30, డిసెంబర్ 2015, బుధవారం

వాగ్నర్ నుంచి రంగనాయకమ్మ వరకు కాపిటల్ వక్రీకరణలు

వాగ్నర్ నుంచి రంగనాయకమ్మ వరకు కాపిటల్ వక్రీకరణలు

                                                                                2016 జనవరి 'వీక్షణం' లో వచ్చింది

మార్క్స్ చెప్పినవి చెప్పలేదని ప్రచారం చేసీ, చెప్పకపోవడం తప్పు అనీ విమర్శించినవారు కొందరు, అలాగే, మార్క్స్ చెప్పనివి ఆయనకు ఆపాదించి దాని ఆధారంగా  తప్పుపట్టేవారు కొందరు చాలమంది ఉన్నారు. ఇలాంటి వాళ్లలో ప్రథముడు సోషలిస్ట్ ప్రొఫెసర్ అడాల్ఫ్ వాగ్నర్ (1835-1917). మార్క్స్ తన విశ్లేషణ నుంచి ఉపయోగపు విలువని పూర్తిగా తొలగించాడని వాగ్నర్ ఆరోపించాడు. ఇదేదో చిన్న విషయం మీద విమర్శ అనిపించవచ్చు. కాని మార్క్సుకి అదే ఎంతో ముఖ్యమయినది. అందుకే Marginal Notes on A. Wagner (1879) లో మార్క్స్ దాన్నితీవ్రంగా ఖండించాడు.

ముందుగా మార్క్స్ కాపిటల్ లో ఏం చెప్పాడో  చూడాలి:
సరుకు ఉపయోగపు విలువ, మారకం విలువల సమ్మేళనం. ఉపయోగం లేనిదేదీ సరుకు కాదు. ఉపయోగపు విలువ ... మారకం విలువ యొక్క వ్యక్తీకరణ రూపం, దృగ్గోచర రూపం అవుతుంది.
ఒక సరుకు విలువ మరొక సరుకు ఉపయోగపు విలువలో, అంటే మరొక సరుకు సహజ రూపంలో దర్శనమిస్తుంది.
అన్నిటినీ మించి, అదనపువిలువ శ్రమశక్తి యొక్క విశిష్ట మైన, దానికి మాత్రమే ప్రత్యేకంగా ఉన్నఉపయోగపు విలువ నుంచి లాగబడింది.
వీటినిబట్టి చూస్తే ఉపయోగపు విలువ మార్క్సుకి పై పై విషయంకాదు. కీలకమైనది. ఇదంతా కాపిటల్ లో సుస్పష్టంగా ఉన్నదే. దాన్ని చదివి కూడా మార్క్స్ అర్థశాస్త్రంలో ఉపయోగపు విలువకి స్థానం లేదు అన్నాడు వాగ్నర్.
అందుకే కావాలనే అస్పష్టంగా వుండేవాడు, కాపిటల్ లో ఒక్క ముక్క కూడా అర్ధం కాని వాడు మాత్రమే మార్క్స్ రచనలో ఉపయోగపు విలువకి ఏపాత్రా లేదు అనగలడు అన్నాడు మార్క్స్ ఘాటుగా. (Marx & Engels Collected works -volume 24 p.545)
 ఇప్పటి దాకా ఉన్న అర్ధశాస్త్రంలో కంటే, నా అర్ధశాస్త్రంలో ఉపయోగపు విలువ చాలా ఎక్కువ పాత్ర పోషిస్తుంది అన్నాడు మార్క్స్. 
ఇది మార్క్స్ చెప్పినా చెప్పలేదు అని విమర్శించిన విషయం.
****
చెప్పకపోయినా చెప్పాడు అన్నది అదనపు విలువకి సంబంధించినది.
శ్రామికులు మాత్రమే ఉత్పత్తిచేసిన అదనపు విలువ అనుచితంగా, అన్యాయంగా పెట్టుబడిదారుల వద్ద వుండి పోతుంది' అని మార్క్స్ అన్నట్లు వాగ్నర్ ఆరోపించాడు. అనుచితంగా, అన్యాయంగా అని మార్క్స్ అనలేదు. వాగ్నర్ అదనపువిలువ గురించి తాను చెప్పనిది తనకు ఆపాదించాడని మార్జినల్ నోట్స్ లో మార్క్స్ తప్పుబట్టాడు: నిజానికి, నేను దీనికి సరిగ్గా వ్యతిరేకమైనది చెప్పాను: ఏమనంటే, సరుకు ఉత్పత్తి ఒకానొక కాలంలో పెట్టుబడిదారీ సరుకు ఉత్పత్తిగా ఉంటుంది. ఈ పెట్టుబడిదారీ సరుకును నిర్దేశించే విలువ నియమం ప్రకారం, అదనపువిలువ తప్పనిసరిగా పెట్టుబడిదారునిదే అవుతుంది, కార్మికునిది కాదు. (Marx & Engels Collected works volume 24 p.558)
మార్క్స్ ప్రకారం ఉత్పత్తి విధానాన్ని బట్టి న్యాయం ఉంటుంది. బానిస వ్యవస్థలో న్యాయమయింది, పెట్టుబడిదారీ వ్యవస్థలో అన్యాయం కావచ్చు. సోషలిస్టు సమాజంలో అన్యాయం కావచ్చు. అందువల్ల ఒక వ్యవస్థను పరిశీలించేటప్పుడు మరొక వ్యవస్థ న్యాయాన్ని కొలబద్ద చెయ్యకూడదు.
'అర్థశాస్త్ర విమర్శకు చేర్పు ' ఉపోద్ఘాతంలో మార్క్స్ ఇలా అన్నాడు:   
పరిశోధనద్వారా నేను సాధించిన సాధారణ ఫలితాన్ని - ఏదైతే సాధింపబడిన తర్వాత నా అధ్యయనానికి మార్గదర్శక సూత్రంగా పనిచేసిందో ఆఫలితాన్ని - క్లుప్తంగా యిలా సూత్రీకరించవచ్చు: తమజీవితానికి సంబంధించిన సామాజికోత్పత్తిలో, మానవులు నిర్దిష్టమూ,అవశ్యకమూ, తమ యిచ్చకు అతీతమూ అయిన సంబంధాలను, తమ భౌతిక ఉత్పాదకశక్తుల అభివృద్ధిలో ఒకానొక నిర్దిష్ట దశకు అనురూపమైన సంబంధాలను పెట్టుకుంటారు. ఈ  ఉత్పత్తి సంబంధాల వెరశి మొత్తమే సమాజపు ఆర్ధిక నిర్మాణ చట్రం, దాని నిజమైన పునాది. ఆపునాది మీదనే చట్టబద్ధ, రాజకీయ ఉపరినిర్మాణం లేస్తుంది, సామాజిక చైతన్యానికి సంబంధించిన నిర్దిష్టరూపాలు దానికి అనురూపంగానే ఉంటాయి. భౌతిక జీవితానికి సంబంధించిన ఉత్పత్తి విధానమే మొత్తం మీద సామాజిక, రాజకియ, బౌద్ధిక జీవిత క్రమాన్ని నిర్దేశిస్తుంది. మానవుల అస్తిత్వాన్ని నిర్దేశించేది వారి చైతన్యం కాదు, తద్భిన్నంగా, వారి సామాజిక అస్థిత్వమే వారి చైతన్యాన్ని నిర్ణయిస్తుంది. వాటి అభివృద్ధికి సంబంధించిన ఒకానొక దశవద్ద, సామాజపు భౌతిక ఉత్పాదకశక్తులు అప్పటికి అస్థిత్వంలో ఉన్న ఉత్పత్తి సంబంధాలతో, లేక - దానికే చట్టబద్ధమైన పదబంధం అయిన ఆస్థి సంబంధాలతో - అవి యింతవరకూ వేటిలోనైతే పనిచేస్తున్నాయో ఆ ఆస్థి సంబంధాలతో ఘర్షణలోకి వస్తాయి. ఉత్పాదక శక్తుల అభివృద్ధి రూపాలుగా వున్న యీ సంబంధాలు  వాటికి శృంఖలాలుగా మారుతాయి. అప్పుడొక సామాజిక విప్లవ శకం ఆరంభమవుతుంది. ఆర్ధికపునాది మార్పుతో బ్రహ్మాండమైన యావత్తూ ఉపరినిర్మాణమూ కొద్దోగొప్పో వేగంగా రూపాంతరం చెందుతుంది."- మార్క్స్ ఎంగెల్స్ సంకలితరచనలు-భాగం2-పే.11
దీన్నిబట్టి వర్తమాన ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడానికే చట్టాలూ, నీతినియమాలూ ఏర్పడతాయి. ఉత్పత్తివిధానం మారితే, అవీ మారతాయి. అన్ని వ్యవస్థలకూ వర్తించే ఏకైక న్యాయం అంటూ ఏదీ ఉండదు. ఇదీ ఆయన అభిప్రాయం. ఈ చారిత్రక దృక్కోణం నుంచి ఆయన క్షణమైనా వైదొలగడు. దీనికి భిన్నంగా ఆయన వాదన ఉండదు. మార్క్స్ ని చదివేవారెవరైనా దీన్ని వదిలిపెట్టకూడదు. ప్రతి దాన్నీ చారిత్రకదృష్టితో పరిశీలించాలి. సోషలిష్టు సమాజాన్ని వూహించి దానికనుగుణమైన నియమాలు పెట్టుబడిదారీ వ్యవస్థకు వర్తింపచెయ్యాలంటే కుదరదు. సమాన విలువల మారకం అనేది ఈవ్యవస్థలో విలువ నియమం. దీని మీద ఆధారపడి,మార్క్స్ అదనపువిలువని నిరూపించాడు. ఈ నియమం ఏ సరుకుల మారకానికైనా వర్తించి తీరుతుంది. ఇది ఎట్టి పరిస్థితులలోనూ భంగపడరాదు. మార్క్స్ పాటించిన నియమం ఇది.
****
బోం బావర్క్ (1851-1914) ఆస్ట్రియా ఆర్ధిక వేత్త. ఆర్ధిక మంత్రిగా పనిచేశాడు. పెట్టుబడిదారులు కార్మికులను దోపిడి చెయ్యటం లేదని వాదించాడు.  వాగ్నర్ బాటలోనే  ఇతడు కూడా మార్క్స్ అర్ధశాస్త్రంలో ఉపయోగపువిలువకి చోటే లేదు అన్నాడు. అతను అప్పుడే తలెత్తుతున్న మార్జినలిస్ట్ స్కూల్ కి ప్రతినిధి. అది విలువ నిర్ణయంలో ఉపయోగపువిలువకి పెద్దపీట వేస్తుంది. అందుకే అంత ముఖ్యమైన అంశాన్ని వదిలివేశాడని మార్క్స్ ను విమర్శించాడు.

ఫెర్డినాండ్ లాసాల్ (1825-64) జర్మన్ సోషలిస్టు. 1848 నుంచీ మార్క్స్ శిష్యుడు. జర్మన్ కార్మిక ఉద్యమ నిర్మాతల్లో ఒకడు. ఆ కాలంలో మార్క్సు, ఎంగెల్స్ లతో సంబంధంలో ఉండేవాడు. జర్మన్ సోషల్-డెమొక్రటిక్ పార్టీ మార్క్సిస్టు పునాది మీద నిర్మాణమవుతున్నదని చెప్పేవాడు. అయితే  ఏఒక్కరూ తనకు తాను సాధించుకోలేని దాన్ని రాజ్యం సాధిస్తుంది అని అతను కార్మికులకి చెప్పాడు. మార్క్స్ చెప్పింది ఇందుకు సరిగ్గా వ్యతిరేకం: కార్మికవర్గం తన విముక్తి తాను సాధించుకొని, ప్రస్తుత రాజ్యాన్ని రద్దుచెయ్యాలి.  లాసాల్ రాజ్యం ఉండాలంటాడు. దానిని పటిష్టపరచాలంటాడు. ఇది మార్క్సుకి వ్యతిరేకమైనది.

లాసాల్ కఠిన వేతన నియమాన్ని సమర్థించాడు. మాల్థూస్ జనాభాసిద్ధాంతం ప్రకారం ఎప్పుడూ కావలసినదానికన్న ఎక్కువమంది శ్రామికులుంటారు గనక శ్రామికుడు సగటున కనీసవేతనం మాత్రమే పొందుతాడు. మార్క్స్ వేతనాల్ని నిర్ణయించే నియమాలు ఏ అర్ధంలోనూ కఠినమైనవి కాదనీ, సాగగలవనీ (ఎలాస్టిక్) చెప్పాడు. పెట్టుబడి సమీకరణ అనే అధ్యాయంలో మాల్థూస్ వాదనని తిప్పికొట్టాడు. వేతనాలను నియంత్రించే నియమాలు చాలా సంక్లిష్టమైనవనీ, పరిస్థితులను బట్టి ఒకప్పుడు ఒక నియమమూ, మరొకప్పుడు మరొక నియమమూ ప్రాబల్యం వహిస్తుందనీ, మరి అందుచేత అవి ఏవిధంగానూ కఠిన నియమాలు కావనీ చెప్పాడు. లాసాల్ భావించినట్లు ఈవిషయాన్ని ఏవో రెండుమాటల్లో పరిష్కరించడం సాధ్యం కాదని సవివరంగా రుజువుచేశాడు.

మాన్యుస్క్రిప్ట్స్ లో మొదటిది ఈమాటలతో మొదలవుతుంది: పెట్టుబడిదారుడికీ, కార్మికుడికీ మధ్య  పోరాటం ద్వారా వేతనాలు నిర్ణయమవుతాయి.

జూల్స్ గెస్డె (1845-1922) ఫ్రెంచ్ సొషలిస్టు. కాపిటల్ చదివాడు. 1875 జూన్ లో లండన్ లో లాఫార్జ్ ను, మార్క్స్, ఎంగెల్స్ లను కలిశాడు. మార్క్సిస్టునయ్యానని చెప్పాడు. అయితే లాసాల్ చెప్పిన వేతన దృఢత్వ సిద్ధాంతాన్ని - పెట్టుబడిదారీ విధానంలో వేతనాలు బాగా పెరగవు అని నొక్కివక్కాణించే సిద్ధాంతాన్ని - మార్క్సుకి అంటగట్టాడు. లాఫార్జ్, గెస్డె ఇద్దరూ తాము మార్క్సిజానికి ప్రతినిధులమని చెప్పుకున్నారు. 1880 లో జూల్స్ గెస్డె, పాల్ లాఫార్జ్ లు Parti Ouvrier Français (POF, or French Workers' Party) పేరుతో సోషలిస్ట్ పార్టీని స్థాపించారు. పెట్టుబడిదారీ వ్యవస్థని రద్దుచేసి సోషలిస్టు సమాజాన్ని స్థాపించడం దాని లక్ష్యం. పెట్టుబడిదారీ చట్రంలోనే సాధించగల డిమాండ్ల కోసం ఆందోళనకి ఆచరణాత్మక సాధనంగా కనీస కార్యక్రమాన్ని మార్క్స్ చూశాడు. కాని గెస్డె దాన్ని పోరాట కార్యక్రమంగా చూడలేదు. రాడికలిజం నించి కార్మికుల్ని బయటకు పంపించేదిగా పరిగణించాడు.

మార్క్స్ 1883లో చనిపోయే ముందు వాళ్లకి రాసిన లేఖలో సంస్కరణ పోరాటాల్ని తిరస్కరించినందుకు వాళ్లను విప్లవపదారాధకులు అన్నాడు.

కార్మిక సంఘాల పాత్రను ఫ్రెంచ్ సోషలిస్టులు వ్యతిరేకించారు. అదే మార్క్సిజమయితే నాకు తెలిసిందల్లా నేను మార్క్సిస్టును కాననే అని లాఫార్జ్ తో మార్క్స్ చెప్పాడు. అంతగా ఆయన సిద్ధాంతాన్ని వక్రీకరించారన్నమాట.
వీళ్లందరూ మార్క్సు సమకాలికులు. వీళ్లలో వాగ్నర్, బాం బావర్క్ ఇద్దరూ మార్క్సుకి వ్యతిరేకులు. మిగిలిన వాళ్లు మార్క్సిస్టులమని చెప్పుకున్న వాళ్లు.

**********
మార్క్స్ వ్యతిరేకి వాగ్నర్ ఉపయోగపు విలువని తప్పించాడని మార్క్స్ ను విమర్శిస్తే, మార్క్సిస్టులైన  మీక్, డాబ్స్వీజీ ప్రభృతులు, మార్క్స్ అలా చేశాడనుకుని, అలా చెయ్యడం సరయిందేనన్నారు. ఇది మార్క్సుమీద విమర్శ కాదు, సరయినదే అనుకున్నారు.
 ఉపయోగపు విలువ ..సహజ వస్తువుగా ప్రకృతి శాస్త్రానికి చెందిన వస్తువు; సామాజిక వస్తువుగా...రాజకీయ అర్ధశాస్త్రానికి చెందిన వస్తువు.... సరుకు ప్రాకృతిక అంశం. దాని ఉపయోగపు విలువ, రాజకీయ అర్ధశాస్త్రం బయటనే ఉంటుంది అన్నాడు హిల్ఫర్డింగ్. అది కొంతకాలం చలామణీ అయింది. అయితే ఆ అవగాహన తప్పు.
 1859 లో వెలువడిన మార్క్స్ క్రిటిక్  లో ఉన్నది ఇలా: ఉపయోగపు విలువగా ఉండడం సరుక్కి ముందుషరతు, కాని అది సరుకా కాదా అనేది ఉపయోగపు విలువకి నిమిత్తం లేదు. దానికదిగా ఉపయోగపు విలువ, నిర్ణాయక ఆర్ధిక రూపానికి స్వతంత్రంగా ఉంటుంది కాబట్టి, అది రాజకీయ అర్థశాస్త్ర పరిశోధనకి ఆవల ఉంటుంది. దానికదే నిర్ణాయక రూపం అయినప్పుడు ఈ పరిధిలోకి వస్తుంది.
ఇందులో చివరి వాక్యాన్ని పట్టించుకోకపోవడమే గందరగోళానికి కారణం.
అదనపువిలువ ఉత్పత్తిలో శ్రమశక్తి ఉపయోగపు విలువది నిర్ణాయక రూపం. కనక అది అర్థశాస్త్ర పరిధిలోకి వస్తుంది.
వాగ్నర్ మీద రాసిన నోట్స్ బయటకొచ్చాక మార్క్సిస్టులు ఉపయోగపు విలువకున్న ప్రాధాన్యతని తెలుసుకున్నారు. మార్క్సే స్వయంగా చెప్పాడని తెలిశాక పాత ఆలోచనలు ఉన్నవాళ్లు గాడిన పడ్డారు.
అయితే మార్క్సిస్టులందరూ ఆయన అదనపు విలువ సిద్ధాంతాన్ని యథాతథంగా అంగీకరించారు. అదనపువిలువని రాబట్టిన తీరుని తలదాల్చారు. మార్క్సిస్టులు ఎవ్వరూ దీనితో విభేదించలేదు. రంగనాయకమ్మగారు ఒక్కరే మినహాయింపు.
*********
1867 లో కాపిటల్ అచ్చయ్యాక, పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు ఆయన సిద్ధాంతం వివరణల్లో వైరుధ్యాలేమైనా దొరుకుతాయేమోనని ఆయన రచనల్ని ఉత్తరాలతో సహా గాలించారు. దొరకలేదు. మార్క్సిస్టునని చెప్పుకునే రంగనాయకమ్మ గారు మాత్రం సులువుగా ఇది వైరుధ్యం కాదా అని ప్రశ్నించారు.
కార్మికుడు పెట్టుబడిదారుడికి ఎక్కువ విలువ ఇస్తే పెట్టుబడిదారుడు కార్మికుడికి తక్కువ విలువ ఇస్తాడు కదా? వాళ్ళమధ్య మారకం ఎప్పుడూ ఇలా అసమానంగానే జరుగుతూ ఉంటుంది కదా? 'మారకం అనేది సమాన విలువల మధ్యనే జరుగుతుంది 'అనే విలువసూత్రం ప్రకారం, ఇది వైరుధ్యం కాదా? అని ప్రశ్నించి అవును, ఇది తప్పనిసరిగా వైరుధ్యమే అన్నారు. (కొత్త పరిచయం-1-పే.226)
మార్క్స్ ప్రకారం: మారకం జరిగేది కార్మికుడి శ్రమశక్తికీ, పెట్టుబడిదారుడి డబ్బుకీ. అది సమాన విలువల మారకమే. శ్రమశక్తిని అమ్మాక దాని ఉపయోగపువిలువ కొన్నవాడిదే. ఎంత శ్రమజరిగినా అంతా పెట్టుబడిదారుడిదే.
అయితే తయారైన సరుకుల్లో చేరిన విలువ మొత్తం కార్మికునికే రావాలి అనే వాదన వుంది. అదంతా వాళ్లదే. కాని అలా రావడం లేదు. కొంత యజమానికి చేరుతున్నది. కనక అది అసమాన మారకం. ఇది రికార్డియన్ సోషలిష్టుల వాదం. రికార్డియన్ సోషలిష్టులు కార్మికుడు తన ఉత్పాదితం మొత్తానికీ హక్కుదారుడు అని వాదించారు. జాన్ ఫ్రాన్సిస్ బ్రే అసమాన మారకాల మోస విధానం చట్టబద్ధ బందిపోటు అని దుయ్య బట్టాడు. చార్లెస్ హాల్స్ శ్రమ ఉత్పత్తి మొత్తం మీద హక్కు సహజ మానవ హక్కు అనీ, భగవంతుని ఆజ్ఞ అనీ చెప్పాడు. జాన్ గ్రే ఈ విధానపు పునాది అన్యాయం అని నిరసించాడు.
రికార్డియన్ సోషలిష్టులు 1820, 1830 దశకాల్లో కృషి చేశారు. దోపిడీ సిద్ధాంతానికి అసమాన మారకాన్నే పునాది ఛేశారు. ఇది పెట్టుబడిదారీ విధానం పరిధిలోనే దోపిడీని నిర్మూలించే అవకాశం ఉంది అనే అభిప్రాయానికి అవకాశమిస్తుంది. మార్క్సు దీన్ని తీవ్రంగా ఖండించాడు. మార్క్స్ తన అర్థశాస్త్రానికి ఎప్పుడూ నైతిక విషయాల్ని ఆధారం చేసుకోలేదు.
రికార్డియన్ సోషలిస్టులు సామాజిక సామరస్యం నెలకొనడానికి సరసమైన, సమానమైన మారకం సరిపోతుంది అని నమ్మారు. ఇది బూర్జువా భ్రాంతి/భ్రమ అన్నాడు మార్క్స్. మార్క్స్ ఖండించిన దాన్ని సరైనదని రంగనాయకమ్మ గారు భావిస్తున్నారు. ఇది వైరుధ్యం కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఇది అంతకుముందే రికార్డియన్ సోషలిష్టులు చెప్పిందే.
రంగనాయకమ్మ గారు అంతటితో ఆగలేదు. మరికొంత ముందుకుపోయి పెట్టుబడిదారుడికీ కార్మికుడికీ అసలు మారకమే లేదు అన్నారు. 
కార్మికుడు పెట్టుబడిదారుడికి ఇచ్చేది తన శ్రమని. దానికి బదులుగా పెట్టుబడిదారుడు కార్మికుడికి ఇచ్చే సరుకు ఏదీ వుండదు. కార్మికుడు ఇచ్చే శ్రమలోనించే కొంతభాగాన్ని తీసి, దానికి జీతం అనే పేరుబెట్టి, దాన్ని కార్మికునికి ఇస్తాడు. మిగిలిన శ్రమనంతా పెట్టుబడిదారుడు తీసుకుంటాడు. పెట్టుబడిదారుడు జీతం పేరుతో ఇచ్చేది, పెట్టుబడిదారుడి శ్రమకాదు. వాడు కార్మికుడి నించి తీసుకోవడమే గాని కార్మికుడికి ఇచ్చేదేమీ లేదు. అంటే, పెట్టుబడిదారుడు కార్మికుడి శ్రమని దోచడమే గాని ఆ ఇద్దరి మధ్యా మారకం అనేది వుండదు. (కొత్తపరిచయం, పే. 248)
ఇద్దరి మధ్యా అసలు మారకమే ఉండదు. జరిగేది కార్మికుడి శ్రమలో కొంతభాగాన్ని పెట్టుబడిదారుడు లాగడమే.
సరే. మిగతాభాగం ఏమవుతుంది? కార్మికునికి పోతుందికదా! అది మారకమే. సొంత డబ్బుల్లోనించి ఇచ్చాడా లేక ఆ తర్వాత తన సరుకులు అమ్మగా వచ్చిన డబ్బుతో ఇచ్చాడా అన్నది మారకానికి సంబంధంలేని విషయం. మారకం జరిగినట్లే అని మార్క్స్ చెప్పాడు.
పెట్టుబడిదారుడు యీవేతనం చెల్లించేది అతనికి బట్టనుండి వచ్చే డబ్బుతో కాదు, అతనివద్ద అప్పటికే వుండిన డబ్బుతో. నేతకార్మికునికి అతని యజమాని సరఫరా చేసిన మగ్గమూ, నూలూ యెలా ఆ కార్మికునివి కాదో, అలాగే శ్రమశక్తి అనే తనసరుకుకు సాటాగా ఆ కార్మికుడు పొందే సరుకులు కూడా అతని ఉత్పాదితం కాదు. యజమానికి తన బట్టకు కొనుగోలుదారుడే దొరికివుండక పోవచ్చు. దాని అమ్మకం ద్వారా అతనికి వేతనం డబ్బులు కూడా వచ్చివుండక పోవచ్చు. నేతకార్మికుని వేతనంతో పోలిస్తే అతను దానిని చాలా లాభదాయకంగా అమ్ముకోవచ్చు. అవన్నీ నేతకార్మికునికి సంబంధం లేదు. పెట్టుబడిదారుడు తనదగ్గరున్న ధనంలో - తన పెట్టుబడిలో – కొంత భాగంతో నేత కార్మికుని శ్రమశక్తిని కొంటాడు. (వేతనశ్రమా, పెట్టుబడీ- సం.ర.-1 పే 95)
పెట్టుబడికీ, శ్రమకీ మొదటి మారకం పద్ధతి ప్రకారం జరిగే ప్రక్రియ. ఇక్కడ డబ్బు పెట్టుబడిగానూ, శ్రమశక్తి సరుకుగానూ ఉంటాయి... చట్టరీత్యా శ్రమశక్తి అమ్మకం ఈ మొదటి ప్రక్రియలో జరుగుతుంది - శ్రమ జరిగిన తర్వాతే రోజు చివరో, వారం చివరో మరొకప్పుడో చెల్లించినప్పటికీ. ఇది శ్రమశక్తి అమ్మబడిన లావాదేవీని ఏవిధంగానూ మార్చదు. (అదనపు విలువ సిద్ధాంతాలు- భాగం1- పే.397) 
ఏమయినప్పటికీ డబ్బు కొనుగోలు సాధనంగా వ్యవహరిస్తుందా, చెల్లింపు సాధనంగా వ్యవహరిస్తుందా అన్నది సరుకుల మార్పిడి స్వభావాన్ని మార్చదు. ఒప్పందంలో శ్రమశక్తి ధర నిర్ణయమవుతుంది. అయితే ఇంటి అద్దె లాగానే, అది కొంతకాలం తర్వాతనే చేతికి వస్తుంది. శ్రమశక్తి విక్రయం జరిగింది. అయితే కొంత కాలం తర్వాత మాత్రమే అది చెల్లించబడుతుంది. విషయం స్పష్టంగా అర్థం గావడానికి గాను ప్రతి అమ్మకంలోనూ శ్రమశక్తి కలవాడు దానికి నిర్ణయించిన ధరను వెంటనే పుచ్చుకోగలుగుతున్నాడని కాసేపు భావిద్దాం. (Cap1-p 171)
సార్వత్రిక సమానకం అయిన డబ్బు ఇస్తాడు. అయితే రంగనాయకమ్మ గారు ఆడబ్బు అతనికెలా వచ్చింది, అదికూడా కార్మికులదే కాబట్టి మారకమే లేదు అంటున్నారు. అయితే ఆడబ్బు అతనికి ఎక్కడిది అనే దానితో మారకానికి సంబంధం ఉండనే ఉండదు.
2013 జూలై వీక్షణంలో రంగనాయకమ్మ గారు పెట్టుబడిదారుడికీ, కార్మిక నాయకుడికీ ఒక ఊహా సంభాషణ సృష్టించారు. శ్రమశక్తిని డబ్బు పెట్టి కొంటున్నానని పెట్టుబడిదారుడు అన్నప్పుడు, "నీడబ్బుపెట్టా? డబ్బు నీదా? ఏ శ్రమచేసి డబ్బు సంపాదిస్తున్నావు? నా శ్రమను అమ్మి, నాడబ్బులోనించి ఒక్క పైసా నాకు పడేస్తావు. మిగతా డబ్బు రాశి నీ పరం" అంటాడు కార్మికుడు. పరిచయంలో "ఆ డబ్బు కార్మికులదే, పెట్టుబడిదారుడిది కాదు" అంటాడు కార్మికుడు. "జీతం కార్మికుడి శ్రమలోది తీసి కార్మికుడికి ఇచ్చేదే"
ఈ వాదనను మార్క్స్ ఒప్పుకోలేదు. పెట్టుబడిదారు తన దగ్గరున్న డబ్బునుంచి ఇస్తాడని అన్నాడు. ఆ డబ్బు అతనికి ఎక్కడిది, కార్మికుల శ్రమ నించి వచ్చిందే కదా అని రంగనాయకమ్మ గారి ప్రశ్న. అయితే పెట్టుబడిదారీ విధానం కొనసాగినంతకాలం అదనపు విలువ పెట్టుబడిదారుడిదే. కనక ఆ డబ్బు చట్టరీత్యా కూడ అతనిదే. ఇది నైతిక వ్యవహారం కాదు.
డబ్బూ సరుకూ చేతులు మారాయంటే అది మారకమే. ఆ డబ్బు ఎలా వచ్చిందీ, ఆ సరుకు ఎవరు చేసిందీ అనే విషయాలతో మారకచర్యకి సంబంధం ఉండదు. మారకంలో పాల్గొన్నవాళ్లు సమానులా కాదా అనేదానితో నిమిత్తం ఉండదు. మారినవి రెండు సరుకులయినా ఒకటే, డబ్బూ సరుకూ అయినా ఒకటే.
శ్రమశక్తి విలువని నేను చెల్లించేస్తున్నాను కదా, ఇంకా తప్పేమిటి? అంటున్నాడే పెట్టుబడిదారుడు? ఆ శ్రమశక్తి విలువ ఎవరు నిర్ణయించింది? వాడు నిర్ణయించిందే!...దోపిడీదారుడి నియమం ప్రకారం మనిషి (శ్రమచేసే మనిషి) అర్ధాకలితో మాడాలి. శ్రామికుడి అవసరాల్ని ఇంత కనీస స్థాయిలో నిర్ణయించి, కనీస విలువనే యిచ్చి శ్రమశక్తి విలువని ఇచ్చేస్తున్నానే! అంటున్నాడు పెట్టుబడిదారుడు. (పాత పరిచయం-2- 266-67)
శ్రమశక్తి విలువని నిర్ణయించేది పెట్టుబడిదారుడొక్కడే కాదు. కార్మికుడు కూడా. అది ఒప్పందం. ఇరువురూ ఒప్పుకుంటేనే కుదురుతుంది. సంప్రతింపులుంటాయి. వేతనాల మార్పుకి బాగా అవకాశం వుందని మార్క్స్ విశ్వసించాడు. ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవటం కార్మికసంఘాల  బాధ్యతగా భావించాడు. వాస్తవానికి వేతనం సరఫరా, గిరాకీలను బట్టీ, కార్మికులు వేతనపెంపు కోసం చేసే పోరాటాల పటిమను బట్టీ వుంటుంది. అంతేగాని పెట్టుబడిదారుడొక్కడే తన యిష్టానుసారం  కనీసావసరాల విలువే శ్రమశక్తి విలువ అంటే సాగదు.

వీక్షణం వ్యాసంలో కొత్త విషయం ఏమంటే: శ్రమ శక్తి సరుకు కాదు అనేది.
శ్రమశక్తి సరుకు అనీ, దాన్ని శ్రామికుడు అమ్ముతాడనీ, పెట్టుబడిదారుడు కొంటాడనీ ఈరకంగా చెప్పడం వల్ల, శ్రమదోపిడీ జరుగుతోందనే వాదం బలహీనపడిపోదా? అని ప్రశ్నించారు రంగనాయకమ్మ గారు.
శ్రమ దోపిడిని నిజమైన విషయంగా చూపించాలంటే శ్రమశక్తిని పెట్టుబడిదారుడు కొంటాడు అనే వాదం తప్పనీ, దాన్ని వదులుకోవాలనీ నావాదం అంటూ సరిపుచ్చారు.
దోపిడీ రుజువు కావాలంటే, పెట్టుబడికీ, శ్రమశక్తికి మారకం లేదని చెప్పాలి. అంతకు ముందూ చెప్పారు. అయితే కారణం ఆ డబ్బు అతనిది కాదు. అతని శ్రమతో వచ్చింది కాదు. కార్మికులది. వాళ్లదే వాళ్లకి ఇస్తున్నాడు కనక మారకమే లేదు. ఇది నాటి వాదన. నేటి వాదన ప్రకారం శ్రమశక్తి సరుకు కాదు. సరుకు కానిది మారకం కాజాలదు. అందువల్ల మారకం లేదు.
శ్రామికుడికీ పెట్టుబడిదారుడికీ మధ్య నిజంగా జరిగే విషయాలు అమ్మడాలూ - కొనడాలూ కాదు అని తేల్చారు.
అయితే మార్క్స్ చెప్పింది ఇది: ఈ మొదటి మారకం లేకపోతే పెట్టుబడిదారీ ఉత్పత్తి ఉండదు. శ్రమ సరుకు కావడంతోనే, పెట్టుబడిదారీ విధానం మొదలయింది.
పెట్టుబడిదారుడికి దక్కే అదనపువిలువ, సరిగ్గా శ్రామికుడు తన శ్రమశక్తిని సరుకుగా అతనికి అమ్మాడు అనే వాస్తవం నించి ఏర్పడుతుంది (అదనపు విలువ సిద్ధాంతాలు-1-పే 315)
శ్రమశక్తి సరుకు కాదనీ, మారకం లేదనీ అంటే, మార్క్స్ వివరణని బట్టి అసలు పెట్టుబడిదారీ విధానం రానట్లే, లేనట్లే.
పెట్టుబడిదారుడు శ్రమశక్తిని కొంటాడనీ, శ్రమశక్తి ఇచ్చే ఉపయోగపువిలువ అతనిదే అనీ, ఒకవేపు వాదిస్తూ; ఆ శ్రమశక్తి ద్వారా అదనపువిలువని తీసుకోవడం శ్రమదోపిడీ అవుతోందని ఇంకోవేపు వాదిస్తే ఆ రెంటికీ ఎలా పొసుగుతుంది?అని రంగనాయకమ్మ గారు ప్రశ్నించారు. (వీక్షణం జూన్2013 పే. 56)
ఎలా పొసుగుతుందో మార్క్స్ పెట్టుబడి లో వివరించాడు. అయితే ఆ వాదన తప్పంటున్నారు వీరు.
పెట్టుబడిదారుడు దోచడమే నిజం కాబట్టి, ఆవాదాన్నే సరైనదిగా భావించి దాన్నే నిలబెట్టాలి. 'శ్రమశక్తి ఇచ్చే ఉపయోగపు విలువ, పెట్టుబడిదారుడిదే' అనే వాదానికి దారితీసే శ్రమశక్తిని అమ్మడం-కొనడం అనే భావాల్ని మాత్రం వదలి వెయ్యాలి. అప్పుడే సమస్య తీరుతుంది. (వీక్షణం జూన్2013 పే. 57)
కాని, శ్రమశక్తి ఎలాంటిదంటే, అది తన విలువ కన్నా ఎక్కువ విలువగల పని చెయ్యగలదు" అని అదే వ్యాసంలో అనడంలో రంగనాయకమ్మ గారు కూడ శ్రమశక్తిని  సరుకుగా చూస్తున్నారు. దానికి విలువా, ఉపయోగపు విలువా వున్నాయంటున్నారు. నేను అమ్మేదీ, నువ్వుకొనేదీ, నా శ్రమశక్తి వరకే. నేను నా మొత్తం శ్రమనంతా నీకు అమ్మడం లేదు" అనడంలోనూ శ్రమశక్తిని అమ్మేది అది సరుకైనప్పుడే గదా.
శ్రమ శక్తి అనేది సరుకు కాదు అని రంగనాయకమ్మ గారి కార్మిక నాయకుడు ఒప్పుకుంటాడు. అంతేగాదు మార్క్స్ పొరపాటు పెట్టుబడిదారుడి వాదనకి ఉపయోగపడిందని చెబుతాడు.
నీ వల్ల జరిగేది శ్రమదోపిడీ కాదని నువ్వు వాదించడానికి నా పొరపాటు నీకు ఎంత సాయపడిందో, నీకు ఎంత ధైర్యం ఇచ్చిందో నాకు ఇప్పుడు తెలుస్తున్నది. శ్రమదోపిడేయే లేదని దోపిడీదారుడు విర్రవీగుతుంటే, నోరెత్తలేని స్థితిలో శ్రామికుడు పడిపోయాడంటే కారణం నా గురువు పొరపాటే అంటాడు. ఇది చిన్నపొరపాటు అని సర్దుబాటు చేస్తాడు. తప్పకుండా మార్చుకుంటాడని హామీ ఇస్తాడు. ఆ పొరపాటు వల్ల మార్క్స్ దోపిడీని నిరూపించలేకపోయాడు. అనుకున్నదానికి సరిగ్గా వ్యతిరేకమైన దాన్ని రుజువు చేశాడు. అందుకు కారణం శ్రమశక్తిని సరుకు అనడమూ, శ్రామికుడికీ పెట్టుబడిదారుడికీ మారకం ఉందనడమూ అని రంగనాయకమ్మ గారి వాదం.
కాని మార్క్స్ సమాన విలువల మారక నియమానికి అనుగుణంగా దోపిడీని నిరూపించగలిగింది శ్రమశక్తిని సరుకు అనడం ద్వారానే. శ్రమ సరుకు కాదు అని చెప్పడం ద్వారానే. కనక ఇది చిన్న పొరపాటు కాదు. మార్క్స్ చేసింది కాదు. ఈ కార్మికనాయకుడే మార్క్సిజం తప్పు అని నిరూపించే కీలక దోషానికి పాల్పడుతున్నాడు. దోపిడీ లేదని పెట్టుబడి వాదించినప్పుడు కార్మికుడు నోరెత్తలేని పరిస్థితిలో పడడానికి కారణం శ్రమశక్తి సరుకు అనడమట!
ఒక సైన్సుని నేర్చుకునేచోట చిన్నపొరపాటు అయినా పొరపాటే అని రంగనాయకమ్మ గారే హెచ్చరించారు. (పాత పరిచయం-1 పే. 14)

దోపిడీని గ్రహించడానికీ, దోపిడీని నిర్మూలించే నూతన సమాజాన్ని నిర్మించడానికీ, మార్క్స్ ఇచ్చిన సిద్ధాంతమే మార్క్సిజం (పాత పరిచయం-1 పే. 4) సరిగా అక్కడే మార్క్స్ పొరపాటు చేశాడంటూ, దోపిడీని గ్రహించడానికి ఆయనే సిద్ధాంతాన్ని సమకూర్చాడనడాన్ని ఏమనాలి?

మొత్తం మీద మార్క్స్ అదనపు విలువని వివరించడానికి తీసుకున్న అధారమే తప్పని తేల్చారు. మార్క్స్ సిద్ధాంతానికి పునాది తప్పని మార్క్స్ శిష్యుడైన కార్మికుని చేతనే అనిపించారు. మరి ఆధారం తప్పయితే, మార్క్స్ నిర్ధారణ తప్పన్నట్లే. అదనపు విలువ సిద్ధాంతం తప్పు అన్నట్లే.
శ్రమ సృజించిన విలువ అంతా పెట్టుబడిదారీ విధానం నియమాల ప్రకారం శ్రామికులకు రాదు. అంతేకాదు నూతన సమాజంలో కూడ కార్మికులు పూర్తి శ్రమ విలువని పొందుతారనే వాదనను  మార్క్స్ తిరస్కరించాడు. మొత్తం శ్రమ వుత్పాదితంలో చాలా మినహాయింపులుంటాయి అని స్పష్టంగా గోథా కార్యక్రమ విమర్శలో కుండబద్దలు కొట్టి మరీ చెప్పాడు. ఆదిమ సమాజంలోకూడా సమాజ వుత్పత్తిని వుమ్మడిగా వాడుకున్నారే తప్ప ఎవరు చేసినవి వాళ్లవి కావు.
మార్క్స్ పొరపాటు బయటపెట్టడమే లక్ష్యంగా వ్యాసమంతా రాసి, చివరలో సంబంధంలేకుండా ఒక వాక్యం! మార్క్సు మూలసూత్రాన్ని మూలకునెట్టి, మార్క్సుని తప్పుబట్టి, మార్క్స్ శిష్యులు గురువునించి ఏమి నేర్చుకుని ఉంటారో ఊహించలేక నన్ను పిలిచావు. నీ ఎత్తుగడలు ఎక్కడయినా చేసుకో, మార్క్స్ శిష్యుల మీద కాదు. అక్కడ సాగవు  అనడం. వారే తప్పుబట్టి మార్క్సునించి అంతా నేర్చామనడం. ఒకపక్క తప్పంటూనే, మరొక పక్క శిష్యులం అనడం.  గురువుని మించిన  శిష్యులా, ముంచిన శిష్యులా?

ఆయన వివరించి చెబితేనే శ్రమదోపీడీ రహస్యం, సమాజానికి తెలిసింది అన్నారు. మళ్ళీమార్క్సు చెప్పింది తప్పని తేల్చారు. శ్రమశక్తి సరుకు కాదు. పెట్టుబడికీ శ్రమకీ మారకం లేదు. అదీ మిధ్య ఇదీ మిధ్య అయితే, మధ్యలో దోపీడి ఏమిటి? పెట్టుబడికీ శ్రమశక్తికీ మారకం జరిగితేనే ఉత్పత్తి మొదలవుతుంది. అప్పుడు అదనపు ఉత్పాదితం పెట్టుబడిదారుడికి చిక్కుతుంది. ఈ మారకం మిధ్య అయితే అదనపు ఉత్పత్తీ మిధ్యే, అదనపు విలువా మిధ్యే. అయితే దోపిడీ శాస్త్రపరంగా ఎలా వివరించాలో వారికే ఎరుక!  వారు ఏమి చెప్పినా అది మార్క్సుది కాదు. మరొకరిది. మార్క్సిజం కాదు, మరొకరిజం.
కాపిటల్ పరిచయం ముందుమాటలో ఇది ఒరిజినల్ నించి ఎక్కడా భిన్నమైనది కాదు అని చెప్పుకున్నారు. మార్క్స్ రాసిన దానికి భిన్నమైనవి చెప్పటమే కాక, మూలాధారమైన అదనపు విలువ వివరణనే తప్పుపట్టారు. వారన్నట్లు మార్క్స్ ఇచ్చిన సిద్ధాంతమే మార్క్సిజం అయితే  రంగనాయకమ్మగారిది మార్క్సిజం కాదు. మరొకరిజం.  అదే మార్క్సిజం అయితే నాకు తెలిసిందల్లా నేను మార్క్సిస్టును కాను అన్న మార్క్స్ మాటల్ని గుర్తుచేసుకోవలసి వస్తుంది.

3, సెప్టెంబర్ 2015, గురువారం

అదనపు విలువ గురించి మార్క్స్ చెప్పిందేమిటి?

అదనపు విలువ గురించి మార్క్స్ చెప్పిందేమిటి?

'వీక్షణం' 2015సెప్టెంబర్ సంచికలో                                                                      ఇ యస్ బ్రహ్మచారి

“In view of the incredibly widespread nature of the distortions of Marxism, our first task is to restore the true doctrine of Marx.” -- Lenin, The State and Revolution

 

మార్క్సిజాన్ని కొందరు ‘మేధావులు’ ఇచ్ఛవచ్చినట్లు వక్రీకరిస్తున్నారు. విలువ నియమం భంగం కాకుండా మార్క్స్ అదనపు విలువని శాస్త్రీయంగా వివరించినప్పటికీ అది తప్పనేవారు ఏర్పడ్డారు – అదీ ‘మార్క్సిస్టు’ ముద్రతో. కనక అసలు మార్క్స్ ఏమిచెప్పాడో చూడాల్సిన అవసరం వుంది. మార్క్సిజానికి ఆధారం ఆయన రచనలేగదా!
పెట్టుబడి పుస్తకం లక్ష్యం “ఆధునిక సమాజపు ఆర్థిక చలన నియమాన్ని బయటపెట్టడం” అని మార్క్స్ తొలి జర్మన్ కూర్పుకి ముందుమాటలో ప్రకటించాడు. అదే అదనపువిలువ నియమం. అదనపువిలువ ఉత్పత్తే ఈ ఉత్పత్తి విధానపు అఖండ నియమం (కాపిటల్ 1 పే. 580) అని చెప్పాడు.
అదనపువిలువ సూత్రం మార్క్స్ ఆర్థిక సిద్ధాంత సౌధానికి పునాది. విలువ నియమాన్ని అనుసరించి అదనపు విలువను రుజువుచేశాడు. ఈ రెంటినీ పరిశీలించడానికే ఈవ్యాసం.
మారకాలూ- విలువా
మనచుట్టూ అనేక సరుకులున్నాయి. మార్కెట్లలో లెక్కకు మించి మారకాలు జరుగుతుంటాయి. అవన్నీ సరుకుకీ డబ్బుకీ మధ్య. డబ్బు ఏర్పడక ముందు వస్తుమార్పిడి సాగింది. ఒక శేరు జొన్నలు యిచ్చి చిన్న గిన్నెడు నూనె తెచ్చుకోవడం. ఆరెండూ సమానమని ఇరువురూ అనుకుంటేనే మారకం జరుగుతుంది. డబ్బొచ్చాక సరుకుకీ, డబ్బుకీ సరిపోవాలి.
ఒక ఇల్లు = 5 మంచాలు అనేదానికీ, 
ఒక ఇల్లు = ఫలానింత డబ్బు అనేదానికీ                                             తేడావుండదు అన్నాడు అరిస్టోటిల్.

ఇలా విలువరూపాన్ని మొదట విశ్లేషించిన వ్యక్తి ఆయనే. మారకం అయ్యాయంటే రెండూ సమానమనే. “సమానత్వం లేకుండా మారకం జరగదు. ఒకే ప్రమాణం చేత కొలవబడకుండా సమానత్వం వుండదు.” సమాన విలువలు కలిగిన సరుకులే మారకం అవుతాయి అనే విషయం అరిస్టోటిల్ కి తెలుసు. అయితే “వాస్తవంలో అలాంటి పోలికలేని వస్తువులు ఒకే ప్రమాణంతో కొలవబడడం అసాధ్యం” అన్నాడు. కనక సమానీకరణ వాటి నిజస్వభావానికి కుదరని విషయం.  పర్యవసానంగా అది వాడుకలో అవసరాలకోసం తాత్కాలిక వుపకరణం మాత్రమే. అవసరాలకోసం నీది నాకు కావాలి, అలాగే నాది నీకు కావాలి. కనక మారకం చేసుకుందాం.

రెండు భిన్న రూపాలున్న సరుకుల్లో ఉమ్మడిగా ఏదో వుంటేనే గాని దాన్ని కొలిచి సమానం చేయటం సాధ్యంకాదు. అన్ని సరుకుల్లో ఉమ్మడిగా వుండి కొలవటానికి వీలయిన అంశం ఏదో ఆయన పరిశీలనకు అందలేదు.

ఆ అంశాన్ని సాంప్రదాయక అర్థశాస్త్ర సంస్థాపకుడూ, ఆడం స్మిత్, డేవిడ్ రికార్డో, కార్ల్ మార్క్స్ ల మార్గదర్శకుడూ విలియం పెట్టీ (1623-1687) పట్టుకున్నాడు. “ఒకడు సరిగ్గా ఒక బుషెల్ ధాన్యాన్నిఉత్పత్తి చెయ్యగలిగిన కాలంలోనే, పెరూ నేలలోంచి ఒక ఔన్సు వెండిని తవ్వి లండన్ కి తీసుకురాగలిగితే, అప్పుడు ఒకటి ఇంకోదానికి సహజమైన ధర అవుతుంది" అంటూ శ్రమే విలువసారం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు (కాపిటల్ 1, పే. 95). ఆయన “సరుకుల విలువను వాటిలో యిమిడివున్న శ్రమ పరిమాణాన్ని పోల్చి నిర్ణయిస్తాడు” (థియరీస్ ఆఫ్ సర్ ప్లస్ వాల్యూ, సం. 1, పే. 355).
పేరు తెలియని ఆర్థికవేత్త ఒకరు 1739-40లో కావచ్చు, జీవితావసరాలు “...ఒకదానితో మరొకటి మారకం చేసుకోబడినప్పుడు, వాటి విలువ తప్పనిసరిగా అవసరమైన శ్రమ పరిమాణం చేత, వాటిని ఉత్పత్తి చెయ్యడంలో మామూలుగా గ్రహించబడిన శ్రమ పరిమాణంచేత నియంత్రించబడుతుంది" అన్నాడు (కాపిటల్ 1, పాదసూచిక 47).
మొట్టమొదటిసారి ఉద్దేశ్యపూర్వకంగా, స్పష్టంగా మారకపువిలువని శ్రమకాలంగా తేల్చినవ్యక్తి బెంజమిన్ ఫ్రాంక్లిన్ (1706-1790). “రాజకీయ అర్థశాస్త్రపు ప్రామిక నియమాన్ని మొదట సూత్రీకరించినవ్యక్తి... ఫ్రాంక్లిన్” “విలువయొక్క వాస్తవస్వభావాన్ని కనుగొన్నాడు" అన్నాడు మార్క్స్. వర్తకం అంటే శ్రమను శ్రమతో మారకం చేయటం తప్ప మరొకటి కాదు, కనక అన్నివస్తువుల విలువా శ్రమచేత ... న్యాయంగా కొలవబడుతుంది అన్నాడు. మారకం అవుతున్న శ్రమలలోని వ్యత్యాసాల్ని ఉపేక్షించాడు. వాటన్నిటినీ సమాన మానవ శ్రమగా కుదించే అభిప్రాయాన్ని, తెలిసి కాకున్నా, వెల్లడించాడని మార్క్స్ శ్లాఘించాడు (కాపిటల్ 1, పే. 57, పాదసూచిక 1).
శ్రమే అన్నిసరుకుల మారకంవిలువలకీ నిజమైన కొలత అన్నాడు ఆడం స్మిత్.
వేటగాళ్ల సమాజంలో ఒక బీవర్ని చంపటానికి పట్టేకాలం ఒక జింకని చంపటానికి పట్టేకాలానికి రెట్టింపు అయితే, ఒక బీవర్ కీ రెండు జింకలకీ మారకం జరుగుతుంది. తరవాతి సమాజాల్లో అలాకాదు. ధాన్యం ధరలో ఒక భాగం భూస్వామి భూమి కౌలుగా, రెండో భాగం కార్మికుల వేతనంగా, మూడోది రైతు లాభంగా ఉంటుంది. ధాన్యం ధర కౌలు, అద్దె, వేతనం, లాభంగా పరిణమిస్తుంది అంటాడు. వేతనాలూ, అద్దె, లాభమూ మూడూ మారకపువిలువకి వనరు అని స్మిత్ చెప్పాడు. దీన్ని తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ థీరీ అన్నారు. 
విలువ నియమంలో గందరగోళం
విలువ నిర్ణయం విషయంలో స్మిత్ కుదురుగా లేడు. ఆదిమ సమాజంలో ఒక విధంగానూ, ఆతర్వాత సమాజాల్లో వేరొక విధంగానూ సరుకు విలువ వుంటుందని స్మిత్ అభిప్రాయపడ్డాడు. ఆదిమసమాజాల్లో ఉత్పత్తిసాధనాలు ఉత్పత్తిదారుల చేతిలోనే వుంటాయి. కనక ఉత్పత్తయిన సరుకు విలువను శ్రమపరిమాణం నిర్ణయిస్తుంది. ఉత్పత్తి విలువలో కౌలూ, వడ్డీ, లాభమూ వుండవు. అందువల్ల ఆకాలంలో శ్రమ పరిమాణమే విలువను నిర్ణయిస్తుంది. అయితే భూస్వామ్యంలో, పెట్టుబడిదారీ విధానంలో భూస్వామీ, వడ్డీ వ్యాపారీ, పెట్టుబడిదారూ వుత్పత్తిసాధనాలకు యజమానులుగా వుంటారు. ఉత్పత్తిదారులు వాళ్లమీద ఆధారపడాలి. ఆ పరిస్థితుల్లో ఉత్పత్తయిన సరుకు విలువ శ్రమని బట్టి మాత్రమే వుండదు. దానికి కౌలూ, వడ్డీ, లాభాలూ కలుస్తాయి. దీన్నిబట్టి భూస్వాములూ పెట్టుబడిదారులూ లేని సమాజానికి వర్తించిన విలువ నియమం వాళ్లు వున్న సమాజానికి వర్తించదు.
“ఈ ధోరణి రికార్డోకి ఆమోదయోగ్యం కాలేదు.” విలువ నియమం వంటి మౌలిక నియమం, సమాజపు అభివృద్ధితో మారిపోదు. “శ్రమకాలాన్ని బట్టి విలువని నిర్ణయించటం సర్వకాలాలకూ వర్తించే సార్వత్రిక నియమం” అన్నాడు. రికార్డో అర్థశాస్త్రానికి చేసిన గొప్ప సేవ దే.
రాజకీయార్థికశాస్త్రం సైన్సుగా వృద్ధి అయ్యేకొద్దీ బూర్జువా సమాజంలో సరుకువిలువని నిర్ణయించేది ఆ సరుకు ఉత్పత్తికి అవసరమైన శ్రమకాలమేఅనే విషయాన్ని సాంప్రదాయ అర్థశాస్త్రం ఆవిష్కరించింది.
అన్ని సరుకుల ధరలూ నిరంతరం మారుతూ వుండడం పూర్వమే గమనించారు. ఆ పరిస్థితులకు, ధరలు పెరుగుతూ, తరుగుతూ వుండటానికి, ఉత్పత్తితో తరచుగా సంబంధం లేదనీ, ధరలు యాదృచ్చికంగా నిర్ణయించ బడుతున్నాయనీ అప్పట్లో భావించారు. తర్వాతి కాలంలో "యీ యెగుడు దిగుడులు దేనిచుట్టూ జరుగుతాయో ఆ స్థిరమైన కేంద్రబిందువుకోసం అన్వేషించారు. సరుకు విలువ సరుకులోవున్నట్టి, దాని వుత్పత్తికి అవసరమైనట్టి శ్రమ చేత నిర్ణయింపబడుతుందని సాంప్రదాయిక అర్ధశాస్త్రం కనుగొన్నది. యీ వివరణతో అది తృప్తిపడింది...”
యీ వివరణ అరకొర వివరణే అన్నాడు ఎంగెల్స్. శ్రమకు గల విలువను సృష్టించే గుణాన్ని సమగ్రంగా పరిశీలించిన మొదటివాడు మార్క్సేనన్నాడు. స్మిత్, రికార్డోల అభిప్రాయాలలో వున్న లోపాల్ని మార్క్స్ సవరించాడు. సమగ్రమైన, శాస్త్రీయమైన శ్రమాశ్రయ విలువ నియమాన్ని రూపొందించాడు. వారికిముందు అభివృద్ధి అయి, కాలపరీక్షకు నిలబడ్డ ప్రతి అంశాన్నీ ఇముడ్చుకున్నాడు. మార్క్స్ కాపిటల్ చదివినవారికి ఆయన తనముందువారి రచనల్ని కూలంకషంగా చదివినట్లు బోధపడుతుంది. అంతేకాదు, ఎవరు  ఎంత గౌరవానికి  అర్హులయితే అంతా ఇచ్చాడు. అదే సమయంలో వాళ్లు జవాబు చెప్పలేకపోయిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. మార్క్స్ విలువనియమాన్ని లోపరహితం చేశాడు. 

శ్రమ ద్వంద్వస్వభావం

సరుకు అనేది ఉపయోగపువిలువ, విలువల సమ్మేళనం. అలా అది ద్వందస్వభావి అయినప్పుడు, దాన్ని సృజించిన శ్రమ కూడా ద్వంద్వస్వభావం కలిగివుండాలని మార్క్స్ గ్రహించాడు. మార్క్స్ శ్రమవిలువ సిద్ధాంతంలో అనిర్దిష్టశ్రమ కేంద్ర బిందువు. నిర్దిష్ట అనిర్దిష్టశ్రమల మధ్య భేదానికి ఆయన చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. "సరుకుల్లో ఇమిడివున్న శ్రమ ద్వంద్వస్వభావమే రాజకీయ అర్థశాస్త్ర అవగాహనకి ఇరుసు” అన్నాడు (కాపిటల్ 1, పే. 49)
ఇంతకు ముందటి ఆర్థికవేత్తలు సరుకుని శ్రమకు మదింపు చేశారు. అయితే ఆ మదింపు అసంపూర్ణమైనదీ, అస్పష్టమైనదీను. సరుకును శ్రమకు మదింపు చేస్తేనే చాలదు. నిర్దిష్ట, అనిర్దిష్ట రూపాలలో, ద్వంద్వరూపంలో మదింపు చేయటం అవసరం (మార్స్క్ ఎంగెల్ ఆర్కైవ్స్ సం. 11, పే. 38 – ఉంటంకింపు: కార్ల్ మార్క్స్ గ్రేట్ డిస్కవరీ – అఫనాసియేవ్, పే. 24). సరుకులు ఉత్పత్తిచేసేటప్పుడు ఏ నిర్దిష్ట శ్రమ చేస్తున్నప్పుడయినా శారీరక,మానసిక శ్రమ వ్యయమవుతుంది. ఇది సాధారణ శ్రమ (లేబర్ ఇన్ జనరల్). ఇది సమాజంలో సార్వకాలికమైనది. ఇది కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో, సరుకుల వుత్పత్తిలో, అనిర్దిష్ట శ్రమ రూపం పొందుతుంది. ఆర్థికవేత్తలందరూ, మినహాయింపు లేకుండా, సరుకు ద్వంద్వ స్వభావం అనే మామూలు అంశం వదిలిపెట్టారు. ఉపయోగపు విలువ, మారకపు విలువ కలిగి వున్నట్లయితే ఆ సరుకు ఏ శ్రమకు ప్రతినిధిగా వుందో ఆ శ్రమ కూడా ద్వంద్వ స్వభావాన్ని కలిగివుండాలి అని ఎంగెల్స్ కి రాసిన లేఖలో మార్క్స్ అన్నాడు.
నిర్దిష్ట శ్రమ ఉపయోగకర వస్తువులను సృష్టిస్తుంది. బట్ట నేసే పనికీ, కుండలు చేసే పనికీ భేదం వుంటుంది. ఏ వస్తువు ఉత్పత్తి చెయ్యాలన్నా దానికి అనువైన నిర్దిష్ట శ్రమ అవసరం. కనక నిర్దిష్ట శ్రమలను సమానపరచటం వీలుకాదు. అవి ఒకదానితో ఒకటి విభేదిస్తాయి. నిజమే. అయితే, వాటన్నిటికీ ఒక సామాన్య గుణం వుంది. ఏ వస్తువు చేస్తున్నా, మెదడూ, కండరాలూ, నరాలూ పని చేస్తాయి. మనిషి శక్తి ఖర్చవుతుంది. సరుకులో చేరుతుంది. ఇది అన్ని సరుకుల్లోనూ వుంటుంది. సరుకు వుత్పత్తి రాకముందు కూడా ఈ శ్రమశక్తి వ్యయం వుంది. అయితే వుత్పత్తయిన వస్తువులు ఆ బృందం లోని వారే వాడుకునేవారు. అవి సరుకులు కావు. మారకం కావు. అందువల్ల, వెచ్చించిన శ్రమను మారకం కోసం పోల్చాల్సిన పనిలేదు. కాని సరుకుల వుత్పత్తీ, మారకం ఏర్పడ్డాక మాత్రం వెచ్చించిన శ్రమను పోల్చవలసి వచ్చింది. ఇది చారిత్రక ధాతువు. దీన్ని మార్క్స్ అనిర్దిష్టశ్రమ అన్నాడు. విలువని ఏర్పరచేది ఇదే. అన్నిసరుకుల్లోనూ వుండే ఉమ్మడి అంశం ఇదే. సరుకుల సమానత్వాన్ని తేల్చేది ఇదే.
ప్రతి వుత్పాదకుని శ్రమా మొత్తం సమాజపు శ్రమలో భాగం. అంటే అది సామాజిక శ్రమ. తమ వుత్పాదితాల్ని అంగట్లో అమ్మేటప్పుడు అన్ని నిర్దిష్ట శ్రమల్నీ అనిర్దిష్ట శ్రమకు కుదించాలి. అప్పుడు వారి శ్రమ సామాజిక స్వభావం తెలుస్తుంది.
ఒకే సరుకు అనేకమంది తయారుచేస్తారు. వాళ్ల పరిస్థితుల్ని బట్టి వేర్వేరు పరిమాణాల్లో శ్రమ వెచ్చిస్తారు. ఒకే రకం సరుకులకు వేరు వేరు శ్రమకాలాలు లెక్కకు రావు. అవి సామాజికంగా అవసరమైన శ్రమ కాలానికి కుదించబడతాయి.
“సామాజికంగా అవసరమైన శ్రమకాలం అంటే, ఆకాలంలో అమలులోవున్న సాధారణ పరిస్థితులలో సగటు నైపుణ్యపు ప్రమాణంతో, తీవ్రతతో ఒక వస్తువును వుత్పత్తి చేయడానికి అవసరమైన శ్రమకాలం" అని మార్క్స్ నిర్వచించాడు. సరుకు విలువని నిర్ణయించేది సామాజికంగా అవసరమైన శ్రమకాలం అని మార్క్స్ నిర్ధారించాడు.

దనపు విలువ-విలువ నియమంతో చిక్కులు

మార్క్సు పెట్టుబడిదారీ ఆర్థిక విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. ఆయనకు ముందే సాంప్రదాయిక అర్థశాస్త్రవేత్తలు శ్రమాశ్రయ విలువ సిద్ధాంతానికి పునాదులు వేశారు.
పెట్టుబడికీ శ్రమకీ మారకంలో "శ్రమవిలువ దేనిచేత నిర్ణయించబడుతుంది? శ్రమచేతనే విలువ నిర్ణయించ బడుతుందనే నియమాన్ని శ్రమ అనే సరుకుకి అన్వయించినప్పుడు అర్థశాస్త్రవేత్తలు అంతర్వైరుధ్యంలో పడ్డారు. శ్రమ విలువ ఎలా నిర్ణయించబడుతుందిఆ శ్రమలో వున్న అవసరశ్రమ చేత. ఒక గంట శ్రమవిలువ ఒక గంట శ్రమకు సమానం అనిమాత్రమే మనకు తెలిస్తే, దాన్నిగురించి బొత్తిగా మనకేమీ తెలియదన్నమాట. యిది మనల్ని వెంట్రుక వాసి కూడా గమ్యం దగ్గరకి తీసుకుపోదు; మనం ప్రదక్షిణం చేస్తూనే వుంటాం." (‘వేతన శ్రమ - పెట్టుబడి కి ఎంగెల్స్ ప్రవేశిక,  సంకలిత రచనలు-2,  పే 84-85). 
శ్రమ సృజించిన విలువనే వాళ్లు శ్రమవిలువ అనుకున్నారు. అందువల్లే, శ్రమవిలువని తేల్చే పని పెట్టుకున్నారు. అది తేలలేదు, తేలేదీ కాదు.
రికార్డో పెట్టుబడికీ శ్రమకీ మారకం విషయంలో సమానత్వం గురించి ఆలోచించాడు. ఆయనకొక చిక్కు వచ్చింది. పెట్టుబడిదారు కార్మికుని శ్రమకు శ్రమవిలువ చెల్లించి చాకిరీ చేయించుకుంటున్నాడు. లాభం పొందుతున్నాడు. శ్రమవిలువ పూర్తిగా కార్మికుడికిస్తే మరి లాభం ఎక్కడనుంచి వస్తుంది? కార్మికునికి తక్కువ ఇస్తే సమాన విలువల మధ్య మారకం జరగలేదని అర్థం గదా? శ్రమ విలువ సిద్ధాంతమే తప్పవుతుంది గదా? సమాన విలువలే మారకం కావాలి, లాభం రావాలి. శాస్త్రీయంగా దీన్ని రుజువు చెయ్యలేకపోయాడు రికార్డో. ఇదే ఆయన్ని వేధించిన సమస్య. వాస్తవానికీ సూత్రానికీ మధ్య పొంతన కుదర్చలేక పోయాడు. విలువ సిద్ధాంతాన్ని వదులుకోలేకా, వాస్తవంగా వస్తున్న లాభాన్ని భ్రమ అనలేకా సతమతమయ్యాడాయన.
రికార్డో శిష్యుడిగా జాన్ స్టువర్ట్ మిల్ (1806-1873) శ్రమనీ, పెట్టుబడినీ శ్రమయొక్క వేర్వేరు రూపాలుగా నిర్వచించాడు. "శ్రమా,పెట్టుబడీ...ఒకటి ప్రస్తుత శ్రమ...మరొకటి నిల్వపడ్డ శ్రమ" అన్నాడు. తక్షణశ్రమ తక్కువ నిల్వశ్రమతో మారకమవుతుంది అని అభిప్రాయ పడ్డాడు. అసమాన విలువల మారకం అన్నమాట. ఇది విలువ నియమాన్ని భంగపరుస్తుందని అంగీకరించడమే అన్నాడుమార్క్స్ (అదనపు విలువ సిద్ధాంతాలు-3, పే. 98-99).

శ్రమా- శ్రమశక్తీ
కార్మికుడు అమ్ముతున్నది శ్రమని కాదు, శ్రమశక్తిని అని మార్క్స్ నిర్ధారించాడు. శ్రమశక్తి సరుకు. శ్రమ కాదు. శ్రమ అనేది చలనంలో వున్న శ్రమశక్తి. కనుక శ్రమకి విలువ వుండదు. శ్రమశక్తి అనే మాట మార్క్సుకి ముందు వాడుకలో లేదు. శ్రమశక్తి విలువనే శ్రమవిలువ అనేవారు. మార్క్స్ ప్రకారం శ్రమకి విలువ వుండదు. ఎందుకంటే అది సరుకు కాదు. కనక శ్రమవిలువ అనేది అర్ధంలేని పదబంధం. శ్రమశక్తి ధర లేక విలువ పైకి శ్రమ ధరగా, విలువగా  కనిపిస్తుంది. మార్క్స్ శ్రమశక్తి విలువ అనే అర్ధంలోనే శ్రమ విలువ అనే మాట వాడాడు. కారణం ఆ మాట ప్రజల్లో విశేషమైన ప్రాచుర్యంలో ఉండటమే.
సాంప్రదాయిక అర్థశాస్త్రం పరిష్కరించలేకపోయిన సమస్యని మార్క్స్ ఎత్తుకున్నాడు. సమానవిలువలే మారకం కావాలి. అయినా లాభం రావాలి. ఈ వాస్తవ పరిస్థితి కళ్లకు కనబడుతున్నదే. కార్మికులు శ్రమ చేస్తున్నారు. బదులుగా వేతనం పొందుతున్నారు. ఇది శ్రమకీ, పెట్టుబడికీ మారకం. శ్రమచేయని పెట్టుబడిదారు లాభం పొందుతున్నాడు. శ్రమే విలువకు ఏకైక వనరు అయితే లాభం వుండకూడదు. లేదా, శ్రమకీ, పెట్టుబడికీ నిరంతరం జరుగుతున్న మారకం అసమానమయినది అయి తీరాలి. వాళ్లు కొట్టుమిట్టాడిన వైరుధ్యం ఇదే.
“అందుచేత, లాభాల సాధారణ స్వభావాన్ని వివరించడానికి, సగటున, సరుకులు తమ అసలు విలువకు అమ్ముడవుతాయనీ, వాటిని వాటి విలువకు అంటే, వాటిలో నిక్షిప్తమైన శ్రమ పరిమాణపు అనుపాతంలో అమ్మడం ద్వారా లాభం వస్తుంది అన్న సిద్ధాంతం నుండి బయలుదేరాల్సి వుంటుంది. ఈ ప్రాతిపదికపై సమస్యను వివరించలేక పోయినట్లయితే, దాన్నసలు వివరించనే లేం. నిత్యజీవితానుభవాన్ని బట్టి యిది విరోధాభాసమైన అసంగత విషయంగా కనిపిస్తుంది. కాని భూమి సూర్యునిచుట్టూ తిరగటం, భగ్గునమండే రెండు వాయువుల కలయికద్వారా నీరు ఏర్పడటం కూడా విరోధాభాసమైన విషయాలే. నిత్యజీవితానుభవరీత్యా విజ్ఞాన శాస్త్రీయ సత్యాలను పరిశీలిస్తే, నిత్యజీవితానుభవమెప్పుడూ వస్తువుల భ్రమాత్మక బాహ్యాకృతులనే చూస్తుంది కనుక, అవి ఎల్లప్పుడూ విరోధాభాసగానే  కానవస్తాయి" (మార్క్స్ ఎంగెల్స్ సంకలిత రచనలు, భాగం 2, పే. 45).
రెండురకాల చలామణీలు
డబ్బుకీ సరుకులకీ రెండురకాల చలామణీలున్నాయి. ఒకటి కొనడం కోసం అమ్మడం: గంపలమ్మి, బియ్యం కొనడం. ఇది సరుకు-డబ్బు-సరుకు. ఇక్కడ రెండు సరుకులూ భిన్నమయినవి. ఈ మారకపు ఉద్దేశం ఉపయోగపువిలువ. ఈ చర్యతో అది ఆగిపోతుంది. రెండోది అమ్మడం కోసం కొనడం. అంటే డబ్బు-సరుకు-డబ్బు. ఇక్కడ మొదటిదీ డబ్బే చివరదీ డబ్బే. గుణాత్మకంగా ఒకటే. పరిమాణంలో మాత్రమే తేడా వీలవుతుంది. సరిగ్గా పెట్టుబడిదారు ఆశించేది అదే. దీని సంకేతం డ-స-డ’. కాని సమాన విలువల మారకం ప్రాతిపదికన ఇది ఎలా సాధ్యపడుతుంది?
డ-స-డ‘  చలనం  డబ్బుని పెట్టుబడిలోకి మారుస్తుంది. డబ్బు దానికదిగా పెట్టుబడికాదు.
మొదట మదుపు పెట్టిన ధనంకంటే “సరుకునుంచి మరింత ఎక్కువ ధనాన్ని తిరిగి రాబట్టటం కోసం సరుకు రూపంలోకి మార్చబడిన ధనమే పెట్టుబడి.”
కొత్తగా రంగంలోకి (మార్కెట్లోకి) దిగే పెట్టుబడి మొదట డబ్బురూపంలోనే వుంటుంది. అది ఒక నిర్దిష్టప్రక్రియ ద్వారా పెట్టుబడిలోకి మారుతుంది. కేవలం డబ్బుకీ, పెట్టుబడి అయిన డబ్బుకీ తొలితేడా వాటి చలామణీ రూపం తప్ప మరేమీకాదు.
మొదట పెట్టిన డబ్బుకంటె చలామణీ చివరలో ఎక్కువ పొందుతాడు. ఈ ప్రక్రియ కచ్చితమైన రూపం డ-స- డ' లో  ' = డ+ Δడ= మొదట మదుపు (అడ్వాన్స్) పెట్టిన డబ్బు + పెరుగుదల. ఈ పెరుగుదలని లేక ఎక్కువని అదనపు విలువ అన్నాడు మార్క్స్. మదుపు పెట్టిన విలువ చలామణీలో అలాగే వుండి, అదనపు విలువని కూడా తనకు తాను కలుపుకుంది. ఈ చలనమే దాన్ని పెట్టుబడిలోకి మారుస్తుంది. డబ్బునుంచి సరుకుల్లోకీ, సరుకులనించి డబ్బులోకీ మారుతూ, అదేసమయంలో పరిమాణాన్ని మార్చుకుంటుంది. విలువ అనేదే ఇక్కడ క్రియాశీలమైనది. విలువ తనకు విలువను కలుపుకుంటుంది. అయితే స-డ-స వలయంలో లాగే డ-స-డ లో కూడా సరుకుల విలువల సమానత్వం అవసరమైన షరతు.
అయితే డబ్బు రెండు రూపాల్లో ఒకటి మాత్రమే. అది సరుకురూపం తీసుకుంటేనే గాని పెట్టుబడి కాదు. డ-స-డ' అనేది పెట్టుబడి సాధారణ సూత్రం.
మరి అదనం ఎక్కడినించి వస్తున్నది? సరుకుల మారకమే విలువని తేదు. కనక చలామణీలో కనబడనిది ఏదో నేపథ్యంలో జరిగి వుండాలి.
పెట్టుబడిదారు కార్మికునికి రోజుకూలీ యిచ్చి దూదినుంచి నూలు తీయిస్తాడు. దూది విలువ అలానే వుంటుంది. కాని నూలులో కొత్తగా శ్రమ కలుస్తుంది. ఆమేర విలువ పెరుగుతుంది. ఇప్పుడు నూలును దాని విలువకే అమ్ముతాడు అయినా అదనపు విలువ పొందుతాడు.
అదనపు విలువ అనే భావాన్ని ప్రవేశపెట్టినవాడు మార్క్స్. అంతకు ముందు వాళ్లు అందులోని భాగాల్ని - లాభం, వడ్డీ, భూమి అద్దె/ కౌలు - విడివిడిగా చూశారు. ఆర్థికవేత్తలందరూ ఒక పొరపాటు చేశారు. అదనపువిలువని దానికదిగా, స్వచ్చరూపంలో ఎవ్వరూ పరిశీలించలేదు. దాని ప్రత్యేకరూపాలయిన లాభంగా, అద్దెగా పరిశీలించారు (థియరీస్ ఆఫ్ సర్ ప్లస్ వాల్యూ సం. 1 పే. 40).
అదనపు విలువను దాని ప్రత్యేక రూపాలయిన లాభం, వడ్డీ, అద్దె వగైరాల నుంచి విడిగా, స్వతంత్రంగా చూడటం తన పుస్తకంలోని రెండు మంచి అంశాలలో ఒకటని పెట్టుబడి మొదటిభాగం ప్రచురించాక, ఎంగెల్స్ కి 1867 ఆగస్ట్ 24 న రాసిన ఉత్తరంలో మార్క్స్ అన్నాడు.
మార్క్సుకు ముందువాళ్లు కార్మికుడు అమ్మేది తన శ్రమని అన్నారు. ఫ్రస్తుత బూర్జువా ఆర్థికవేత్తలు దాన్నే కొనసాగిస్తున్నారు. మార్క్సు దీన్ని ఖండించాడు. అమ్మేది శ్రమను కాదు, శ్రమశక్తిని అని రుజువుచేశాడు. ఇది ఆయన శాస్త్రీయ ఘనతల్లో ఒకటి.
శ్రమవిలువ దగ్గర బయలుదేరిన సాంప్రదాయ ఆర్థికవేత్తలకు యిబ్బంది ఎదురయింది. శ్రమశక్తి దగ్గర బయలుదేరితే చిక్కు వీడిపోతుంది. శ్రమశక్తి ఒక సరుకు. అయితే అది విశిష్టమైన సరుకు. విలువను సృష్టించటం దాని ఉపయోగపు విలువ.
పెట్టుబడిదారు కార్మికుల శ్రమను డబ్బుతో కొన్నట్లు కనబడుతుంది. వాళ్లు తమ శ్రమను డబ్బుకుగాను పెట్టుబడిదారుకు అమ్ముతారు. కాని యిది పైకి కనిపించేది మాత్రమే. నిజానికి వాళ్లు అమ్మేదీ, అతను కొనేదీ శ్రమశక్తిని. శ్రమవిలువ సిద్ధాంతం కేంద్రంగా రాజకీయ అర్థశాస్త్రాన్ని నిర్మించటానికి రికార్డో ప్రయత్నించాడు గాని కార్మికులు అమ్ముతున్నది శ్రమని కాదనీ శ్రమశక్తిననీ గ్రహించలేదు అంటాడు మార్క్స్.
పెట్టుబడి సాధారణ సూత్రం డ-స-డ' లో మొదటి డబ్బు కంటే రెండోది ఎక్కువ పరిమాణం. మొదటి చర్య డబ్బుతో సరుకును కొనడం. ఈ చర్య డబ్బుని పెంచదు. రెండో చర్య సరుకుని డబ్బుకు అమ్మడం. ఇందులోనూ డబ్బు పెరగదు. మరి  చివరలో ఎక్కువ డబ్బు  ఎలా వస్తున్నది? ఇది సాధ్యం కావాలంటే మొదటి చర్యలో కొన్న సరుకు విలువకంటె రెండోచర్యలో అమ్మే సరుకు విలువ ఎక్కువై తీరాలి. ఈ విలువ పెరగడం మొదటి చర్యలో కొన్న సరుకు వల్ల జరగాలి. అదికూడా ఆ సరుకు విలువలో భాగం కాదు. అందువల్ల ఒకనిర్ధారణకు రాకతప్పదు: అదేమంటే, ఆ సరుకు విలువను సృష్టించేదై వుండాలి. అదికూడా తన విలువకంటె ఎక్కువ విలువను. అప్పుడు మాత్రమే డ-' అవుతుంది. అలాంటి విశిష్ట లక్షణం గల సరుకు లభ్యమయింది. అదే శ్రమశక్తి, పనిచేయగల సామర్ధ్యం. విలువని ఏర్పరిచే  సరుకు అదొక్కటే. అందుకే అది విలక్షణమైన సరుకు.
మరి దాని విలువ ఎలా నిర్ణయమవుతుంది? అన్ని సరుకుల విలువ లాగానే. అంటే దాని వుత్పత్తికి అవసరమయ్యే శ్రమకాలం చేత. శ్రమ శక్తి మనిషికి బయట వుండదు. సజీవ మానవుని శక్తిగా వుంటుంది. కనక అతని వుత్పత్తికి కావలసింది పోషణే. అందుకు కొంత పరిమాణంలో జీవితావసరవస్తువులు కావాలి. శ్రమశక్తి వుత్పత్తికి అవసరమయ్యే  శ్రమకాలం, ఆ జీవితావసర వస్తువుల వుత్పత్తికి అవసరమయ్యే శ్రమకాలమే. ఆ విలువ చెల్లించి ఒక రోజు శ్రమశక్తిని కొన్నా గాని, కార్మికుడు దాన్ని చేతుల్లో పెట్టలేడు. వచ్చి పనిచేస్తాడు. బట్ట నేశాడనుకుందాం. బట్టగా మారేది దారం. మగ్గం కాదు. అయినా మగ్గం లేనిదే బట్ట తయారవదు. ఇవి పాదార్థిక అంశాలు. శ్రమ మానవాంశం. రెండూ వుంటేనే శ్రమప్రక్రియ సాధ్యమవుతుంది.
శ్రమవిలువ సిద్ధాంతాన్ని పట్టుకున్న స్మిత్, రికార్డోలు కార్మికుడు అమ్ముతున్నది శ్రమ అనుకున్నారు. వాళ్ల దృష్టిలో శ్రమే సరుకు. సరుకు విలువని నిర్ణయించేది ఆ సరుకులోవున్న శ్రమే. ఆలెక్కన శ్రమలో ఇమిడివున్న శ్రమే శ్రమవిలువని నిర్ణయించాలి. ఇలా శ్రమవిలువ శ్రమే అనే వలయంలో చిక్కుకున్నారు.
అర్థశాస్త్రవేత్తలు శ్రమే సరుకు అనుకున్నారు. పెట్టుబడిదారు కార్మికుని శ్రమను కొంటున్నాడు. మారకం విలువ చెల్లించి, ఉపయోగపు విలువను పొందుతున్నాడు. అతని చేత శ్రమ చేయించి సరుకులు ఉత్పత్తి చేయిస్తున్నాడు. ఆ సరుకులు కార్మికునికి చెందవు. వాటిపై సర్వహక్కులూ పెట్టుబడిదారువే. వాటిని వాటి విలువలకే అమ్ముతున్నాడు. ఈ వాదనతో వచ్చిన చిక్కేమంటే సమాన మారకాలే జరుగుతుంటే లాభం ఎలా వస్తుంది? రాకూడదు. కాని వస్తున్నదే! అంటే శ్రమవిలువ నియమమే సరయినది కాదా?
"ఒక మనిషి విలువ...మిగతా వస్తువుల విలువ లాగ అతని ధర, అంటే, అతని శక్తిని వుపయోగించుకునేందుకు ఎంత ఇవ్వబడుతుందో అంతన్నమాట" (కాపిటల్ 1, పే. 167, పాదసూచిక 2) అని థామస్ హాబ్స్ తన లెవియాథాన్ పుస్తకం (1839-44) లో చెప్పాడు. ఆయన తర్వాతివారు ఈ ఆవిష్కరణని గమనించలేదు అంటాడు మార్క్స్ (వేతనం,ధర, లాభం, మార్క్స్ ఎంగెల్స్ సంకలిత రచనలు, భాగం 2,  పే. 46).
ఒక ఉపయోగపు విలువని ఉత్పత్తిచేసేటప్పుడు, తనలో వున్న ఏ మానసిక శారీరక సామర్ధ్యాల్ని మనిషి నియోగిస్తాడో ఆ సామర్ధ్యాల మొత్తమే శ్రమశక్తి లేక పనిచేయగల సామర్ధ్యం అని శ్రమశక్తిని నిర్వచించాడు (కాపిటల్ 1, పే. 164). అలాగే, “శ్రమశక్తి యొక్క విలువ శ్రమశక్తిని సృష్టించడానికీ, అభివృద్ధి చెయ్యడానికీ, కొనసాగించడానికీ కావలసిన జీవితావసరాల విలువ చేత నిర్ణయించబడుతుంది” అన్నాడు (సంకలిత రచనలు, భాగం 2,  పే. 48).
సమానకాలు మారకమైనా, అసమానకాలు మారకమైనా అదనపు విలువ రాదు. చలామణీ విలువను చేర్చదు. మారకం విలువను చేర్చదు. ఇవన్నీ మార్క్స్ కి ముందువాళ్లే చెప్పారు. వర్తకుని పెట్టుబడి, వడ్డీ పెట్టుబడికి విభిన్న  రూపాలు. అయితే ఇవి ఆధునిక పెట్టుబడి ప్రామాణిక రూపం  కంటే ముందునుంచే వున్నాయి. డబ్బు పెట్టుబడిలోకి మారడాన్ని సరుకుల మారకపు నియమాల పునాది మీద వివరించాలి. సమానమైనవాటి మారకం అందుకు ఆరంభ బిందువు కావాలి. డబ్బుని పెట్టుబడిలోకి మార్చాలని వచ్చిన తొలి పెట్టుబడిదారు సరుకుల్ని వాటి విలువలకే కొనాలి. వాటి విలువలకే అమ్మాలి. ప్రక్రియ చివరలో చలామణీ మొదట పెట్టిన డబ్బుకంటె ఎక్కువ డబ్బు లాగాలి. పూర్తి పెట్టుబడిదారుగా అతని అభివృద్ధి చలామణీ రంగం లోపలా, వెలుపలా జరగాలి. ఇవి సమస్య షరతులు.

మార్క్స్ వివరణ

ఇవన్నీ ఎలా నెరవేరాయో మార్క్స్ వివరించాడు. “మార్కెట్ లో ఎంతో విలక్షణమైన సరుకు ఒకటి ఉంది. దాని  ఉపయోగపు విలువ అంతా మారకపు విలువని ఉత్పత్తి చేయడమే. అలాంటి సరుకును కనుగొన్నప్పుడు మాత్రమే యీ చిక్కు సమస్య విడిపోతుంది. అలాంటి సరుకు వుంది - అదే శ్రమశక్తి. ఒక సరుకు సొంతదారు తన శ్రమతో విలువని సృజించగలడు, కాని స్వయం వర్ధమాన విలువను సృజించజాలడు. తన సరుకుకు తాజాశ్రమ కలిపి మరికొంత విలువను చేర్చగలడు. ఉదాహరణకి, తనదగ్గరున్న తోలుతో బూట్లు తయారుచెయ్యటం ద్వారా. అదే తోలులో ఇప్పుడు ఎక్కువ విలువ ఇమిడి వుంటుంది, ఎక్కువ శ్రమ ఇమిడివుంటుంది కనక. అయితే తోలు విలువ అంతకు ముందెంతో ఇప్పుడూ అంతే. అది వ్యాకోచించలేదు. బూట్లు తయారు అవుతున్నప్పుడు అదనపు విలువను చేర్చలేదు. కనక సరుకు ఉత్పత్తిదారు ఇతర సరుకు ఉత్పత్తిదారులతో సంబంధంలోకి రాకుండా, చలామణీ రంగం బయట, విలువని పెంచలేడు. ఆ కారణంగా డబ్బునిగానీ, సరుకునిగానీ పెట్టుబడిలోకి మార్చలేడు. అంటేచలామణీ వల్ల పెట్టుబడి ఉత్పత్తి సాధ్యం కాదు. చలామణీ వెలపల ఉత్పత్తవటం అసాధ్యం.
ఒక కార్మికుడి జీవితావసర వస్తువులు ఒక రోజుకు సరిపడేవి ఉత్పత్తి కావటానికి 4 గంటల సామాజిక శ్రమ పడుతుందనుకుందాం. ఆతర్వాత కూడా అతను పనిచెయ్యగలడు. మరో 4 లేక 6 గంటలు. ఇది అదనపు శ్రమ. ఆ కాలంలో తయారయిన సరుకులు యజమానివే. వాటిని అమ్మినప్పుడు అదనపు విలువ దక్కుతుంది. కార్మికుడు తన శ్రమశక్తి మారకపు విలువ పొంది, ఉపయోగపు విలువను వదులుకున్నాడు. అంటే ఒకరోజు శ్రమశక్తి ఉపయోగపు విలువ అంతా శ్రమ యజమానికి చెందుతుంది. కనక అతను రోజంతా యజమాని కొరకు శ్రమ చెయ్యాలి. ఒక రోజు శ్రమశక్తిని పోషించటానికి సగం రోజు శ్రమ మాత్రమే చాలుననే పరిస్థితి యీ శ్రమశక్తి చేత రోజంతా పని చేయించవచ్చునన్న విషయమూ, అందుచేత దానిని రోజంతా వుపయోగించడం ద్వారా సృష్టించబడే విలువ దాని రోజువారీ విలువకు రెట్టింపు అయిన విషయమూ - ఇదంతా కొనేవాని అదృష్ట విశేషమే గాని, అమ్మినవానికి జరిగిన అన్యాయం యెంతమాత్రమూ కాదు. షరతులన్నీ వర్తించాయి. అదనపు విలువ చేకూరింది. డబ్బు పెట్టుబడిగా, స్వయం వర్ధమాన విలువగా మారింది.”
పెట్టుబడిదారు అదనపు శ్రమకాలాన్ని వీలయినంత పొడిగించే యత్నం చేస్తాడు. అది అతనికి ప్రయోజనం కనక. అయితే యీ పొడిగింపు కార్మికుల ప్రయోజనాల్ని దెబ్బగొడుతుంది. వర్గ పోరాటానికి దారిపడుతుంది. మామూలు పనిదినాన్ని తేల్చటం ఇరు వర్గాల మధ్య వందల ఏళ్లపాటు సాగిన పోరాట ఫలితం.
ఆ సరుకుల ఉత్పత్తికి పట్టే కాలం 'అవసరశ్రమకాలం'. ఆ కాలంలో వ్యయమైన శ్రమ 'అవసరశ్రమ'. ఆతర్వాత కూడా కార్మికుడు పనిచేస్తాడు. ఈ రెండోభాగం 'అదనపుశ్రమకాలం'. వ్యయమైన శ్రమ 'అదనపు శ్రమ'. ఇది అదనపు విలువను ఉత్పత్తిచేస్తుంది. శ్రమప్రక్రియ చివరలో మొదటపెట్టిన డబ్బుకంటె ఎక్కువ వస్తుంది. ఆ ఎక్కువే డబ్బును పెట్టుబడిలోకి మారుస్తుంది. పెట్టుబడిలోకి మారిన డబ్బు మరల చలనంలోకొస్తుంది. ఇది అలా కొనసాగుతూనే వుంటుంది.

విలువను నిర్ణయించేది సామాజికంగా అవసరమైన శ్రమ. కార్మికుడు అమ్మేదీ, పెట్టుబడిదారు కొనేదీ శ్రమశక్తిని, శ్రమను కాదు. శ్రమ సరుకు కాదు. కనక శ్రమవిలువ అనేది అర్థంలేని మాట. సమాన విలువలు మారకం అవుతూనే అదనపువిలువ వస్తుంది. ఇవి మార్క్స్ శాస్త్రీయంగా రుజువుచేసిన విషయాలు. వీటిని తప్పన్నా, వక్రీకరించినా, అది మార్క్సిజం అవదు. మహా అయితే మరొకరిజం కావచ్చు.