కాపిటల్ మూడో భాగం
అధ్యాయం-7- పరమ అదనపు విలువ ఉత్పత్తి
విభాగం 2. అదనపు విలువ ఉత్పత్తి
అదనపు విలువ ఉత్పత్తి
పెట్టుబడిదారుడు సొంతపరుచుకున్న ఉత్పాదితం ఒక
ఉపయోగపువిలువ - నూలైనా, బూట్లయినా. ఒక అర్ధంలో బూట్లు సామాజిక పురోగతిని
సూచించేవే. మన పెట్టుబడిదారుడు నిస్సందేహంగా పురోగామే. అయినప్పటికీ,
అతను బూట్లని, అవి ఉపయోగపు విలువలు అనే ఉద్దేశ్యంతో ఉత్పత్తి చెయ్యడు. అవి మారకం విలువకు నిలయాలు అయినందువల్లనే ఉత్పత్తి చేస్తాడు.
పెట్టుబడిదారుడికి రెండులక్ష్యాలు ఉంటాయి.
పెట్టుబడిదారుడికి రెండులక్ష్యాలు ఉంటాయి.
1.మారకంలో విలువ వున్న ఉపయోగపు విలువని ఉత్పత్తి
చెయ్యాలి అనుకుంటాడు.అంటే, అమ్మకానికి ఉద్దేశించిన వస్తువుని,సరుకుని.
2. ఆ సరుకు ఉత్పత్తిలో వాడిన సరుకుల మొత్తం విలువ
కన్నా- అంటే, ఉత్పత్తి సాధనాలవిలువ, శ్రమ శక్తి విలువల మొత్తం కన్నా- ఎక్కువ విలువవున్నసరుకుని ఉత్పత్తి చెయ్యాలనుకుంటాడు.
అతని లక్ష్యం: సరుకుని ఉత్పత్తి చెయ్యడం; ఉపయోగపు
విలువనే కాదు, విలువని కూడా; విలువని మాత్రమే కాదు, అదే సమయంలో అదనపు విలువని
కూడా.
అదనపు విలువ ఉత్పత్తి చెయ్యాలంటే, ముందు విలువని
ఉత్పత్తి చెయ్యాలి. విలువ ఉత్పత్తి చెయ్యడానికి సరుకులు ఉత్పత్తి చేస్తే
సరిపోతుంది. మరి అదనపు విలువ పొందాలంటే అతను ఏం చెయ్యాలి?
మనం పరిశీలిస్తున్నది సరుకుల
ఉత్పత్తిని. అందులోనూ ఇప్పటివరకూ ఒక అంశాన్నేచూశాం. సరుకులు ఒకేసమయంలో ఉపయోగపు
విలువలూ, విలువలూ కూడా. అందువల్ల, వాటిని ఉత్పత్తి చేసే ప్రక్రియ కూడా శ్రమ
ప్రక్రియా, అదే సమయంలో విలువని ఉత్పత్తి చేసే ప్రక్రియా అయి ఉండాలి.
విలువ ఉత్పత్తి గా ఉత్పత్తి
నిర్దిష్ట సామాజిక పరిస్థితుల్లో ఒక
సరుకు ఉత్పత్తికి అవసరమైన, దానిలో వస్తుత్వం చెందిన శ్రమ కాలం చేత ఆ సరుకు విలువ
నిర్ణయమవుతుంది. ఇది మనకు తెలిసిందే. మన పెట్టుబడి దారుడి కోసం నిర్వహించబడిన శ్రమ
ప్రక్రియ ఫలితంగా అతనికి చేరిన ఉత్పాదితం విలువ విషయంలో కూడా ఈనియమమే
వర్తిస్తుంది. దాని విలువకూడా అదే నియమం ప్రకారమే నిర్ణయమవుతుంది.
ఈ ఉత్పాదితం 10 పౌన్ల నూలు
అనుకుందాం. అప్పుడు అందులో వున్న శ్రమ పరిమాణాన్ని లెక్కించడమే మన మొదటి స్టెప్.
ఉత్పాదితంలో ఉన్న శ్రమ పరిమాణం రెండు
భాగాలుగా ఉంటుంది:
1. ఉత్పత్తి సాధనాల్లో ఇమిడివున్న
శ్రమ పరిమాణం
2. కొత్తగా ఉత్పాదితంలో కలిసిన కొత్త
శ్రమ పరిమాణం
మొదట ఉత్పత్తి సాధనాల్లో ఇమిడివున్న
శ్రమ పరమాణాన్నిగురించి చెబుతాడు.
నూలు వడకాలంటే, ముడిపదార్ధం కావాలి. 10 పౌన్ల
దూది అనుకుందాం. ఈదూది విలువెంతో తెలుసుకోవాల్సిన పని మనకు లేదు. ఎందుకంటే, అతను
దాని పూర్తివిలువకే, 10 షిల్లింగులకి కొన్నాడని అనుకుందాం. ఆదూది ధరలో అదూది
ఉత్పత్తికి అవసరమైన సగటు సామాజిక శ్రమ కాలం వ్యక్తమయింది. అన్ని శ్రమపరికరాల
అరుగుదల విలువ 2 షిల్లింగులు అనికూడా
అనుకుందాం. అలాంటప్పుడు, 12 షిల్లింగులకు ప్రాతినిధ్యం వహించే బంగారాన్ని ఉత్పత్తి
చెయ్యడానికి 24 గంటల శ్రమ, రెండు పనిదినాల
శ్రమ అవసరమయితే, ఆనూలులో ఇప్పటికే రెండురోజులశ్రమ ఇమిడి ఉంది.
బదిలీ అయిన శ్రమ
ఉన్నదంతా వడికే శ్రమద్వారా శ్రమ పదార్ధల నుంచీ,
శ్రమ సాధనాల నుంచీ బదిలీ చేయబడిందే. అంతే కాని వడికే శ్రమ కొత్తగా ఏర్పరచింది
కాదు. అది ఇందులో లేదు.
40 పౌన్ల నూలు విలువ = 40 పౌన్ల దూది
విలువ + మొత్తం కదురు విలువ అనుకుందాం. అంటే, ఇరువైపులా ఉన్న సరుకుల ఉత్పత్తికి
ఒకే శ్రమకాలం పట్టిందని అర్ధం. అలాంటప్పుడు,
10 పౌన్ల నూలు విలువ =10 పౌన్ల దూది
విలువ + ¼ కదురు విలువ.
ఒకవైపున్న 10 పౌన్ల నూలులో ఎంత శ్రమ
కాలం ఉందో, రెండో వైపున్న 10 పౌన్ల దూదిలోనూ నాలుగో వంతు కడురులోనూ కలిపి అంతే
శ్రమ ఉంది. కనుక విలువ దూదిలో కనిపించినా, కడురులో కనిపించినా, నూలులో కన్పించినా
విలువ పరిమాణంలో తేడా ఉండదు. దూదీ, కడురూ పక్కపక్కనే ఉండే బదులు (ప్రక్రియలో)
కలిసి పోయాయి. వాటి రూపాలు నూలు రూపం లోకి మారాయి. వాటి విలువలో మార్పు లేదు. అవి
వాటి సమానకమైన నూలుతో నేరుగా మారితే ఎలాగో అలాగే.
ముడి పదార్ధాల, శ్రమసాధనాల విలువ ఉత్పాదితానికి బదిలీ
నూలు ఉత్పత్తిలో ముడిపదార్ధం దూది. ఆ
దూది ఉత్పత్తికి అవసరమైన శ్రమ, నూలు ఉత్పత్తికి అవసరమైన శ్రమలో భాగమే. అందువల్ల
నూలులో ఆశ్రమ ఉంటుంది. ఇదే కదురులో
ఉన్నశ్రమకీ వర్తిస్తుంది. కదురు అరగకపోతే దూది వదకబడేది కాదు.దూది ఉత్పత్తికీ,
కదుర ఉత్పత్తికీ అవసరమైన శ్రమ నూలులో ఉంటుంది.
నూలు విలువని నిర్ణయించడానికి లేక దాని ఉత్పత్తికి అవసరమైన శ్రమకాలాన్ని
నిర్ణయించడానికి వివిధకాలాల్లో, ప్రదేశాల్లో జరిగిన ప్రక్రియల్ని ఒకే ప్రక్రియగా
చూడాలి. మొదట దూది ఉత్పత్తికి అవసరమైన శ్రమ కాలమూ, కడురులో అరిగిన భాగాన్ని
ఉత్పత్తిచేయ్యడానికి అవసరమైన శ్రమ కాలమూ. ఆతర్వాత దూది, కదురులతో నూలు వడకడానికి
అవసరమైన శ్రమ కాలమూ. వరసలో జరిగే ఈవేర్వేరు పక్రియల్ని, ఒకే ప్రక్రియ యొక్క
భిన్నమైన దశలుగా చూడవచ్చు. నూలులో వున్న శ్రమంతా గతశ్రమే; ఆనూలు లోని భాగాల
ఉత్పత్తికి జరిగిన చర్యలు, చివరి చర్య అయిన వడకడానికి ముందే ఎప్పుడో జరిగాయి
అనేదాంతో మనకి నిమిత్తం లేదు. ఒక ఇల్లు కట్టడానికి 30 రోజుల శ్రమ పట్టింది అనుకుందాం.
చివరోజు శ్రమ మొదటి రోజు శ్రమ తర్వాత 29 రోజులకు జరిగింది అనేవాస్తవం ఆఇంటిలో ఇమిడివున్న శ్రమ మొత్తాన్నిఏమాత్రం మార్చజాలదు. అందువల్ల
ముడిపదార్ధాలలోనూ శ్రమ సాధనాల్లోనూ ఉన్న శ్రమ వడికే ప్రక్రియ మొదలవక ముందే,
దానికి ముందు దశలో వ్యయమైన శ్రమగా
చూడవచ్చు.
కదురు ఉత్పత్తిలో అవసరమైన శ్రమ కాలం
20గంటలనుకుందాం.అంటే అది అరిగిపోయేదాకా వడికితే ఆ 20 గంటల శ్రమ కాలాన్నే బదిలీ
చెయ్యగలడు. ఎందుకంటే అందులో ఉన్న శ్రమ కాలం అంతే. అది కొత్త విలువని ఏర్పరచే
సరుకుకాదు. కొత్త విలువని ఏర్పరచే సరుకు శ్రమ శక్తి ఒక్కటే.
ఉత్పత్తిసాధనాల విలువలు (అంటే దూది
విలువా,కదురు విలువా రెండూ ) 12
షిల్లింగుల ధరలో వ్యక్తమయ్యాయి. అందువల్ల అవి నూలువిలువలో భాగాలు. అంటే ఉత్పాదితం
విలువలో భాగాలు అన్నమాట.
విలువ బదిలీకి షరతులు
ఈ విలువ బదిలీ ఆటోమేటిక్ కాదు.ఇందుకు రెండు
షరతులున్నాయి:
1. ఉత్పాదితం ఉపయోగపు విలువ అయి తీరాలి.
2.సామాజికంగా అవసరమైన శ్రమ కాలం కంటే ఎక్కువ
వెచ్చించ కూడదు. అంటే పదార్ధాలు గానీ శ్రమ గానీ వృధా కాకూడదు.
ఇక్కడ దూదీ, కదురూ ఒక ఉపయోగపు విలువ
ఉత్పత్తిలో కలవాలి. నూలు అవాలి. విలువ దాన్ని వహించే ప్రత్యేక ఉపయోగపు విలువ నుండి
స్వతంత్రమైనది. అయితే అది ఏదో రకం
ఉపయోగపువిలువలో రూపొంది తీరాలి.
నిర్దిష్ట సామాజిక పరిస్థితుల్లో
సరుకు ఉత్పత్తికి అవసరమయ్యే శ్రమ కంటే ఎక్కువ కాకూడదు. అందువల్ల, ఒక పౌను నూలు
వడకడానికి ఒకపౌను దూదికన్నా ఎక్కువ అవసరం అవకపోతే, ఒక పౌను దూది
మాత్రమేఖర్చయ్యేట్లు జాగ్రత్త పడాలి. కదురు విషయంలోనూ అలాంటి శ్రద్ధే తీసుకోవాలి. స్టీల్ కదురు బదులు
పెట్టుబడిదారుడు హాబీగా బంగారు కదురు
వాడవచ్చు. అయితే నూలులో చేరే కదురువిలువ స్టీల్ కదురు ఉత్పత్తికి అవసరమైన
శ్రమకాలమే, కాని బంగారు కదురు ఉత్పత్తికి అవసరమైన శ్రమ కాలం కాదు. ఎందుకంటే అప్పటి
నిర్దిష్ట సామాజిక పరిస్థితుల్లో స్టీల్ కడురుకంటే ఎక్కువది అవసరం లేదు.
కదురు నించీ, దూది నించీ ఎంత విలువ నూలు కి బదిలీ
అయిందీ తెలుసు.12 షిల్లింగులు.లేక రెండు పనిదినాల శ్రమ. ఇక వడికే వాని శ్రమవల్ల కొత్తగా కలిసే విలువ
గురించి చర్చిస్తాడు.
వడికే శ్రమవల్ల కొత్తగా కలిసే విలువ
శ్రమ ప్రక్రియలో వడికేవాడి శ్రమని
దూదిని నూలుగా మార్చే ఒక ప్రత్యేక మానవ చర్యగా చూశాం. అక్కడ ఆపనికి ఆశ్రమ ఎంత
అనువుగా ఉంటే నూలు అంత మెరుగ్గా ఉంటుంది – మిగిలిన పరిస్థితులన్నీ మారకుండా ఉంటే.
అతని శ్రమని మిగిలిన ఉత్పాదకశ్రమలకన్నా భిన్నంగా చూస్తాం.
1. దాని ప్రత్యేక లక్ష్యం –వడకడం - రీత్యా భిన్నం.
2. దాని చర్యల ప్రత్యేక స్వభావం
రీత్యా, దాని ప్రత్యేక ఉత్పత్తిసాధనాల స్వభావం
రీత్యా భిన్నం.
3.ఆశ్రమ ఉత్పాదితం యొక్క ఉపయోగపు
విలువ రీత్యా భిన్నం.
వడికే చర్యకి దూదీ, కడురూ అవసరం. కాని ఫిరంగి తయారీలో
అవెందుకూ కొరగావు.
అందుకు భిన్నంగా ఇక్కడ మనం వడికే
వాని శ్రమని విలువని ఏర్పరచే మేరకు పరిగణిస్తే, అంటే విలువకి వనరుగా చూస్తే, అతని
శ్రమ ఫిరంగి గొట్టాన్ని తోలిచేవాడి శ్రమకి భిన్నమైనది కాదు. మనకి ఇంకాస్త దగ్గర
యిన విషయానికొస్తే,ఉత్పత్తి సాధనాలైన దూది పండించేవాడి శ్రమకీ, కదురుచేసేవాడి
శ్రమకీ భిన్నమైనదికాదు.
ఈ ఏకత్వం వల్లనే, పత్తి పండించడమూ,
కదురు చెయ్యడమూ, వడకడమూ అనేవి మొత్తం నూలు
విలువలో భాగాలు కాగలిగాయి. అవి
ఒకదాన్నించి మరొకటి పరిమాణంలో మాత్రమే తేడాగా ఉంటాయి. ఇక్కడ శ్రమ గుణంతో,
శ్రమ ప్రత్యేక స్వభావంతో మనకి
ప్రమేయం లేదు. ప్రమేయం ఉన్నదల్లా శ్రమ పరిమాణంతోనే. దీన్నికేవలం లెక్కగట్టాల్సి ఉంటుంది. వడకడం అనే శ్రమని, ఒక
నిర్దిష్ట సమాజంలో అనిపుణ, సాదా, సగటు
శ్రమ అనుకుని ముందుకు పోదాం. ఇందుకు వ్యతిరేకంగా ఊహించినా తేడా ఉండదని తర్వాత
తెలుసుకుంటాం.
శ్రమ కాలం మాత్రమే లెక్క కొస్తుంది
శ్రామికుడు పనిలో ఉన్నప్పుడు, అతని శ్రమ ఒకేమైన
మార్పుచెందుతూ ఉంటుంది: చలనంగా ఉన్నది నిశ్చలమైన వస్తువు అవుతుంది; పనిచేస్తున్న శ్రామికుడు
ఉన్నది ఉత్పత్తయిన వస్తువు అవుతుంది.ఒక గంట వడికాక, ఆచర్య ఒక నిర్దిష్ట మొత్తం
నూలులో ప్రాతినిధ్యం వహిస్తుంది. వేరేగా చెబితే, నిర్దిష్ట పరిమాణంగల శ్రమ దూదిలోరూపొందింది.
రెండు పనులు ఎప్పుడూ జరుగుతాయి:
1.నూలు ఉత్పత్తవుతుంది
2.శ్రమ శక్తి ఖర్చవుతుంది.
నూలు సరుకయితే, ఖర్చయిన శ్రమశక్తి నూలులో చేరి
దానికి విలువని ఏర్పరుస్తుంది.
మనం
శ్రమ అంటున్నాం. అంటే, వడికేవాని జీవ శక్తి (vital force), వడికే శ్రమ కాదు.ఎందుకంటే,
ప్రత్యేక శ్రమ అయిన వడికే శ్రమ ఇక్కడ సాధారణ శ్రమశక్తి వ్యయంగా లెక్కకొస్తుంది,
కాని వడికే వాని ప్రత్యేక మైన పనిగా లెక్కకురాదు.
సగటు సామాజిక ఉత్పత్తి పరిస్థితుల్లో
A పౌన్ల దూది ఒక గంట శ్రమతో B పౌన్ల
నూలు అవాలి అనుకుందాం. అప్పుడు, ఒక రోజు శ్రమ 12A పౌన్ల దూదిని 12B పౌన్ల నూలుగా
చెయ్యలేకపోతే, రోజు శ్రమ 12 గంటల శ్రమగా లెక్కకి రాదు. ఎందుకంటే, విలువ ఉత్పత్తిలో
సామాజికంగా అవసరమైన శ్రమ మాత్రమే లెక్కకొస్తుంది.
విలువ ఎలా ఉత్పత్తవుతుందో, దాని పరిమాణాన్ని కోలిచేది ఎలాగో చెప్పాడు.
ఇక అదనపు విలువ ఉత్పత్తిని వివరిస్తాడు.
అదనపు
విలువ ఉత్పత్తి గా ఉత్పత్తి
ఇందుకు కొత్తగా ఏర్పడిన విలువని
పెట్టుబడిదారుడి ఖర్చుతో పోల్చాలి.ముందుగా 6 గంటల శ్రమ ఏర్పరచిన విలువ
ఉత్పాదితాన్ని లెక్కలోకి తీసుకుంటాడు. ఎందుకంటే శ్రామికునికిచ్చిన వేతనం 6 గంటల
శ్రమకి ప్రతినిధి కనుక. మరి వేతనం 6 గంటలశ్రమకి
సమానకం అయినప్పుడు శ్రామికుడు 6 గంటల పైన ఎందుకు పనిచెయ్యాలి? ఇది శ్రామికుడికి బాగానే
ఉంటుంది. అయితే పెట్టుబడిదారుడు తృప్తిపడడు .కారణం
అదనపు విలువ ఏర్పడక పోవడమే. ఈ వాదనని అంచెలంచెలుగా అనుసరిద్దాం.
ఒక గంటలో 1 2/3 పౌన్ల దూదిని 1 2/3 పౌన్ల నూలుగా వడకగలిగితే, అప్పుడు
10 పౌన్ల దూది 6 గంటల శ్రమని పీల్చుకుంటుంది.
ఇక్కడ శ్రమ అనేది వడికే ప్రత్యేక
శ్రమ, దానికి పదార్ధం దూది, దాని ఉత్పాదితం నూలు – ఈవాస్తవాలతో మనకి పనిలేదు. ఆ
శ్రమ పదార్ధమే ఒక ఉత్పాదితం అనీ, అందువల్ల అది ముడి పదార్ధం అనే వాస్తవాలతో
పనిలేనట్లే.
ఇదే పనివాడు వడకడానికి బదులుగా
బొగ్గుగనిలో పనిచేస్తుంటే, శ్రమ పదార్ధాన్ని-బొగ్గుని- ప్రకృతి సమకూరుస్తుంది;
అయినప్పటికీ, వెలికితీయబడిన హండ్రెడ్ వెయిట్
(=50.8 కిలోలు) బొగ్గు
ఒక నిర్దిష్టపరిమాణంలో పీల్చిన శ్రమ కి ప్రాతినిధ్యం వహిస్తుంది.
శ్రమ శక్తి అమ్ముడయినప్పుడు దాని
ఒకరోజు విలువ 3 షిల్లింగులు అనుకున్నాం. ఆ మొత్తంలో 6 గంటల శ్రమ ఇమిడి ఉంటుందనీ
కూడా అనుకున్నాం. ఫలితంగా, శ్రామికుడికి సగటున
కావలసిన జీవితావసర వస్తువుల ఉత్పత్తికి అంత శ్రమ కాలం అవసరం. మన వడికే
శ్రామికుడు గంటకి 1 2/3 పౌన్ల దూదిని 1 2/3 పౌన్ల నూలుగా మారిస్తే, 6 గంటల్లో 10 పౌన్ల
దూదిని 10 పౌన్ల నూలుగా మారుస్తాడు. అందువల్ల, వడికే ప్రక్రియలో దూది 6 గంటల
శ్రమని పీల్చుకుంది. 3 షిల్లింగుల విలువగల బంగారంలోనూ అంతే శ్రమ ఉంటుంది. ఫలితంగా, కేవలం
వడికే శ్రమ వల్ల దూదికి 3 షిల్లింగుల శ్రమ కలిసింది.
ఇప్పుడు ఉత్పాదితం అయిన 10 పౌన్ల నూలు మొత్తం విలువ ఎంతో చూద్దాం.
అందులో 2½ రోజుల శ్రమ ఉంది:
దూదిలో, కదురు అరిగిన భాగంలో 2 రోజుల శ్రమ ఉంది.
వడకడంలో అరరోజు గడిచింది. ఈ మొత్తం శ్రమకి 15 షిల్లింగుల విలువగల బంగారం
ప్రాతినిధ్యం వహిస్తుంది. అందువల్ల, 15 షిల్లింగులు 10 పౌన్ల నూలుకి సరిపోయే ధర. ఆ
లెక్కన ఒక పౌను నూలు ధర 18 పెన్నీలు.
పెట్టుబడిదారుడు ఆశించిన ఫలితం అది కాదు. అతను
నిర్ఘాంతపోతాడు. విస్తుపోయి చూస్తాడు. కారణం: అతను బయానాపెట్టిన విలువా, వచ్చిన
ఉత్పాదితం విలువా సరిగ్గా సమానం. పెట్టిన అడ్వాన్స్ పెరగలేదు, అదనపువిలువ
ఉత్పత్తవలేదు, ఫలితంగా డబ్బు పెట్టుబడిలోకి మారలేదు. నూలు ధర 15షిల్లింగులు.
అందులో ఉన్న వాటిని మార్కెట్లో 15 షిల్లింగులిచ్చి అతను కొన్నాడు: దూది 10 షిల్లింగులు, కడురు
అరిగిన భాగం 2 షిల్లింగులు, శ్రమశక్తిక 3 షిల్లింగులు.వెరశి 15 షిల్లింగులు.తేడా
ఒక్కటే. మొదట విడివిడిగా ఉన్న విలువలు ఇప్పుడు ఒకే వస్తువులో ఉన్నాయి. అంతే.
చివరకి వచ్చింది 15 షిల్లింగుల నూలే. పెట్టుబడిదారుడికి పెట్టిన విలువే వచ్చింది. కాని అదనపు విలువ
రాలేదు. అందుకే అతను దిగ్భ్రాంతు డవడమూ, గుడ్లు తేలేయడమూ.
నిజానికి ఈ ఫలితంలో పెద్ద
విచిత్రమేమీ లేదు. ఒకపౌను నూలు విలువ 18 పెన్నీలు గదా! అతను మార్కెట్లో 10 పౌన్ల
నూలు కొంటే దానికి 15 షిల్లింగులు
ఇవ్వాల్సిందే.
ఒకవ్యక్తి రెడీగా కట్టి వున్న ఇల్లు కొన్నా, తనే కట్టించుకున్నా ఇల్లు
ఏర్పరచుకున్న పధ్ధతి ఆ ఇంటి మీద పెట్టిన
డబ్బుని పెంచదు అనేది స్పష్టమే.
అనుభవరీత్యా లాభాలోస్తున్నాయి అని
అతనికి తెలుసు. తనకి ఎందుకు లాభం రావాలో కారణాలు వెదుకుతాడు.
అదనపు విలువ కోసం పెట్టుబడిదారుడి వాదనలు
అశాస్త్రీయ అర్ధశాస్త్రంలో ఆరితేరిన
మన పెట్టుబడిదారుడు అదనపు విలువ కోసం పట్టుబడతాడు.రకరకాల
వాదనలు ముందుకు తెస్తాడు:
1. నేను నాడబ్బు అడ్వాన్స్ చేసింది
ఎందుకు? మరింత డబ్బు చేసుకోడానికే గదా! అంటాడు.
అతను ఉత్పత్తి చేస్తున్న ఉద్దేశ్యం అదనపువిలువ పొందడం అంటున్నాడు. ఇందుకు ద్వంద్వ సమాధానం వస్తుంది.
A. ఉద్దేశ్యమే
దాన్ని నెరవేరేట్లు చెయ్యదు.
B.కొందరు పెట్టుబడి
దారులు ఉత్పత్తి చెయ్యకుండానే డబ్బు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఉంటారు. ఫుట్ నోట్ లో
రెండు ఉదాహరణ లిచ్చాడు:1844-47 మధ్య ఉత్పత్తి రంగం నించి కొంత తీసి రైల్వే చట్టా వ్యాపారంలో
పెట్టాడు; అలాగే అమెరికా అంతర్యుద్ధకాలంలో ఫాక్టరీని మూసేసి లివర్ పూల్ దూది
మార్కెట్లలో జూదం ఆడేందుకు శ్రామికుల్నిబజారు పాలు చేశాడు.
కనుక ఈవాదన నిలబడదు వీగిపోతుంది.
అయినా అతను వెనక్కి తగ్గడు. ఇక అన్ని రకాలుగా బెదిరిస్తాడు, దబాయిస్తాడు.ఇంకోసారి
చిక్కకుండా ఏమాత్రం ఏమరుపాటుపడకుండా అప్రమత్తంగా ఉంటాడు.
2. ఇకముందు సరుకులు తానే ఉత్పత్తిచేయడం
కాకుండా, మార్కెట్లో కొనుక్కుంటానంటాడు.
అంటే ఉత్పత్తి చెయ్యనని
బెదిరిస్తున్నాడు. అయితే ఇక్కడ అతనికి పెద్దచిక్కు ఉంది: ఏమంటే,
ఇతని లాగే మిగతా పెట్టుబడి దారులు
కూడా, ఉత్పత్తికి స్వస్తి చెబితే? ఇతగాడికి కొనడానికి సరుకులు ఎక్కడనుంచి
వస్తాయి?ఉత్పత్తి ఆపేస్తే సరుకులు మార్కెట్లో ఉండవు. డబ్బయితే ఉంటుంది కాని దాన్నతను తినలేడు గదా!
కనక ఈబెదిరింపూ పని చెయ్యలేదు. ఇప్పుడిక
నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు.
3. మితంగా ఖర్చుపెట్టుకుంటున్నాను. నా 15 పౌన్లనీ ఎలాబడితే అలా
వాడుకొని ఉండవచ్చు. కాని నేనలా చెయ్యకుండా ఉత్పత్తికి వినియోగించాను. నూలు తయారు
చేశాను.-అంటాడు.
అతను తన మితవ్యయానికి
బహుమతి కావాలంటున్నాడన్నమాట.
దీనికి జవాబులు:
1.
అతను
పెట్టిన వాటికి ఫలితంగా ఇప్పుడతనికి నూలు ఉన్నది.
2.
పీనాసి
బతుకు ఎటువంటి సమస్యలు తెచ్చిపెడుతుందో ఇంతకూ ముందే చూశాం.
3.
బహుమతి
ఎక్కడ నించి రావాలి? చివరి ఉత్పాదితంలో అతనికి ఇచ్చేంత విలువ లేదు.
4. అందువల్ల
అతని సుగుణమే అతనికి బహుమతి అనుకొని సంతృప్తి పడాలి. తననుతాను ఓదార్చుకోవాలి.
అందుకతను అంగీకరించడు. బతిమిలాటకు దిగుతాడు.
4.ఈనూలువల్ల నాకేమీ ఉపయోగం లేదు:
దాన్ని అమ్మకానికి ఉత్పత్తి చేశాను.
అలా అయితే అమ్ముకోవచ్చు. ఆటంకమేముంది?
అతను దాన్ని ఇతరులకు అమ్మాలి. అమ్ముడవకపోతే అమితోత్పత్తి అనే అంటువ్యాధి
పట్టుకుంటుంది. పట్టుకోకుండా ఉండడానికి మాకుల్లాక్ ఒక చిట్కా అమలు చెయ్యాలి:
అదేమంటే భవిష్యత్తులో అమ్మకం కోసం
కాకుండా, కేవలం తనకోసమే ఉత్పత్తి చేసుకోవాలి. ఇది అతని లక్ష్యం కాదుగదా!
ఇప్పుడతను మొండికి తిరుగుతాడు
5. సమాజానికీ శ్రామికుడుకీ సేవచేస్తున్నాను.
శ్రామికుడు అతని చేతులు కాళ్ళతోనే శూన్యంలోంచి
సరుకులు ఉత్పత్తి చేస్తాడా? నేనతనికి పదార్ధాలు ఇవ్వలేదా? వాటిలోనే కదా అతని శ్రమ
రూపం పొందింది?
సమాజంలో ఎక్కువ మంది జనం తగినంత డబ్బులేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి నా ఉత్పత్తి సాధనాలద్వారా, దూదీ, కదురూ ద్వారా సమాజానికి
ఎనలేని సేవ చెయ్యడం లేదా? సమాజానికి మాత్రమే కాదు, శ్రామికుడికి కూడా
జీవితావసరవస్తువులు సమకూర్చడం ద్వారా సేవ చెయ్యడం లేదా? ఈ నా సేవకి బదులు ప్రతిఫలం
ఏమీ పనిలేదా?
సరే. శ్రామికుడు దూదినీ, కదురునీ
నూలుగా మార్చడం ద్వారా సమానమయిన సేవ పెట్టుబడిదారుడికి చెయ్యలేదా?
అతనివల్ల శ్రామికుడు ప్రయోజనం పొందితే,
అతనుకూడా శ్రామికుని నుంచి అంతే ప్రయోజనంపొందాడు.
అంతేకాదు. అసలిక్కడ సేవ అనేదేమీ లేదు. ఇక్కడ మనం పరిశీలిస్తున్నది మారకం విలువని.
పెట్టుబడిదారుడు శ్రామికుడికి 3 షిల్లింగులు ఇచ్చాడు. శ్రామికుడు దూదికి 3
షిల్లింగుల విలువ కలిపాడు. అంటే తిరిగి
కచ్చితమైన సమానకాన్ని ఇచ్చాడు. విలువకి విలువ చెల్లించాడు.ఇప్పటిదాకా డబ్బుగర్వంతో
ఉన్న మనమిత్రుడు సడన్ గా తన పనివాడి కుండే నమ్రత ప్రదర్శిస్తూ అడుగుతాడు:
6. నేనుకూడా పనిచేస్తున్నాను
నేను
మాత్రం పనిచేయ్యలేదా? వడికే వాడిని పర్యవేక్షించే పనీ, జాగ్రత్తగా చూసే పనీ
చెయ్యలేదా? ఈ శ్రమ కూడావిలువని ఏర్పరచదా?
అయితే ఆపనులకు మేనేజర్లూ, సూపర్వైజర్లూ ఉండనే
ఉంటారు గదా! అందుకే వాళ్ళు ఈ మాటలకు వాళ్ళకొచ్చే నవ్వును ఆపుకుంటారు. లోపల్లోపల ముసిముసిగా
నవ్వుకుంటారు.
అతని వాదనలన్నీ వీగిపోయాయి. అయినా తగ్గడు.
పెట్టుబడి దారుడు కార్యవాది
ఇంతలో అతను మనసారా ఒకసారి నవ్వి పాత దర్పాన్ని
తిరిగి తెచ్చుకుంటాడు. ఆర్ధిక వేత్తలు చెప్పే మొత్తం సిద్ధాంతాన్ని ఏకరువు పెడతాడు. కాని వాస్తవంగా వాటికి పైసా
విలువ కూడా ఇవ్వడు. తాను అనుకున్నది జరపాలి అనుకుంటాడు. లక్ష్యసాధనకి చెప్పే
ఇలాంటి మభ్యపెట్టే మాటల్నీ, గారడీ
ట్రిక్కుల్నీ అమ్ముడుబోయిన అర్ధశాస్త్ర
ప్రొఫెసర్లకి వదిలేస్తాడు. అతను మాత్రం అనుకున్నది సాధించే రకం , కార్యవాది.
తనపనికి బయట చెప్పేదాన్ని పట్టించుకోడు. అయినప్పటికీ తన వ్యాపారంలో తనకు కావలసినది
ఏమిటో స్పష్టంగా తెలుసు.
పెట్టుబడి దారుడూ, వాళ్ళ సమర్ధకులూ చెప్పే మాటలూ
చేసే సమర్ధనలూ సరినవికావు అని మార్క్స్ మన మనసుకి హత్తుకునేంత, చక్కగా చెప్పాడు. వాళ్ళు
చేసే పనుల్ని జాగ్రత్తగా పరీక్షించాలి అంటాడు.
విషయాన్ని మరీ దగ్గరగా చూద్దాం అంటాడు.
శ్రమశక్తి విలువా, ఆశ్రమశక్తి
ఉత్పత్తిచేసే విలువా రెండూ రెండు వేర్వేరు పరిమాణాలు
రోజు శ్రమ శక్తి విలువని 6
గంటలలో ఉత్పత్తి చెయ్యచ్చు.కాబట్టి శ్రామికుడు 6 గంటలు మాత్రమే పనిచేస్తే
చెల్లుబోతుంది. అయితే 6 గంటల పని అవగానే పనివాళ్ళని ఇంటికి పంపాల్సిన పనిలేదు. ఎందుకంటే,
అతను రోజుకు సరిపడా జీవితావసర వస్తువులు ఇచ్చాడు; ఒకమామూలు పనిదినం అంతా పనిచేయించుకునే
హక్కు అతనికి ఉంటుంది.
ఒక రోజు శ్రమశక్తి విలువ 3 షిల్లింగులు
అనుకున్నాం. దాన్ని బట్టి ఆ శ్రమశక్తిలో రూపొంది ఉన్నశ్రమ అరరోజు శ్రమ. అంటే, ఒక
రోజు శ్రమశక్తి ఉత్పత్తికి కావలసిన జీవితావసర వస్తువులు అరరోజు శ్రమతో
ఉత్పత్తవుతాయి. అయితే శ్రమశక్తిలో ఉన్న పాత/గత శ్రమ
(past labour), అది చర్యలోకి దింపే సజీవ శ్రమ ఒకటి కావు. అంటే,
శ్రమశక్తి నిర్వహణకు అయ్యే రోజు ఖర్చు, రోజు పనిలో
అదిచేసే ఖర్చు రెండూ రెండు వేర్వేరు విషయాలు. మొదటిది, శ్రమశక్తి మారకంవిలువని
నిర్ణయిస్తుంది. రెండోది, దాని ఉపయోగపు విలువని నిర్ణయిస్తుంది. ఒక శ్రామికుడు 24
గంటలపాటు జీవించడానికి అరరోజు శ్రమ చాలు, అనే వాస్తవం అతడు రోజంతా పనిచేయడాన్ని
నివారించదు. అందువల్ల శ్రమశక్తి విలువా, ఆశ్రమశక్తి ఉత్పత్తిచేసే విలువా రెండూ
రెండు వేర్వేరు పరిమాణాలు.
రోజు శ్రమశక్తి ఉత్పత్తి అవడానికి కావలసిన
వస్తువులు ఎక్కడెక్కడో ఉత్పత్తవుతాయి. వాటి ఉత్పత్తికి 6 గంటల శ్రమ సరిపోవచ్చు.
అయితే వాటిని వాడుకున్న శ్రామికుడు 12 గంటలైనా పనిచేయ్యగలడు. దీన్నిబట్టి,
శ్రమశక్తి యొక్క ఉత్పత్తి విలువా, అది ఉత్పత్తిచేసే విలువా భిన్నమైనవి. రెంటికీ
పరిమాణంలో తేడా ఉంటుంది.
పెట్టుబడిదారుడు శ్రమశక్తిని కొన్నప్పుడు అతని
మనసులో ఉన్నది సరిగ్గా ఈ తేడాయే.
ఆ శ్రమశక్తి కున్నప్రయోజనకర లక్షణాలు-
ఏలక్షణాలవల్లయితే, అది నూలునో, బూట్లనో చేస్తుందో ఆ లక్షణాలు –అతని పనికి
తప్పనిసరి షరతు. అంతకన్నా మరేమీ కావు; ఎందుకంటే, విలువని ఉత్పత్తి చెయ్యాలంటే,
శ్రమ ప్రయోజనకరంగా ఖర్చు పెట్టాలి. అతన్ని ప్రభావితం చేసింది శ్రమశక్తి కున్న
విశిష్ట ఉపయోగపు విలువే. అది విలువకి వనరు, అంతే కాదు,తన విలువకన్నా ఎక్కువ
విలువకు వనరు. పెట్టుబడిదారుడు శ్రమశక్తి నుంచి ఆశించే విశిష్ట సేవ ఇదే;
ఈ లావాదేవీలో అతను శాశ్వతమైన సరుకుల మారక నియమాలకు అనుగుణంగానే వ్యవహరిస్తాడు. శ్రమశక్తిని అమ్మేవాడు, అన్ని ఇతర సరుకులు అమ్మేవాళ్ళ లాగే, మారకం
విలువని పొందుతాడు, ఉపయోగపు విలువని వదులుకుంటాడు. ఒకదాన్ని ఇవ్వనిదే, రెండోదాన్ని
తీసుకోలేడు. శ్రమ శక్తి ఉపయోగపువిలువ, అంటే శ్రమ, అమ్మినవానికి చెందదు – నూనె
అమ్మినవానికి ఆ నూనె ఉపయోగపువిలువ ఎలా చెందదో అలాగే. అంటే ఈసందర్భంలో శ్రమ శక్తి
ఉపయోగపు విలువ కొన్న వానిదే గాని అమ్మిన శ్రామికునికి చెందదు.
పెట్టుబడిదారుడు ఏమీ ఇవ్వకుండానే కొంత
తీసుకుంటాడు. అయితే అతను సరుకుల మారక నియమాల్ని ఉల్లఘించడు.
డబ్బువాడు ఒక రోజు శ్రమశక్తికి డబ్బిచ్చాడు.
అందువల్ల, ఆ రోజు శ్రమశక్తి ఉపయోగపువిలువ అతనికే చెందుతుంది.
ఒకవైపు, రోజు శ్రమశక్తి పోషణకి అర రోజు శ్రమ సరిపోవడమూ, మరొకపక్క అదే
శ్రమశక్తి రోజంతా పనిచేయ్యగలగడమూ, ఫలితంగా ఒక రోజులో అది ఉత్పత్తి చేసే విలువ,
దాన్ని ఉపయోగించుకున్నందుకు చెల్లించిన విలువకి రెండింతలు ఉండడమూ – అనే పరిస్థితి నిస్సందేహంగా కొన్నవాని అదృష్టమే, కాని ఏవిధంగానూ అమ్మినవానికి
కీడు కాదు.
కొన్న పెట్టుబడి దారుడికి అదృష్టం ఎందుకంటే, అది
ఉచితంగా వచ్చింది, అందులో అతని శ్రమ లేదు. అమ్మిన శ్రామికుడికి హాని ఎందుకు లేదంటే, అతనికి
రావలసిన శ్రమశక్తి విలువ అతనికి వచ్చింది.
ఈపరిస్థితిని మన పెట్టుబడిదారుడు
ముందే తెలుసుకున్నాడు. అదే అతని
నవ్వుకి కారణం.
అందువల్ల, మన కార్మికుడు కార్ఖానాకి
పోయి చూస్తే అక్కడ 6 గంటల పనికి కాదు, 12 గంటల పనికి అవసరమైనన్ని ఉత్పత్తి సాధనాలు
ఉంటాయి.
6 గంటల ప్రక్రియలో 10 పౌన్ల దూది 6
గంటల శ్రమని పీల్చుకుని, 10 పౌన్ల నూలు ఎలా అయిందో, అలాగే ఇప్పుడు 20 పౌన్ల దూది
12 గంటల శ్రమని పీల్చుకొని, 20 పౌన్ల నూలు అవుతుంది.
ఇప్పుడు మనం ఈపెరిగిన
ప్రక్రియలో వచ్చిన ఉత్పాదితాన్ని పరిశీలిద్దాం.
ఈ 20 పౌన్ల నూలులో మొత్తం 5 రోజుల శ్రమ ఉంది. దూదిలోనూ, కదురు
అరుగుదలలో 4 రోజుల శ్రమ ఉంది. మిగిలిన
రోజు శ్రమ వడికే టప్పుడు దూది పీల్చుకున్న శ్రమ. బంగారంలో చెబితే 5 రోజుల శ్రమ 30
షిల్లింగులు అవుతుంది. అంటే అది 20 పౌన్ల నూలు ధర. పౌను ధర 18పెన్నీలు. అయితే
ప్రక్రియలో చేరిన సరుకుల విలువ మొత్తం 27 షిల్లింగులు. వచ్చిన నూలు ధర 30
షిల్లింగులు. అందువల్ల అతను పెట్టిన
దానికన్నా, తయారైన ఉత్పాదితం విలువ 3
షిల్లింగులు ఎక్కువ. 27 షిల్లింగులు 30 షిల్లింగులు అయ్యాయి. 3 షిల్లింగుల అదనపు
విలువ ఏర్పడింది. ఎట్టకేలకు ట్రిక్కు
జయప్రదమయింది. అతని డబ్బుపెట్టుబడి లోకి మారింది.
సరుకుల మారక నియమాల్ని భంగపరచ కుండానే అదనపు
విలువ ఉత్పత్తయింది.
సమస్యలో ఉన్న ప్రతి షరతూ నెరవేరింది.
సరుకుల
మారకాన్ని నియంత్రించే నియమాలేవీ ఏవిధంగానూ భంగం కాలేదు. అదెలాగో వివరిస్తాడు.
సమానకాలకు సమానకాలే మారకం అయ్యాయి. పెట్టుబడిదారుడు కోనేవాడుగా ప్రతి సరుకుకీ, దూదికీ, కదురుకీ,
శ్రమశక్తి కీ దేనిపూర్తి విలువ దానికి చెల్లించాడు.
అప్పుడిక సరుకులు కొన్న ప్రతివాడూ ఏం చేస్తాడో
అదే చేశాడు.అంటే వాటి ఉపయోగపు విలువల్ని వాడుకున్నాడు. శ్రమశక్తి వాడకం సరుకుల్ని
ఉత్పత్తి చేసే ప్రక్రియ కూడా. ఇక్కడ అతనికి కొన్న వస్తువుల వాడకం వల్ల 30 షిల్లింగుల విలువగల 20 పౌన్ల నూలు వచ్చింది.
ఇంతకుముందు కొనేవాడుగా ఉన్న పెట్టుబడిదారుడు ఇప్పుడు అమ్మేవాడుగా మార్కెట్ కి మరల
వస్తాడు. అతను నూలుని పౌను 18 పెన్నీల
లెక్కన అమ్ముతాడు. అదే దాని కచ్చితమైన విలువ. అంతచొప్పునే అమ్మినప్పటికీ, మొదట్లో
పెట్టినదానికంటే 3 షిల్లింగులు అదనంగా రాబడతాడు.
“ఈ క్రమం అంతా, అతని డబ్బు పెట్టుబడిగా మారడం అంతా చలామణీ రంగం లోపలే జరిగింది,
అదే సమయంలో అది దాని లోపల జరగనూ లేదు. ఇది
చలామణీ జోక్యంతో జరిగింది, ఎందుచేతనంటే దానికి శ్రమశక్తి కొనుగోలు తప్పనిసరి షరతు.
ఇది చలామణీ రంగం లోపల జరగలేదు, ఎందుచేతంతే ఉత్పత్తిరంగంలో జరిగిన, విలువచే విలువని
పుట్టించడం అనే క్రమాన్ని ఇది కేవలం సిద్ధం చేసేది.అంతే. ”
మొదటి చర్య లేకుండా రెండో చర్య అసంభవం. శ్రమ
శక్తిని చలామణీ రంగంలో కొంటేనే రెండో చేర్య అయిన ఉత్పత్తి మొదలవుతుంది. ఇది చలామణీ
రంగంలో జరిగింది అదనపు విలువ ఉత్పత్తికి
రెండో చర్య అంటే ఉత్పత్తి లేకపోతే, ఉన్న విలువ పెరగదు. డబ్బు పెట్టుబడిలోకి మారదు.
అందువల్ల డబ్బు పెట్టుబడి అవడం చలామణీ రంగంలోనూ జరగాలి, ఆరంగం బయటా జరగాలి.
అలాగే జరిగింది- అని రుజువు చేసాడు మార్క్స్. ఇది
అంతకు ముందు ఆర్ధికవేత్తలకు అంతుబట్టలేదు. ప్రయత్నించినా పరిష్కారం దొరకలేదు.
సమానవిలువలే మారితే, లాభం ఎలావస్తుంది? ఇదే
వాళ్ళు శాస్త్రీయంగా తేల్చలేకపోయిన
సమస్య. మార్క్సుకి మిగిల్చిన సమస్య.
వాళ్ళెలా పక్కదారులు పట్టారో, రుజువు చెయ్యడానికి మార్క్స్
కి ఉపకరించిన కొత్త అంశం ఏమిటో వచ్చే పోస్ట్ లో