19, మార్చి 2018, సోమవారం

సహకారం


సహకారం
చిన్న యజమానీ-పెట్టుబడిదారుడూ
ఇద్దరు ముగ్గురు పనివాళ్ళని పెట్టుకొని, బతకటానికి తానుకూడా వాళ్ళతో పాటు పనిచేసే వాడు కచ్చితమైన అర్ధంలో పెట్టుబడిదారుడు కాడు, ‘చిన్న యజమాని’. ఎక్కువమంది  శ్రామికుల్ని పెట్టుకుని, తానూ పనిచెయ్యకుండా, పెద్ద పరిమాణంలో సరుకులు ఉత్పత్తి చేసేవాడు  పెట్టుబడిదారుడు. “ఒకేకాలంలో, ఒకే చోట, ఒకే యజమానికింద ఒకే రకమైన సరుకు తయారుచెయ్యడానికి అధిక సంఖ్యలో కార్మికులు కలిసి పని చెయ్యడమే పెట్టుబడిదారీ ఉత్పత్తికి చారిత్రకంగానూ, తార్కికం గానూ  ఆరంభ బిందువు” అని మార్క్స్ చెప్పినట్లు ఇప్పటికే మనకు తెలుసు.
ఉత్పత్తి పధ్ధతి - చేతి పనిముట్లతోనే
వృత్తి మేస్త్రీల వర్క్ షాపుల్లో చేతిపనిముట్లతో పని జరిగేది. కార్ఖానా తొలిదశల్లోనూ పని సాగింది చేతిపనిముట్లతోనే. దీన్నిబట్టి పని పద్ధతికి సంబంధించి రెంటికీ తేడాలేదు.
తేడా కేవలం పనివాళ్ళ సంఖ్యలో మాత్రమే.
వృత్తి మేస్త్రీ దగ్గర కొద్దిమంది పనివాళ్ళు ఉండేవాళ్ళు. పెట్టుబడిదారుడి వద్ద తొలిదశలో సైతం ఎక్కువమంది ఉంటారు. ఇంతకు మించి మరే తేడా లేదు. దీన్నిబట్టి “మధ్యయుగాల నాటి చేతివృత్తుల యజమాని వర్క్ షాప్ పెద్దదయింది, అంతే.
శ్రామికుల సంఖ్య పెరిగితే  అదనపు విలువ మొత్తం పెరుగుతుంది
ఒక శ్రామికుడికి  3 షిల్లింగులిచ్చి పనిచేయిస్తే, 3 షిల్లింగుల అదనపు విలువ వచ్చిందనుకుందాం. 10మందిని పెడితే 30, వందమందిని పెడితే 300 షిల్లింగుల అదనపువిలువ వస్తుంది.
ఒక (వ్యష్టి) పెట్టుబడి ఉత్పత్తి చేసే అదనపు విలువ మొత్తం = ఒక శ్రామికుడు ఉత్పత్తిచేసే అదనపు విలువ×శ్రామికుల సంఖ్య. శ్రామికుల సంఖ్య ఎంత పెరిగితే అదనపువిలువ అంత పెరుగుతుంది.
అయితే శ్రామికుల సంఖ్య అదనపు విలువ రేటుని ప్రభావితం చెయ్యదు
శ్రామికుల సంఖ్య అదనపు విలువ రేటుని ప్రభావితం చెయ్యదు.
 అదనపు విలువ రేటు = అదనపు విలువ/ శ్రమశక్తి విలువ.
10 కార్మికులకి 5షిల్లింగుల చొప్పున ఇచ్చి పనిచేయిస్తే
శ్రమశక్తి విలువ=10 X 5 =50 షిల్లింగులు. అదనపు విలువ 50 షిల్లింగులు అనుకుందాం. అప్పుడు
 అదనపు విలువరేటు = అదనపు విలువ/శ్రమశక్తి విలువ =50/50 X 100= 100. అదనపువిలువ రేటు 100 శాతం.
శ్రామికుల సంఖ్య 50 అయితే శ్రమశక్తి విలువ 250 షిల్లింగులు. వచ్చే అదనపు విలువ 250. అదనపు విలువరేటు = అదనపు విలువ/శ్రమశక్తి విలువ =250/250 X 100= 100. అదనపువిలువ రేటు 100 శాతం.
శ్రామికుల సంఖ్య ఎంతైనా అదనపువిలువ రేటు 100 శాతమే ఉంటుంది. శ్రామికుల సంఖ్య అదనపు విలువ మొత్తంమీద ప్రభావం చూపుతుంది. అంతేగాని అదనపువిలువ రేటుని  ప్రభావితం చెయ్యదు.
కార్మికుల సంఖ్యను బట్టి మారేది వాళ్ళని నియమించిన వానికి వచ్చే అదనపువిలువ మొత్తం మాత్రమే.
అయినప్పటికీ, కొన్ని పరిమితుల్లో ఒక మార్పు వస్తుంది. విలువలో సిద్ధించేది సగటు సామాజిక  శ్రమే. ఫలితంగా ఆశ్రమ సగటు శ్రమ శక్తి వ్యయమే.
సగటు సామాజిక శ్రమ
ఒక వస్తువు తయారు చెయ్యడానికి వేర్వేరు కార్మికులకు వేర్వేరు సమయాలు పడతాయి. అయిదుగురు పనివాళ్ళకి ఒకే వస్తువు తయారు చెయ్యడానికి ఒకనికి   60 నిమిషాలు మిగిలినవాళ్ళకి వరసగా  55, 50, 45,35 నిమిషాల కాలం పట్టిందనుకుందాం.  వాటి సగటు లెక్కించవచ్చు - 245/5 = 49.  అంటే ఈ అయిదుగురు పనిచేసేచోట ఆ సరుకు తయారీకి పట్టే సగటు శ్రమ కాలం 49 నిమిషాలు. ఆకాలంలో తయారుచేసేవాడు  సగటు శ్రామికుడు.
ఏపరిశ్రమలోనైనా, ప్రతి శ్రామికుడూ సగటు శ్రామికుడికి భిన్నంగా వుంటాడు. పై ఉదాహరణలో ప్రతివాడూ సగటు శ్రామికుడి కన్నా ఎక్కువో తక్కువో సమయం తీసుకోవడం గమనించవచ్చు.
అయితే ఒకేసారి నిర్దిష్టమైన కనీస సంఖ్యలో కార్మికుల్ని నియమించినప్పుడు, ఈ వ్యష్టి వ్యత్యాసాలు, పరిహారమవుతాయి. అయిదుగురికి బదులు 50 మందిని పెడితే ఈ తేడాలు సరిపుచ్చుకుంటాయి. 
సగటు సామాజిక శ్రమదినం =ఎక్కువమంది పనివాళ్ళ సంయుక్త పనిదినం/పనివాళ్ళ సంఖ్య
ఉదాహరణకి ,ఇలా అనుకుందాం. పనిదినం 12 గంటలు. పనివాళ్ళు 12మంది. సంయుక్త పనిదినం 12X12 = 144 గంటలు. ఈ 12 మందిలో ప్రతివాని శ్రమా సగటు సామాజిక శ్రమనించి ఎంతోకొంత తేడా పడుతుంది. ఒకే పనికి ఒకరికొకరికి భిన్న సమయాలు పడతాయి. అయినాగాని, ప్రతివాని పనిదినమూ సంయుక్త పనిదినం అయిన 144 గంటల్లో 12 వంతు అయినందువల్ల, అది సగటు సామాజిక పనిదినం లక్షణాల్ని కలిగి వుంటుంది.
సగటు సామాజిక శ్రమ
ఏదైనా సరుకు తయారుచెయ్యడానికి ఎవరైనా ఒక  శ్రామికునికి  సామాజికంగా అవసరమైన శ్రమకాలం కన్నా ఎక్కువ పట్టవచ్చు. ఆసందర్భంలో సామాజికంగా అవసరమైన శ్రమకాలం నించి అతనికి  అవసరమైన శ్రమకాలం తేడాగా వుంటుంది. అందువల్ల అతని శ్రమ సగటుశ్రమగా, అతని శ్రమశక్తి సగటు శ్రమశక్తిగా లెక్కకురావు. అదసలు అమ్ముడు పోకపోవచ్చు. లేదా సగటుశ్రమశక్తి విలువకన్నా తక్కువకి అమ్ముడవచ్చు. అందువల్ల, శ్రమశక్తికి ఒక కనీస సామర్ధ్యం ఉన్నట్లు ఊహించ బడుతుంది. దాన్ని పెట్టుబడిదారీ ఉత్పత్తి ఎలా నిర్ణయిస్తుందో ముందుముందు చూస్తాం.
పెట్టుబడి దారుడు సగటు శ్రమశక్తి విలువనే చెల్లించినప్పటికీ, ఈ కనీస సామర్ధ్యం అనేది సగటు సామర్ధ్యానికి తేడాగా వుంటుంది.
ఒకవేళ పై 12 మంది 6 జతలుగా చిన్న యజమానుల వద్ద పనిచేస్తే, ప్రతి యజమానీ ఒకే విలువ ఉత్పత్తి చెయ్యడం అనేదీ, ఫలితంగా సాధారణ అదనపు విలువ రేటు పొందడం అన్నదీ కేవలం యాదృచ్చికం. వ్యష్టి సందర్భాలలో తేడాలు రావచ్చు.
ఒకవేళ పై 12 మంది 6 జతలుగా చిన్న యజమానుల వద్ద పనిచేస్తే, ఆ ఆరుగురు చిన్న యజమానులు గుంజే అదనపు విలువరేటులో తేడాలుంటాయి - ఒకరికి ఎక్కువా, మరొకరికి తక్కువా. సమాజం మొత్తాన్ని తీసుకున్నప్పుడు, ఈ తేడాలు సరి అవుతాయి. కాని వ్యష్టి యజమానుల విషయంలో  సరి కావు.
ఎక్కువమంది పనివాళ్ళని పెట్టుకున్నప్పుడు మాత్రమే,  విలువ ఉత్పత్తి నియమాలు పూర్తిగా అమలవుతాయి.
ఒకేచోట ఎక్కువమందిని నియమిస్తే దాని ప్రభావాలు
పని చేసే పద్ధతిలో మార్పు లేకున్నా, అనేకమంది శ్రామికులని ఒకేసారి నియమించడం శ్రమప్రక్రియ యొక్క పరిస్థితుల్లో విప్లవం తెస్తుంది. వాళ్ళు పనిచేసే భవనాలూ , ముడిపదార్ధాలు పెట్టే గోదాములూ, పరికరాలూ, పాత్రలూ –ఒక్కముక్కలో ఉత్పత్తి సాధనాల్లో కొంత భాగం ఉమ్మడిగా వినియోగమవుతాయి.
ఒకపక్క ఉత్పత్తిసాధనాల మారకం విలువ పెరగదు. కారణం ఒకసరుకు ఉపయోగపు విలువని  బాగా ఎక్కువగా, ప్రయోజనకరంగా వాడినందువల్ల దాని మారకం విలువ పెరగదు. మరొకపక్క, ఆ ఉత్పత్తిసాధనాలు ఉమ్మడిగా అంతకుముందు కంటే ఎక్కువస్థాయిలో వినియోగమవుతాయి. ఒక నేతగాడు ఇద్దరు సహాయకులతో పనిచేసే గదికన్నా, 20మంది నేసే గది పెద్దది కావాలి. అయితే ఇద్దరిద్దరు పనిచేసే 10 రూములు కట్టే కంటే 20మంది నేసే ఒక పెద్దగది కట్టడానికి ఖర్చు తగ్గుతుంది.
 ఫలితంగా స్థిర పెట్టుబడి కొంత తగ్గుతుంది. ఆమేరకు ఉత్పత్తయ్యే మొత్తం  సరుకు విలువ కూడా తగ్గుతుంది. అంటే సరుకు తక్కువకి తయారవుతుంది.
 “ భారీ ఎత్తు కార్యనిర్వహణ ద్వారా మాత్రమే ఉత్పత్తి సాధనాలలో పొదుపు సాధింప బడుతుంది.”-పెట్టుబడి గురించి .95
ఉత్పత్తి సాధనాలలో పొదుపు ప్రభావాలు
 ఉత్పత్తి సాధనాల వాడకంలో పొదుపుని రెండు దృక్పధాలనుంచి పరిశీలించాలి:
1. వాటి పొదుపు సరుకులని  చౌక పరుస్తుంది. తద్వారా శ్రమశక్తి విలువని తగ్గిస్తుంది.
2. అదనపు విలువకీ పెట్టిన మొత్తం పెట్టుబడికీ – అంటే స్థిర అస్థిర భాగాల విలువ మొత్తానికీ – ఉండే నిష్పత్తిని మారుస్తుంది.
ఈరెండో అంశం మూడో సంపుటంలో చర్చకొస్తుందనీ, ఇక్కడ పట్టించుకోననీ చెబుతాడు మార్క్స్. దానికి సంబంధిచిన విషయాల్ని అందులో చర్చిస్తాననీ చెబుతాడు.
స్థిరపెట్టుబడి £500. అస్థిరపెట్టుబడి £250. అధనపు విలువ £250  అయిన సందర్భంలో:
అదనపు విలువ రేటు =250/250 X 100 = 100 శాతం.
లాభం రేటు = 250/750 X 100 = 33 1/3 శాతం.
“అస్థిర పెట్టుబడి మీద లెక్కగట్టే అదనపు విలువ రేటే  అదనపు విలువ రేటు. మొత్తం పెట్టుబడి (స్థిరపెట్టుబడి + అస్థిర పెట్టుబడి) మీద లెక్కకట్టే అదనపువిలువ రేటు లాభం రేటు.”-Capital 3.43
 “ ఇవి రెండూ ఒకే అంశం యొక్క రెండు కొలతలు (measurements). ఆ కొలతల ప్రమాణాలు (standards of measurement) భిన్నమైనవి. అయినందువల్ల అవి ఆ అంశం యొక్క నిష్పత్తుల్ని,లేక భిన్న సంబంధాల్ని వ్యక్తం చేస్తాయి.”-Capital 3.43
 ఈ ఉత్పత్తి విధానంలో శ్రమ సాధనాలు తనకు స్వతంత్రంగా /సంబంధంలేనివిగా వేరే వ్యక్తి ఆస్తిగా కార్మికుడు గమనిస్తాడు. కనుక, వాటి వాడకంలో పొదుపు అనేది తనకు సంబంధం లేని చర్యగా పరిగణిస్తాడు, తన వ్యక్తిగత ఉత్పాదకతని పెంచే పద్ధతులతో తనకేమీ సంబంధం లేదని అనుకుంటాడు.
సామాన్య సహకారం
చాలామంది పనివాళ్ళు– ఒకే శ్రమప్రక్రియలోనైనా,లేక ఒకదానికొకటి సంబంధం ఉన్న వేర్వేరు ప్రక్రియల్లోనైనా- పక్కపక్కనే పనిచేస్తున్నప్పుడు వాళ్ళు సహకరించుకుంటున్నట్లు. వాళ్ళ శ్రమ సహకారశ్రమ.
సహకారశ్రమ అనేది కేలం పరిమాణాత్మక మార్పు కాదు. ఎదో కొత్త సృష్టి. మార్క్స్ దాన్ని ‘సామాజిక శక్తి’ అన్నాడు. విడి విడి గా ఒక్కొక్కని శక్తిని కలిపిన మొత్తం కంటే, వాళ్ళే ఉమ్మడిగా ఒకే పనిలో పాల్గొన్నప్పటి శక్తి ఎక్కువగా ఉంటుంది. మార్క్స్ దాన్ని ‘సామాజిక శక్తి’ అన్నాడు.
విడివిడి శ్రామికుల శారీరక శక్తి మొత్తం, ఒకే పనిలో కొందరు ఒకేసమయంలో కలిసి పాల్గొన్నప్పుడు అభివృద్ధి చెందే సామాజిక శక్తి భిన్నమైనది. అది ఎక్కువ బరువైన వస్తువుని లేపడం, ఒక యంత్రాన్ని హాండిల్ తో తిప్పడం, దేన్నైనా  అడ్డు తొలగించడం,వంటి పనులు చెయ్యగలదు. సహకారం ద్వారా, ఉత్పాదకశక్తి పెరుగుతుంది; అంతేకాదు ఒక కొత్త శక్తి పుడుతుంది. అదే సంయుక్త శక్తి.
ఈ సందర్భంలో John Betters మాటలు కోట్ చేస్తాడు : ఒకడు టన్ను బరువు ఎత్తలేడు. పదిమంది కష్టం మీద ఎత్తుతారు. అదే వందమంది అయితే ఒక్కొక్కడు ఒక్కొక్క వేలి బలంతో ఎత్తేస్తారు”- Proposals for Raising a Colledge of Industry.‖ London, 1696, p. 21

సహకారం ఉత్సాహపరుస్తుంది, హుషారుకలిగిస్తుంది
అనేక శక్తుల ఐక్యత కొత్త శక్తిని పుట్టిస్తుంది, అంతే కాదు. సామాజిక సంపర్కం ప్రతి ఒక్కరినీ ఉత్సాహపరిచి, సమర్ధతనీ పెంచుతుంది. ఇది పొలం పనుల్లో స్పష్టంగా తెలుస్తుంది. అందువల్ల,కలిసి పనిచేస్తున్న 12 మంది సంయుక్త పనిదినం 144 గంటల్లో 12 మంది విడివిడిగా తలా 12 గంటల్లో ఉత్పత్తిచేసినదానికన్నా ఎక్కువ ఉత్పత్తి చేస్తారు.
సామాన్య సహకారంలో వ్యక్తం కాకపోయినా శ్రమ విభజన ఉంటుంది
అనేకమంది ఒకేసమయంలో  రకమైన పనిలో ఉండవచ్చు. అయినాగాని ప్రతివాని శ్రమా, సమష్టిశ్రమలో ఒక భాగంగా ఉంటుంది. సహకారం ఫలితంగా ఆ శ్రమప్రక్రియలోని అన్ని దశలగుండా శ్రమ పదార్ధం (subject of labour) త్వరగా ముందుకు కదులుతుంది. ఉదాహరణకి, నిచ్చెన అడుగు మెట్టు నించి పైమెట్టుదాకా ఒక డజన్ మంది బేల్దార్లు వరసలో నిలబడి రాళ్ళు పైకి చేర్చేటప్పుడు ప్రతి పనివాడూ ఒకే పని చేస్తాడు. అయినాగాని,   వాళ్ళ వేర్వేరు చర్యలు ఒక పూర్తి చర్యలో భాగాలు. అవన్నీ ఒకదానికొకటి సంబంధంలో వున్నభాగాలు. ప్రతి రాయీ నడవాల్సిన వేర్వేరు దశలు. ఆరాళ్ళని ఒక్కడే మోసుకొని నిచ్చెన ఎక్కుతూ దిగుతూ పైకి చేర్చడం కంటే, 12మంది నిచ్చెన మెట్ల మీద వరసగా ఉండి పైకి చేర్చడం త్వరగా అవుతుంది. అదే దూరానికి తక్కువ కాలంలో చేర్చడం సాధ్యమవుతుంది..
మరొక ఉదాహరణ. ఒక భవనాన్ని ఒకేసమయంలో వేర్వేరు వైపుల నుండి  కట్టేటప్పుడు, శ్రమ సమ్మేళనం అవుతుంది. 12 మంది బేల్దార్లు తమ ఉమ్మడి పనిదినం అయిన  144గంటల్లో, ఒకే బేల్దారు 12 రోజుల్లో /144గంటల్లో చేసే పనికన్నా ఎక్కువ చేస్తారు. అందువల్ల మొత్తం పని జరిగే కాలం తగ్గుతుంది.
పై ఉదాహరణల్లో పనివాళ్ళు ఒకేరకమైన పని చేస్తున్నారు- అనే పాయింట్ ని నొక్కి చెబుతాడు. ఎందుకంటే, ఇది ఉమ్మడి శ్రమ యొక్క సామాన్యమైన రూపం. ఇది సహకారంలో గొప్ప పాత్ర పోషిస్తుంది – దాని పూర్తి అభివృద్ధి చెందిన దశలో కూడా.
ఒకవేళ పని సంక్లిష్టమైనదయితే, వేరువేరు చర్యల్ని వేర్వేరు పనివాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. దాంతో  ఆయా చర్యలు ఒకే కాలంలో జరిగే వీలుంటుంది. కనుక మొత్తం పని అయ్యే కాలం తగ్గుతుంది.
సంక్లిష్ట శ్రమ చెయ్యాల్సిన సమస్య అయినట్లయితే, ఒకేసమయంలో చాలా పనులు చెయ్యాల్సి ఉంటుంది. ఒకరు ఒక పనిచేస్తే, మరొకరు మరొక పని చేస్తారు. ఒకేవ్యక్తి తేలేని ఫలితాన్ని అందరూ కలిసి తెస్తారు. అందుకు వాళ్ళు తోడ్పడతారు/సహకరిస్తారు. ఒకడు తెడ్డు వేస్తె, మరొకడు చుక్కానీ పట్టుకుంటాడు, మూడోవాడు వల విసురుతాడు, లేదా పెద్దచేపల్ని కొట్టే ఈటె (హర్పూన్)తో పొడుస్తాడు; ఈవిధంగా చేపల వేట విజయవంతం అవుతుంది. ఈ సహకారం లేనిదే ఈపని అసాధ్యమవుతుంది.- Destutt de Tracy

కీలక సమయాలు
చాలా పరిశ్రమల్లో నిర్దిష్ట ఫలితాల్నిరాబట్టాల్సిన కీలక సమయాలుంటాయి. ఆసమయాల్ని ఆయాప్రక్రియల స్వభావం నిర్ణయిస్తుంది. ఉదాహరణకి, ఒక మందలో గొర్రెల బొచ్చు కత్తిరించాల్సివస్తే, ఒక నిర్ణీత కాలంలో పని మొదలై, పూర్తయిపోవాలి. అలాగే ఒక గోధుమ చేను నూర్చాల్సి వచ్చినా అంతే. అలా చెయ్యడం మీదనే ఉత్పాదితం నాణ్యతా, పరిమాణమూ ఆధారపడి ఉంటాయి. ఈ సందర్భాల్లో ప్రక్రియకి పట్టే సమయం నిర్ణయమై ఉంటుంది – హెర్రింగ్ చేపల వేటలో లాగానే. ఒక రోజు నుండి 12 గంటలు మించిన పనిదినాన్నిఏ ఒక్క వ్యక్తీ  ఏర్పరచలేడు. అయితే, సహకరించుకునే 100 మంది పనిదినాన్ని 1200 గంటలకు పెంచగలరు. పనికి కావలసిన సమయం తక్కువగావుంటే, సరైన సమయంలో ఎక్కువమందిని దింపి పని పూర్తి చెయ్యవచ్చు. సమయం చాలకపోవడాన్ని, మందితో భర్తీ చెయ్యవచ్చు.  అదే కాలంలో అదే పని చెయ్యడానికి కావలసిన వ్యష్టి శ్రామికుల సంఖ్య కంటే, ఈ శ్రామికుల సంఖ్య ఎప్పుడూ తక్కువే ఉంటుంది.
కొన్ని పనుల్లో సహకారం అనివార్యం
ఒకపక్క, విస్తరించిన స్థలంలో పని జరగడానికి సహకారం వీలు కలిగిస్తుంది. ఫలితంగా, కొన్ని పనుల్లో – ముంపు నీళ్ళని బయటకు పంపడం , కరకట్టలు కట్టడం, నీటిపారుదల పనులు, కాలవలు తవ్వడం,రోడ్లు రైల్వే లైన్లు వెయ్యడం వంటి వాటిలో- సహకారం అనివార్యం.
మరోక వైపు ఉత్పత్తి స్థాయిని విస్తరిస్తూ, స్థల విస్తీర్ణాన్ని సాపేక్షంగా కుదించడాన్ని సాధ్యం చేస్తుంది. అందువల్ల అనవసరమైన అనేక ఖర్చులు ఉండవు. పనివాళ్ళు గుమికూడి ఉండడం, వివిధ ప్రక్రియలు ఒకేచోట కలిసి ఉండడం , ఉత్పత్తిసాధనాల కేంద్రీకరణ – ఇందుకు కారణాలు.
సహకారంయొక్క పెట్టుబడిదారీ స్వభావం
సహకారానికి శ్రామికులు ఒకే చోట కూడడం అవసరమైన షరతు. అలా కూడాలంటే, ఒకే పెట్టుబడిదారుడు వాళ్ళని పనిలో పెట్టుకోవాలి. అనేకమంది శ్రమశక్తిని కొని శ్రామికుల్ని ఒకచోటకి చేర్చకపోతే వాళ్ళు సహకరించుకోలేరు. ఎక్కువమందిని నియమించాలంటే, అస్థిర పెట్టుబడి తగినంత పెట్టుబడిదారుడి జేబులో సిద్ధంగా ఉండాలి. సహకరించుకునే కార్మికుల సంఖ్య అతని వద్ద ఉన్న డబ్బుని బట్టి ఉంటుంది. 30 మందికి సరిపడే డబ్బుతో 300 మందిని పెట్టుకోజాలడు.
స్థిర పెట్టుబడికి సంబంధించి కూడా అంతే. 30 మందికి కావాల్సిన పరికరాలు –ఉమ్మడిగా వాడుకునేవి చాలా ఉన్నా- 300 మందికి చాలా ఎక్కువే కావాలి. శ్రమపదార్ధాలు 10 రెట్లు కావాలి. కనుక అందుకు తగినంత పెట్టుబడి ఉండాలి.
తాను శారీరక శ్రమ చెయ్యకుండా, అదనపు విలువ మీద బతకాలంటే, కొందరు పనివాళ్ళని పెట్టుకోవాలనీ, అందుకు తగిన కనీస మొత్తం అవసరమనీ ఇంతకూ ముందే చూశాం. చిన్న యజమాని నించి పెట్టుబడిదారుడుగా అవడానికీ, పెట్టుబడిదారీ ఉత్పత్తిని లాంచన ప్రాయంగా ప్రారంభించడానికీ కనీస పెట్టుబడి అవసరం అవుతుంది – అని  ఇంతకు ముందు అధ్యాయంలో గమనించాం.
ఇప్పుడు అనేక విడివిడి ప్రక్రియల్ని ఒకే సామాజిక ప్రక్రియగా కలపడానికి ఒక కనీస మొత్తం అవసరం అని గమనిస్తున్నాం.

సహకారంలో పెట్టుబడిదారుడు పర్యవేక్షకుడు అవుతాడు
శ్రామికుడు తన కోసం కాకుండా పెట్టుబడి దారుడి కోసం, ఫలితంగా అతని కింద పనిచేస్తాడు. ఫలితం: పెట్టుబడికి శ్రమ లొంగి వుండడం.
1.భారీ స్థాయిలో కలిసిన శ్రమ పర్యవేక్షణని  అవసరపరుస్తుంది –వ్యష్టి పనుల్ని సమన్వయ పరచడానికి. నిర్దేశించడానికీ, పర్యవేక్షించదానికీ, సర్దుబాటు చెయ్యడానికీ సారధి అవసరం. అజమాయిషీ అవసరం. ఈ ఆధిపత్యానికి ప్రతిఘటన ఏర్పడుతుంది. పెట్టుబడిదారీ ఉత్పత్తి ఉద్దేశ్యమూ, లక్ష్యమూ వీలైనంత అదనపు విలువ గుంజడమే. అందుకోసం శ్రమశక్తిని ఎంత సాధ్యమైతే అంత దోచడమే. అందుకోసం సహకరించుకునే కార్మికుల సంఖ్య పెరిగే కొద్దీ, పెట్టుబడి ఆధిపత్యానికి ప్రతిఘటనా ఎక్కువవుతుంది. దాంతో ఆ ప్రతిఘటనని ప్రతి ప్రతిఘటనతో(counterpressure) అధిగామించాల్సిన అవసరం పెట్టుబడికి కలుగుతుంది. శ్రమ శక్తి దోపిడీకీ, అధిక శ్రమకీ  కార్మికుల ప్రతిఘటన పెరిగేకొద్దీ మరింత పర్యవేక్షణ అవసరం అవుతుంది.

2.శ్రామికుడు వాడే ఉత్పత్తి సాధనాలు శ్రామికులవి కావు, అవి ఇతరుల ఆస్తి, పెట్టుబడిదారుడివి. వాటి పరిమాణం ఎంత పెరిగితే వాటి సరైన వినియోగం మీద అంత నియంత్రణ అవశ్యకమవుతుంది.
ప్రత్యేక పర్యవేక్షకుల నియామకం
సహకారం విస్తరించే కొద్దీ, ఈ నిరంకుశత్వం దానికి తగిన రూపాలు తీసుకుంటుంది. కనీస పెట్టుబడి కూడగానే  వాస్తవ శ్రమ ను వదిలించుకున్నట్లే, ఇప్పుడు పనివాళ్ళని నిరంతరం పర్యవేక్షించే పనికి  ప్రత్యేకమైన వేతన శ్రామికులని నియోగిస్తాడు. పెట్టుబడిదారుడి ఆధిపత్యంలో ఉన్న శ్రామికుల సైన్యానికి కూడా , నిజమైన సైన్యానికి లాగానే ఆఫీసర్లూ (మేనేజర్లూ), సార్జెంట్లూ (ఫోర్ మెన్లూ, పర్యవేక్షకులూ) కావాలి. వాళ్ళందరూ పనిజరిగేటప్పుడు  పెట్టుబడిదారుడి పేరుమీద అతని తరఫున ఆధిపత్యం నెరుపుతారు. పర్యవేక్షణ వారి  ఏకైక చర్య అవుతుంది.
శ్రమ సామాజిక ఉత్పాదక శక్తులు పెట్టుబడికి చెందుతాయి
పెట్టుబడిదారీ విధానంలో ప్రధానమైన సంబంధం అదనపు విలువని ఉత్పత్తిచేసే శ్రమశక్తి అమ్మకమూ, వినియోగమూ. సహకారం వాళ్ళ కూడా ఈ సంబంధం మార్పుచెందుతుంది. శ్రామికుడు అమ్మకందారుడుగా తన ఒక్కని శ్రమశక్తిని అమ్ముతాడు. శ్రామికులని అందరినీ కలిపేవాడు పెట్టుబడిదారుడే. కాబట్టి, అనేకమంది శ్రామికుల సహకారం ఫలితం అయిన సామాజిక ఉత్పాదకశక్తులు పెట్టుబడి యొక్క ఉత్పాదకశక్తులే.
అమ్ముకునే దాకా, శ్రమశక్తికి శ్రామికుడే ఓనర్. తనదైన శ్రమశక్తిని మించి అతను అమ్మలేడు. పెట్టుబడి దారుడు ఒక శ్రమశక్తిని కాక 100 శ్రమశక్తుల్ని కొని,ఒకనితో కాక ఒకరితో ఒకరికి సంబంధంలేని 100 మందితో ఒప్పందాలు చేసుకున్నా పరిస్థితిలో తేడా ఉండదు. వాళ్ళని సహకారంలో పెట్టకుండానే పనిచేయిన్చుకోగలడు. 100 స్వతంత్ర శ్రమశక్తుల విలువ  అతను చెల్లించాడు.కానీ ఆ 100మంది సంయుక్త శ్రమశక్తికి ఏమీ చెల్లించలేదు.ఒకరికొకరు స్వతంత్రులు కావడం వల్ల, వాళ్ళు ఏకాకులు, ఎవరికివారుగావున్న విడివిడి వ్యక్తులు. పెట్టుబడిదారుడితో సంబంధంలోకి వచ్చే విడివిడి వ్యక్తులు.అంతేగాని వాళ్ళలో వాళ్ళకి సంబంధం లేదు.ఈ సహకారం అనేది శ్రమప్రక్రియతో మొదలవుతుంది. అయితే శ్రమ ప్రక్రియ మొదలయ్యేటప్పటికే శ్రామికులు తమకు తాము చెందకుండా పోతారు. ఆ ప్రక్రియలో ప్రవేశించగానే, పెట్టుబడిలో కలిసిపోతారు. పెట్టుబడిలో అంతర్భాగమవుతారు.

అందువల్ల కలిసి పనిచేటప్పుడు పెంపొందే   ఉత్పాదకశక్తి పెట్టుబడి యొక్క ఉత్పాదక శక్తే. శ్రామికులని నిర్దిష్ట పరిస్థితుల్లో పెట్టినప్పుడు ఈ శక్తి ఉచితంగా ఉత్పన్నం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో పనివాళ్ళని పెట్టేది పెట్టుబడే. ఒక పక్క, ఈ శక్తి కోసం పెట్టుబడిదారుడికి ఏ ఖర్చూ ఉండదు; మరోపక్క, పెట్టుబడికి చెందే ముందుగా, శ్రామికుడు ఈ శక్తిని పెంపొందించు కోలేదు.
కనుక  ఆశక్తి పెట్టుబడికి ప్రకృతి ప్రసాదించిన శక్తిగా, పెట్టుబడిలో అంతర్గతంగా ఉన్న శక్తిగా అగపడుతుంది.
ఈ ఉత్పాదక శక్తులు  శ్రామికుల నుండి కాకుండా, పెట్టుబడి నుండి పుట్టినట్లు అగపడుతుంది.
భిన్న ఉత్పత్తి సంబంధాల్లో సహకారం పాత్ర
ప్రాచీన ఆసియన్లూ, ఈజిప్షియన్లూ, ఎట్రూస్కన్లూ మొదలైనవాళ్ళు నిర్మించిన బ్రహ్మాండమైన కట్టడాలలో సరళ సహకారం యొక్క గొప్ప ఫలితాలు చూడవచ్చు. 
ప్రాచీన కాలాల్లో ప్రాచ్య రాజ్యాల్లో పౌర, మిలిటరీ ఖర్చులు పోను మిగులు ఉండేది. వ్యవసాయేతర జనాభామీద ఆరాజ్యాలకు ఆధిపత్యం ఉండేది. కనుక మహత్తర నిర్మాణాలు చేపట్టగలిగాయి. భారీ విగ్రహాల్నీ,అపారపరిమాణంలో ఉండే వస్తువుల్నీ తరలించడానికి మానవ శ్రమే  విస్తారంగా వాడబడేది. వాటిని ఎలా రవాణా చేసారా అని మనం ఆశ్చర్యచకితులమవుతుంటాం. శ్రామికుల్ని ఎక్కువమందిని పెట్టడం,వాళ్ళ యత్నాల్ని కేంద్రీకృతం చెయ్యడం అందుకు సరిపోయాయి. వారి సంఖ్యే వారి బలం. అంతమత మందిని పురమాయించగల అధికారం ఉన్నందువల్లనే ఆ రాజప్రాసాదాలూ, కోటలూ, గుళ్ళూ గోపురాలూ, పిరమిడ్లూ నిర్మించగలిగారు. అంతమంది కార్మికుల్ని పోషించడానికి సరిపోయే ఆదాయం ఒకవ్యక్తి చేతుల్లోనో, కొందరి చేతుల్లోనో చేరి ఉంటేనే గాని అంతటి నిర్మాణాలు సాధ్యం కావు.
 ఆసియా, ఈజిప్ట్ రాజులకూ, ఎట్రూస్కన్ మతపాలకులకూ ఉన్న ఈ ఆదాయం, అధికారం ఆధునిక సమాజంలో పెట్టుబదారుడికి బదిలీ అయింది. అతను ఒక్కడే కావచ్చు,లేదా జాయింట్ స్టాక్ కంపెనీల్లో లాగే సమష్టి పెట్టుబడిదారుదయినా కావచ్చు.
మానవాభివృద్ధి తొలి కాలంలో వేటాడి బతికే తెగలలోనూ, భారతీయ వ్యవసాయదారుల్లోనూ ఉత్పత్తిసాధనల ఉమ్మడి యాజమాన్యం ఉండేది. మరోకవైపు, ఏఒక్కడూ తన తెగతో బొడ్డుతాడు ఇంకా తెంచుకోలేదు. కలిసికట్టుగా ఉన్నారు. ఏ తేనెటీగ తేనెతెట్టెతో ఎలాగయితే సంబంధం తెంచుకోజాలదో, అలాగే ఏవ్యక్తీ అయినా తనతేగలోని మనుషులతో తెగతెంపులు చేసుకోజాలడు. ఆకాలంలో సహకారం అనేది ఈ రెండు పరిస్తితుల మీదా ఆధారపడి ఉండేది.
ప్రాచీన సహకారానికి ఈ రెండు విశిష్ట లక్షణాలూ ఉంటాయి. ఈ రెండు లక్షణాలచేతా అది పెట్టుబడిదారీ సహకారానికి భిన్నంగా ఉంటుంది. ప్రాచీన కాలాల్లోనూ, మధ్య యుగాల్లోనూ, ఆధునిక వలసల్లోనూ అక్కడక్కడ అప్పుడప్పుడు  భారీ స్థాయిలో  సహకారం వాడకంలో ఉంటుంది. అది ఆదిపత్యమూ, దాసత్వమూ అనే సంబంధం మీద, మరీ ముఖ్యంగా బానిస విధానం మీద ఆధారపడి ఉంటుంది. అందుకు విరుద్ధంగా  పెట్టుబడి దారీ సహకారం తన శ్రమశక్తిని అమ్ముకునే స్వేచ్చగల వేతన కార్మికుని ఉనికిని ఆశిస్తుంది.
చారిత్రకంగా ఈరూపం రైతుల వ్యవసాయానికీ, స్వతంత్ర చేతి వృత్తుల నిర్వహణకూ- గిల్డులలోగానీ, ఇతరత్రాకానీ - వ్యతిరేకంగా అభివృద్ధి అయింది. వీటి (వ్యవసాయం, చేతివృత్తులు) దృష్ట్యా చూస్తే, స్వయంగా పెట్టుబడిదారీ సహకారం, సహకారం యొక్క ఒక ప్రత్యేక చారిత్రిక రూపం అనే విషయం వ్యక్తం అవదు. అవకపోగా, అసలు సహకారం అనేదే పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియకు చెందిన చారిత్రిక రూపంగా, దాన్ని ప్రత్యేకంగా వేరుపరచి చూపే చారిత్రిక రూపంగా అగపడుతుంది.   
సహకారం వల్ల అభివృద్ధయిన శ్రమయొక్క సామాజిక ఉత్పాదకశక్తి, పెట్టుబడి యొక్క ఉత్పాదక శక్తి లాగా కనబడుతుంది. అలాగే విడివిడి స్వతంత్ర వ్యక్తులో, చిన్న యజమానులో నిర్వహించే ఉత్పత్తి ప్రక్రియతో పోల్చి చూస్తే, అసలు  సహకారమే పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియ యొక్క విశిష్ట రూపంగా అగపడుతుంది. పెట్టుబడికి స్వాధీనం అయినప్పుడు వాస్తవ శ్రమ ప్రక్రియలో వచ్చే మొదటి మార్పు ఇదే. ఈ మార్పు అప్రయత్నంగా జరుగుతుంది. ఒకే ప్రక్రియలో, ఏకకాలంలో ఎక్కువమంది వేతన శ్రామికుల్ని పెట్టడం ఈ మార్పుకి అవసరమైన షరతు. అదే పెట్టుబడిదారీ ఉత్పత్తికి ఆరంభ స్థానాన్ని (starting-point) ఏర్పరుస్తుంది. అది పెట్టుబడి పుట్టుకతో సమవసిస్తుంది కూడా. చారిత్రకంగా శ్రమప్రక్రియ సామాజిక ప్రక్రియగా పరివర్తన చెందడానికి చారిత్రకంగా పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం అవసరమైన షరతుగా తననుతాను ప్రదర్శించుకుంటుంది. అందువల్ల మరొకపక్క, ఈ శ్రమప్రక్రియ యొక్క సామాజిక రూపం శ్రమ ఉత్పాదకతని పెంచడం ద్వారా  మరింత లాభదాయికంగా, శ్రమ దోపిడీ చేసేందుకు  పెట్టుబడి ప్రయోగించే పద్దతిగా ప్రదర్శించుకుంటుంది.
ఇంతదాకా సహకారం అనేదాన్ని మౌలిక రూపంలో పరిశీలిస్తున్నాం. ఆరూపం సమస్త భారీ స్తాయి ఉత్పత్తికీ  కూడా అవసరమైనదే. అయితే అది పెట్టుబడిదారీ అభివృద్ధిలో ఒక ప్రత్యేక శకానికి  లాక్షణిక స్థిర రూపం కాదు. మహా అయితే చేతివృత్తులతో తొలి కార్ఖానా దశ మొదట్లోనూ, కార్ఖానాల కాలంలో పెద్దస్థాయి వ్యవసాయంలోనూ అలా అయినట్లు అగపడుతుంది- అదీ ఇంచుమించుగా మాత్రమే.భారీ పెట్టుబడి ఉన్న ఏయే ఉత్పత్తి శాఖల్లో శ్రమ విభజనా, యంత్రాలూ అప్రధానంగా ఉంటాయో ఆయా ఉత్పత్తి శాఖల్లో   సామాన్య సహకారం ఎప్పుడూ ప్రబల రూపంగా ఉంటుంది.

శ్రమ విభజానా, యంత్రాలూ ముఖ్య పాత్ర పోషించకుండా పెట్టుబడి భారీ స్థాయిలో పనిచేస్తున్న ఈ రోజుల్లో కూడా అది అస్తిత్వంలో ఉంది. ఆవిధంగా సహకారం పెట్టుబడిదారీ ఉత్పత్తి యొక్క ముఖ్య రూపం.
దాని ప్రాధమిక రూపం మరింత సంక్లిష్ట రూపాల బీజాల్ని ఇముడ్చుకొని ఉంటుంది. అది (ప్రాధమికరూపం) సంక్లిష్ట రూపాల్లో వాటి అంశాలలో ఒకటిగా తిరిగి కన్పిస్తుంది. అంతేకాదు, వాటి (సంక్లిష్ట రూపాల) సరసనే ఒక ప్రత్యేక పద్ధతిగా నడుస్తుంది.

రాబోయే పోస్ట్-శ్రమ విభజనా –కార్ఖానా ఉత్పత్తీ
























14, మార్చి 2018, బుధవారం

కమ్యూనిస్ట్ అని ఐన్‌స్టైన్ మీద అమెరికా నిఘా

     కమ్యూనిస్ట్ అని ఐన్‌స్టైన్ మీద అమెరికా నిఘా
Link






ఇప్పుడున్న పెట్టుబడిదారీ సమాజంలోని ఆర్ధి
అరాచకత్వమే అరిష్టానికి కారణం అని నాభిప్రాయం

ఈ అరిష్టాల్ని పోగొట్టాటానికి ఒకే మార్గం ఉన్నదని ధృవీకరించుకున్నాను-
సోషలిష్ట్ ఆర్ధిక విధానాన్ని నెలకొల్పటం
“(ఆ విధానం) సామాజిక లక్ష్యాల దిశలో సాగే విద్యావిధానాన్ని అనుసరించి ఉండాలి.అలాంటి ఎకానమీలో ఉత్పత్తి సాధనాలు సమాజానికి చెంది ఉంటాయి. అవి ప్రణాళికాబద్ధంగా ఉపయోగించబడతాయి. ప్రణాళికా బద్ధవిధానం సమాజంఅవసరాలకు ఉత్పత్తిని సర్దుబాటు చేస్తుంది. జరగాల్సిన పనిని పనిచేయగలిగినవాళ్ళందరికీ పంపిణీచేస్తుంది.ప్రతి పురుషుడికీమహిళకీబిడ్డలకీ బతుకుదెరువు గ్యారంటీ ఇస్తుంది.
ఈ అభిప్రాయాలు వ్యక్తం చేసిన వ్యక్తి 1879మార్చ్ 14 న పుట్టి 76 ఏళ్ళు బతికి 1955 ఏప్రిల్ 18న చనిపోయిన అల్బర్ట్ ఐన్‌స్టైన్. నోబెల్ బహుమతి పొందిన సైంటిస్ట్ గా అందరకీ సుపరిచుతుడేకాని పై మాటలు చెప్పేటంతటి సోషలిస్ట్ అని పెద్దగా తెలియదు. 
పెట్టుబడిదారీ మీడియా బయటకు పొక్కకుండా చేసింది. టైం మేగజీన్ వ్యాసమే అందుకు తార్కాణం.1999 డిశంబర్ 31 టైం మేగజీన్ 'శతాబ్దపు మనీషీ (Person of the Century) అనే శీర్షికతో ఐన్‌స్టైన్ గురించి ఫ్రెడరిక్ గోల్డెన్ రాసిన వ్యాసం వేసింది.
కాని ఆయన బాహాటంగా ప్రకటించిన సోషలిస్ట్ భావాల్ని 15 పేజీల్లో ఎక్కడా మాటవరసకన్నా ప్రస్తావించలేదు. ఈమాటలే అయితే పోనీలే అనుకోవచ్చు. సోషలిజం ఎందుకు అనే వ్యాసం రాశాడు. ఆయన చర్యలు ఆయన సోషలిష్ట్ భావాలకి అద్దం పడతాయి. పెట్టుబడి దారీ సమర్ధకులూసంస్తలూ ఆయనకి వ్యతిరేకంగా వ్యవహరించిన సందర్భాలెన్నో ఉన్నాయి. అమెరికా గూఢచర్య సంస్త ఎఫ్.బీ.ఐ అయన్ని రహస్యంగా అమెరికాలో అడుగు పెట్టినప్పటినుంచీ చనిపోయే దాకా కమ్యూనిస్ట్ అని నిఘాపెట్టింది..
ఆయన యుద్ధాలకి బద్ధవ్యతిరేకి.పొరహక్కులకి కట్టుబడిన మనిషి.సామాజిక అసమానతల్ని బహిరంగంగానే విమర్శించేవాడు. సొషలిస్టు ప్రణాళికాబద్ధ ఆర్ధిక విధానాన్ని సమర్ధించాడు.
1931 లోనే 'వర్గ భేదాలు అన్యాయమైనవి/,సమర్ధింపరానివిఅంతిమంగా బలప్రయోగం మీద అధారపడ్డవీ అని రాశాడు. 1946 లో 'ది నీగ్రో క్వొశ్చన్  అనే వ్యాసంలో అమెరికా జాతి వివక్షని ఖండించాడు.
1934 లో మహాసంక్షోభం కార్మికుల కొనుగోలుశక్తికీపెట్టుబడికున్న ఉత్పాదకసాంకేతిక శక్తిలకీ మధ్య వ్యత్యాసానికి ఫలితం అని గ్రహించాడు.
1932 లో కాలిఫోర్నియా యూనివర్సిటీలో పాఠాలు చెప్పేందుకు వీసా కోసం దరఖాస్తు చేశాడు. అంతకుముందు చాలాసార్లు అలాచేశాడు.అయితే ఈసారి విమెన్ పేట్రియట్ కార్పొరేషన్ అనే సంస్త అతన్ని దేశంలోకి రానివ్వద్దని 16 పేజీల లేఖ రాసింది. అతని యుద్ధవ్యరేక భావాలూఅంతర్జాతీయ అభిప్రాయాలూ 'కమ్యూనిస్టుఅరాచక కమ్యూనిస్టు సంస్తలతోగ్రూపులతో ప్రత్యక్ష సంబంధం' ఉన్న వాళ్ళకుండేటటువంటివి అని ఆసంస్త రాసింది.అందు మీదట బెర్లిన్ కాన్సలేట్ ఆఫీస్ లో ఆయన రాజకీయ అభిప్రాయాలేమిటో తెలుసుకోగోరారు.ఆయనకు కోపమొచ్చింది:
" ఇలాంటి సిల్లీ ప్రశ్నలకి జవాబివ్వను. అమెరికా రావాలని నేనడగలేదు.మీదేశస్తులే ఆహ్వానించారుఅవును, ప్రాధేయపడ్డారు. మీదేశానికి ఒక అనుమానితుడిగా అయితే రావాలనుకోను.మీరు నాకు వీసా ఇవ్వదలుచుకోకపోతే చెప్పండి అన్నాడు.
అదంతా పత్రికలో వచ్చింది.మరుసటిరోజు ఇస్తామని అధికారులు ప్రకటించారు.1932 డిశంబర్ 10 న బయల్దేరి 1933 జనవరి12 న అమెరికా చేరాడు. ఆతర్వాత రెండు వారాలకి జర్మనీలో హిట్లర్ అధికారం చేబట్టాడు.ఐన్‌స్టైన్ అమెరికా లోనే జీవితాంతం ఉండిపోయాడు.
అప్పటినించీ 1955 లో చనిపోయే వరకూ అమెరికా F.B.I (ఫెడరల్ భ్యూరో ఆఫ్ ఈన్వెస్టిగేషన్) ఆయన్ని రహస్యంగా వెంటాడుతూనే ఉంది. డైరెక్టర్ జాన్ హూవర్ దాన్నొక ముఖ్య కార్యక్రమంగా పెట్టుకున్నాడు.అతను సామాన్యుడు కాడు. 1919 లో 23 నగరాల్లో 10000 మందిని కమ్యూనిస్టులంటూ అరెస్ట్ చేశారు.వాళ్ళలో ఎక్కువమంది అమెరికన్లు. చివరకి వదిలివేయాల్సి వచ్చింది. వీళ్ళ తరఫున వాదించేందుకు ఇష్టపడ్డ లాయర్ల జాబితా తయారుచేసాడు. కమ్యూనిస్ట్ పార్టీలో 80000 మంది సభ్యులుండేవారు. ఈయన దడికి సభ్యత్వం 6000 కి పడిపోయింది. దానికి బహుమతిగా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు.మూడేళ్ళకి డైరెక్టర్ గా పదోన్నతి పొందాడు.అప్పటికి సంస్త అధికారం పరిమితమే. చట్టం అమలు రష్ట్ర కార్యక్రమమే.హూవర్ ఏజెంట్లు తుపాకులతో తిరగకూడదు. అనుమాతుల్ని అదుపులోకి తీసుకోకూడదు.ఈ అధికారాలకోసం 1935 లో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటుచేసేట్లు కాంగ్రెస్ మీద విజయవంతంగా ఒత్తిడి తెచ్చాడు. అప్పటినుంచీ 1972 లో చనిపోయేవరకూ హూవర్ డైరెక్టర్‌గా కొనసాగాడుఆయన హయాంలో అమెరికాకి ఎనిమిది మంది అధ్యక్షులు మారారు.కాని ఎవ్వరూ హూవర్ జోలికి వెళ్ళలేదు. వాళ్ళ రహస్యాల్ని కూడా సేకరించి ఉంచటమే కారణమని కొందరంటారు.
ఐన్‌స్టీన్ మీద 22 సంవత్సరాల్లో 1800 పేజీల (దస్త్రంఫైల్ తయారు చేశాడు. 1983 లో దాని గురించి నేషన్ మేగజీన్ వ్యాసంతో చాలా భాగం తెలిసింది. అయితే ఒక పావు భాగం రహస్యంగానే అధికారుల అధీనంలో ఉంది.ఫ్రెడ్ జెరోం సమాచార స్వేచ్చ చట్టం ప్రకారం మిగిలినదాంట్లో ఎక్కువ భాగం రాబట్టి తన పుస్తకం 'The Einstein File : J. Edgar Hoover's Secret War Against the World's Most Famous Scientist ' రాశాడు. 348 పేజీల పుస్తకమది. 2002 లో ప్రచురించాడు.
హిట్లర్ కంటే ముందుగా అణ్వాయుధం నిర్మించాలని రూజ్వెల్ట్ కి లేఖ రాసినప్పుడు.ఆకార్యక్రమంలో సహాయపడేందుకు ఐన్‌స్టీన్ పేరు ప్రతిపాదనకు వచ్చింది.సైనిక నిఘా విభాగం ఎఫ్.బీ.ఐ అభిప్రాయం అడిగింది.అందుకు హూవర్ ఐన్‌స్టీన్ అమెరికాలో కమ్యూనిస్ట్ ప్రయోజనాల్ని చూస్తున్నాడనీ, 1923-1929 కాలంలో ఆయన ఇల్లు కమ్యూనిస్ట్ సెంటర్ గా ఉండిందనీ రాశాడు.ఇలాటి వ్యక్తి ఇంత తక్కువ టైంలో అమెరికాకి విధేయుడైన పౌరిడిగా మారడం కష్టం అని రాశాడు. అతనికి విప్లవ నేపధ్యం వుంది కనక నియమించమని సిఫారసు చెయ్యటం లేదు అని ఎఫ్.బీ.ఐ నిష్కర్షగా చెప్పింది.
రెండో ప్రపంచ యుద్ధం ముగిశాకకోల్డ్ వార్ మొదలయింది.అప్పటినుంచీ ఐన్‌స్టీన్ మీద నిఘా ఉధృతమయింది. హిరోషిమా నాగసాకీలమీద బాంబులేయడాన్ని ఆయన దృడంగా వ్యతిరేకించడాన్ని తీవ్రంగా పరిగణించింది. 1946 మేలో అణ్వాయుధ వృద్ధికి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు ఏర్పడ్డ ఎమర్జన్సీ కమిటీ ఆఫ్ అటామిక్ సైంటిస్ట్స్ అనే సంస్తకి నాయకత్వం వహించేందుకు ముందుకొచ్చాడు. ఆయనే దీనికి నాయకుడనీగతంలో అనేక కమ్యూనిస్ట్ ఫ్రంట్ ఆర్గనైజేషన్లు ఆయన్ను ఉపయోగించుకున్నాయి అని ఎఫ్.బీ.ఐ రాసింది.
1948 స్మిత్ చట్టం ప్రకారం కమ్యూనిస్ట్ పార్టీ నేతలమీద నేరారోపణలు చేసారు.ఐన్‌స్టైన్ ఆనేతల పక్షాన నిలబడ్డాడు.జూలియస్ఎథెల్ రోజంబర్గ్ ల్ని సోవియట్ గూడచారులంటూ దోషులుగా నిర్ణయించి 1953లో విద్యుత్ కుర్చీలో హతమార్చారు.ఆసందర్భంలో ఆయన వాళ్ళకి సహాయం చేశాడు.వాళ్ళకి ప్రాణ బిక్ష పెట్టమని ఫెడరల్ జడ్జ్ కి లేఖ రాశాడు. అయితే ఆజడ్జ్ దాన్ని హూవర్ కి పంపాడు.దాన్ని దస్త్రసంలో చేర్చాడు.
1950 మొదట్లో అధ్యక్షుడు హారీ ట్రూమన్ హైడ్రోజన్ బాంబ్ తయారీకి శిఘ్ర కార్యక్రమం ప్రకటించాడు.ఐన్‌స్టైన్ టెలివిజన్ లో తీవ్రంగా వ్యతిరేకించాడు.మర్నాడే వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ప్రధాన శీర్షికన ప్రచురించింది.
ఆయనకిచ్చిన పౌరసత్వాన్ని రద్దుచేసే ప్రయత్నాలూ జరిగాయి.విదేశీయులకి పౌరసత్వం ఇచ్చే సంస్త ఐ.ఎన్.ఎస్ (Immigration and Naturalization Service) ఐన్‌స్టైన్ కి సంబంధించి దస్త్రంలో చెడు సమాచారమంతా పంపమని ఎఫ్.బి.ఐ ని కోరింది. విశ్వవ్యాప్త ప్రతిష్ట ఉన్న శాస్త్రవేత్త అయినప్పటికీపౌరసత్వాన్ని ఉపసంహరించే అవకాశం ఉందా అని తేల్చాలి కనక జాగ్రత్తగా పరిశోధించమని ఆదేశించింది. అయిదేళ్ళపాటు పరిశోధన కొనసాగింది.ఇది ఆయనకు తెలుసు.1948లోనే ఒక దౌత్యవేత్తతో అమెరికా ఇక ప్రజాస్వామ్యదేశం ఎంతమాత్రమూ కాదు.మన సంభాషణ రికార్డ్ అవుతూనే ఉంటుందిసందేహం లేదు.గదిలో వైర్లుంటాయి.నాఇంటిని జాగ్రత్తగా గమనిసున్నారు అన్నాడు.
మాకార్ధీని అభిశంసించాక ఐన్‌స్టైన్ మీద ఈదాడి తగ్గుముఖం పట్టింది.అయితే ఆయన చనిపోయాక చాలారోజులకిగాని ఆ ఫైల్ మూత బడలేదు.
మరి టైం వ్యాసంలో ఆయన ఇంత గాఢంగా ప్రకటించిన సోషలిష్ట్ భావాల గురించి ఎందుకు రాయలేదు? 1999 చివరలో రాసిన వ్యాసమిది.అంతకుముందు జరిగిన విషయాలన్నీ పత్రికకు తెలుసు.1983 లోనే ఎఫ్.బి.ఐ దస్త్రంలో చాలాభాగం బయటకొచ్చింది. అవన్నీ వ్యాసరచయిత(ల)కు కంఠోపాఠమే.అయినా రాయలేదంటే కచ్చితంగా కావాలని అలాచేశారు.
.ఐన్‌స్టైన్ అంతటి ప్రతిభావంతుడు సోషలిజాన్ని అక్కున చేర్చుకోవటం పెట్టుబడిదారీ సమర్ధకులకూప్రధానస్రవంతి మీడియాకూ ఎంతమాత్రమూ ఇష్టముండదు.స్వేచ్చా మార్కెట్ ను కోరుకునే వాళ్ళకి ఆయన ఆలోచనలు సుతరాం నచ్చవు.కనక కావాలనే అలా వదలివేశారు.
అయితేనేంటైం వ్యాసానికి 50 ఏళ్ళ ముందే ఆయనే Why Socialim? అనే వ్యాసంలో ఆయన సోషలిజాన్ని ఎంతగా ఆకాంక్షించాడో రాశాడు.అది 'మంత్లీ రెవ్యూ' తొట్టతొలిసంచిక (1949 మే)లో వచ్చింది. తెలుగు అనువాదం ‘ అరుణతార  2000 మే-జూన్ సంచికలో పడింది.
http://esbrahmachari.wordpress.com/ బ్లాగ్ లో చదవవచ్చు

http://esbrahmachari.files.wordpress.com/2012/03/e0b0b8e0b18be0b0b7e0b0b2e0b0bfe0b09ce0b082-e0b08ee0b082e0b0a6e0b181e0b095e0b181.pdf
పైన ప్రస్తావించిన వ్యాసాలు కింద ఇచ్చిన వెబ్‌సైట్లలో లభిస్తాయి.
1.లైఫ్ మేగజీన్ వ్యాసం Dupes and Fellow Travelers Dress Up Communist Frontsఇక్కడ ఉంది
2. లైఫ్ పత్రికలో ప్రకటించిన ఐన్‌స్టైన్ ఫొటో ఈసైట్ లో చూడవచ్చు http://books.google.co.in/books?id=U04EAAAAMBAJ&pg=PA42&lpg=PA42&dq=Dupes+and+Fellow+Travelers+Dress+Up+Communist+Fronts&source=bl&ots=MxD1sbM1r0&sig=sLnidZSUa8BsBNGhsm4ipfZFa8c&hl=te&sa=X&ei=54RiT7awOY7KrAe71_S8Bw&ved=0CDQQ6AEwAw#v=onepage&q&f=false
3. 'టైంలో వచ్చిన వ్యాసం http://www.time.com/time/magazine/article/0,9171,993017,00.html
4. ఐన్‌స్టైన్ రాసిన వ్యాసం Why socialism ఇక్కడ చదవవచ్చు
http://monthlyreview.org/2009/05/01/why-socialism
5. ఐన్‌స్టైన్ మీద హూవర్ తయారు చేసిన దస్త్రం (FBI file) ఇక్కడ దొరుకుతుంది.