారు. వీరిగురించే పట్టించుకునేలా ఈ పుస్తకం పరిమితులు మనల్ని ఒత్తిడి చేస్తాయి.”
మూలంలో "...to concern chiefly with..." అని వుంటుంది.chiefly అనే పదం అనువాదంలోకి రాలేదు. ఫలితం ఈరెండు రకాల వాళ్ళను గురించి మాత్రమే పట్టించుకున్నట్లయింది. కాని మార్క్స్ చెప్పింది ప్రధానంగా వాళ్ళ గురించి అని. అంటే ఇతరులగురించి కూడా కొంత పట్టించుకోవడం ఉన్నట్లే.
6. సాపేక్ష అదనపు జనాభాలో అట్టడుగు పొర బికారితనంలో ఉంటారంటు మార్క్స్ వాళ్ళెవరెవరో చెబుతాడు:
"Exclusive of vagabonds,criminals, prostitutes, in a word, tha dangerous classes, this layer of society consists of three categories" - Capital 1, page 602.
దేశదిమ్మరుల్నీ, నేరస్తుల్నీ, వేశ్యల్నీ -ఒక్కముక్కలో ప్రమాదకరవర్గాల్ని మినహాయిస్తే ఈపొరలో మూడు కేటగిరీల వాళ్ళున్నారు- అని దీనర్ధం.
పరిచయంలో అనువాదం ఇందుకు భిన్నంగా వుంది:
"ప్రత్యేకంగా, దేశదిమ్మరులూ, నేరస్తులూ, వేశ్యలూ, - ఒక్కమాటలో చెప్పాలంటే 'ప్రమాదకర వర్గాలు,' సమాజంలోని ఈపొరలో 3 రకాల వాళ్ళున్నారు"- పరిచయం-5, పేజి 522.
దేశదిమ్మరులూ, నేరస్తులూ, వేశ్యలూ కాకుండా మరొక మూడు రకాల వాళ్ళు ఈ పొరలో వున్నారు అనే భావం అనువాదంలో రాలేదు.
Exclusive అంటే 'ప్రత్యేకంగా' కాదు. 'మినహాయించిన 'అని. ఇక్కడ 'వాళ్ళే కాకుండా ' అనో 'వాళ్ళని మినహాయిస్తే' అనో అనువదించాలి.* [17]
7. పరిచయం-5, 452 వ పేజీలో ఇలా ఉంది:
".... ఆ కార్మికులు ఇప్పుడు 'అదనపు జనాభా 'లో భాగంగావుంటారు."
మూలంలో 'తాత్కాలిక అదనపు జనాభా 'అని ఉంది.
"They now form a part of temporary surplus population." - Theories of Surplus Value, vol II, page:497
Temporary అనే మాట అనువాదంలో ఎగిరిపోయింది.
8. "...we assume that the merchant does not enrich himself by depressing wages" Capital III -page:293.
వర్తకుడు ధనం పొందుతున్నది వేతనాలు తగ్గించడం ద్వారా కాదని భావిద్దాం (assume) అంటున్నాడు మార్క్స్.
రంగనాయకమ్మగారి ప్రకారం ఇది వ్ assumption కాదు. వాస్తవం.
" వర్తకుడు ధనం పొందేది, తన కార్మికులకు శ్రమశక్తి విలువగా వుండే జీతాలు ఇవ్వడం ద్వారా కాదు." -పరిచయం-5, పేజీ 62.
ఇదేకదు. ఇంతకన్నా పెద్ద తప్పుందిక్కడ, గమనించి వుంటారిప్పటికే.
"by depressing wages" అంటే 'జీతాలు ఇవ్వడం ద్వారా' అని అర్ధమా? కాదు, 'జీతాలు తగ్గించడం ద్వారా ' అని.
9.'ఇలాఉండవచ్చు 'అన్నట్లుగా మార్క్సు చెప్పిందాన్ని 'ఉన్నదంతా అలానే 'అయినట్లుగా చేసిన తీరు చూద్దాం.
"కానీ సరుకుల విలువ  నుంచీ వాటి వుత్పత్తి ధరలు తేడాగా వుంటాయి కాబట్టి........" - పరిచయం 4, పేజీ:277.
'తేడాగా వుంటాయి' అని బల్లగుద్ది చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే, అదనపువిలువా, లాభమూ ఒకే పరిమాణంలో వున్న సందర్భాల్లో సరుకుల విలువ నుంచి వుత్పత్తిధరలు తేడాగా వుండవు.*[18] అలాంటి అవకాశం లేదనడం కుదరదు. అందుకే మార్క్సు 'తేడాగా వుండవచ్చు ' అన్నాడే కానీ రంగనాయకమ్మ గారిలాగా 'తేడాగా వుంటాయి' అంటూ నిర్ధారించలేదు. ఇప్పుడు మూలంలో చదువుదాం:
"Since the price of production may differ from the value of a commodity" Capital III, page: 164
10. మార్క్సు ఒక అంశాన్ని మరుగుపరచడం గురించి చెబితే, రంగనాయకమ్మగారు రెండు అంశాల్ని మరుగుపరచడంగా రాశారు:
"ధర రూపం అనేది 'విలువ ' కీ 'ధర 'కీ మధ్య [అంటే విలువకీ దాని డబ్బు వ్యక్తీకరణకీ మధ్య] ' పరిమాణాత్మకమైన పొంతనలేని తనాన్ని మరుగుపరచడమే కాకుండా విలువకు సంబంధించి గుణాత్మకమైన పొంతనలేని తనాన్ని కూడా మరుగుపరుస్తుంది." -పరిచయం 4, పేజీ:280.
"The price form, however, is not only compatible with the possibility of a quantitative incongruity between magnitude of value and price i.e. between the former and its expression in money, but it may also conceal a qualitative inconsistency,..." Capital-1 page:104-105
"ధర రూపం అనేది విలువ పరిమాణానికీ, ధరకీ... మధ్య పరిమాణాత్మక పొంతనలేనితనం వుండే అవకాశానికి తగివుండడమే కాకుండా,గుణాత్మక  పొంతనలేనితనాన్ని మరుగు పరచవచ్చు..." అంటాడు. మార్క్సు గుణాత్మకమైన పొంతనలేనితనాన్ని మరుగుపరచవచ్చన్నాడు కానీ, "పరిమాత్మకమైన పొంతనలేనితనాన్ని మరుగు” పరుస్తుందనలేదు. అనువాదం మరొక అడుగు ముందుకువేసి 'పరిమాత్మకమైన పొంతనలేనితనాన్ని’ కూడా 'మరుగు 'పరుస్తుందని చెబుతుంది.
అంతేకాదు. మార్క్సు గుణాత్మకమైన పొంతనలేని తనాన్ని గురిచయినా మరుగుపరచవచ్చు 'అన్నాడే కాని ' మరుగుపరుస్తుంది ' అనలేదు. కానీ పరిచయంలోని అనువాదం 'మరుగు పరుస్తుంది 'అని తేల్చివేసింది.
11. మార్క్సు, తన గతితార్కిక పద్ధతికీ, హెగెల్ గతితార్కిక పద్ధతికీ ఉన్న తేడా గురించి చెబుతూ –
“ To Hegel, the life-process of the human brain, i.e., the process of thinking, which under the name of ‘the idea’, he even transforms into an independent subject, is the demiurgos of the real world, and the real world is only the external, phenomena form of ‘the idea’.”- అన్నాడు.Capital 1, page: 29
పరిచయంలో దీని అనువాదం ఇదీ -"హెగెల్ ప్రకారం: మనిషి మెదడుకి చెందిన జీవక్రమం, అంటే ఆలోచనాక్రమం, ఏదైతే భావం పేరుతో వుంటుందో అది(దేనినైతే అతను ఆఖరుకి ఒక స్వతంత్రవిషయంగా మార్చివేశాడో అది), నిజప్రపంచపు మానవాతీతశక్తి. ఈనిజప్రపంచమేమో 'భావానికి 'సంబంధించిన అసాధారణ బాహ్యరూపం మాత్రమే."- పరిచయం-5, పేజీ: 634.
మూలంలో ఉన్న 'demiurgos' అనువాదంలో 'మానవాతీత శక్తి' అయింది. కానీ demiurgos అంటే 'మానవాతీత శక్తి 'కాదు. సృష్టికర్త. సృష్టికర్త మానవాతీత శక్తేకదా అనవచ్చు! అయితే దెయ్యమూ, సైతానూ కూడా మానవాతీత శక్తులే. కనుక ఆపదం సరైన అనువాదంకాదు. అలాగే మూలంలో "external, phenomenal form" అని వున్నదాన్ని పరిచయంలో "అసాధారణ బాహ్యరూపం" అని అనువదించారు.'phenomenal' అంటే ఇక్కడ అర్ధం, 'ఇంద్రియాగోచర ', 'దృగ్గోచర '-అని. దానికి 'అసాధారణ' అనే అర్ధం కూడా ఉంది. కానీ ఇక్కడ అర్ధం మాత్రం 'ఇంద్రియాగోచర 'అనే.. మార్క్సు రచనల్లో, దాదాపు ప్రతిచోటా  ఈ అర్ధంతోనే ఉంటుంది. వాటిని చదివేవారికి సాధారణంగా ఈవిషయం తెలిసే ఉంటుంది. కానీ, పరిచయంలో మాత్రమిది 'అసాధారణ'o గా అనువాదమయింది.
పరిచయంలో అనువదించిన ఈకొటేషన్  తెలియందేమీ కాదు. 'మార్క్సిస్టు సిద్ధాంతం' అనే వ్యాసంలో 'తాత్విక భౌతికవాదం' గురించి రాస్తూ, ఇదే విషయాన్ని లెనిన్ కోట్ చేశాడు. అందులో డెమియుర్గోస్ (demiurgos) పక్కనే బ్రాకెట్లలో 'సృష్టికర్త, నిర్మాత '( the creator, the maker)-అని ఉంది. ఈవ్యాసాన్ని కొండేపూడి లక్ష్నీనారాయణగారు తెలుగులోకి అనువదించారు.*[19] 'మార్క్సిజం మౌలిక సమస్యలు 'అనే పుస్తకంలో ప్లెహనోవ్ కూడా ఈకొటేషన్ ని ఇచ్చాడు. దానిని నిడమర్తి ఉమారాజేస్వరరావుగారు అనువదించారు. ఇందులోకూడా demiurgos ని సృష్టికర్త 'అనే అనువదించారు.  phenomenal ని ఇంద్రియాగోచర అని తెలుగు చేశారు*.[20] పరిచయంలో ఉన్నట్లు ఎవ్వరూ చెయ్యలేదు, చెయ్యబోరు.
12. The German Ideology, 67వ పేజీలో -
"The rulingideas are nothing more than the ideal expression of the dominant material relations....." అని ఉంది.
భావాలనేవి, భౌతికసంబంధాలకు భావరూప వ్యక్తీకరణలేనని తెలియని మార్క్సిస్టులెవరూ ఉండరు. మార్క్స్, ఎంగెల్స్ లు ఇక్కడ చెబుతున్నది ఆవిషయాన్నే.
"పాలకభావాలు అనేవి, ప్రబలమైన భౌతిక సంబంధాలకు భావరూప వ్యక్తీకరణే తప్ప వేరొకటి కాదు..." అంటున్నారు.
పరిచయం- 5 లోని 652 వ పేజీలో దీన్నిలా అనువదించారు.-
"పాలక వర్గ భావాలు అనేవి, ప్రబలంగా వున్న భౌతిక సంబంధాలకు ఖచ్చితమైన వ్యక్తీకరణ తప్ప ఇంకేమీ కాదు."
'భావాత్మక' అనో 'భావరూప 'అనో  అనువదించాల్సిన idealని 'ఖచ్చితమైన 'అని అనువదించారు. 'భావాత్మక 'అనడానికీ 'ఖచ్చితమైన 'అనడానికీ ఎంతో తేడా ఉంది. Ideal అనేదాన్ని 'ఖచ్చితమైన 'అని అనువదించడంలో ఏమాత్రం ఖచ్చితత్వం లేదు.
13."సమాజంలో సహజంగా ఏర్పడ్డ భిన్న వృత్తుల్న్ని వర్క్ షాపులో ఒక క్రమ పద్ధతిలో వున్నత స్థాయికి చేర్చడం ద్వారానూ, వాటిని పునరుత్పత్తి చెయ్యడంద్వారానూ, మాన్యుఫాక్చర్, స్పెషలైజ్డ్ శ్రామికుడికి నైపుణ్యాన్ని ఇస్తుంది"- పరిచయం-3, పేజీ:35-36
ఈపునరుత్పత్తి చేసేదీ, ' క్రమపద్ధతిలో వున్నత స్థాయికి ' చేర్చేదీ- వేటిని? భిన్న వృత్తుల్ని.అంటే రకరకాలుగా వున్న వృత్తుల్ని.కానీ మూలంలో "వృత్తుల విభజనని పునరుత్పత్తి చెయ్యదం ద్వారానూ, వర్క్ షాప్ లోపల క్రమపద్ధతిలో చివరికంటా తీసుకెళ్ళడం ద్వారానూ..." అని వుంది. (" by reproducing, and systematically driving to an extreme within the workshop..." - Capital-1, page"321)
వృత్తుల 'విభజన 'ని గురించి చెబుతున్నది భిన్న వృత్తుల గురించి చెబుతున్నట్లు అనువాదమయింది.
14."The prerequisites for the capitalist mode of production...are the following" capital-3-page:618
"పెట్టుబడిదారీ ఉత్పత్తివిధానానికి పూర్వషరతులు ఇవీ" అని మార్క్సు చెబుతున్నాడు. పరిచయం-5 లోని 271 వ పేజీలో " పెట్టుబడిదారీ వుత్పత్తి విధానానికి లక్షణాలు ఇవీ"- అని అనువాదం చేశారు. 'పూర్వ షరతులు 'కి బదులుగా 'లక్షణాలు 'అని చేశారు.'పూర్వషరతులు ' అంటే ఆవిధానం రావడానికి ముందుగా వుండవలసినవి. 'లక్షణాలు ' అనేవి ఆవిధానంతో వచ్చేవి.
అనువాదం చెయ్యడానికి 'మూలం ' ఉండటమన్నది ‘పూర్వ షరతు’. కానీ అనువాదానికి మూలం ‘లక్షణం’ కాదు. ‘పూర్వషరతు’ కీ ‘లక్షణాని’కీ అంత తేడా ఉంది.
15."వర్తకుడికేమో, చలామణీ ఖర్చులు, వాటి పరిమాణానికి తగ్గట్టుగా వచ్చే జనరల్ లాభం రేటుకి మూలంగా వుంటాయి"- పరిచయం-5, పేజీ-57
దీనికి మూలం ఇదీ: "To the merchant they appear as a source of his profit, proportional, given the general rate of profit, to their size" Capital3-page:301
" జనరల్ లాభం రేటుకి మూలంగావుంటాయి" - అని అనువాదంలో ఉంది. కాని మార్క్సు " లాభానికి మూలంగా కనిపిస్తాయి" అనిచెప్పాడు.'లాభం' అనడానికీ 'లాభం రేటు 'అనడానికీ ఎంతో తేడా ఉంది.
మార్క్సు చెప్పేప్రకారం: ఒక నిర్దిష్టమైనలాభం రేటు ఉన్నప్పుడు, చలామణీ ఖర్చుల పరిమాణం లాభానికి మూలంగా వర్తకునికి కనిపిస్తుంది. ఉదాహరణకి  లాభం రేటు 20% ఉందనుకోండి.అప్పుడు చలమణీ ఖర్చులు 100 అయితే, 20 లాభం వస్తుంది. 200 అయితే 40 లాభం వస్తుంది. అంటే చలామణీ ఖర్చుల్ని లాభం వస్తున్నట్లుగా, లాభానికి చలామణీ ఖర్చులు మూలంగా ఉన్నట్లుగా వర్తకునికి కనిపిస్తుంది.
కానీ 'పరిచయం' లోని అనువాదం ప్రకారం చలామణీ ఖర్చులకి తగ్గట్లుగా వచ్చేది 'లాభం ' కాదు, 'జనరల్ లాభం రేటు’
అంటే చలామణీ ఖర్చులు 100 అయితే 20 లాభం రేటు ఉందనుకోండి. అప్పుడు 200 కి 40% లాభం రేటు ఉంటుంది. అంటే 100 కి 20 లాభం వుంటే, 200 కి80 లాభం అవుతుంది.(200 కి లాభం రేటు 40% కాబట్టి)
మార్క్స్ లాభం అన్నదాన్ని 'లాభం రేటు' గా అనువదించడం వల్లనే విషయం ఇంత అవకతవకగా తయారయింది.
16. "దోపిడీ స్థాయి ఇంత అని వున్నప్పుడు, ఒకశాఖలో వుత్పత్తి అయిన అదనపువిలువ రాశి 'సామాజిక పెట్టుబడి 'కి సంబంధించిన సగటు (జనరల్) లాభం రేటు ఏర్పాటుకి చాలా ముఖ్యం."   పరిచయం-4, పేజీ 278
మూలంలో _ "At a given degree of exploitation, the mass of surplus-value produced in a particular sphere of production is then more important for the aggregate average profit of social capital" - అని వుంది. Capital III -page167
ఇక్కడకూడా మార్క్సు లాభం మొత్తం (aggregate) గురించి చెబుతుంటే పరిచయంలో లాభం రేటు అని అనువా దంచేశారు.
17."......boards of numerous managers or directors are placed above the actual director, for whom supervision and management serve as a pretext to plunder the stock holders and amass wealth."- Capital- III, page:389.
"....వాస్తవ డైరెక్టర్ కంటే పైన, అనేక మంది మేనేజర్లా, డైరెక్టర్లా బోర్డులుంటాయి.స్టాక్ హోల్డర్లను దోచుకోవడానికీ, సంపద కూడబెట్టడానికీ, సూపర్విజనూ, మేనేజిమెంటూ అతనికి సాకుగా మాత్రమే వుపయోగపడతాయి."- అని మార్క్సు చెబుతున్నాడు.
పరిచయం-5 , 244వ పేజీలో ఇలా అనువాదం అయింది:
"...అనేకమంది మేనేజర్ల, లేదా డైరెక్టర్ల బోర్డులు వుంటాయి. సూపర్ విజనూ, మేనేజిమెంటూ అనేవి, వాళ్ళకి, వాటాదారుల్ని కొల్లగొట్టి సంపదని కూడగట్టుకోవడానికీ సాకులుగా వుపయోగపడతాయి."
మార్క్సు ప్రకారం కొల్లగొట్టడానికి సాకులుగా ఉపయోగపడేది "వాస్తవ డైరెక్టర్" కి. కాని అనువాదంలో డైరెక్టర్ల (లేక మేనేజర్ల) బోర్డులకు సాకులుగా వుపయోగపడుతున్నట్లుగా తయారయింది. కొల్లగొట్టడానికి సాకులుగా ఉపయోగించుకునే 'వాస్తవ డైరెక్టర్  మాత్రం హాయిగా తప్పుకున్నాడు.'
18. "దేన్నయితే ...రికార్డో వుత్పత్తి ఖర్చు (కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లేదా కాస్ట్ ప్రైస్) అనీ అంటాడో" -పరిచయం-4. పేజీ:279
మూలంలో - "Recardo calls price of production or cost of production" Capital III,page:198 "  
కాపిటల్ లో వున్న ప్రైస్ ఆఫ్ ప్రొడక్షన్, పరిచయంలో కాస్ట్ ప్రైస్ గా మారింది. కానీ,'కాస్ట్ ప్రైస్ ' కీ 'ప్రైస్ ఆఫ్ ప్రొడక్షన్ ' కీ చాలా తేడా వుంది.
కాస్ట్ ప్రైస్ = ప్రైస్ ఆఫ్ ప్రొడక్షన్ - సగటు లాభం.వీటి మధ్య ఇంత తేడా వున్నా, 'ప్రైస్ ఆఫ్ ప్రొడక్షన్ ' అనే ఇంగ్లీష్ మాటస్థానంలో, 'కాస్ట్ ప్రైస్’ అనే ఇంకోమాటని పరిచయంలోకి తెచ్చిపెట్టారు. మూలంలో ఒకటి ఉంటే అనువాదంలో ఇంకొకటి ఎందుకు పెట్టారో అంతుబట్టదు.
19. "The more advanced country sells its goods above their value even though cheaper than the competing countries-" Capital-III, p.238"
"ఎక్కువ పురొగమించిన దేశం తనసరుకుల్ని పోటీపడే దేశాలకన్నా చౌకగా అమ్ముతున్నప్పటికీ, వాటివిలువలకన్నా ఎక్కువకే అమ్ముతుంది."- అంటున్నాడు.
రంగనాయకమ్మగారేమో:" ఎక్కువ పురోగమించిన దేశం (మోర్ అడ్వాన్స్ డ్ కంట్రీ ) తను పోటీ పడుతున్న దేశాల సరుకులకంటే తనసరుకులు తక్కువ విలువతో వున్నప్పటికీ, వాటిని వాటి విలువలకన్నా ఎక్కువకి అమ్ముతుంది.." పరిచయం-5, పేజీ 344
'తన సరుకులు తక్కువతో ఉన్నప్పటికీ 'అని పరిచయంలో ఉంది కానీ కాపిటల్ లో లేదు. 'చౌకగా అమ్ముతున్నప్పటికీ 'అని కాపిటల్ లో వున్నది, అనువాదంలోకి రాలేదు. మార్క్సు చెప్పిందొకటి రంగనాయకమ్మగారు రాయలేదు. రంగనాయకమ్మగారు రాసిందొకటి మార్క్సు చెప్పలేదు.
20. "..as long as the capitalist mode of production continues to exist, interest bearing capital, as one of its forms, also continues to exist.." -Capital3, page 607
"పెట్టుబడిదారీ వుత్పత్తి విధానం ఉనికిలో కొనసాగినంతకాలమూ దాని రూపాల్లో ఒకటిగా వడ్డీ పెట్టుబడి కూడా ఉనికిలో ఉంటుంది... " అంటాడు.
పెట్టుబడి రూపాలలో వడ్డీపెట్టుబడి కూడా ఒకటి. అది పెట్టుబడిదారీ విధానం కొనసాగినంతవరకూ ఉనికిలో వుంటుంది, అని వడ్డీ పెట్టుబడి గురించి చెప్తున్నాడు. కాని వడ్డీ పెట్టుబడి అనేది పరిచయంలో అనువాదానికి నోచుకోలేదు.
"పెట్టుబడి దారీ విధానం వునికిలో కొనసాగినంత కాలమూ, దాని రూపాలలో ఒకటిగా 'క్రెడిట్ విధానం' కూడా వునికిలో వుంటుంది - పరిచయం 5 పేజీ 608.మూలంలో 'క్రెడిట్ విధానం ' అనేది ఉందేమో చూడండి.వడ్డీపెట్టుబడి స్థానంలో 'క్రెడిట్ విధానం ' పెట్టారు . ఎక్కడిదీ పదబంధం? అనువదించిన భాగంలో లేదు మిగిలిన వాక్యంలో ఉంది. "and constitutes in fact the basis of its credit system."
అంటే వడ్డీ పెట్టుబడి వాస్తవానికి క్రెడిట్ విధానానికి పునాదిగా ఉంటుంది- అని. ఇందులో ఉన్న క్రెడిట్ విధానాన్ని తీసుకుపోయి ముందుభాగానికి జోడించారు. దాంతో అక్కడుండాల్సిన 'వడ్డీ పెట్టుబడి 'తప్పుకుంది.
21.వెకిలి ఆర్ధికవేత్త (vulgar economist)అభిప్రాయాన్ని గురించి చెప్పే సందర్భం ఇది.
సరుకు పెట్టుబడీ, వర్తక పెట్టుబడీ, మనీడీలింగ్ పెట్టుబడీ అనేవి పెట్టుబడిదారీ వుత్పత్తి విధానం నుంచి ఆవిర్భవించాయి. అంతకుముందున్న వుత్పత్తి విధానాలలో ఇవి లేవు. కాని వెకిలి అర్ధికవేత్త అభిప్రాయంప్రకారం ఇవన్నీ 'దానికదిగా ఉత్పత్తిక్రమం ' నుంచే (' పెట్టుబడిదారీ వుత్పత్తివిధానం, అనే ప్రత్యేకరూపంతో సంబంధం లేకుండా) పుట్టుకొస్తాయి. ఈవిషయాన్ని మార్క్సు  ఇలా చెప్పాడు:
"సరుకు పెట్టుబడినీ, డబ్బు పెట్టుబడినీ, ఆతర్వాత వర్తకపెట్టుబడినీ, మనీడీలింగ్ పెట్టుబడినీ దానికదిగా వుత్పత్తిక్రమం (process of production as such) నుండే అవసరంగా తలెత్తే రూపాలుగా రాబట్టడానికి అతను (వెకిలి ఆర్ధికవేత్త- మాది) పడే తంటాలు"
మూలంలో -"...his apologetic endeavours to deduce commodity  - capital and money - capital, and latter commercial capital and money-dealing capital as forms arising necessarily from the process of production as such..." Capital-III page:324
పరిచయం-5, 62-63 పేజీల్లో దీన్నిలా అను వధించారు:
"'సరుకు పెట్టుబడి' నీ, డబ్బు 'పెట్టుబడి' నీ; తర్వాత 'వర్తకపెట్టుబడి‘ నీ, 'మనీడీలింగ్ పెట్టుబడి' నీ - వుత్పత్తివిధానం అనే దాని నించే తప్పనిసరిగా పుట్టుకొచ్చే అంశాలుగా గ్రహించకుండా తప్పించుకోవడానికి అతను చేసే దొంగయత్నాలు"
ఆనాలుగు రకాల పెట్టుబడులూ 'ఉత్పత్తి విధానం’ నుంచి (దానిరూపంతో సంబంధం లేకుండా)పుట్టుకొచ్చినవేనని గ్రహించకుండా తప్పించుకోవడానికి దొంగయత్నాలు చేస్తాడట- వెకిలి ఆర్ధికవేత్త.
వీటన్నిటినీ " దానికదిగా వుత్పత్తివిధానం" నుంచే పుట్టుకొచ్చేవిగా చూపించడానికి తంటాలు పడుతుంటాడని మార్క్సు అంటే, అలా పుట్టుకొస్తాయని గ్రహించకుండా 'తప్పించుకోవడానికి దొంగయత్నాలు 'చేస్తున్నాడని అనువదించడం! అప్పటికి ఇవన్నీ అలా పుట్టుకొస్తాయని మార్క్సే అంటున్నట్లూ,  వెకిలి ఆర్ధవేత్త దాన్ని గ్రహించకుండా 'తప్పించుకోవడానికి దొంగయత్నాలు ' చేస్తున్నట్లూ తయారయింది.మార్క్సు వెకిలి ఆర్ధికవేత్త గురించి చెప్పింది మార్క్సుకే తగులుకుంది. వెకిలి ఆర్ధికవేత్తేమో అది (తను చెప్పిందే తనకు అంటకుండా 'దొంగయత్నాలు 'చేసున్నాడు. మార్క్సు చెప్పే దాని సారాంశం తల్లక్రిందులయింది.
కాపిటల్ ని తప్పుగా అనువదించిన బ్రాడ్ హౌస్  ని విమర్శిస్తూ How not to translate Marx, అనే వ్యాసంలో ఎంగెల్స్ అన్న మాటలే [21]*పరిచయంలో వున్న ఇలాంటి అనువాదాలకి కూడా సరిపోతాయి:
"చిన్న చిన్న తప్పుల్ని పక్కనబెడితే, మార్క్సు చెప్పిందానికి, సరిగ్గా వ్యతిరేకదాన్ని, మార్క్సే చెప్పేట్లుగా చేస్తాడు మిస్టర్ బ్రాడ్ హౌస్."
"మార్క్సు 'తెలుపు 'అన్నదాన్ని 'నలుపు 'అని ఎందుకు అనువదించకూడదో మిస్టర్ బ్రాడ్ హౌస్ కు అంతుబట్టదు."
                                                                                 “They appear as a sign of confused thinking.
                                                                           That is why they are called logical contradictions”
                                                                                                                                    -A.Spirkin, O.Yakhot
పరిచయం -1కి రాసిన ముందుమాటలో రంగనాయకమ్మగారు "ఇందులో వున్నదంతా....తర్కం.లెక్కలంత ఖచ్చితమైన తర్కం" అన్నారు.[22]* లెక్కలసంగతి ఇంతకు ముందే చుశాము. ఇక ఇప్పుడు 'తర్కం 'సంగతి కొద్దిగా చూద్దాం.
ఏవిషయమైనా తార్కికంగా సరిగా వుండాలంటే అందులో కన్సిస్టెన్సీ (consistency) వుండాలి[23]** అంటే, అందులో చెబుతున్న విషయాలమధ్య పొంతన వుండాలి. ఒకసారి ఒకరకంగా చెప్పిన తరువాత మళ్ళీ దానికి భిన్నంగాగానీ వ్యతిరేకంగావుండే రీతిలోగానీచెప్పగూడదు. ఖచ్చితంగా, నిర్దుష్టంగా చెప్పాలి. చివరివరకు ఒకలాగే చెప్పాలి. తేడాలుండకూడదు.ఒకసారి ఒకరకంగా ఇంకోసారి ఇంకోరకంగా చెబితే అది తర్కం అనిపించుకోదు. కానీ, అలాచెప్పిన సందర్భాలు కూడా పరిచయంలో వున్నాయి.
1. - "యంత్రాల్ని కనిపెట్టి, వాటితో వుత్పత్తిచెయ్యడం ప్రారంభమైనప్పటినించీ అది భారీపరిశ్రమగా మారింది." (పరిచయం-3, పేజీ:2). మళ్ళీ అదేపుస్తకంలోని 6వ పేజీలో "ఆటోమేటిక్ యంత్రాలద్వారా వుత్పత్తిజరగడం ప్రారంభమైనప్పటి నించీ అది 'భారీ పరిశ్రమ '."
ఈరెండు వాక్యాలూ కరెక్ట్ కావాలంటే యంత్రాలూ ఆటోమేటిక్ యంత్రాలూ ఒకటైనా అయ్యుండాలి, లేకపోతే రెండూ ఒకేసారి వుత్పత్తిలో ప్రవేశించయినా ఉండాలి. కాని అవి రెండూ ఒకటికావు.[24] ఒకేసారి ప్రవేశించనూ లేదు.
2. వస్తువు, సరుకూ గురించి పరిచయంలో వున్న గందరగోళం అంతాయింతా కాదు."...మారక సంబంధంలో వున్న వస్తువు, ఒక ఉపయోగపు విలువగల వస్తువుగా వుంటూనే, కొంత మారకం విలువగల సరుకుగాకూడా వుంటుంది. అంటే ఆసమయంలో దానికి వస్తువు లక్షణాలూ, సరుకులక్షణాలూ కూడా వుంటాయి. అయితే, ఆ 2 లక్షణాలూ దానికి ఏక కాలంలోనే వుండవు. అది వస్తువుగా వున్న క్షణాలలో సరుకుగా వుండదు; సరుకుగావున్న క్షణాలలో వస్తువుగా వుండదు."- (పరిచయం1, పేజీ:88)
'ఆసమయంలో' దానికి వస్తువు లక్షణాలూ సరుకు లక్షణాలూ 'కూడా' వుంటాయంటూ, మళ్ళీ ‘ఏకకాలంలోనే’ వుండవనడం! "వస్తువుగా వున్న క్షణాలలో వస్తువుగా వుండద"ట." సరుకుగా వున్న క్షణాలలో వస్తువుగా వుండ" దట. మరి "వస్తువు లక్షణాలూ, సరుకు లక్షణాలూ కూడా " ఆసమయంలోనే వుండటమంటే ఏమిటో?
3. పోనీ, "వస్తువుగా వున్న క్షణాలలో సరుకుగా వుండదు. సరుకుగా వున్న క్షణాలలో వస్తువుగా వుండదు." అనే దానిమీద నిలబడ్డారా అంటే అదీలేదు.
దాని పక్క పేజీలోనే "వస్తువుని సరుకు అని ఎప్పుడూ అనకూడదు. కానీ 'సరుకు'ని వస్తువు అనికూడా అనవచ్చు."..అంటారు.
' సరుకుగా వున్న క్షణాలలొ వస్తువుగా వుండ'నప్పుడు, సరుకుని వస్తువు అని కూడా ఎలా అంటారు? "ఆ 2 లక్షణాలూ దానికి ఏకకాలంలో వుండవు" కదా.
4. " మనుషులు తయారు చేసేవి 'వస్తువులు '. మనుషులతో సంబంధం లేకుండా ప్రకృతి సహజంగా తయారయ్యేవి వస్తువులు కావు, అవి ప్రకృతి సహజ పదార్ధాలు." (పరిచయం-1, పేజీ 69)
"ప్రతీ ఒక్క వస్తువూ, ప్రతీ ఒక్క పదార్ధం శ్రమవల్లనే తయారవుత్యాయి." (పరిచయం-1, పేజీ 69)
మొదటి కొటేషన్లో శ్రమలేకుండా వుండేదే 'పదార్ధం ' అని చెప్పారు.రెండో దాంట్లో 'ప్రతీ ఒక్క పదార్ధం శ్రమవల్లనే తయారవు 'తుందని పూర్తివ్యతిరేకంగా చెబుతున్నారు.
5. వస్తువులకి మారకం తప్పనిసరి కాదు. మారకం జరిగిన సందర్భాలలో మాత్రమే, ఆవస్తువులో వున్న శ్రమ విలువ అవుతుంది., జరగని సందర్భాలలో కాదు - అనే వుద్దేశ్యంతో " విలువగా అయ్యేది శ్రమే అయినా, శ్రమ అనేది తప్పనిసరిగా విలువగా  అవ్వాలనే నియమం లేదు" అంటూ " దీన్నే క్లుప్తంగా చెబితే, 'విలువ అంటే శ్రమే, కానీ శ్రమ అంటే విలువ కాదు.' " - అని సూత్రీకరించారు. (పరిచయం-1. పేజీ:85).
'విలువ అంటే శ్రమే ' అనడం వరకూ బాగానే వుంది కానీ, శ్రమ అంటే విలువ కాదు 'అని సూత్రీకరించడం తప్పు. ఎందుకంటే మారకం జరిగే సందర్భాల్లో, శ్రమ అంటే విలువే కాబట్టి.
మారకం జరిగినప్పుడే శ్రమ విలువ అవుతుంది, జరగనప్పుడు కాదు, అనేదాన్ని క్లుప్తంగా చెబితే 'శ్రమంటే విలువ కాదు ' అవుతుందా?ఎలా? కొన్నిసందర్భాలలో అనే అర్ధాన్నిచ్చే పదం అందులో ఏముంది?
దీనిని సరిగ్గా చెప్పాలనుకుంటే "శ్రమ ప్రతిసందర్భంలోనూ విలువ కాదు" అని చెప్పవచ్చు. అంతేగాని, ఒకపక్క మారకం జరిగినప్పుడు శ్రమ విలువ అవుతుందని చెబుతూ, ఇంకోపక్క 'శ్రమ అంటే విలువ కాదు' అని జనరలైజ్ చెయ్యడం తర్కం అనిపించుకోదు. ఇది "క్లుప్తంగా" చెప్పడం కాదు, తప్పుగా చెప్పడం.
6."పెట్టుబడిదారుడు ఖర్చుచేసే మొత్తం పెట్టుబడిలో ఒకభాగం 'ముడిపదార్ధాలు 'గానూ, ఇంకొభాగం 'శ్రమసాధనాలు 'గానూ వుంటుంది." (పరిచయం-2, పేజీ: 40)
"ముడిపదార్ధాల్నీ, శ్రమపరికరాల్నీ, ఆగ్జైలరీ పదార్ధాల్నీ, మొత్తం సరుకు తయారీలో కావలసిన అన్ని నిర్జీవ వస్తువుల్నీ కలిపే 'శ్రమ సాధనాలు 'అంటున్నామనే సంగతి మరచిపోవద్దు."  (పరిచయం 2, పేజీ: 44)
మొదటి కొటేషన్లో శ్రమసాధనాలూ, ముడి పదార్ధాలూ వేరువేరు అయినట్లు చెప్పారు. రెండో కొటేషన్లో ముడిపదార్ధాలు శ్రమసాధనాల్లో భాగమయినట్లు చెబుతున్నారు. వీటిలో ఏదో ఒకటే కరెక్టు కావాలి. రెండోది తప్పయి తీరాలి. మార్క్సు ప్రకారం అయితే ముడిపదార్ధాలు వేరూ, శ్రమసాధనాలు వేరూ.*[25]
రంగనాయకమ్మగారు 'పరిచయం ' చేసిన ఈపుస్తకానికి "మార్క్స్ కాపిటల్" అని పేరు పెట్టారు కాబట్టి, ఇందులో వున్న తప్పులన్నీ మార్క్సు రాసినవేనేమోననిపించవచ్చు. కానీ పరిచయంలో వున్న గందరగోళానికి 'కాపిటల్ 'తో ఏమాత్రం సంబంధంలేదు. పూర్తిగా వారి సొంతం.
మార్క్సు శ్రమకలిసిందే వస్తువు (థింగ్)అని ఎక్కడా చెప్పలేదు. ప్రకృతిసహజపదార్ధాల్ని కూడా వస్తువులన్నాడు*[26] కానీ రంగనాయకమ్మగారి ప్రకారం "ప్రకృతిసహజంగా తయారయ్యేవి వస్తువులు కావు." మార్క్సు శ్రమసాధనాలలో ముడిపదార్ధాల్ని చేర్చలేదు. రంగనాయకమ్మగారు అలా చేర్చిన సందర్భాలు చాలా వున్నాయి.
అంతేకాదు, " 'శ్రమసాధనాలు ' అన్నా, 'వుత్పత్తిసాధనాలు ' అన్నా ఒకటే "నని పరిచయం-2 లోని 37 వపేజీలోనూ, 321 వ పేజీలోనూ కూడా రంగనాయకమ్మగారు చెప్పారు. కానీ మార్క్సు ప్రకారం శ్రమసాధనాలు, వుత్పత్తి సాధనాలలో భాగం మాత్రమే.**[27]
ఆఖరికి, సరుకులో వైరుధ్యం గురించి కూడా పరిచయంలో తప్పే చెప్పారు.
"సరుకులొ వుండే వుపయోగపువిలువా, విలువా విరుద్ధాంశాలు. ఇవి ఒకటి వున్నచోట ఒకటి వుండవు. ఇది 'సరుకు 'లోవున్న వైరుధ్యం." (పరిచయం-1, పేజీ: 196)
విరుద్ధాంశాలు కలిసివుండడమే వైరుధ్యం. ఒకటివున్నచోట ఒకటి వుండకపోతే అది వైరుధ్యమే కాదు.
"వాస్తవమేమిటంటే, ఏవిరుద్ధాంశమైనా విడిగా వుండలేదు. దాని వ్యతిరేకాంశం అనేది లేనప్పుడు దాని వునికికి కావలసిన పరిస్థితినే అది కోల్పోతుంది."[28] అంటాడు మావో.
కానీ, రంగనాయకమ్మగారు మాత్రం ఒకటి వున్నచోట ఒకటి వుండక పోవడమే వైరుధ్యం అంటారు. సరిగ్గా వ్యతిరేకంగా!
- 'గిల్డు ' గురించి రంగనాయకమ్మగారి అభిప్రాయం మరీ విడ్డూరం.
"గిల్డు అంటే నేతగానీ, కుట్టుగానీ, కమ్మరంగానీ, వడ్రంగం గానీ, ఏదోఒక వృత్తి (పని) జరిగే స్థలం" అట.(పరిచయం 3, పేజీ:2)
గిల్డు అంటే ‘పనిస్థలం' కాదు, ‘వృత్తిసంఘం '. ఏడిక్షనరీలోనైనా దీని అర్ధం వుంటుంది. 'కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక 'లోకూడా స్పష్టంగా వుంది. తెలుగులో గిల్డు అనే దానిని ఎవరైనా 'వృత్తిసంఘం' అనే రాశారు కానీ 'పనిస్థలం ' అని ఎవరూ రాయలేక పోయారు - ఒక్క రంగనాయకమ్మగారు తప్ప.
మార్క్స్ రాసిన కాపిటల్ కీ రంగనాయకమ్మగారు పరిచయంచేసిన మార్క్స్ కాపిటల్ కీ ఎన్నో తేడాలున్నాయి. వాటిలో కొన్ని ఇక్కడ చూపించాము. వీటితో అయిపోలేదు. ప్రధానమైన విషయాలలో సైతం పరిచయంలో తప్పులు జరిగాయి. విలువగురించీ, విలువరూపం గురించీ పరిచయంలో చెప్పినదాంట్లో లొసుగులున్నాయి.
అదనపువిలువ సిద్ధాంతం గురించి మార్క్స్ చెప్పేదొకటైతే, రంగనాయకమ్మగారు చెప్పిందింకొకటి. మార్క్స్ గతితర్కం 'పరిచయం' లో గందరగోళంగా మిగిలింది.
ఒకవిషయంలో ఎంగెల్స్ రాసింది సందేహాలకు దారితీస్తుందని అన్నారు.
ఉత్పాదక అనుత్పాదక శ్రమలవిషయంలో మార్క్సే తప్పుగా వున్నట్లు చెప్పారు.
అయితే వీటి గురించి వివరంగా రాయవలసి వుంది.
రంగనాయకమ్మగారు అరిస్టాటిల్ పరిశోధన ప్రారంభించాడని చెప్పేనాటికి ఆయన చనిపోయి 22 సంవత్సరాలయింది.
"విలువ అంటే శ్రమ" అనే సూత్రీకరణ రాజకీయార్ధికశాస్త్రానికే మూలస్తంభం లాంటిది. అయినా దాన్ని మొదట ఎవరు సూత్రీకరించారు, ఎప్పుడు సూత్రీకరించారు - అనే వాటిలో కూడా 'పరిచయం'లో తప్పే ఉంది.
'కాపిటల్ 'లో వున్న లెక్కలన్నీ చిన్నవే. సాధారణంగా ఎవరికైనా తెలిసివుండేవే. అయినా ఈ లెక్కలలో కూడా పరిచయంలో తప్పులు ఉన్నాయి.
రూపాయల్ని భాగించినప్పుడు వచ్చేది కూడా రూపాయలే గానీ, పైసలు కాదు.
పైవన్నీ (లవాలన్నీ)కలిపి, కిందవన్నీ (హారాలన్నీ)కలిపి, భిన్నాల కూడికని చేస్తే లెక్కతప్పు వస్తుందనేది చాలా సాధారణ విషయం. కానీ, రంగనాయకమ్మగారు సరిగ్గా అదే చేశారు
Ideal అనేదాన్ని 'ఖచ్చితమైన 'అని అనువదించడంలో ఏమాత్రం ఖచ్చితత్వం లేదు.
మార్క్సు వెకిలి ఆర్ధికవేత్త గురించి చెప్పింది మార్క్సుకే తగులుకుంది.
ఆఖరికి, సరుకులో వైరుధ్యం గురించి కూడా పరిచయంలో తప్పే చెప్పారు.
'గిల్డు ' గురించి రంగనాయకమ్మగారి అభిప్రాయం మరీ విడ్డూరం.




*పరిచయం-1-2వ ముద్రణ,14 వ పేజీ (పరిచయం-1 నుంచి ఇచ్చిన కొటేషన్లన్నీ, ప్రత్యేకించి చెప్పనప్పుడల్లా 3 వ ముద్రణ నుంచి ఇచ్చినట్లు)
[1] Karl Marx, A biography, progress Publishers, Moscow, 1984, page-372
[2] Marx Engels  Selected correspondence, progress Publishers, Moscow, 1982, page-180
[3] 'కాపిటల్ ప్రచురణ కధా(ఎ.ఉరొయేవా పుస్తకానికి తెలుగు అనువాదం)విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 1979, 26 వ పేజీ.
[4] ఈరచనని 1859 లోనే, మార్క్స్ రాశాడన్న విషయం 'పరిచయం-1' లోని 10,16 పేజీలలో కూడా ఉంది.
[5] Terrell Carver రాసిన ‘Marx & Engels the intellectual relationship’ (1983) –page-1
[6] Karl Marx, Capital, Vol:1, Progress publishers Moscow, 1986 page:433
[7] . Karl Marx, ‘Theories of Surplus Value’-1-p 355
[8] . Karl Marx, A Contribution to the Critique of political Economy, progress publishers, Moscow, 1989,p-61
[9] మార్క్స్ ఎంగెల్స్ సంకలితరచనలు-భాగం2,1981,39 వ పేజీ
[10] .Everyman’s Encyclopaedia vol 1 p406
[11]  CapiTal III -page 440
[12] పరిచయం-5 పేజీ 193
[13] CapiTal III -page 440
[14] పరిచయం-5 పేజీ 193
[15]  Capital-1-page29
[16] పరిచయం-5 పేజీ 635
[17] .* జర్మన్ నుంచి EdenCedar Paul లు చేసిన అనువాదంలో " Excluding Vagabonds, criminals and prostitutes.... అని వుంది.(Capital, page:711)
[18] * “1) 80c + 20v + 20s. rate of profit = 20%
           Price of product = 120 value=120…… in branches of production in which the composition happens to coincide with the social average, would value and price of production be equal,”- Capital: vol: III, page: 164.
[19] * లెనిన్ సంకలిత రచనలు (9 సంపుటాల్లో) 1వ సంపుటం, పేజీ: 18
[20] * ప్లెహనోవ్, మార్క్సిజం మౌలిక సమస్యలు, పేజీ:40
[21] * See : Homage to Karl Marx, 1969, pages 72,74
(ఇంగ్లిష్ కొటేషన్లు అన్ని పరిచయంలో చెప్పిన ఎడిషన్లలోవే. పరిచయంలోని అనువాదాలలో తప్పుగావున్న భాగం వరకే కోట్ చేశాము)
[22]  *పరిచయం -1, పేజీ:21
[23]  ** “ The laws of logic are the laws of consistency.” –The Open philosophy and the Open Society, by Maurice Cornforth,1970, page:76
[24] * See Capital 1-page: 360
[25] * See: Capital, vol : 1, pages 174&176
[26] * See: Capital, vol : 1, pages: 48&174
[27] ** See: Capital, vol : 1, page : 176
[28] *Selected works of Mao Tse-tung, 1975, vol: 1, page 338

5, ఏప్రిల్ 2016, మంగళవారం

రంగనాయకమ్మ పరిచయం చేసింది మార్క్సునేనా?

రంగనాయకమ్మ పరిచయం చేసింది మార్క్సునేనా?
వీక్షణం 2016 ఏప్రిల్ సంచికలో వచ్చింది                                            ఇ.యస్.బ్రహ్మాచారి
మార్క్స్ కాపిటల్ పరిచయం పేరుతో రంగనాయకమ్మగారి రచన వెలువడిన తర్వాత ‘మార్క్స్ చెప్పిందేమిటీ? రంగనాయకమ్మగారు రాసిందేమిటి? అని దిలీప్, నేను కలిసి 1994 ఫిబ్రవరిలో ఒక 28 పేజీల చిన్న పుస్తకం అచ్చువేశాం. “అదనపు విలువ సిద్ధాంతం గురించి మార్క్స్ చెప్పిందొకటైతే, రంగనాయకమ్మగారు చెప్పిందింకొకటి. అలాగే ఉత్పాదక అనుత్పాదక శ్రమల విషయంలో మార్క్సే తప్పుగా ఉన్నట్లు చెప్పారు. వీటి గురించి తరవాత వివరంగా రాయవలసి వుంది” అని ఆ పుస్తకాన్ని ముగించాము. ఆ తర్వాత ఆమె తన పాత పరిచయానికి సవరణలు చేసి కొత్త పరిచయం (2004) కూడ ప్రచురించారు. ఇప్పుడు వీక్షణం 2013 జూన్, జులై సంచికల్లో ‘శ్రమశక్తి ఉపయోగపువిలువ గురించి’అనే వ్యాసంలో ఆమె మరికొన్ని ప్రతిపాదనలు చేశారు.
అదనపు విలువ విషయంలో రంగనాయకమ్మ గారి తప్పుడు వాదనల గురించి వీక్షణం 2015 సెప్టెంబర్ సంచికలో ‘అదనపు విలువ గురించి మార్క్స్ చెప్పిందేమిటి?’, వీక్షణం 2016 జనవరి సంచికలో వాగ్నర్ నుంచి రంగనాయకమ్మ వరకు కాపిటల్ వక్రీకరణలు’  వ్యాసాల్లో చర్చించాను. ఆ వ్యాసాలను క్రోడీకరిస్తే,
మార్క్స్ చెప్పింది
రంగనాయకమ్మగారు చెప్పింది
పెట్టుబడికీ శ్రమశక్తికీ  సమాన మారకం
అసమాన మారకం
మారకం ఉంది
అసలు మారకమే లేదు
శ్రమశక్తి సరుకు
శ్రమశక్తి సరుకు కాదు

మార్క్స్ చెప్పినదీ రంగనాయకమ్మగారు రాసినదీ వేరు వేరు మాత్రమే కాదు, వ్యతిరేకమయినవి. అసమాన మారకం (ఇచ్చేది తక్కువ పుచ్చుకునేది ఎక్కువ) వల్లనే పెట్టుబడిదారు అదనపు విలువ పొందుతాడు అని మార్క్స్ కి ముందు కొందరు భావించారు. ఆ వాదం శాస్త్రీయమైనది కాదనీ, సమాన మారకం జరుగుతూనే అదనపు విలువ ఏర్పడుతుందనీ మార్క్స్ చెప్పాడు. వాళ్లు అనుకున్నట్టుగా మారకం జరిగేది శ్రమకీ, పెట్టుబడికీ కాదనీ, శ్రమశక్తికీ పెట్టుబడికీ అనీ శ్రమశక్తి అనే కొత్త భావనను ప్రవేశపెట్టాడు. ఆ ఆధారం మీదనే అదనపు విలువని రుజువు చేశాడు. మరి అందుకు భిన్నంగా ‘అసమాన మారకం’, ‘మారకమే లేదు’, ‘శ్రమశక్తి సరుకే కాదు’ అని వాదించడం అంటే మార్క్సుని తోసివేసినట్టే.
ఇక్కడే మరొక విషయం ఉంది. గతంలో అసమాన మారకం అన్నవాళ్లు కూడ ‘మారకం లేదు’ అనలేదు. అసమాన మారకం అన్నా మారకం ఉన్నట్టే. కాని ‘అసమాన మారకం’ అంటూనే ‘మారకం లేదు’ అనడం రంగనాయకమ్మగారి సొంతం. రంగనాయకమ్మగారి పరిచయంలో పెట్టుబడిదారుడికీ, కార్మికులకూ మధ్య అసలు మారకమే లేదు అని ఒక ఉప అధ్యాయమే ఉంది. మారకమే లేకపోతేశ్రామికుడు పనిస్థలంలోకి వచ్చి ఎందుకు పనిచేస్తాడు? మారకం జరిగితేనే, ఉత్పత్తి ప్రక్రియ మొదలు అవుతుంది. కనుక మారకం అనివార్యం.
రంగనాయకమ్మ గారు పరిచయంలో శ్రమశక్తి సరుకు అనే రాశారు. అది సరుకు కాదని అనలేదు. వీక్షణం వ్యాసంలో (2013 జూన్, జులై - 'శ్రమశక్తి ఉపయోగపువిలువ గురించి') ‘శ్రమశక్తి సరుకు కాదు’ అని కొత్తగా ప్రతిపాదించారు. అలా ఆమె మార్క్స్ మౌలిక ప్రాతిపదికనే మారుస్తున్నారు. అంటే ఆమె తన పరిచయాన్ని 'శ్రమశక్తి సరుకు కాదు' అనే దానికి అనుగుణంగా తిరగరాయాల్సి వుంటుంది. అదనపు విలువ సిద్ధాంతం గురించి మార్క్స్ చెప్పిందొకటైతే, రంగనాయకమ్మగారు చెప్పిందింకొకటి అవుతుంది.
**
ఇక ఉత్పాదక అనుత్పాదక శ్రమలగురించి చూద్దాం.
పెట్టుబడిదారు శ్రామికుని శ్రమశక్తిని కొంటాడు. అంటే, శ్రమశక్తికీ పెట్టుబడికీ మారకం జరుగుతుంది. శ్రమశక్తి యజమానికి అమ్ముకునేందుకు సరుకుల్ని ఉత్పత్తి చేస్తుంది. అదనపు విలువని ఉత్పత్తిచేస్తుంది. పెట్టుబడిదారు పెట్టిన డబ్బుని పెంచుతుంది. అటువంటి శ్రమ ఉత్పాదక శ్రమ. వీటిలో ఏదైనా ఒకే సారాన్ని తెలుపుతుంది. పెట్టుబడితో మారకం జరిగే శ్రమ, యజమాని కొరకు సరుకుల్ని ఉత్పత్తిచేసే శ్రమ, అదనపు విలువని ఉత్పత్తిచేసే శ్రమ,యజమాని డబ్బుని పెంచే శ్రమ అంటూ ఉత్పాదకశ్రమని మార్క్స్ నిర్వచించాడు. మార్క్స్ మాటల్లో “డబ్బుని పెట్టుబడిగా మార్చే శ్రమ ఉత్పాదక శ్రమ”(అదనపు విలువ సిద్ధాంతాలు 1.399), “అదనపు విలువని నేరుగా ఉత్పత్తిచేసే శ్రమ ఉత్పాదక శ్రమ” (కాపిటల్, పెంగ్విన్ 1.1038), “ఉత్పాదక శ్రామికుడు శ్రమశక్తిని కొన్నవాడికి సరుకులు ఉత్పత్తిచేస్తాడు.” (అ.వి.సి. 1.160).
పెట్టుబడితో కాక వ్యక్తుల ఆదాయంతో మారకం జరిగినప్పుడు అనుత్పాదక శ్రమ. ఉపయోగపు విలువలను ఉత్పత్తి చేసే శ్రమ, విలువని ఉత్పత్తి చెయ్యని శ్రమ అనుత్పాదక శ్రమ. మార్క్స్ మాటల్లో “అదనపు విలువని ఉత్పత్తి చెయ్యని శ్రమ అనుత్పాదక శ్రమ”, “అనుత్పాదక శ్రామికుడు ఉపయోగపు విలువలు ఉత్పత్తిచేస్తాడు.” (అ.వి.సి. 1.160)
రంగనాయకమ్మగారు ఈ నిర్వచనాలను ఆమోదించారు: వారిమాటల్లో: “అదనపు విలువని ఉత్పత్తి చెయ్యని శ్రమ అనుత్పాదక శ్రమ” (కొత్త పరిచయం, 2004, 1.421), “విలువగా మారకుండా ఉపయోగపు విలువగానే ఖర్చయ్యే శ్రమ అదనపు విలువని ఇవ్వదు, అందులో అదనపు శ్రమ ఉన్నప్పటికీ. అది అనుత్పాదక శ్రమ అవుతుంది” (కొత్త పరిచయం 1.422)
రెంటికీ తేడా అదనపు విలువని ఉత్పత్తి చెయ్యడం, చెయ్యకపోవడం. అంతే, మరే అంశంతోనూ సంబంధంలేదు.
ఆడం స్మిత్ ఉత్పాదక శ్రమకూ, అనుత్పాదక శ్రమకూ చెప్పిన తేడాను రికార్డో, సిస్మాండిలు ఆమోదించారు. రెంటికీ తేడా ఏమంటే, ఒకటి ఎప్పుడూ తన శ్రమని పెట్టుబడితో మారకం చేసుకుంటుంది, మరొకటి తన శ్రమని ఎప్పుడూ దేశ ఆదాయం లోని ఒక భాగంతో మారకం చేసుకుంటుంది” (అ.వి.సి. 1.177) స్మిత్ ఇక్కడ గుండెకాయను చేరుకున్నాడనీ, నేరుగా పెట్టుబడితో మారకం అయ్యే శ్రమగా ఉత్పాదక శ్రమని నిర్వచించాడనీ, అలా నిర్వచించగలగడం అతని శాస్త్రీయ ఘనతల్లో ఒకటనీ మార్క్స్ అన్నాడు.
శ్రమ మారింది డబ్బుతోనా లేక పెట్టుబడిగా వున్న డబ్బుతోనా అనేదే ఆ తేడా. “శ్రమకి ఉత్పాదక, అనుత్పాదక తేడాలు ఏర్పడేది, అది అదనపు విలువని ఇస్తోందా లేదా అనేదాన్ని బట్టి” (కొత్త పరిచయం 1.422), "ఉత్పాదక శ్రమలు 'పెట్టుబడి'తో సంబంధంలో ఉంటే, అనుత్పాదక శ్రమలు ఆదాయంతో సంబంధంలో ఉంటాయి” (కొత్త పరిచయం 1.428).
ఇంతవరకూ మార్క్స్ చెప్పినదీ, రంగనాయకమ్మగారు రాసినదీ ఒకటే. తేడా ఏమీ లేదు. ఇక ఈ నిర్వచనాన్ని బట్టి ఏది ఉత్పాదక శ్రమో, ఏది అనుత్పాదక శ్రమో తేల్చాలి. ఏది ఉత్పాదక శ్రమో తేల్చేచోట రంగనాయకమ్మగారికి మార్క్సుతో  పూర్తి  ఏకీభావం ఉంది. అనుత్పాదక శ్రమ విషయంలో మాత్రం మార్క్స్ కొన్ని పొరపాట్లు చేశాడని, తప్పు మీద తప్పు చేశాడని ఆమె అంటున్నారు (కొత్తపరిచయం 1.500-507).
ఆ తప్పులేవో చూద్దాం.
మార్క్స్ అనుత్పాదక శ్రామికుడికి ఉదాహరణగా పియానో శ్రామికుణ్ని చూపాడు. ఎవరైనా పియానోని మార్కెట్లో కొనుక్కోవచ్చు లేదా ఇంటిదగ్గరే తయారు చేయంచుకోవచ్చు. “షాపులో కొనే బదులు నా ఇంట్లోనే చేయించుకున్నాను అనుకుందాం. అప్పుడు పియానో చేసిన శ్రామికుడు అనుత్పాదక శ్రామికుడు. ఎందుకంటే అతని శ్రమకూ నా ఆదాయానికీ మారకం జరిగింది గనక.” (అ.వి.సి. 1.160) అని మార్క్స్ అన్నాడు.
రంగనాయకమ్మగారు దీనికి ఒప్పుకోవడం లేదు. “ఒకరి ఇంటికి వచ్చి వాళ్ల స్వంత వాడకం కోసం పియానో చేసి ఇచ్చిన పనివాడిని మార్క్సు అనుత్పాదక శ్రామికుడు అంటున్నాడు. కానీ ఇది పొరపాటు” అంటున్నారు.
నిజానికి మొదట్లో  రంగనాయకమ్మగారు ఇచ్చిన నిర్వచనం ప్రకారం అతడు అనుత్పాదక శ్రామికుడే అవుతాడు. “ఒక శ్రమని గాని, ఆ శ్రమతో తయారైన వస్తువుల్ని గాని అమ్మకపోతే, ఆ శ్రమకు బదులుగా డబ్బురాదు. అందులోవున్న అదనపు శ్రమ కూడా డబ్బుగా మారదు. విలువగా మారని శ్రమ అదనపు విలువని ఇవ్వదు (కొత్త పరిచయం 1.422).
అతని శ్రమ పియానోని అమ్ముకునే సరుకుగా ఉత్పత్తి చెయ్యలేదు. వాడుకునే వాయిద్య వస్తువుగా తయారుచేసింది. దాన్ని అమ్మి డబ్బు చేసుకోవడం లేదు కనుక పియానో చేసిన శ్రామికుని శ్రమ అదనపు విలువని ఉత్పత్తి చెయ్యదు. “అదనపు విలువని ఉత్పత్తిచెయ్యని శ్రమ అనుత్పాదకశ్రమ” (కొత్త పరిచయం 1.421) అని రంగనాయకమ్మగారి నిర్వచనం. పియానో కార్మికుని శ్రమ అదనపు విలువగా మారలేదు గదా. అలాంటప్పుడు అనుత్పాదక శ్రమే కదా! అతడు అనుత్పాదక శ్రామికుడే అవుతాడు కదా!
కాని కాదంటున్నారు రంగనాయకమ్మగారు. అనుత్పాదక శ్రామికుడు అనడం మార్క్స్ పొరపాటు అని తేలుస్తున్నారు. మరి అనుత్పాదక శ్రామికుడు కాకపోతే అతను ఎవరు? పియానో శ్రామికుడు ‘స్వతంత్ర ఉత్పత్తిదారుడిగా (స్వతంత్ర శ్రామికుడిగా) లెక్కకు రావాలి’ అంటున్నారు. వారిచ్చిన నిర్వచనం ప్రకారం అతడు అనుత్పాదక కార్మికుడే అవుతాడు గనుక నిర్వచనాన్నే మార్చేశారు. అందుకు అవసరమైన సొంత అంశాల్ని చొప్పించారు. దాని ప్రకారం అనుత్పాదక శ్రామికుణ్ణి స్వతంత్ర ఉత్పత్తిదారుడిగా తీర్చిదిద్దారు.
తమ సొంతశ్రమతో సరుకులు చేసి అమ్ముకునేవాళ్లు స్వతంత్ర ఉత్పత్తిదారులు. వాళ్లు కూలి ఇచ్చి ఇతర పనివాళ్లని పెట్టుకోరు. అలాగే వాళ్లు ఇతరుల దగ్గరకి కూలిపనికి పోరు. సరుకులకు యజమానులే, కాని కార్మికులకు కాదు. శ్రామికులే, కాని మరొకరి దగ్గర పనిచేసే వేతనశ్రామికులు కారు. ఉదాహరణకు ఒక నేతగాడు తన ఇంట్లో మగ్గం, ఇతర పరికరాలూ పెట్టి, కావలసిన దారమూ ఇతర ముడిపదార్ధాలూ కొని దుప్పట్లూ, తుండుగుడ్డలూ నేసి ఇంటిదగ్గరో, బజార్లు తిరిగో అమ్ముకుంటూంటాడు. అతను స్వతంత్ర ఉత్పత్తిదారుడు. అలాంటివాళ్లు మనకి చాలామంది తారస పడుతుంటారు. కూరలు అమ్మే కర్రీపాయింట్ వాళ్లు, ఇనప వస్తువులు ఇళ్లదగ్గర తయారుచేసి అమ్మేవాళ్లూ ఈకోవకి చెందుతారు. వీళ్లు మరొకరిని పనికి పెట్టుకోరు, వేరొకరి వద్ద పనికిపోరు. దీన్నిబట్టి వేతన కార్మికులైనవారు స్వతంత్ర ఉత్పత్తిదారులు కారు. స్వతంత్ర ఉత్పత్తిదారులైనవారు వేతనకార్మికులు కారు. స్వతంత్ర ఉత్పత్తిదారులు ఉత్పత్తిచేసిన శ్రమ విలువ మొత్తం పొందుతారు. కాని వేతనశ్రామికులు పొందరు. ఉత్పాదకశ్రామికుల అదనపు శ్రమ విలువగా మారి యజమానికి పోతుంది. అనుత్పాదక శ్రామికుల అదనపు శ్రమ యజమానిది అవుతుంది. కాని, ఈ యజమాని చేయించుకున్న వస్తువుని అమ్మడం లేదు కనక విలువ రూపంలో చేతికి అందదు.
“స్వతంత్ర ఉత్పత్తిదారులు అంటే, తమకు యజమాని లేని, తాము యజమానులుగా లేని, ఉత్పత్తిదారులు” (కొత్త పరిచయం 1.157) అనే నిర్వచనం పియానో శ్రామికుడికి వర్తిస్తుందా అనేది తేల్చాల్సిన విషయం.
ఉత్పత్తి సాధనాలు - శ్రమ పరికరాలూ, శ్రమ (ముడి) పదార్ధాలూ - పెట్టుబడిదారులకు ఉన్నట్లే స్వతంత్ర ఉత్పత్తిదారులకూ ఉంటాయి. పెట్టుబడిదారు వేతన శ్రామికుల చేత ఉత్పత్తి చేయిస్తాడు. స్వతంత్ర ఉత్పత్తిదారు తన శ్రమతో ఉత్పత్తిచేస్తాడు -  ఇదీ తేడా. వేతన శ్రామికుడికి ఉత్పత్తిసాధనాలు ఉండవు. కనక శ్రమశక్తిని అమ్ముకొని వేతన శ్రామికుడిగా ఉంటాడు. పియానో చేసిచ్చిన శ్రామికుడు వేతన శ్రామికుడు. చేయించుకున్నవాడు  వినియోగదారుడు.
“పియానోకి కావలసిన మెటీరియల్స్ అన్నీ నేనే కొనుక్కున్నాననీ, పియానోని షాపులో కొనడానికి బదులు దాన్ని నేను ఇంటిదగ్గరే తయారు చేయించుకున్నాననీ ఊహించండి. పియానోని చేసిన పనివాడు ఇప్పుడు అనుత్పాదక శ్రామికుడు. ఎందుకంటే, అతని శ్రమ, నా ఆదాయంతో మారకం అవుతోంది గనక” అన్నాడు మార్క్స్. (అ.వి.సి. 1.160) దీన్ని ఉటంకించి రంగనాయకమ్మగారు మార్క్స్ పొరపాటు పడ్డాడన్నారు (కొత్త పరిచయం 1.501).
మెటీరియల్ అతనిది కాదు. శ్రమ వరకే అతనిది. చేసినపనికి కూలి తీసుకుంటాడు. అతను అమ్మేది పియానోని కాదు, పియానోను చేసిన శ్రమని. కనక అతను వేతన శ్రామికుడు. అనుత్పాదక శ్రామికుడు. రంగనాయకమ్మగారన్నట్లు స్వతంత్ర ఉత్పత్తిదారుడయితే, మెటీరియల్స్ అతనే కొనుక్కొని, పియానో చేసి దాన్ని అమ్ముకుంటాడు.  ఇక్కడ మెటీరియల్స్ అతనివి కావు, పియానో అతనిది కాదు, దాన్ని అతను సరుకుగా అమ్మలేడు. అతన్ని స్వతంత్ర ఉత్పత్తిదారుడు అనడం తప్పు.
మరి రంగనాయకమ్మగారు ఏ నిర్వచనం ప్రకారం అతను అనుత్పాదక శ్రామికుడు కాడని అంటున్నారు? మార్క్స్ నిర్వచనానికి ఆమె కొత్త అంశాలు జోడించడం ద్వారా ఆ మాట అంటున్నారు.
“ఒక పనివాడు అనుత్పాదక శ్రామికుడిగా లెక్కకు రావాలంటే, అతను ఒక ఇంటిలోగానీ, ఒక ఉత్పత్తిస్థలంలో గానీ ఒక యజమాని కింద జీతానికి పనిచేసే వేతన శ్రామికుడిగా ఉండాలి. అలాకాని వ్యక్తి అనుత్పాదక శ్రామికుడు కాడు” అని రంగనాయకమ్మగారు కొత్త నిర్వచనం ఇచ్చారు. (కొత్త పరిచయం 1.501). ఇది మార్క్స్ కి తెలియని విషయం.
మన పియానో శ్రామికుడు ఒక యజమానికింద జీతానికి పనిచేసేవాడు కాడు. విడిగా పని చేస్తాడు. కనక రంగనాయకమ్మగారికి అతను అనుత్పాదక శ్రామికుడు కాడు. మరొకచోట మెటీరియల్ ఇచ్చి కుట్టించుకున్న విడిదర్జీని అనుత్పాదక శ్రామికుడు అన్నాడు మార్క్స్. రంగనాయకమ్మగారి ప్రకారం ఇది తప్పు. ఒక యజమానికింద లేడు కనక అతనూ అనుత్పాదక శ్రామికుడు కాడు. పరుపులు కుట్టేవాళ్లుంటారు. వాళ్లలో ఒక యజమానికింద ఉండనివాళ్లూ ఉంటారు. బజార్లో తిరుగుతూ పిలిస్తే వచ్చి కొత్తవి కుట్టిపెడతారు, లేదా పాతవి బాగుచేస్తారు. మెట్టుదగ్గర కార్మికులు చేరతారు. వాళ్లూ ఒక యజమానికింద ఉండరు. ఎవరు పిలిచినా వెళ్లి పనిచేసి కూలీ తీసుకుంటారు. వీళ్లను మార్క్స్ అనుత్పాదక శ్రామికులు అని అంటేకాదు అలా అనడం తప్పు అంటారు రంగనాయకమ్మగారు. ఇలాంటివాళ్లు స్వతంత్ర ఉత్పత్తిదారుల కిందికి వస్తారు అంటారు.
స్వతంత్ర ఉత్పత్తిదారుడు తయారుచేసిన సరుకు అతనిదే. అతనే అమ్ముకుంటాడు. వేతన కార్మికుడు ఉత్పాదక శ్రామికుడైనా, అనుత్పాదక శ్రామికుడైనా ఉత్పాదితం అతనిది కాదు. పియానోలకు కావలసిన మెటీరియల్ కొనుక్కొని తానే పియానోలు చేసి వాటిని అమ్మేవాడు స్వతంత్ర ఉత్పత్తిదారుడు. మన పియానో శ్రామికుడు అలాంటివాడు కాడు. కేవలం పియానో చేసి పెట్టే  వేతన శ్రామికుడు. అనుత్పాదక శ్రామికుడు.
రంగనాయకమ్మగారి ప్రకారం శ్రమ (ఉత్పత్తిచేసిన) విలువ అంతా  శ్రామికునికి దక్కితే, ఆ శ్రామికుడు స్వతంత్ర ఉత్పత్తిదారుడు. పియానో శ్రామికునికి అతని శ్రమ (ఉత్పత్తిచేసిన) విలువ అంతా దక్కుతుంది. కనక స్వతంత్ర ఉత్పత్తిదారుడు. ఇదీ వారి వాదం.
“పియానో విలువ 60C+20V+20S = 100 గా ఉందనుకుందాం. పియానోలు తయారుచేసే వ్యక్తి, ఒక పెట్టుబడిదారు దగ్గర పనిచేస్తే, అతను ఒక పియానో చేసినప్పుడల్లా, 20V+20S = 40 శ్రమ చేస్తాడు. ఆ శ్రామికుడినించి పెట్టుబడిదారుడికి 20S పోతూ ఉంటుంది. కానీ, ఆ శ్రామికుడు, ఒకరి ఇంటికివెళ్లి, పియానోని చేసి పెడతాడనుకుందాం. పియానోకి అవసరమయ్యే 60Cని ఆ ఇంటివాళ్లే తెచ్చుకుంటారు. ఆ 60 C మీద శ్రామికుడు తన 40 శ్రమ కలుపుతాడు. పియానో తయారవుతుంది. దాన్ని చేయించుకున్నవాళ్లు, దాన్ని చేసిన వ్యక్తికి 40 ఇస్తారు. పియానో విలువ 100 అవుతుంది. చేసిన వ్యక్తికి 40 రావడం అంటే, అతని శ్రమ విలువ అంతా అతనికే అందింది. కాబట్టి, ఈ వ్యక్తి అనుత్పాదక శ్రామికుడు కాడు. స్వతంత్ర ఉత్పత్తిదారుడు అవుతాడు. ఈ వ్యక్తి, పియానోల ఉత్పత్తి సంస్థలో ఉత్పాదక శ్రామికుడిగా ఉంటూనే, ఎవరి ఇళ్లకైనా వెళ్లి పియానోలు చేసిపెడితే, ఆ సంబంధంలో 'స్వతంత్ర ఉత్పత్తిదారుడే (కొత్తపరిచయం 1.501) అంటున్నారు రంగనాయకమ్మగారు.
40 ఎందుకిస్తారు? ఇవ్వరు. వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఏపని చేసేవాడికైనా కూలి ఇంత అని అందరికీ తెలిసే ఉంటుంది. దాని ప్రకారం ఇమ్మంటారు, ఇస్తారు. ఇది అందరికీ తెలిసినదే, రోజూ జరిగేదే. ఉత్పాదక శ్రామికులకి ఇచ్చినట్లే వారి వేతనం ఉంటుంది. రోజుకూలికి చేసే పనివాళ్లు చాలామంది కనబడతారు. పిలిస్తే వచ్చి పనిచేసి, రోజు కూలి తీసుకుంటారు. ఎంత అని అడిగితే మేస్త్రి 400 రూపాయలిస్తాడు, అంతే ఇవ్వమంటారు. అందుకే, ఇటువంటి ఒక ఉదాహరణలో మార్క్స్ ఇంటికొచ్చి పనిచేసిన అనుత్పాదక దర్జీ శ్రమధర “ఉత్పాదక దర్జీ పొందేదాన్ని బట్టి నిర్ణయమవుతుంది” అంటాడు (అ.వి.సి. 1.402) కాబట్టే వీరిని అనుత్పాదక శ్రామికులు అన్నాడు మార్క్స్. రంగనాయకమ్మగారి దృష్టిలో, ఏరోజుకారోజు పని వెదుక్కునే వీళ్లు స్వతంత్ర ఉత్పత్తిదారులు!
వాస్తవానికి, వీరి వేతనం శ్రమశక్తి విలువే కాని ఉత్పత్తయిన మొత్తం విలువ కాదు. పియానో చేసిచ్చినవాడు కూలికి పనిచేసే శ్రామికుడు. కనక అతడు అదనపు శ్రమ చేస్తాడు. అది చేయించుకున్న వానికి దక్కుతుంది. శ్రామికుడి శ్రమ (ఉత్పత్తిచేసిన) విలువ అంతా అతనికి దక్కదు. దక్కుతుంది అనడం తప్పు.
అనుత్పాదక శ్రమలు అదనపుశ్రమని ఇస్తాయని ఒకచోటా, ఇవ్వవని ఒకచోటా చెప్పినట్లు అయింది. ఈ పరిస్థితి మనల్ని మొదట చాలా అయోమయంలో పడేస్తుందిఅన్నారు రంగనాయకమ్మగారు. అయితే మార్క్స్ అనుత్పాదక శ్రామికుడు అదనపు శ్రమ చేస్తాడనే చెప్పాడు. చెయ్యడని ఎక్కడా చెప్పలేదు. అనుత్పాదక శ్రామికుడైనా, ఉత్పాదకశ్రామికుడి లాగే అదనపు శ్రమ చేస్తాడు. పియానో శ్రామికుడు వేతన శ్రామికుడే. ఏపనిలోనైనా, రోజుకూలికి చేసే పనివాళ్లు చాలామంది కనబడతారు. ఒక్కో పనిచేసేవాళ్లు ఒక్కోచోట చేరి పనిచేయించుకునే వాళ్లకోసం చూస్తుంటారు. పిలిస్తే వచ్చి పనిచేసి రోజుకూలి తీసుకుంటారు. పియానో చేసిన కార్మికుడయినా అంతే. అలాగే తీసుకుంటాడు. ఉత్పాదక శ్రామికుడి లాగే అదనపు శ్రమ చేస్తాడు.
ఈ కొటేషన్ లో, మొదటి వాక్యాల్లో కూడా ఒక పొరపాటు ఉంది. ఒక ఇంటివాళ్లు ఒక కుట్టుమనిషిని ఇంటికి పిలిపించుకుని కోటు కుట్టించుకుంటే, అతని శ్రమవిలువ అంతా (20v+20s=40) చెల్లిస్తారు. అది యజమానీ శ్రామిక సంబంధం కాదు. ఇది సరిగానే ఉంది" అంటున్నారు రంగనాయకమ్మగారు.
అయితే మార్క్స్ ఆ శ్రామికుణ్ణి గృహసేవకుడితో పోల్చి అనుత్పాదక శ్రామికుడు అన్నాడు. అంతేగాని అతని శ్రమవిలువ అంతా (20v+20s=40) చెల్లిస్తారు అనలేదు. శ్రామికునికి వచ్చేది శ్రమశక్తి విలువ మాత్రమే. శ్రమ సృజించిన విలువకాదు అని మార్క్స్ పదేపదే చెబుతాడు.
అంతేకాదు, అది యజమానీ శ్రామిక సంబంధం కాదు అని మార్క్స్ అనలేదు. అనకపోయినా ఆయన అలా అన్నట్లూ, అది సరైనదే అయినట్లూ రంగనాయకమ్మగారు చెబుతున్నారు. ఇది ఆయన చెప్పనిదాన్ని, ఆయనకు ఆపాదించడమే.
ఇంతకూ ఈ స్వతంత్ర ఉత్పత్తిదారుకు యజమాని లేడు అని రంగనాయకమ్మగారు ఎలా తేల్చారు? ఆంటర్ ప్రెనర్ అనే మాటను యజమాని అని అనువాదం చెయ్యడం ద్వారా!
ఆంటర్ ప్రెనర్ అనేవాడు యజమానే. లాభం రాబట్టే యజమాని. ఒక టైలర్ నలుగురిని పెట్టుకొని బట్టలు కుట్టించి అమ్ముతాడు. లాభం పొందుతాడు. అతను ఆంటర్ ప్రెనర్. లాభం పొందడం కోసం కార్మికుల్ని పెట్టే యజమాని ఆంటర్ ప్రెనర్. అలాగని యజమానులు అందరూ లాభం రాబడతారని కాదు. లాభం రాబట్టని యజమానులూ ఉంటారు. ఖర్చుపెట్టుకొని పనిచేయించుకునే యజమానులు కూడా ఉంటారు. ప్రతి ఆంటర్ ప్రెనర్ యజమానే, కాని ప్రతి యజమానీ ఆంటర్ ప్రెనర్ కాడు.
ఒకరు పనిలో పెట్టుకున్నటైలర్లు కుట్టిన కోటు తనే వాడుకుంటే, కుట్టినవాళ్లకి యజమానే, కాని ఆంటర్ ప్రెనర్ కాడు. ఎందుకంటే, అతను దాన్ని అమ్మి లాభం చేసుకోలేడు. అతని ఆదాయం ఖర్చు అవుతుంది - ఇదీ మార్క్స్ చెప్పింది. “నేను తొడుక్కోడానికి ఇంటివద్ద కోటు కుట్టించుకున్నప్పుడు (ఆర్థిక కాటగరీ అర్థంలో) అది నన్ను నా సొంత వ్యాపారిని (entrepreneur) చెయ్యదు” (అ.వి.సి. 1.296) అని మార్క్స్ అంటే, “నేను తొడుక్కోవడానికి ఒక టైలర్ తో ఇంటిదగ్గరే ఒక కోటుని తయారుచేయించుకున్నప్పుడు ఆవిషయం నన్ను ఆర్థిక అర్థంలో యజమానిగా చెయ్యదు" అని రంగనాయకమ్మగారు అనువదించారు. ఇంటికి వెళ్లి కోటు కుట్టి ఇచ్చిన కుట్టుమనిషికి కుట్టించుకున్న మనిషి యజమానిగా ఉండడు అని నిర్ధారించారు. కుట్టించుకున్నవానికీ కుట్టినవానికీ యజమాని-శ్రామిక సంబంధం ఉండదు. యజమాని లేడు గనక అదనపు శ్రమ ఉండదు. దోపిడీకి అవకాశం ఉండదు. అదనపు శ్రమ లేదు కనక శ్రమ విలువ అంతా అతనికే దక్కుతుంది. అతను స్వతంత్ర ఉత్పత్తి దారుడు - ఇదీ వారి వాదన.
యజమాని లేడు అనడం తప్పు. ‘ఆంటర్ ప్రెనర్’ గా చెయ్యదు అంటే ‘యజమాని’ గా చెయ్యదు అని కాదు.
ఉదాహరణకి, కొంతకాలం ఖాళీగా ఉన్న స్థలంలో చిల్లచెట్లు కొట్టేయించి, చెత్త ఎత్తేయించి,మొక్కలు పీకేయించి శుభ్రం చేయిస్తాడు స్థలం యజమాని. పనివాళ్లంతా కూలి తీసుకుని అతను చెప్పినట్లు పనిచేస్తారు. అంతవరకు వాళ్లకు అతడు యజమానే. డబ్బు తీసుకొని పనిచేసే కూలీలకు డబ్బిచ్చి పనిచేయించుకునేవాడు యజమానే. కాదనడం కుదరదు.
యజమాని లేడు అనీ, యజమాని లేడు కాబట్టి కుట్టుమనిషి స్వతంత్ర ఉత్పత్తిదారుడు అనీ తేల్చారు. ఉన్న యజమానిని లేడని తప్పు నిర్ధారణకు రావడానికి కారణం ఆంటర్ ప్రెనర్ అనే మాటకి యజమాని అని తప్పు అనువాదం చెయ్యడం. “ఇప్పుడిచ్చే కొటేషన్ మహా గందరగోళంగా ఉంటుంది. ‘స్వేచ్ఛ’గా అనువాదం చేసినప్పటికీ ఈ గందరగోళం తప్పదు” అని హెచ్చరించి ‘స్వేచ్ఛగానే’ అనువాదం చేశారు. ఆ అనువాదంతోనే గందరగోళం!
“మార్క్స్ ఈ కొటేషన్ లో, ఇంటికి వచ్చి కోటు కుట్టి ఇచ్చే శ్రామికుణ్ణి అనుత్పాదక శ్రామికుడిగా కాక, స్వతంత్ర శ్రామికుడిగానే చెబుతున్నాడు (కొత్త పరిచయం 1.502) అని మార్క్స్ అనని మాట కూడ ఆయన నోట్లో పెట్టారు. కాని మార్క్స్ అలా అనలేదు. దర్జీ గృహసేవకుడి లాంటివాడే అని స్పష్టంగా చెప్పాడు. అంటే అతను అనుత్పాదక శ్రామికుడు అని చెప్పాడు.
జాబింగ్ దర్జీ శ్రమ నా డబ్బుతో మారకం అయింది అంటాడు. తయారైన సరుకుతో డబ్బు మారకం కాదిది. ఆ సరుకుని తయారుచేసే శ్రమతో డబ్బు మారకం. అంటే అతను అనుత్పాదక శ్రామికుడు. జాబింగ్ దర్జీ పొందిన ధరలో ఉన్న శ్రమ కన్నా అతను చేసిన శ్రమ ఎక్కువ కావచ్చు. ఇందుకు అవకాశం ఉంది, ఎందుకంటే అతని శ్రమధర ఉత్పాదక దర్జీ పొందేదాన్ని బట్టి నిర్ణయమవుతుంది (అ.వి.సి. 1.402) అని మార్క్స్ స్పష్టంగానే చెప్పాడు. అయోమయంలో పడేసింది మార్క్స్ కాదు, రంగనాయకమ్మగారు.
అనుత్పాదక శ్రామికులు “తమ సేవల రూపంలో ఒక 'ఈక్వివలెంట్' ని ఇస్తారు” అంటాడు మార్క్స్ (అ.వి.సి. 1.218) రంగనాయకమ్మగారు ఇలా వివరించారు: “’ఈక్వివలెంట్’ ఇవ్వడం అంటే, ఇచ్చేవిలువా, తీసుకునే విలువా సమానంగా ఉంటాయి అని అర్ధం.” “ఈ శ్రామికులు యజమానులకు ఇచ్చే శ్రమవిలువా, వాళ్లనించి తీసుకునే జీతాలవిలువా సమానంగా వుంటాయనీ, అంటే అనుత్పాదక శ్రమల విషయంలో 'అదనపుశ్రమ’ వుండదనీ చెప్తోన్నట్టు అర్ధం. అందుకే ఇదికూడా తప్పే” అన్నారు రంగనాయకమ్మగారు (పాత పరిచయం 3.372)
డబ్బుకీ శ్రమశక్తికీ మారకం ఉంటుంది గాని డబ్బుకీ శ్రమ ఉత్పత్తిచేసిన ఉత్పాదితానికీ కాదు.
“శ్రామికునికీ పెట్టుబడిదారునికీ మధ్య మారకం మామూలు (సింపుల్) మారకమే; అతడూ ఇతడూ (ఈచ్)సమానకాన్ని (Equivalentని)పొందుతారు; ఒకరు డబ్బుపొందితే, మరొకరు చెల్లించిన డబ్బుకి సరిగ్గా సరిపడే ధర గల సరుకు పొందుతారు” అని మార్క్స్ గ్రుండ్రిస్ లో అన్నాడు.
ఆ సరుకే శ్రమశక్తి. మారకంలో ఉన్నది ఒకవైపు డబ్బు, మరోవైపు శ్రమశక్తి. ఇచ్చే డబ్బుకి వచ్చే శ్రమశక్తి సరిపోతుంది. మారేది సమానకాలే. శ్రమశక్తి సమానకం అంటే శ్రమశక్తి పునరుత్పత్తికి కావలసిన సరుకులు. శ్రమశక్తి ఉపయోగపు విలువ వల్ల ఏర్పడ్డ ఉత్పాదితం కాదు. కనక సమానకం ఇస్తారు అనడం కరెక్టే. అలాగే అనాలి కూడా.
మార్క్స్ చెప్పిన అనుత్పాదక శ్రమ ఫార్ములా డ-స-డ కాదు. స-డ-స (చివర స శ్రమ లేక సేవ). “డబ్బు చెల్లింపు సాధనంగా వ్యవహరిస్తుంది, పెట్టుబడిగా కాదుఅంటాడు మార్క్స్. డ-స-డ (డబ్బు-సరుకు-డబ్బు) పెట్టుబడి ఫార్ములా. స-డ-స (సరుకు-డబ్బు-సరుకు) అనుత్పాదక శ్రమ ఫార్ములా.
రంగనాయకమ్మగారి ప్రకారం స-డ-స సూత్రం, “సమాన విలువలుగల సరుకుల మారకాలనే  సూచిస్తుంది. అనుత్పాదక శ్రామికుడికీ, అతని యజమానికీ జరిగే మారకాన్ని ఈ సూత్రం ద్వారా చెప్తే, ఆ మారకం, సమాన విలువల మారకంగానే ఉందనే అర్ధాన్ని ఇస్తుంది. ఇది తప్పు (కొత్త పరిచయం 1.503).
మార్క్స్ ప్రకారం ఏ మారకమైనా సమాన విలువల మారకమే. పెట్టుబడిదారుడికీ, కార్మికుడికీ అయినా, వినియోగదారుడికీ అనుత్పాదక శ్రామికుడికీ అయినా, సరుక్కి సరుక్కీ అయినా మారకం సమాన మారకమే.
“అనుత్పాదక శ్రమ, యజమానికి ఉపయోగపు విలువనే ఇచ్చినప్పటికీ, అది యజమాని ఇచ్చిన డబ్బుకన్న ఎక్కువ ఉపయోగపు విలువనే ఇస్తుంది. కాబట్టి, ఈసంబంధాన్ని C-M-C గా చెప్పడం పనికిరాదు. అలా చెప్తే, అనుత్పాదక శ్రామికులు అదనపు శ్రమ ఇవ్వరు అనే అర్థం వస్తుంది” అంటున్నారు రంగనాయకమ్మగారు (కొత్త పరిచయం 1.503).
“ఇచ్చేది డబ్బూ, పుచ్చుకునేది  శ్రమా. విలువా, ఉపయోగపు విలువా రెండు భిన్న రాసులు. వాటిని సరిపోల్చడం కుదరదు” అనీ, “మారకపు విలువ, ఉపయోగపు విలువ అనేవి వాటి స్వభావం రీత్యా కొలవబడజాలని పరిమాణాలు” అనీ మార్క్స్ అన్నాడు (కాపిటల్ 1.506).
అదనపు విలువ ఉత్పత్తి అయ్యే వలయం డ-స-డ. స-డ-స లో అదనపు విలువ ఉత్పత్తి కాదు, అసలు విలువే ఉత్పత్తి కాదు. తయారయ్యేది ఉపయోగపు విలువ. దీనికి విలువ ప్రసక్తి ఉండదు. కనుక ఇచ్చే శ్రమా పుచ్చుకునే శ్రమా అనేది ఉండదు. ఇచ్చేది డబ్బు, పుచ్చుకునేది శ్రమ. శ్రమ అనేది సరుకు కాదు. దానికి విలువ ఉండదు. శ్రమవిలువ అనేది అర్థంలేనిమాట అని మార్క్స్ చెప్పాడు.
చివర శ్రమవల్ల తయారైన సరుకు కాదు. శ్రమ ఇమిడి ఉన్న సరుకు కాదు. శ్రమ ఉత్పాదితం కాదు. ఇది శ్రమే. సజీవ శ్రమకీ డబ్బుకీ మారకం. “దాని (అనుత్పాదక శ్రమకి సంబంధించిన) వినియోగాన్ని సూత్రీకరించవలసింది M-C-M గా కాదు, C-M-C గా...ఇక్కడ డబ్బు కేవలం చలామణీ సాధనంగా పనిచేస్తుంది గాని పెట్టుబడిగా కాదు" అంటాడు మార్క్స్ (కొత్త పరిచయం 1.503, కాపిటల్ పెంగ్విన్ 1.1041). ఇక్కడ చివర స అనేదానికి ‘శ్రమ లేక సేవ’ అని బ్రాకెట్లో పెట్టాడు.
“సేవ అంటే సరుకు రూపంలో అయినా సరే, శ్రమరూపంలో అయినా సరే ఉన్న ఒక ఉపయోగపు విలువ యొక్క ఉపయోగకర ఫలితం తప్ప వేరు కాదు” (పెట్టుబడి, విశాలాంధ్ర, 175-176).
అంటే ఒక శ్రమ ఉపయోగపు విలువగా, సేవగా వినియోగమయితే, ఆ శ్రమ అనుత్పాదక శ్రమ. ఆ శ్రామికుడు అనుత్పాదక శ్రామికుడు. అతని శ్రమ ఉపయోగపు విలువ కొరకు వాడబడింది, మారకం విలువని ఏర్పరచడానికి కాదు. దానికి చెల్లించే డబ్బు పెట్టుబడినించి కాదు, ఆదాయం నించి.
కాని అనుత్పాదక శ్రామికుడితో మారకం స-డ-స' గాచెప్పాలి. అప్పుడే అనుత్పాదక శ్రామికుడికీ యజమానికి జరిగే మారకాన్ని సరిగ్గా సూత్రీకరించగలుగుతాం" అని రంగనాయకమ్మగారు అంటున్నారు (పాత పరిచయం 373)
స-డ-స' సూత్రీకరణ రంగనాయకమ్మగారి సొంతం. అది మార్క్సుకి సాధ్యం కాలేదు. అందుకు మార్క్స్ చాలడు.
“విషయాల్ని ఇలా చెప్పవలసి ఉండగా, మార్క్సు అనుత్పాదక శ్రమని వివరించడంలో, కొన్నిచోట్ల సరిగానూ, కొన్నిచోట్ల పొరపాటుగానూ ఉన్నాడు. కాపిటల్-2 లో ‘చలామణీ ఖర్చుల’ గురించి చెప్పినచోట అనుత్పాదక శ్రమ గురించి చాలా కచ్చితమైన, ‘పూర్తిగా సరియైన’ అభిప్రాయాలు ఇచ్చాడు. వాటికి వ్యతిరేకమైన అర్ధాలు వచ్చే పొరపాట్లు ఎలా జరిగాయో గానీ, వాటిని పొరపాట్లుగానే అర్ధం చేసుకొని వదలివెయ్యాలి” (కొత్త పరిచయం 1.503) అంటున్నారు రంగనాయకమ్మగారు.
“ఉత్పాదక, అనుత్పాదక శ్రమల గురించి సరిగా తెలుసుకోకపోతే, 'కార్మికవర్గం ఎవరు?' అనే విషయాన్ని అర్థం చేసుకోవడంలో చాలా పొరపాటు జరుగుతుంది” (పాత పరిచయం 3.366) అనీ, “ఉత్పాదక-అనుత్పాదక శ్రామికులందరూ ... ఆ రెండురకాల శ్రామికులూ కలిసిన మొత్తమే కార్మికవర్గం” (పాత పరిచయం 3.376) అనీ రంగనాయకమ్మగారు అంటున్నారు.
కచ్చితంగా చెప్పాలంటే, అనుత్పాదక శ్రామికులెవరో, స్వతంత్ర ఉత్పత్తిదారులెవరో సరిగా తెలుసుకోవాలి. ఈ ప్రయత్నమే రంగనాయకమ్మగారు చేశారు. మార్క్స్ స్వతంత్ర ఉత్పత్తిదారుల్ని అనుత్పాదక శ్రామికులుగా చెప్పి తప్పు చేశాడన్నారు.
ఎవరిది రైటు,ఎవరిది తప్పు?
“మార్క్స్ ఇచ్చిన ఉదాహరణలను బట్టి పోతే, కార్మికవర్గం అంటే ఉత్పాదక శ్రామికులు మాత్రమే అనే పొరపాటు అర్థానికి రావలసి వస్తుంది” అని రంగనాయకమ్మగారు అన్నారు.
ఎలా వస్తుంది? కార్మికవర్గం అంటే వేతన శ్రామికులు అని ‘ప్రణాళిక’లోనే స్పష్టం చేశారు: “కార్మికవర్గం అంటే, సొంత ఉత్పత్తి సాధనాలు లేనందువల్ల, బతకడానికి తమ శ్రమశక్తిని అమ్ముకోవలసిన ఆధునిక వేతన శ్రామికుల వర్గం” అని స్పష్టంగా వివరించారు.
వారు చెప్పినట్లు ఉదాహరణలను బట్టిపోదాం: మార్క్స్ ఉదాహరణలలో వారిని అనుత్పాదక శ్రామికులు అన్నాడు. అంటే వేతన శ్రామికులన్నమాట. వాళ్లు కార్మికవర్గం పరిధిలోనే ఉంటారు. మార్క్స్ అనుత్పాదక కార్మికులు అన్నవాళ్లు రంగనాయకమ్మగారికి కార్మికవర్గంలో ఎందుకు కనిపించరో తెలియదు. కారణం ఒక్కటే తోస్తున్నది. వాళ్లు రంగనాయకమ్మగారికి స్వతంత్ర ఉత్పత్తిదారులు కనక కార్మికవర్గంలో ఉండరు. మార్క్స్ ప్రకారం వాళ్లు అనుత్పాదక శ్రామికులు, వేతన కార్మికులు. కచ్చితంగా కార్మికవర్గంలో ఉంటారు. వాళ్లు కార్మికవర్గంలో ఉండనిది మార్క్స్ ఉదాహరణల బట్టి కాదు, వాటికి రంగనాయకమ్మగారిచ్చిన వక్రభాష్యాన్ని బట్టి.
“మధ్యతరగతిలో కిందిశ్రేణికి చెందినవారు చిన్న ఉత్పత్తిదారులు, దుకాణదారులు, చేతిపరిశ్రమలవారు, రైతులు …… వీరంతా యథాతథవాదులు, విప్లవకారులు కారు. పైగా వీరు అభివృద్ధి నిరోధకులు" అని ప్రణాళిక అంది.
మార్క్స్ అనుత్పాదక శ్రామికులు అన్నవాళ్లని అనేకమందిని రంగనాయకమ్మగారు స్వతంత్ర ఉత్పత్తిదారుల కింద జమ కట్టి, మార్క్స్ విప్లవకారులుగా గుర్తించినవాళ్లని యథాతథవాదులుగా, అభివృద్ధినిరోధకులుగా చెబుతున్నారు. చరిత్ర రథచక్రాన్ని ముందుకు నడిపే కార్మికుల్ని, వెనక్కి తిప్పడానికి ప్రయత్నించేవాళ్లుగా చూపిస్తున్నారు.
‘వీక్షణం’ వ్యాసంలో పెట్టుబడిదారుడికీ, మార్క్స్ శిష్యుణ్ణి అని చెప్పుకునేవానికీ ఒక చర్చను రంగనాయకమ్మగారు ఊహించారు. అందులో ‘శ్రమశక్తి సరుకు కాదు’ అని అని తేలుస్తాడు ‘శిష్యుడు’! సరుకు అని చెప్పి మార్క్స్ పొరపాటు చేశాడనీ దాన్ని దిద్దుకుంటాడనీ చెప్తాడు. “శ్రమదోపిడీయే లేదని దోపిడీదారుడు విర్రవీగుతోంటే, నోరెత్తలేని స్తితిలో శ్రామికుడు పడిపోయాడంటే కారణం నా గురువు పొరపాటే” అనీ అంటాడు. అంటే మార్క్స్ అదనపు విలువని రుజువు చెయ్యలేక పోయాడని!
మళ్లీ, “ఈ సంగతి మార్క్సుకి తెలియదనీ, తెలియకనే అలా చెప్పాడనీ అనుకోగలమా? రాయడంలో కొన్నిసార్లు అలాంటి పొరపాట్లు జరుగుతూనే వుంటాయి. ఆయనకు తెలుసు, కాని రాయడంలో పొరపాటు జరిగింది”, “మొదట్లో రాసిన భాగాన్ని మార్క్సు మళ్లీ ఒకసారి చూసుకునివుంటే, ఆ విషయాలన్నీ కూడా తప్పకుండా సవరించేవాడే" అనీ రాశారు రంగనాయకమ్మ (పాత పరిచయం 3.370).

ఇలా కొత్త నిర్వచనాలతో, ఫార్ములాలతో, పరిభాషతో, మార్క్సులో లేనివి, మార్క్సు తప్పన్నవీ ఇరికించి, వాటినిబట్టి మార్క్స్ తప్పులు చేశాడని రంగనాయకమ్మగారు తేల్చారు. సరిచూసుకోక పొరపాటుపడ్డాడనీ, మళ్లీ ఒకసారి చూసుకుని వుంటే, ఆవిషయాలన్నీ కూడా తప్పకుండా సవరించేవాడే అనీ చెప్పారు. అంటే  రంగనాయకమ్మగారు చెప్పినట్లుగా దిద్దుకునే వాడని కాబోలు. ఏం చేసేవాడో తెలుసుకునే అవకాశం మనకి లేదు. మార్క్స్ లేడు. అందువల్లే రంగనాయకమ్మగారు “తప్పకుండా సవరించుకునేవాడే” అని ధైర్యంగా చెప్పారేమో. ఉండి ఉంటే, రంగనాయకమ్మగారి ‘పరిచయాన్ని’ పఠించి,వాగ్నర్ మీద వ్యాఖ్యానించినట్టుగా “కాపిటల్ లో ఒక్క ముక్క కూడా అర్థంకాని వ్యక్తి” అనేవాడో, ఫ్రెంచ్ మార్క్సిస్టుల గురించి అన్నట్లు వారిది మార్క్సిజం అయితే, నేను మార్క్సిస్టుని కాను” అనేవాడో, అసలు “ఈ పుస్తకంలో పరిచయం చేసిన మార్క్సు నేను కాదు” అనేవాడో, ఎవరికి తెలుసు?

12, ఫిబ్రవరి 2016, శుక్రవారం

ప్రభుత్వ సహాయం పొందుతున్న అమెరికా శ్రామికులు

ప్రభుత్వ సహాయం పొందుతున్న అమెరికా శ్రామికులు
అమెరికాలో నూటికి 30 మంది శ్రామికులు అంటే 4 కోట్లా 12 లక్షలమంది ప్రభుత్వ సహాయం పొందుతున్నారు. వీళ్ళలో 1 కోటి 93 లక్షలమంది ఫుల్ టైం పనివాళ్ళు. అయితే వీళ్ళలో ఎక్కువమంది కీతా వేతనాలొచ్చే పనుల్లో ఉంటారు. తక్కువ వేతనం అంటే గంటకి 12.16 డాలర్లకి లోపు. 12.16 డాలర్ల లోపు వాళ్ళలో 53.1 శాతం మందికి చాలాతక్కువ ఆదాయం వస్తుంది. దాంతో ఇల్లు గడవడం కష్టమవుతుంది. అంతకు మించి పని దొరకదు. కనక ప్రభుత్వ సహాయం మీద ఆధారపడతారు. మరో దారి ఉండదు. అయితే, ప్రభుత్వ సహాయం మీద తేరగా తిని బతకడానికి అలవాటుపడి పనులకు పోరు - అనే ఒక అభిప్రాయం ప్రచారంలో ఉంది. ఇది సరయినదేనా?
వాస్తవాలు పరిశీలించి నిజానిజాలు నిగ్గుతేల్చాలి.
******
శ్రామికులకి వేతనాలు పెరగడం లేదు. కొత్తగా వస్తున్న ఉద్యోగాలకి జీతాలు తక్కువ. మాంద్యంలో పోయినవాటి జీతాల కన్నా, తర్వాత వచ్చిన వాటికి జీతాలు తక్కువ. పెన్షన్లు కోసే ప్రయత్నం తీవ్రంగా జరుగుతున్నది. ఆదాయం తగ్గుతున్నా, ఖర్చులు పెరుగుతున్నాయి.  ఆరోగ్యం, విద్య, ఇంటి అద్దెలు భారీగా పెరుగుతున్నాయి. 2016 జనవరి లో వచ్చిన 151,000 ఉద్యోగాల్లో  102,000 కనీస వేతనాలవి. రెటైల్ (చిల్లర వర్తకం) రంగంలో 58,000,విశ్రాంతి,ఆతిధ్య రంగంలో 44,000. జనవరిలో 21 లక్షలమంది  దీర్ఘకాల నిరుద్యోగులు (27 వారాలుగా ఉద్యోగం లేనివారు) ఉన్నారు.మొత్తం నిరుద్యోగుల్లో వీళ్ళు 26.9 శాతం. పార్ట్ -టం వాళ్ళు 60 లక్షలమంది. శ్రామికుల పరిస్థితి ఇలావుంది.
సరే,అవతలవైపు చూద్దాం.2009 లో కార్పొరేట్ల లాభాలు మొత్తం- 5,587 (5,58,700 కోట్ల) డాలర్లు. 2014 లో లాభాలు 8290 బిలియన్ (829,000 కోట్ల) డాలర్లు.
సీ.ఈ.ఓ వేతనాలు అంతకంతకూ అధికమవుతున్నాయి.శ్రామికుల వేతనాలు మహా అయితే ఉన్నచోటే ఉంటున్నాయి.అనేకమందికి తగ్గుతున్నాయి.మాంద్యం వచ్చినప్పుడు ఆటో కంపెనిలు కొత్తగా చేరే వాళ్ళకి సగం జీతమే ఇచ్చే ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. సీ.ఈ.ఓ ల వేతనాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.వాల్ మార్ట్ సీ.ఈ.ఓ కి 2014 లో రెండున్నర కోట్ల డాలర్లొచ్చాయి.అక్కడే పనిచేసే ఒక మధ్యస్థ శ్రామికుడికి 22,590 డాలర్లు.లెక్కిస్తే ఇతని జీతానికి, సీ.ఈ.ఓ వేతనం 1133 రెట్లు. ఎక్కడైనా 500 రెట్లకి పైమాటే.  ఈ తేడా కూడా పెరుగుతున్నది
మహామాంద్యం సాగిన 2008,2009, 2010 కాలంలో కూడా కార్పొరేట్ లాభాలు పెరుగుతూనే ఉన్నాయి. మాంద్యం వాళ్ళకి లేనట్లే. శ్రామికులకి ఇప్పటికీ మాంద్యం కొనసాగుతున్నట్లే. 1970 దశకంలో జాతీయోత్పత్తిలో ఇంచుమించు 60 శాతం కార్మికుల వేతనాలుగా ఉండేది. 2010 లో అది 54.9  చేరింది. అదే లాభాల పాలు 1970 లో 7.5 శాతం అయితే, 2010 లో 12.6 శాతానికి పెరిగింది. 1950 నించీ ఇదే ఎక్కువ.
పై 5 శాతం సంపన్నులకి 1970 లో 17 శాతం సంపద ఉండేది. అదిప్పుడు 22 శాతానికి పెరిగింది. మధ్యతరగతి మాటకొస్తే, 1995 లో ఆకుటుంబం ఎంత తీసుకుందో, ఇప్పుడూ అంతే(ధరల పెరుదలతో సరిచేసి చూస్తే). జనవరిలో చేసిన ఒక సర్వేలో తమ పిల్లలు తమకంటే ఆర్ధికంగా తగ్గిపోతారని 56 శాతం మంది అభిప్రాయపడ్డారు.
అమెరికా ప్రజల అదాయాలు తగ్గుతూ ఉన్న రోజుల్లో కార్పొరేట్ల లాభాలు పైకి, పైపైకీ దూసుకు పోయాయి-అనే నిజాన్ని ఈగణాంకాలు బయటపెడుతున్నాయి.
అందువల్ల, సంపన్నుల ఆస్తులు  ఎగబాకడమూ, శ్రామికుల పరిస్థితి దిగజారడడమూ- కళ్ళకు కడుతున్న దృశ్యం.ఆదాయ అంతరాలు అంతూపొంతూ లేకుండా పెరుగుతున్నాయి.ఎంతగా పెరుగుతున్నాయో చెబుతూ ఎన్నో నివేదికలొచ్చాయి. అన్ని దేశాల పరిస్థితీ ఇలాగే వుందని ఆయాదేశాల గణాంకాలు పైపైన చూచినా ఎవరికైనా తేలిగ్గా తెలుస్తుంది.
ఒకవైపు అనేకమందికి ఆదాయం తగ్గుతున్నది. ఖర్చు పెరుగుతున్నది. మరి ప్రభుత్వ సహాయం తీసుకోకుండా ఎలా బతుకుతారు? అనే ఆలోచన చెయ్యకుండా సహాయంతోనే బతకడానికి అలవాటుపడి పనులు చెయ్యడం లేదు అని తప్పుడు ప్రచారం చేసే వాళ్ళని ఏమనాలి?
ఈగాణాంకాలన్ని వాళ్ళకి కరతలామలకమే. జీతం సరిపోదు కనక తీసుకుంటున్నారు అనే నిజం వాళ్ళకి తెలియక కాదు. కార్పొరేట్ల ప్రయోజనాల్ని పెంచడం వాళ్ళ పని.

వాళ్ళలక్ష్యం ఈ పరిస్థితికి కారణాలు చెప్పటం కాదు.ప్రజా సంక్షేమం కాదు. కార్పొరేట్లకు మేలుచేసే భావాలు ప్రచారంలొ పెట్టడం. జీతాలు తక్కువ ఇస్తున్నారు అనరు. ప్రభుత్వ సహాయం మీద ఆధారపడడానికి కారకులు కార్పొరేట్లు అని చెప్పరు. కార్మికులు పనిచెయ్యకుండా కూచోని తిడానికి అలవాటు పడ్డారని నింద బాధితుల పైకి తోస్తారు. ఇది వారు ఊరకే చెయ్యరు. అందుకు దండిగా పారితోషికం పొందుతారు- ప్రత్యక్షంగానో, పరోక్షంగానో.

3, ఫిబ్రవరి 2016, బుధవారం

అమెరికాలో అన్నం చీటీల కోత

అమెరికాలో అన్నం చీటీల కోత
అమెరికాలో 18-49 ఏళ్ళ వయసున్న నిరుద్యోగులకి 3 నెలలపాటు నెలకి 150 నించి 170 డాలర్ల దాకా ఇస్తారు. గతంలో అన్నం చీటీలు అనేవారు. ఇప్పుడు Supplemental Nutrition Assistance Program (SNAP) ప్రయోజనాలు అంటున్నారు  వికలాంగులకూ, మైనర్ పిల్లలున్నవారికీ 3 నెలలు అనే కాలపరిమితి లేదు. అయితే 2008 మాంద్యం వల్ల ఉద్యోగాలు దొరకడం కష్టమైంది. అందువల్ల 3 నెలల తర్వాత కూడా కొనసాగించారు. ఇప్పుడు ఉద్యొగాల పరిస్థితి మెరుగ్గా వున్నదంటూ తిరిగి 3 నెలల కాల పరిమితి విధిస్తున్నారు. 2016 జనవరి నించీ 22 రాష్ట్రాలలో 3 నెలలు మాత్రమే ఇస్తారు. ఇందువల్ల, 2016 లో 10 లక్షల మందికి అన్నం చీటీల డబ్బు ఆగిపోతుంది.
దాదాపు 5 కోట్లమంది అంటే 15 శాతం మంది అమెరికన్లు అన్నం చీటిలమీద ఆధారపడి బతుకుతున్నారు.2014 లో 4కోట్లా 80 లక్షలమంది ఆహారభద్రతలేని కుటుంబాలలో ఉన్నారు.వాళ్ళలో 1 కోటీ 53 లక్షలమంది పిల్లలు.అమెరికా ఆహార బాంకులు 400 కోట్ల పౌన్ల ఆహారాన్ని నిరుడు ఇచ్చారు.
ఇంకా 79 లక్షలమంది నిరుద్యోగులు 6 నెలలకు పైగా కాళీగా ఉన్నారు. కీతావేతనాల వాళ్ళు పెరుగుతున్నారు. దీనివల్ల ఇబ్బంది పడేవాళ్ళంతాపేదలే. ఇదీ రాకపోతే వాళ్ళు నానా అగచాట్లు పడవలసి వస్తుంది.వీళ్ళలో నూటికి 40 మంది మహిళలు. మూడోవంతు 40 ఏళ్ళు దాటినవాళ్ళు. అత్యధికులు విద్యార్హతలు పెద్దగా లేని వాళ్ళు.ఈపరిస్థితుల్లో అన్నం చీటిలు నిరాకరిండం ప్రభుత్వాల బధ్యతా రాహిత్యాన్ని బయటపెట్టుకోవడమే.

SNAPకి బడ్జెట్లో 2016 ఆర్ధిక సంవత్సరానికి ఒబామా కేటాయించింది 8,370 కోట్ల డాలర్లు. మిలిటరీకి 61,000 కోట్ల డాలర్లు.యుద్ధాలకి ఎంతైనా సరే అనే డెమాక్రట్లూ, రిపబ్లికన్లూ పేదరికం మీద యుద్ధానికి ఖర్చు తగ్గిస్తున్నారు. అగ్రరాజ్య అధిపతులకి పేదవాళ్ళకి పట్టెడు అన్నం పెట్టడానికి ప్రాణం ఒప్పడం లేదు.