26, జూన్ 2018, మంగళవారం

యంత్రాలు తొలిగించిన పనివాళ్ళ నష్ట పరిహారం గురించిన సిద్దాంతం


కాపిటల్   అధ్యాయం -15
యంత్రాలూ – ఆధునిక పరిశ్రమా
విభాగం-6
యంత్రాలు తొలిగించిన పనివాళ్ళ నష్ట పరిహారం గురించిన సిద్దాంతం

యంత్రాలు పనివాళ్ళని తొలిగిస్తాయి- అనే వాస్తవాన్నిఎవ్వరూ కాదనలేరు. అయితే దీన్ని  ఒప్పుకుంటూనే బూర్జువా ఆర్ధిక వేత్తలు – జేమ్స్ మిల్, మాక్ కులోచ్, టోరెన్స్, సీనియర్, జాన్ స్టువర్ట్ మిల్ వంటి వారు - ఇలాచెబుతారు:
పనివాళ్ళని తొలిగించే యంత్రాలు తప్పనిసరిగా కొంత పెట్టుబడిని విడుదల చేస్తాయి. అలా విడుదలైన పెట్టుబడి తొలిగించబడి నంతమంది అదే తరహా పనివాళ్ళని నియమించడానికి సరిపోతుంది.
అంటే, ఒక యంత్రం 100 మందిని తొలిగించింది అనుకుందాం. అప్పుడు వాళ్ళ వేతనాలు ఎంతో అంత పెట్టుబడిని కూడా విడుదల చేస్తుంది. అది తిరిగి అలాంటి పనివాళ్ళని 100 మందిని పెట్టుకోడానికి సరిపోతుంది.  
 రికార్డో కూడా మొదట ఈ అభిప్రాయంతోనే ఉన్నాడు. అయితే తర్వాత శాస్త్రీయ నిష్పక్షపాతంతో , సత్యసంధతతో ఆ అభిప్రాయాన్ని వదులుకున్నాడు, ఖండించాడు. పై ఆర్ధికవేత్తల అభిప్రాయాన్ని మార్క్స్ తప్పని తేలుస్తాడు. ఎలాగో చూద్దాం.

ఒక తివాచీల ఫాక్టరీలో ఒక్కొక పనివాడికి 30 పౌన్లచొప్పున 100 మందిని నియంచడానికి పెట్టుబడిదారుడు 3000 పౌన్లు అస్థిరపెట్టుబడి  పెట్టాలి. వాళ్ళలో 50 మందిని తొలిగించి, మిగిలిన 50 మంది చేతా  1500 పౌన్లు ఖర్చయ్యే యంత్రాలతో పని చేయిస్తాడు అనుకుందాం. సులభంగా ఉండడం కోసం భవనాలూ బొగ్గూ వగయిరాల్ని పక్కన బెడదాం. ఏడాదిలో ఖర్చయ్యే ముడి పదార్ధం రెండు సందర్భాలలోనూ 3000 పౌన్లే అనుకుందాం.
ఈ మార్పువల్ల పెట్టుబడి ఏమైనా విడుదల అవుతుందా?
మార్పుకిముందు మొత్తం పెట్టుబడి 6000 పౌన్లు.అందులో స్థిర పెట్టుబడి 3000, అస్థిర పెట్టుబడి 3000. మార్పు తర్వాత స్థిర పెట్టుబడి 4500 (3000 ముడి పదార్ధం + 1500 యంత్రాలు);  అస్థిర పెట్టుబడి 1500. వెరసి 6000 పౌన్లు. మునుపు అస్థిర పెట్టుబడి మొత్తం పెట్టుబడిలో సగం. ఇప్పుడు నాలుగో వంతు. అంటే అప్పుడు అస్థిర భాగంగా ఉన్న మొత్తంలో కొంత భాగం (1500 పౌన్లు) స్థిర భాగానికి చేరింది. అది ఇక  శ్రమ శక్తి కొనుగోలుకి ఉపయోగపడదు. స్థిర పెట్టుబడిలో బందీ అయి ఉంటుంది. అస్థిర పెట్టుబడి స్థిర పెట్టుబడిలోకి మార్చబడింది.
అన్ని ఇతర పరిస్థితులూ మారకుండా అలాగే ఉంటే, 6000 పౌన్ల పెట్టుబడి ఇకముందు కూడా 50మందిని మించి నియమించజాలదు. యంత్రాల్లో మెరుగుదల వచ్చినప్పుడల్లా ఇంకా తక్కువమందిని నియమిస్తుంది. ఒక వేళ కొత్త యంత్రం ఖరీదు అది తొలిగించే శ్రమశక్తి ఖరీదు, పరికరాల ఖరీదు కంటే తక్కువ వుంటే, అంటే  1500 పౌన్లు కాకుండా 1000 పౌన్లే ఉంటే, 1000 పౌన్ల అస్థిర పెట్టుబడి స్థిరపెట్టుబడిగా మార్చబడి, బందీగా ఉండేది; 500 పౌన్లు విడుదలయి ఉండేది. వేతనాలు మారకుండా అలానే ఉంటే, ఆ 500 పౌన్లు తొలిగించబడ్డ 50 మందిలో 16 మందిని నియమించడానికి సరిపోతుంది. అయితే 16 మందినికూడా నియమించలేదు. కారణం: పెట్టుబడిగా వినియోగించడానికి ఈ 500 పౌన్లలో కొంత భాగం స్థిర పెట్టుబడిలోకి(ముడిసరుకులు, పరికరాలకోసం) మారాలి. మారగా, మిగిలినదానినే శ్రమ శక్తి కొనడానికి వినియోగించాలి.
కొత్త యంత్రాల తయారీకి ఎక్కువమంది మెకానిక్కులకి పనొస్తుంది. అయితే అది పనిపోయి వీధుల పాలైన తివాచీ పనివాళ్ళకి  నష్టపరిహారం అనవచ్చునా? వాటి నిర్మాణంలో అవి తొలిగించిన వాళ్ళ కంటే తక్కువమందే నియమితులవుతారు. తొలిగించబడ్డ శ్రామికుల వేతనం 1500 పౌన్లు. ఆ మొత్తం ఇప్పుడు యంత్రం రూపంలో ఈక్రింది అంశాలకి  ప్రాతినిధ్యం వహిస్తుంది:
1.      ఆ యంత్ర నిర్మాణంలో వినియోగించిన ఉత్పత్తి సాధనాల విలువ
2.      నిర్మించిన మెకానిక్కుల వేతనం
3.      యజమాని వాటాగా పోయే అదనపు విలువ.
పైగా ఆ యంత్రాలు అరిగిపోయే దాకా కొత్తవి పెట్టాల్సిన పనుండదు. కాబట్టి పెరిగిన మెకానిక్కుల్ని పనిలో ఉంచడం కోసం ఒక  కార్పెట్ మాన్యుఫాక్చరర్ తర్వాత మరొకరు పనివాళ్ళ స్థానంలో యంత్రాలను పెట్టవలసి ఉంటుంది.
పెట్టుబడిదారీ విధాన సమర్ధకులు (apologists) చెప్పేది ఇదికాదు. వాళ్ళ దృష్టిలో ఉన్నది విడుదలైన శ్రామికుల జీవితావసరాలు.
పై సందర్భంలో యంత్రాలు 50 మందిని విడుదల చేసి, వాళ్ళని నియమించుకునేందుకు ఇతరులకు అవకాశం ఇస్తాయి. అదే సమయంలో పనివాళ్ళ  వినిమయం (consumption) నుంచి 1500 పౌన్ల జీవితావసర సాధనాలని  ఉపసంహరించి, విడుదల చేస్తాయి. ఇది తెలిసిందే, కొత్తదేమీ కాదు. ఆర్ధిక పరిభాషలో దానర్ధం యంత్రాలు కార్మికుల జీవితావసరాలను విముక్తం చేస్తాయి అని. లేక జీవితావసరాలను కార్మికుణ్ణి నియమించే  పెట్టుబడిలోకి మారుస్తాయి అని.
ఈ సిద్ధాంతం అర్ధం ఏమంటే: 1500 పౌన్ల విలువచేసే జీవనాధార సాధనాలు తొలిగించబడ్డ 50 మంది శ్రమ చేత పెరుగుతూ వస్తున్న పెట్టుబడి. కనుక వాళ్లకి బలవంతపు సెలవు మొదలవగానే ఈ పెట్టుబడి వినియోగంలో ఉండదు. అదే 50 మంది శ్రమా ఉత్పాదకంగా ఎక్కడ వినియోగామవుతుందో, అక్కడ మళ్ళీ  కొత్తగా మదుపు పెట్టబడే దాకా విశ్రమించదు. అందువల్ల ఇప్పుడో, ఎప్పుడో ఆ పెట్టుబడీ కార్మికులూ మరల  కలిసి తీరాలి. అప్పటికి  నష్ట పరిహారం చెల్లింపు పూర్తి అవుతుంది. అందువల్ల యంత్రాలవల్ల తొలిగించ బడ్డ కార్మికుల బాధలు స్థిరంగా ఉండేవి కావు, తాత్కాలిక మైనవి. ఇదీ వాళ్ళ వాదన. . 
ఆ 1500 పౌన్లూ పని వాళ్లకి సరుకులు, పెట్టుబడి కాదు
తొలిగించబడ్డ పనివాళ్ళకి సంబంధించి – 1500 పౌన్ల విలువ చేసే జీవితావసర సాధనాలు ఎన్నడూ పెట్టుబడిగా లేవు. వాళ్ళు పెట్టుబడిగా ఎదుర్కున్నది దేన్నంటే, ఆ తర్వాత యంత్రాలమీద పెట్టిన 1500 పౌన్లని. మరీ జాగ్రత్తగా చూస్తే, ఈ మొత్తం (1500 పౌన్లు) తొలిగించ బడ్డ 50 మంది ఏడాదిలో ఉత్పత్తి చేసిన తివాచీల్లో ఒక భాగానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే, యజమాని నుంచి వాళ్ళ వేతనాల కింద వస్తురూపంలో కాక, డబ్బు రూపంలో అందిన భాగానికి ప్రతినిధి అన్నమాట. డబ్బు రూపంలో ఉన్న తివాచీలతో వాళ్ళు 1500 పౌన్ల విలువైన జీవితావసర వస్తువులు కొన్నారు. అందువల్ల ఆ 1500 పౌన్లూ వాళ్లకి సరుకులు, పెట్టుబడి కాదు. సరుకులకు సంబంధించి ఆ పనివాళ్ళు కొనుగోలు దారులు, వేతన శ్రామికులు కారు. యంత్రాలు వాళ్ళని కొనుగోలు సాధనం నుంచి విడుదల చేశాయి; ఈ పరిస్థితి వల్ల కొనుగోలుదారులుగా ఉన్నవాళ్ళు, కొనుగోలుదారులు కాకుండా పోయారు. ఆ కారణంగా సరుకులకు గిరాకీ తగ్గింది. ఈ తగ్గుదలని  మరొక చోట పెరుగుదల పూరించి తీరాలి. లేకుంటే, సరుకుల మార్కెట్ ధర పడిపోతుంది. ఇలాంటి స్థితి కొంతకాలం పాటు ఉంటే, ఇంకా కొనసాగితే, ఆసరుకుల ఉత్పత్తిలో ఉన్న శ్రామికులకు ఉద్వాసన మొదలవుతుంది. అంతకుముందు జీవితావసర వస్తువుల ఉత్పత్తిలో ఉన్న పెట్టుబడిలో కొంత భాగం మరొక రూపంలో పునరుత్పత్తి చెందవలసి వస్తుంది. ధరలు పడిపోతూ, పెట్టుబడి ఉన్న చోటు వదిలి వరోకచోటికి పోతూ ఉన్నప్పుడు, జీవితావసర వస్తువుల ఉత్పత్తిలో ఉన్న శ్రామికుల వంతు వస్తుంది; వాళ్ళ వేతనాల్లో కొంత భాగం నుంచి విడుదల అవుతారు. అందువల్ల, జీవితావసర సాధనాల నుంచి యంత్రాలు పనివాణ్ణి విడుదల చేసినప్పుడు, ఆ సాధనాలు అదేసమయంలో ముందుముందు అతన్ని నియమించే  పెట్టుబడిలోకి లోకి మారతాయి అని నిరూపించే బదులు, పెట్టుబడి దారీ విధాన వకాల్తాదారులు, తాము స్థిరపరుచుకున్న సరఫరా గిరాకీ సూత్రంతో (cut-and-dried law of supply and demand) ఏమి రుజువు చేస్తున్నారంటే: యంత్రాలు  అవి ప్రవేశించిన శాఖల్లోని పనివాళ్ళనే కాక, యంత్రాలు లేని శాఖల్లో పనిచేసేవాళ్ళని కూడా  బజార్లో పడేస్తాయి అని.
ఈ ఆర్ధిక వేత్తల  వాదం వాస్తవాల్ని తారుమారు చేసింది. అసలు వాస్తవాలు ఇవే:
·         యంత్రాల చేత తొలిగించబడ్డ పనివాళ్ళు శ్రమ మార్కెట్లో పడతారు. పెట్టుబడిదారులకు అందుబాటులో ఉన్న శ్రామికులతో కలుస్తారు. వాళ్ళ  సంఖ్య పెంచుతారు.
·         యంత్రాల వల్ల వచ్చే ఫలితాన్ని శ్రామికులకు వచ్చే నష్టపరిహారంగా సూచించారు. అయితే అందుకు విరుద్ధంగా, అది అత్యంత భయంకరమైన శిక్ష.  అలాగని కాపిటల్ 7 వ భాగం (The Accumulation of Capital) లో తెలుస్తుంది.
·         తొలిగించ బడ్డవాళ్ళు వేరే శాఖల్లో ప్రయత్నించవచ్చు, సందేహం లేదు. పని దొరికి, వాళ్ళకీ, జీవితావసరవస్తువులకీ మళ్ళీ బంధం పడవచ్చు. అలా పడేది ఎప్పుడంటే: మదుపు పెట్టడానికి చూస్తున్న కొత్త పెట్టుబడి మధ్య వర్తిత్వం వల్లనే, కాని మునుపు వాళ్ళని పెట్టుకున్న, ఆతర్వాత యంత్రాల్లోకి మార్చబడ్డ పెట్టుబడి మధ్యవర్తిత్వం వల్ల కాదు.
·         ఒకవేళ వాళ్లకి పని దొరికినా వాళ్ళ పరిస్థితి ఎంతో దీనంగా, దయనీయంగా ఉంటుంది. శ్రమ విభజన వల్ల వికలులాయి ఉన్నారు. పాత వృత్తికి బయట వాళ్లకి విలువ ఉండదు. ఎంతగా నంటే, వాళ్లకి పరిశ్రమల్లోకి ప్రవేశం దొరకదు- ఏవో కొన్ని తక్కువ తరహా పరిశ్రమలలో తప్ప. ఈ తక్కువ రకం పరిశ్రమలలో తక్కువ కూలి ఉంటుంది. దానికి తోడు చేరే ప్రయత్నం చేసే వాళ్ళ సంఖ్య   అతిగా ఉంటుంది.
·         అదీ కాక ప్రతి పరిశ్రమ శాఖా ప్రతి ఏడాదీ కొత్త వాళ్ళని ఆకర్షిస్తుంది. ఆ కొత్త వాళ్ళ దళం నుంచి కాళీలు నింపుతుంటారు. విస్తరణకి కావలసిన వాళ్ళని తీసుకుంటుంటారు. ఒక పరిశ్రమ శాఖలో పనివాళ్ళలో కొందరిని యంత్రాలు  విడుదల చేసీ చెయ్యగానే, రిజర్వ్ లో ఉన్న వాళ్ళు కూడా పనులున్న కొత్త దారులు పడతారు. ఇతర శాఖల్లో కుదురుతారు; ఈలోగా, పాత బాధితులు అంటే ముందే తొలిగించబడ్డ వాళ్ళు ఈపరివర్తన దశలో పస్తులుంటారు, చనిపోతారు.

పనివాణ్ణి జీవితావసర వస్తువులనుండి విడుదలచేయడంలో యంత్రాల బాధ్యత లేదు. ఇది నిస్సందేహమైనది. అవి ఏ శాఖలో ప్రవేశిస్తే అక్కడి ఉత్పత్తి పెరుగుతుంది, చౌకబడుతుంది. మొదట మొదట వేరే శాఖల్లో ఉత్పత్తయ్యే జీవితావసర వస్తువుల మొత్తంలో తేడా ఉండదు. అయితే యంత్రాలు ప్రవేశించాక తొలిగించబడ్డ వాళ్ల జీవితావసరాలు అంతకు ముందు కంటే ఎక్కువ కాకున్నా, అంతే అయినా  సమాజంలో ఉంటాయి; వార్షికోత్పత్తిలో, కార్మికులు కానివాళ్ళు వృధా చేసే భాగం కాకనే ఉంటాయి.
పెట్టుబడిదారీ సమర్ధకులు ఆధార పడ్డది ఈ పాయింట్ మీదే.
యంత్రాల పెట్టుబడిదారీ వినియోగం నుండి విడదీయరాని వైరుధ్యాలూ, వైషమ్యాలూ ఉండవని వాళ్ళంటారు. ఎందుకంటే అవి స్వయంగా యంత్రాలవల్ల తలెత్తవు, పెట్టుబడిదారీ వినియోగం వల్ల మాత్రమే తలెత్తుతాయి. అందువల్ల యంత్రాలని యంత్రాలుగా ఒంటరిగా పరిగణిస్తే శ్ర్తమ గంటల్ని తగ్గిస్తాయి. అయితే పెట్టుబడి సేవలో ఉంటే, పని గంటల్ని పెంచుతాయి; అవి యంత్రాలుగా శ్రమని సులువు పరుస్తాయి, కానీ పెట్టుబడి సేవలో అవే యంత్రాలు  శ్రమని తీవ్రతరం చేస్తాయి; అవి యంత్రాలుగా ప్రకృతిశక్తులమీద మానవ విజయం, పెట్టుబడి చేతిలో అవే యంత్రాలు ప్రకృతి శక్తులకి మానవుణ్ణి బానిస చేస్తాయి; అవి యంత్రాలుగా ఉత్పత్తిదారుల సంపదని పెంచుతాయి, కానీ పెట్టుబడి సేవలో అవే యంత్రాలు  ఉత్పత్తిదారుల్ని దరిద్రులుగా చేస్తాయి. అందువల్లా, ఇతర కారణాల వల్లా బూర్జువా ఆర్ధిక వేత్త తొణుకూ బెణుకూ లేకుండా ఈ వైరుధ్యాలన్నీ వాస్తవం యొక్క బాహ్యరూపాలే కాని వాటికి వాస్తవంగా కానీ, సిద్ధాంత పరంగా కానీ మనుగడ లేదు అని వక్కాణిస్తాడు. అంతే కాకుండా, తన ప్రత్యర్ధి మూఢుడని చెబుతాడు. ఎంతటి మూఢుడంటే, యంత్రాల పెట్టుబడిదారీ వినియోగానికి వ్యతిరేకంగా  కాకుండా, అసలు యంత్రాల వినియోగానికే వ్యతిరేకంగా  వాదించేటంతటి మూఢుడని చెప్పకనే చెబుతాడు.

1.యంత్రాల పెట్టుబడిదారీ వినియోగం వల్ల తాత్కాలిక అసౌకర్యం కలుగుతుంది – అనే విషయాన్ని అతను తిరస్కరించడు.         అయితే అతని ప్రకారం యంత్ర వినియోగం పెట్టుబడి ద్వారా మాత్రమే సాధ్యం. అన్యధా  అసాధ్యం. అతని దృష్టిలో యంత్రాలు కార్మికుణ్ణి వినియోగించుకోవడమూ, కార్మికుడు యంత్రాలని వినియోగించడమూ రెండూ ఒకటే. కాబట్టి యంత్రాల పెట్టుబడిదారీ వినియోగంలోని వాస్తవ స్థితిని ఎవరైనా  బయట పెట్టారంటే, వాళ్ళు యంత్రాల వినియోగానికే వ్యతిరేకులంటూ ముద్ర వేస్తారు. సమాజాభివృద్ధికి శత్రువులంటూ నిందిస్తారు.

2. యంత్రాలు ప్రవేశించిన పరిశ్రమల్లో పనివాళ్ళు తొలిగించబడినప్పటికీ, అది ఇతర పరిశ్రమల్లో పనివాళ్ళ నియామకాన్ని పెంచవచ్చు. ఏమైనా ఈ ఫలితానికీ, నష్టపరిహార సిద్ధాంతం అనబడే దానికీ సంబంధం ఏమీ లేదు. ఒకేరకం  వస్తువుని, చేత్తో చెయ్యవచ్చు, యంత్రంతో చెయ్యవచ్చు. రెంటిలో యంత్రంతో చేసిన వస్తువు చౌక. దీన్నుంచి ఒక తిరుగులేని సూత్రాన్ని లాగగలం:
మునుపు చేతివృత్తిలోనో, కార్ఖానా లోనో తయారైన ఉత్పాదితాల మొత్తమూ, ఇప్పుడు యంత్రాలతో తయారైన ఉత్పాదితాల మొత్తమూ  సమాన మైతే, ఇప్పుడు ఖర్చయిన మొత్తం శ్రమ తగ్గినట్లు.
శ్రమ సాధనాల మీద, యంత్రాల మీద, బొగ్గు వగయిరాలమీద  వెచ్చించిన కొత్త శ్రమ ఆ యంత్రాలవాడకం వల్ల తొలిగించబడ్డ శ్రమ కంటే తప్పకుండా తక్కువగా ఉండాలి; అలా కాకపొతే ఆయంత్ర ఉత్పాదితానికి  చేత్తో చేసిన దానంత  విలువయినా కనీసంగా ఉండి తీరుతుంది. ఎక్కువ విలువైనా ఉండవచ్చు. వాస్తవానికి తక్కువమందితో యంత్రం తయారుచేసిన మొత్తం వస్తువుల  పరిమాణం , తొలిగించబడిన చేత్తోచేసిన మొత్తం వస్తువుల పరిమాణం ఎంతో అంతే ఉండదు,అంతకన్నా ఎంతో ఎక్కువ ఉంటుంది.
1 లక్ష గజాలు చేమగ్గాల మీద నేసిన నేతగాళ్ళకన్నా తక్కువమంది నేతగాళ్ళచేత మరమగ్గాలమీద 4 లక్షల గజాల బట్ట ఉత్పత్తయింది అనుకుందాం. నాలుగింతలయిన ఉత్పత్తిలో నాలుగింతల ముడి పదార్ధం ఉంటుంది. అందువల్ల ముడి పదార్ధం ఉత్పత్తి నాలుగు రెట్లు అవాలి. అయితే భవనాలు, యంత్రాలు, బొగ్గు వంటి శ్రమ సాధనాలకు సంబంధించి అలా ఉండదు.        ఒక పరిశ్రమలో యంత్రాల వాడకం పెరిగేకొద్దీ, ఉత్పత్తి సాధనాలు సమకూర్చే పరిశ్రమల్లో ఉత్పత్తి పెరగాల్సి వస్తుంది.
తద్వారా ఎంత మంది పనివాళ్ళు పెరుగుతారు అనేది పనిదినమూ, శ్రమ తీవ్రతా అలానే ఉంటే, పెట్టిన పెట్టుబడి యొక్క  అంగనిర్మాణాన్నిబట్టి ఉంటుంది – అంటే, అస్థిర పెట్టుబడితో స్థిర పెట్టుబడికి ఉన్న నిష్పత్తిని బట్టి ఉంటుంది. ఈ నిష్పత్తి తిరిగి  యంత్రాలు ఆయా శాఖల్ని ఏమేరకు పట్టుకున్నాయి, లేదా పట్టుకుంటున్నాయి అనే దాన్ని బట్టి  ఉంటుంది. ఇంగ్లీష్ ఫాక్టరీ వ్యవస్థ అభివృద్ధితో, బొగ్గు,లోహ గనుల్లో పనిచెయ్యాల్సిన గతిపట్టిన మనుషుల సంఖ్య ఎంతగానో పెరిగింది; అయితే ఇటీవల కొన్నేళ్లుగా ఆ పెరిగే వేగం కొంత తగ్గింది, ఎందువల్లంటే, గనిపనుల్ల్లో కొత్త యంత్రాలు రావడం వల్ల.  
యంత్రం నిర్మించే కొత్త పనివాడు

యంత్రంతో పాటు దాన్ని నిర్మించే పనివాడు కొత్తగా రంగం మీదికొస్తాడు. యంత్రాల ఉత్పత్తిని కూడా యంత్రం తన పట్టులోకి తెచ్చుకుంది. రోజురోజుకీ పెరిగి పోతున్నది. ఇంగ్లాండ్ వేల్స్ లో 1861 లో యంత్ర నిర్మాణ రంగలో 60,807 మంది పనిచేసేవాళ్ళు. ముడి పదార్ధానికి సంబంధించి వేగంగా పురోగమిస్తున్న నూలు పరిశ్రమ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పత్తి పంటకు ఊపు తెచ్చింది. దాంతో ఆఫ్రికా బానిస వ్యాపారం ఊపందుకుంది. సరిహద్దుల్లో ఉన్న బానిస దేశాలకు బానిసల పెంపకం ప్రధాన వ్యాపారమయింది. అమెరికాలో బానిసల లెక్క మొదటిసారి 1790 లో తీశారు. అప్పుడు 697,000 మంది ఉన్నారు. 1861 దాదాపు 40 లక్షల మందయ్యారు.  
మరోవైపు, ఇంగ్లండ్ లో ఉన్ని ఫాక్టరీలు పెరిగినందువల్ల, పంట పొలాలు క్రమంగా గొర్రెల మేపే పచ్చిక బయళ్ళుగా మారాయి. దాంతో వ్యవసాయ కార్మికుల అవసరానికి మించి ఉన్నారు. ఈ పరిస్థితి వాళ్ళని గుంపులు గుంపులుగా పట్టణాలకు తరిమివేసింది. ఐర్లాండ్ జనాభా పోయిన 20 ఏళ్లలో సగానికి పడిపోయింది. ఇప్పుడు (1867) కూడా తగ్గుతూనే ఉన్నారు. అక్కడి భూస్వాముల, ఇంగ్లిష్ ఉన్ని ఉత్పత్తిదారుల అవసరాలకు సరిగ్గా సరిపోయేటట్లు తగ్గుతున్నారు.
నేతగానికి నూలు కావాలి. అదే అతనికి శ్రమ పదార్ధం.ఆదారం ఒకే దశలో తయారవదు. పత్తి పండించే దశ, విత్తనాలు తీసే దశ, ఏకే దశ, వడికే దశ వంటి  కొన్ని దశలు గడిస్తేనే నేతగాడు నేసే శ్రమ  చెయ్యడానికి శ్రమ పదార్ధం తయారవుతుంది.
  
శ్రమ పదార్ధం (subject of labour) తయారయ్యే దశల్లో ఏ దశల్లో యంత్రాలు ప్రవేశిస్తే అ దశల్లో ఉత్పత్తి పెరుగుతుంది. దాంతో పాటే ఆ పదార్ధాల్ని అందుకునే చేతివృత్తుల్లో, కార్ఖానాలలో  శ్రమకు గిరాకీ ఎక్కువవుతుంది. ఉదాహరణకు, యంత్రాలతో ఉత్పత్తయిన నూలు చౌక గానూ, సమృద్ధిగానూ చేమగ్గం వాళ్లకు సరఫరా అయింది. మొదట్లో అదనంగా డబ్బు వెచ్చించ కుండానే పూర్తికాలం పనిచెయ్యగలిగారు.  తదనుగుణంగా వాళ్ళ ఆదాయాలు కూడా పెరిగాయి. అందువల్ల నూలు బట్టల వృత్తి లోకి ప్రవహించారు. జెన్నీ వల్లా, త్రాజిల్ వల్లా, మ్యూల్ వల్లా  వచ్చిన 8 లక్షలమంది నేతగాళ్ళు మరమగ్గం దెబ్బకి మునిగిపోయారు.
అదే విధంగా యంత్రాలతో ఉత్పత్తయిన బట్ట సమృద్ధిగా లభించడం వల్ల దర్జీలూ, సూదితో కుట్టే స్త్రీలూ ఎక్కువమంది అవసరమయ్యారు. కనుక వాళ్ళ సంఖ్య కుట్టు యంత్రం వచ్చే దాకా పెరుగుతూనే  ఉంది.
యంత్రాలూ –శ్రమ విభజనా
యంత్రాలు ముడిపదార్ధాలనీ, మధ్యంతర ఉత్పాదితాల్నీ, శ్రమ సాధనాల్నీ అలాటి వాటిని పెంచుతాయి. వాటి ఉత్పత్తిలో అవి అదే నిష్పత్తిలో ఎన్నో శాఖలుగా విడిపోతాయి. సామాజిక ఉత్పత్తి వైవిధ్యం పెరుగుతుంది. సామాజిక శ్రమ విభజనని కార్ఖానా ఉత్పత్తి కన్నా, యంత్రోత్పత్తి ముందుకు తీసుకు పోతుంది.  ఎందుకంటే, ఫాక్టరీ వ్యవస్థ తన పట్టులో పెట్టుకున్నపరిశ్రమల్లో ఉత్పాదకతని చాలా ఎక్కువ స్థాయిలో పెంచుతుంది. 
యంత్రాలూ- విలాస వస్తువుల ఉత్పత్తీ
యంత్రాల వల్ల కలిగే తక్షణ ఫలితం : అదనపు విలువ పెరగడం, అదనపువిలువని నింపుకున్న ఉత్పాదితాల మొత్తం పెరగడం. అంటే పెట్టుబడిదారుల ఆదాయం అధికమవుతుంది. పెట్టుబడిదారులూ, వాళ్ళ మీద ఆధారపడ్డవాళ్ళూ వాడే వస్తువులు ఎక్కువగా దొరికే కొద్దీ, సమాజంలో ఈ అలాంటి వాళ్ళ తరగతి పెరుగుతుంది; దానికి తోడు, జీవితావసర వస్తువుల ఉత్పత్తి చెయ్యడానికి అవసరమయ్యే పనివాళ్ళ సంఖ్య సాపేక్షంగా తగ్గుతూ ఉంటుంది; అందువల్ల సంపద పెరిగిన వాళ్ళకి  విలాసాల కోసం కొత్తకొత్త కోర్కెలు పుట్టుకొస్తుంటాయి. ఆ కోర్కెల్ని తీర్చే సాధనాలను కూడా ఉత్పన్నం చేస్తాయి. ఆధునిక పరిశ్రమ కొత్తగా ప్రపంచ మార్కెట్లతో ఏర్పరచిన సంబంధాలు కూడా వీటికి వైవిధ్యం తెస్తాయి. అందువల్ల, విలాస వస్తువుల సంఖ్యా, వాటి  ఉత్పతీ  పెరుగుతాయి.
రవాణా పరిశ్రమల్లో శ్రామికులకి గిరాకీ
దేశీయ విలాస వస్తువులకు మరిన్ని విదేశీ వస్తువులు వస్తాయి. అంతే కాక, పెద్ద మొత్తాల్లో విదేశీ ముడిసరుకులూ , మిశ్రమ భాగాలూ (ingredients) మధ్యంతర ఉత్పాదితాలూ (intermediate products), దేశీయ పరిశ్రమల్లో ఉత్పత్తి సాధనాలుగా వాడ బడతాయి. అవి దేశ దేశాలకూ చేరాలి. కనుక రవాణా పరిశ్రమ శాఖోపశాఖలుగా చీలిపోతుంది. ఆయా శాఖల్లో  శ్రామికులకి గిరాకీ పెరుగుతుంది.
ఉత్పత్తి సాధనాల పెరుగుదలా, జీవితావసరసాధనాల పెరుగుదలా, వీటికి తోడు శ్రామికులసంఖ్య సాపేక్ష తగ్గుదలా కాలవలు, దొరువులూ సొరంగాలూ తవ్వడానికీ, వంతెనల నిర్మాణం వంటి వాటిలో  పనివాళ్ళ గిరాకీ పెంచుతాయి. అయితే ఇవి ఎప్పుడో భవిష్యత్తులో ఫలితాన్ని ఇస్తాయి.
యంత్రాల ప్రత్యక్ష ఫలితంగా గానీ, యంత్రాల వల్ల ఏర్పడే సాధారణ పారిశ్రామిక మార్పుల వల్ల గానీ, పూర్తిగా కొత్త ఉత్పత్తి శాఖలు ఏర్పడి, నూతన శ్రమ రంగాల్ని ఏర్పరచవచ్చు. అయితే  ఈ శాఖల స్థానం అత్యంత అభివృద్ధి సాధించిన దేశాల్లో సైతం ఏమాత్రమూ ముఖ్యమైంది కాదు. వాటిలో పనిదోరికే వాళ్ళ సంఖ్య, ఆపరిశ్రమలు మొరటు శారీరక శ్రమకు  కల్పించే గిరాకీని బట్టి (ప్రత్యక్ష అనులోమానుపాతంలో) ఉంటుంది. 1861 ఇంగ్లండ్, వేల్స్ జనాభా లెక్కల ప్రకారం ఇటువంటి 5 ముఖ్యమైన పరిశ్రమల్లో ఉన్న మొత్తం పనివాళ్ళు 94,145 మంది మాత్రమే.
పూర్వపు గృహ బానిసలు మళ్ళీ
ఆధునిక పరిశ్రమల్లో ఉత్పాదకత అసాధారణ స్థాయిలో ఉండడం వల్లా, అన్ని శాఖల్లో శ్రమ దోపిడీ విస్తృతీ, తీవ్రతా అధికం అవడం వల్లా – కార్మిక వర్గంలో అంతకంతకూ ఎక్కువ భాగాన్ని అనుత్పాదక పనుల్లో పెట్టడానికి వీలు కుదిరింది. ఆ కారణంగా నౌకరుల తరగతి పేరుతో పూర్వపు గృహబానిసలు పుట్టుకొస్తున్నారు. వాళ్ళలో పురుష సేవకులు, మహిళా సేవకులు, యజమానుల వెంబడి ఉండే బంట్లూ ఉంటారు.   
అంటే, అనుత్పాదక శ్రామికులు పెరుగుతారు. పూర్వపు గృహ బానిసలు మళ్ళీ పుట్టుకొస్తారు..
1861 ఇంగ్లండ్, వేల్స్ జనాభా లెక్కల ప్రకారం వస్త్ర ఫాక్టరీలలోనూ, గనుల్లోనూ పనిచేస్తున్న వాళ్ళు మొత్తం - 1,208,442
వస్త్ర ఫాక్టరీలలోనూ, లోహ పరిశ్రమల్లోనూ పనిచేస్తున్న వాళ్ళు మొత్తం - 1,039,605.
సేవకులు -1,208,648
రెండు సందర్భాలలోనూ వీళ్ళ సంఖ్య గృహబానిసల సంఖ్యా కన్నా తక్కువే. ఆహా! పెట్టుబడిదారీ విధానంలో యంత్రాల వినియోగం ఎంత అద్భుతమైనదో గదా!
వచ్చే పోస్ట్: ఫాక్టరీ వ్యవస్థ చేత పనివాళ్ళ గెంటివేతా- ఆకర్షణా
                  నూలు బట్టల పరిశ్రమలో సంక్షోభం


23, జూన్ 2018, శనివారం

కార్మికునికీ యంత్రానికీ మధ్య ఘర్షణ


కాపిటల్   అధ్యాయం -15
యంత్రాలూ ఆధునిక పరిశ్రమా
విభాగం-5
కార్మికునికీ యంత్రానికీ మధ్య ఘర్షణ
పెట్టుబడి పుట్టిన నాడే పెట్టుబడి దారుడికీ వేతన శ్రామికుడికీ ఘర్షణ ఏర్పడింది. కార్ఖానా ఉత్పత్తి దశ మొత్తంలో - ఆరంభం నుంచీ అంతం దాకా-ఈ ఘర్షణ కొనసాగింది. నతానియేల్ ఫోర్ స్టర్ అన్నట్లు యజమానులూ వాళ్ళ పనివాళ్ళూ ఎడతెగని యుద్ధంలో ఉన్నారు. యజమానుల లక్ష్యం వాళ్ళ పని వీలైనంత చౌకగా చేయించుకోవడం; అందుకోసం వాళ్ళు ఏ ఎత్తుగడకైనా వెనకాడరు. పనివాళ్ళు తమ కోర్కెల్ని తీర్చమని యజమానుల్ని ఒత్తిడి చేస్తుంటారు. అదే ఘర్షణకి కారణం. ఇరు వర్గాల ప్రయోజనాలు పరస్పర విరుద్ధమైనవి. ఏవర్గానికావర్గం తన ప్రయోజనాలు సాధించుకునే ప్రయత్నం చేస్తుంది. అదే వర్గపోరాటం. 
శ్రమ సాధనాల మీద పోరాటం
యంత్రాలు పెట్టినప్పటినుంచీ మాత్రమే, శ్రమ సాధనాలకు వ్యతిరేకంగా పోరాటం మొదలైంది. 17 వ శతాబ్దం మొత్తంలో, యూరప్ అంతటా రిబ్బన్ మగ్గం మీద తిరుగుబాట్లు జరిగాయి. ఇది రిబ్బన్లనీ, లేసులనీ చేసే యంత్రం. దీన్ని జర్మనీలో కనిపెట్టారు.  
అది ఒకేసారి 4-6 శాల్తీలు చేస్తుంది. అయితే ఈ యంత్రం కార్మికుల పని పోగొట్టి, వాళ్ళని వీధుల్లోకి తోస్తుందని  వెనిస్ నగర మేయర్ భయపడ్డాడు. దాన్ని కనిపెట్టిన వాణ్ణి గొంతు నులిమో, నీళ్ళలో ముంచో రహస్యంగా చంపించాడు. లేడెన్ లో 1629 దాకా దీన్ని వాడలేదు; రిబ్బన్ నేతగాళ్ళు కొట్లాడినందు వల్ల, టౌన్ కౌన్సిల్ దాన్ని నిషేధించాల్సొచ్చింది. కోలోన్ లో 1676 చివర్లో నిషేధించారు. అదే సమయంలో ఇంగ్లండ్ లో ప్రవేశిస్తుండగా, అక్కడ అల్లర్లు చెలరేగాయి. 1685 లో రాజశాసనం జర్మనీ అంతటా దాని వాడకాన్ని నిషేధించింది. హాంబర్గ్ లో సెనేట్ ఆజ్ఞ మేరకు యంత్రాన్ని బహిరంగంగా భస్మం చేశారు. 6 వ చార్లెస్ చక్రవర్తి 1719 లో  1685 శాసనం అమలు కాలాన్ని పొడిగించాడు. శాక్సనీ ఎలెక్టరేట్ లో 1765 దాకా దాన్ని బాహాటంగా వాడడానికి అనుమతి లేదు. ఈ యంత్రం యూరప్ ని పునాదులదాకా ఒక కుదుపు కుదిపింది. వాస్తవానికి ఈ   యంత్రం కదురు యంత్రానికీ, మర మగ్గానికీ, ముందుది. 18 వ శతాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవానికి కూడా. ఏమీ అనుభవంలేని పిలగాడు సైతం ఆమగ్గాన్ని- దానిలో ఉండే కండెలతో - సహా ఆడించ గలడు. ఒక కడ్డీని వెనక్కీ ముందుకీ అడిస్తుంటే చాలు. మెరుగుపడిన అదే యంత్రం ఒకేసారి 40-50 శాల్తీల్ని ఉత్పత్తి చేస్తుంది.

రంపకోత యంత్రం
1630 ప్రాంతంలో డచ్ దేశస్తుడు లండన్ లో గాలి వల్ల కదిలే  రంపకోత యంత్రాన్ని  తయారుచేశాడు. అయితే అది ప్రజల ఆగ్రహానికి బలై  పోయింది. 18 వ శతాబ్దం మొదట్లో సైతం జలచోదక కోత యంత్రాల్ని ప్రజలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. పార్లమెంటు సపోర్టు ఉన్నప్పటికీ ఆ యంత్రాలు అతికష్టం మీద మాత్రమే, వ్యతిరేకతను తట్టుకొని రాగలిగాయి.
గొర్రె బొచ్చు కత్తిరించే యంత్రం
1758 లో ఎవరెట్
అనే వ్యక్తి జల శక్తితో నడిచే గొర్రె బొచ్చు కత్తిరించే యంత్రాన్ని తయారుచేశాడు. అంతే,ఒక లక్షమంది పడి దాన్ని దగ్ధం చేశారు. ఎందుకంటే, దానిమూలంగా వాళ్లకి పని లేకుండా పోయింది.
ఉన్ని చిక్కుదీసే యంత్రం
ఆర్క్ రైట్ చిక్కు తీసే యంత్రాలని కనిపెట్టాడు. అప్పటికి ఆపని మీద బతుకుతున్న 50 వేలమంది ఆ యంత్రానికి వ్యతిరేకంగా పార్లమెంటుకి పిటిషన్ పెట్టారు.

19 వ శతాబ్దం తొలి 15 సంవత్సరాల్లో,మరమగ్గం వాడకాన్ని వ్యతిరేకిస్తూ లడ్డైట్ ఉద్యమకారులు యంత్రాల్ని భారీ స్థాయిలో ధ్వంసం చేశారు. ఈ చర్య జకోబిన్ వ్యతిరేక ప్రభుత్వాలకు అత్యంత అభివృద్ధి నిరోధక చర్యలు తీసుకోడానికి, దమన కాండ చేపట్టడానికీ సాకుగా ఉపయోగపడింది.
యంత్రాలకూ, వాటిని పెట్టుబడి వినియోగించడానికీ ఉన్న తేడా ఏమిటో అప్పటికి వాళ్ళు  గ్రహించ లేదు. ఆతేడా తెలుసుకొని, కార్మికులు తమ దాడుల్ని ఉత్పత్తి సాధనాల మీద కాకుండా, వాటిని వినియోగించే విధానం మీద ఎక్కుబెట్టే సరికి కొంత సమయం పట్టింది. కొంత అనుభవం అవసరం అయింది.
యంత్రాలకూ శ్రామికులకీ పోటీ
కార్ఖానా ఉత్పత్తి కాలంలో వేతనపోరాటాలు కార్ఖానా ఉత్పత్తికి వ్యతిరేకంగా ఎక్కుపెట్ట బడినవి కావు. కాని కొత్త కార్ఖానా పెట్టడానికి వ్యతిరేకత  వచ్చేదే. అయితే అది కార్మికుల వైపునించి కాదు, వృత్తి సంఘాల వైపు నించి వచ్చేది.
అందువల్ల ఆనాటి రచయితలు శ్రమ విభజనని పనివాళ్ళ కొరత తగ్గించేదిగా చూశారు. అంతేకాని పనిలో ఉన్న వాళ్ళని తొలిగించేదిగా చూడలేదు.
శ్రమ సాధనం యంత్రం రూపం పొందగానే, శ్రామికునికి పోటీదారు అవుతుంది. రికార్డో మాటల్లో: యంత్రాలూ శ్రామికులూ ఎడతెగని పోటీలో (constant competition) ఉన్నారు.

అప్పటినుండీ పెట్టుబడి స్వయం విస్తరణ, యంత్రాల మూలంగా బతుకుతెరువు పోయిన  శ్రామికుల సంఖ్యకు అనులోమాను పాతంలో ఉంటుంది. పెట్టుబడిదారీ ఉత్పత్తి వ్యవస్థ ఈ వాస్తవం మీద ఆధారపడి ఉంటుంది: పనివాడు తన శ్రమ శక్తిని ఒక సరుకుగా అమ్ముతాడు అనేదే ఆ వాస్తవం. ఒక ప్రత్యేక పనిముట్టుని వాడే నేర్పుగా చేసి శ్రమ విభజన ఆ శ్రమ శక్తిని ప్రత్యేకపరుస్తుంది. ఎప్పుడైతే, పనిముట్టుని వాడడం యంత్రం పని/వంతు అవుతుందో, అప్పుడే శ్రామికుని శ్రమ శక్తి శక్తి ఉపయోగపు విలువతో పాటు మారకం విలువ కూడా అంతర్ధానం అవుతుంది; పనివాడు అమ్ముడుపోడు- చట్టం తీసేసిన నాణెం ఎలా చలామణీ అవడో అలాగే.
పెట్టుబడి స్వయం విస్తరణకు వారితో అక్కర లేదు. అలా యంత్రాలవల్ల అక్కర లేకుండా పోయిన శ్రామికులు పాత చేతి వృత్తుల ఉత్పత్తికీ, యంత్రాల ఉత్పత్తికీ మధ్య అసమ పోటీలో దెబ్బతింటారు. లేదా, సులభంగా అందుబాటులో ఉండే పరిశ్రమ శాఖల్లోకి వరదకడతారు. శ్రమ మార్కెట్ ని ముంచెత్తుతారు. మూగు తారు.ఫలితం: శ్రమ శక్తి ధర, దాని విలువకన్నా తగ్గిపోతుంది.
కార్మికులకి ఉరట కలిగించేందుకు పెట్టుబడిదారీ విధాన సమర్ధకులు రెండు విషయాలు చెబుతారు:
1.కార్మికుల బాధలు తాత్కాలికమే
2. ఒక ఉత్పత్తి రంగాన్ని యంత్రాలు ఆక్రమించేసరికి చాలా సమయం పడుతుంది. అందువల్ల యంత్రాల వల్ల కలిగే వినాశనం యొక్క విస్తృతీ, తీవ్రతా తగ్గే విధంగా యంత్రాలు క్రమేపీ ప్రవేశ పెట్టబడతాయి.
రెంటినీ పరిశీలిస్తే, మొదటిది రెండో దాన్ని తటస్థపరుస్తుంది - అని మనకు అర్ధమౌతుంది. యంత్రాలు ఒక పరిశ్రమని దశలవారీగా పట్టుకున్నప్పుడు, వాటితో పోటీ పడే పనివాళ్ళకి నిరంతరమైన, దీర్ఘకాలిక కష్టనష్టాల్ని కలిగిస్తాయి.

ఇంగ్లాండ్ లో చేమగ్గం పనివాళ్ళ దుస్థితి
యంత్రాలు రావడం వేగంగా  జరిగితే, దాని దుష్ప్రభావం ఉగ్రంగా ఉంటుంది. ఎక్కువమంది ప్రజలమీద ప్రభావం పడి, బాధలు పడతారు. ఇందుకు రుజువుగా  ఇంగ్లండ్ లో చేమగ్గం పనివాళ్ళు నెమ్మదిగా అంతరించిన వైనాన్ని ఉదాహహరిస్తాడు. ఇంతకన్నా భయంకరమైన విషాదం  చరిత్రలో మరొకటి లేదు. ఇది పూర్తిగావడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. చివరకి 1838లో ముగిసింది. చాలామంది ఆకలితో చనిపోయారు. చాలా కుటుంబాలు రోజుకి 2 ½ పెన్నీలతో దీర్ఘకాలం బతుకులీడ్చారు.ఇంగ్లండ్ పత్తి యంత్రాలు  ఇండియా మీద తీవ్ర ప్రభావం చూపాయి.గవర్నర్ జనరల్ నివేదిక 1834-35 లో ఇలావుంది: వాణిజ్య చరిత్రలో దీనంతటి దీనస్థితి ఇంకొకటి లేదు. నూలు బట్టల నేతగాళ్ళ ఎముకలతో ఇండియా మైదానాలు తెల్లబారు/తెలుపెక్కుతున్నాయి. ఈ ఐహిక ప్రపంచం నుంచి పంపివేయడంలో, యంత్రాలు వాళ్లకి తాత్కాలిక అసౌకర్యాన్ని కలిగించాయి, అంతే.  
ఇక మిగిలిన వాళ్ళ సంగతి. యంత్రాలు కొత్త ఉత్పత్తి రంగాలను పట్టుకుంటాయి.కనుక తాత్కాలికమన్న అసౌకర్యం వాళ్లకి  శాశ్వతం అవుతుంది. కాబట్టి, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం కార్మికునికి వ్యతిరేకంగా శ్రమ సాధనాలకీ, ఉత్పాదితానికీ ఇచ్చే స్వతంత్రంగానూ , విడిగానూ ఉండే స్వభావం యంత్రాల వల్ల పూర్తి శతృత్వంగా వృద్దిచెందింది. ఇక్కడ రికార్డో నుండి కోట్ ఉంది:  
ఒక దేశ ఆదాయం అంటే రికార్డో దృష్టిలో భూస్వాముల, పెట్టుబడిదారుల ఆదాయం, అదే దేశ సంపద. ఆ ఆదాయం పెరగడానికి ఏదైతే కారణమో, అదే అంశం జనాభాన్ని అవసరానికి మించినదిగా (redundant) చేస్తుంది. శ్రామికుల పరిస్థితిని దిగజారుస్తుంది.
ఇక్కడే యంత్రాల్ని నిరంతరం మెరుగుపరచడంలో లక్ష్యం ఏమిటో  ఆండ్రూ ఉరే మాటలు ఉటంకిస్తాడు:
పూర్తిగా మనిషి శ్రమని రద్దు చెయ్యడం. లేదా మగ పెద్దవాళ్ళ స్థానంలో స్త్రీలనీ, పిల్లల్నీ నియమించో, నిపుణ శ్రామికుల స్థానంలో అనిపుణుల్ని  నియమించో శ్రమ ధరని తగ్గించడం.
అందువల్ల శ్రామికుడు మొదట శ్రమ సాధనాలమీద తిరగబడ్డది యంత్రాలరాకతోనే.
శ్రమ సాధనం శ్రామికుణ్ణి కొత్త యంత్రాలు అప్పటికే ఉన్న చేతివృత్తులతో గానీ, కార్ఖానా ఉత్పత్తితో గానీ పోటీ కి దిగినప్పుడు ఈ ఘర్షణ బలంగా బయట పడుతుంది. అక్కడి పనివాళ్ళు యంత్రాలని వ్యతిరేకిస్తారు. ఆధునిక పరిశ్రమలో సైతం యంత్రాలలో నిరంతర మెరుగుదలా, ఆటోమాటిక్ వ్యవస్థలో అభివృద్ధీ ఇంచుమించు అటువంటి ప్రభావాన్నే చూపుతుంది. 
మెరుగైన యంత్రాల లక్ష్యం శారీరక శ్రమని తగ్గించడం, మనిషి సహాయానికి బదులు  ఇనుం సహాయంతో పని పూర్తి చెయ్యడం.
ఇంతకుముందు చేత్తో తిప్పిన వాటికి (వేరే) శక్తిని వాడడం మామూలయింది. యంత్రాలలో వచ్చే  చిన్న చిన్న మార్పుల లక్ష్యం:

  •  చోదక శక్తి పొదుపు 
  • మెరుగైన పని·        
  • అంతే సమయంలో ఎక్కువ ఉత్పత్తి       
  •   పెద్దవాళ్ళ బదులు పిల్లలయినా చెయ్యగలగడం

ఆటోమాటిక్ విధానంలో నిపుణ శ్రమ క్రమేపీ లేకుండా పోతుంది. పెద్దల బదులు పిల్లల్నీ, నిపుణుల బదులు మామూలు వాళ్ళనీ పెట్టవచ్చు. యంత్రాల వల్ల ఇటుకల ఫాక్తరీల్లో నిపుణ శ్రామికులతో అసలు అవసరం లేకుండా పోయిందని ఉరే రాసాడు. ఇంజన్ భాగాలు మునుపటికన్నామెరుగైన పరికరాలతో , తక్కువ నిపుణ శ్రమతో తయారవుతున్నాయి. ఇది వేతన రేట్లను తగ్గిస్తుంది.

యంత్రాల అభివృద్ధీ – కార్మికుల తొలగింపూ
1860తర్వాత 3ఏళ్లలో యంత్రాలు ఉరుకులమీద అభివృద్ధి అయ్యాయి. దానికి అనుగుణంగా కార్మికులు తొలగింప బడ్డారు.ఉదాహరణలు:

  1.          ఒక మాంచెస్టర్ మాన్యుఫాక్చరర్- మునుపు  చిక్కుదీసే యంత్రాలు 75 ఉండేవి.ఇప్పుడు 12 ఉన్నాయి. వాటితో అంత పనీ చేస్తున్నాం. పనివాళ్ళు 14 మంది తక్కువ.వారానికి 10 పౌన్లు వేతనాలు మిగులుతున్నాయి. దూది వృధా కావడం 10 శాతం తగ్గింది.
  2.          ఒక స్పిన్నింగ్ మిల్ లో స్పీడు పెంచడం ద్వారానూ, కొన్ని స్వయం చాలక ప్రక్రియల్ని ప్రవేసపెట్టడం ద్వారానూ ఒక విభాగంలో నాలుగో వంతు మందిని తొలిగించారు. ఇంకో విభాగంలో సగం మందిని బయటకు పంపించారు.
  3.          రెండోసారి నూలు చిక్కుదీసే యంత్రాన్నోకదాన్ని తెచ్చి, పనివాళ్ళని చాలామందిని తగ్గించారు.
  4.          మరొక మిల్లులో యంత్రాల వల్ల మూడోవంతు పనివాళ్ళకు పని పోయింది. యజమానులకి మూడోవంతు ఖర్చు తగ్గింది.
అంతా ఇదే కాదు, ఇంకా వుంది.
మా దారం వాడే తయారీ దారులు ఎక్కువ గుడ్డ తయారు చేసేవారు.. పాత యంత్రాలతో తీసిన దారంతో నేసిన బట్టకన్నా చౌకగా గిట్టేది.

ఇక్కడ యంత్రాలలో మెరుగుదలలు మొత్తం ఫలితాన్ని తెలిపే పట్టిక ఉంది. ఆఫలితం ఇది.

1861 – 1868 కాలంలో 338 దూది ఫాక్టరీలు పోయాయి. వేరే మాటల్లో చెబితే, ఆ యంత్రాలను  మించి ఉత్పత్తిచేసే యంత్రాలు కొద్ది మంది పెట్టుబడిదారుల చేతుల్లో చేరాయి. మరమగ్గాలు 20,663 తగ్గిపోయాయి. అదే కాలంలో ఉత్పత్తి పెరిగింది. కనుక పాత యంత్రాలకంటే కొత్త యంత్రాలు ఎక్కువ ఫలితాన్నిచ్చాయి. కండెలు 1,612,541 పెరిగాయి. అయితే పనివాళ్ళు 50,505 మంది
తగ్గారు. దూది సంక్షోభం వల్ల  కార్మికులకు కలిగిన తాత్కాలిక కష్ట నష్టాలు అధికమయ్యాయి. యంత్రాల మెరుగుదల వల్ల  తాత్కాలిక కష్ట నష్టాలు శాశ్వతం అయ్యాయి.

యంత్రం శ్రామికునికి  పోటీ దారు
శ్రామికుని మీద యంత్రం పైచేయి సాధించి, నిరంతరం అతడి అవసరం లేకుండా చేస్తూ ఉంటుంది. ఆవిధంగా యంత్రం అతనికి పోటీ దారు అవుతుంది. అంతేకాదు, శ్రామికుడికి హాని చేసే శక్తి కూడా.  అలాగని  పెట్టుబడి బహిరంగంగా ప్రకటిస్తుంది. దాన్ని ఉపయోగించుకుంటుంది కూడా. పెట్టుబడి నిరంకుశత్వాన్ని ఎదిరిస్తూ కార్మిక వర్గం చేసే తిరుగుబాట్లను అణచివేసేందుకు యంత్రం శక్తివంతమైన ఆయుధం.
గాస్కెల్ ప్రకారం ఆవిరి ఇంజన్ మొదట్నించీ మానవ శక్తికి శత్రువే. కొత్తగా ఏర్పడ్డ  ఫాక్టరీ వ్యవస్థకు సంక్షోభాన్ని తెచ్చిపెట్టే,  పెరుగుతున్న కార్మికుల కోర్కెల్ని అణగ తొక్కడానికి పెట్టుబడిదారుడికి వీలు కలిగించచిన శత్రువు. కార్మికుల తిరుబాట్లకు వ్యతిరేకంగా పెట్టుబడికి 1830 నుండీ  కొత్తకొత్త యంత్రాలను కనిపెట్టారు. ఆ ఆవిష్కరణల గురించి చరిత్ర రాయవచ్చు. అలాంటి వాటిలో స్వయంచాలక కదురు (self-acting mule) ప్రధాన మయింది. ఎందుకంటే, ఆటోమాటిక్ వ్యవస్థలో కొత్త శకాన్ని తెరిచింది అదే. ఇందుకు రుజువుగా ఇక్కడ  ఫుట్నోట్ పెట్టాడు మార్క్స్.
తన వర్క్ షాప్ లో సమ్మెల కారణంగా , యంత్రాలని నిర్మించేందుకు యంత్రాలు ఉపయోగించడంలో ఎంతో ముఖ్యమైన అనేక కొత్త పద్ధతుల్ని కనుగొన్నట్లు ఫెయిర్ బైర్న్ చెప్పాడు అనేదే ఆ ఫుట్ నోట్.
ఆవిరి సమ్మెటని కనిపెట్టిన నాస్మిత్ ఇంజనీర్ల దీర్ఘ సమ్మె మూలంగా 1851 లో తాను యంత్రాలకు చేసిన మెరుగుదలల గురించి ఇలా చెప్పాడు :  ఆధునిక మెరుగుదలల లక్షణం స్వయం చాలక పరికర యంత్రాలని ప్రవేశ పెట్టడమే. ఇక పనివాడు చెయ్య వలసిన దాన్ని పిల్లవాడు కూడా చెయ్యగలడు. అదేమంటే, యంత్రం చేసే సొగసైన పనిని పర్యవేక్షించడమే. తమ నిపుణత మీద ఆధారపడ్డ పనివాళ్ళని తొలిగించాను. మునుపు ఒక మెకానిక్ కి నలుగు పిల్లల్ని పెట్టాను. ఇప్పుడు పెద్ద వాళ్ళను 1500 నుంచి 750 కి తగ్గించాను. నాకు లాభాలు బాగా పెరిగాయి.
కార్మికుల ప్రతిఘటనకు  దెబ్బ
కాలికో ప్రింటింగ్ లో వాడిన యంత్రం గురించి ఉరే ఇలా అన్నాడు: పనివాళ్ళతో ఉన్న భారమైన ఒప్పందాల షరతుల నుంచి పెట్టుబడిదారులు విముక్తి కోసం సైన్స్ ని  ఆశ్రయించారు.
కొత్త కొత్త  యంత్రాల రాకతో, మెరుగుదలలతో  కార్మికుల కలిసికట్టు ప్రతిఘటన దెబ్బతిన్నది. వాళ్ళు లొంగి పోవలసి వచ్చింది.
స్వయం చాలక కదురు గురించి చెబుతూ, పెట్టుబడి సైన్స్ ని తన సేవకు వినియోగించు కున్నప్పుడు, అది పెడసరి పనివాణ్ణి  వాలుకి తెస్తుంది, అణకువ నేర్పుతుంది. ఈ మహత్తర సిద్దాంతం అప్పటికే ఉన్నప్పటీ, స్వయం చాలక కదురు యంత్రం ఆ సిద్దాంతానని ధృవపరిచింది.
ఉరే పుస్తకం(The Philosophy of Manufactures) రాసి 30 ఏళ్లయింది. అప్పటికి ఫాక్టరీ వ్యవస్థ  కొద్దిగానే అభివృద్ధి చెంది ఉంది. అయినప్పటికీ ఆరచన ఫాక్టరీ తత్వాన్ని సరిగ్గా బయట పెడుతుంది. పై సిద్ధాంతాన్ని ప్రతిపాదించాక, ఉరే కోపం కట్టలు తెంచుకుంది. ఎందుకంటే, భౌతిక-యాంత్రిక శాస్త్రం పేదల్నిల్ని పెట్టుబడిదారుడు వేధించే సాధనంగా ఉన్నదని నిందిస్తున్నారు,అందుకని. 
కార్మికులకు ఆండ్రూ ఉరే హెచ్చరిక
యంత్రాలు త్వర త్వరగా అభివృద్ధి అవడం, కార్మికవర్గాలకి  ప్రయోజనకరమో సుదీర్ఘంగా ఉపదేశించాక, వాళ్లకి ఒక హెచ్చరిక చేస్తాడు. ఏమంటే, కార్మికుల పట్టుదలవల్లా, సమ్మెలవల్లా యంత్రాల అభివృద్ధిని వేగవంతం అవుతుంది. మెరుగైన యంత్రాలు పనివాళ్ళను తగ్గిస్తాయి. కనుక ముందు చూపులేకుండా ప్రవర్తిస్తే తమని తామే నష్టపరుచుకున్న వాళ్ళవుతారు.
దీనికి కొన్ని పేజీల వెనక ఇందుకు వ్యతిరేకమైనది రాశాడు:
ఫాక్టరీ పనివాళ్ళకున్న పొరపాటు అభిప్రాయాల మూలంగా తీవ్ర ఘర్షణలూ, అంతరాయాలూ ఏర్పడుతున్నాయి. అవి లేకున్నట్లయితే ఫాక్టరీ వ్యవస్థ ఇంకా వేగంగా అభివృద్ధయ్యేది. సంబంధించిన వారందరికీ మరింత ప్రయోజనకరంగా ఉండేది అన్నాడు. అయితే మళ్ళీ ఇలా అన్నాడు: బ్రిటన్ నూలుబట్టలు ఉత్పత్తయ్యే జిల్లాల్లో, సమాజం అదృష్టం వశాత్తూ యంత్రాల మేరుగుదలలు క్రమంగా వస్తున్నాయి. మెరుగుదల వల్ల పెద్దవాళ్ళకి కొందరికి పనిపోయి, ఆదాయం తగ్గుతుంది. అయితే అది పిల్లల శ్రమకి గిరాకీ పెంచుతుంది. వాళ్ళ వేతనాల రేటు పెంచుతుంది. ఇలాంటి ఊరడింపు పలుకులు పలికే ఇతనే పిల్లల తక్కువ వేతనాల్ని సమర్ధిస్తాడు. అందుకు అతను చెప్పే కారణం : ఆపరిస్థితి  తలిదండ్రులు పిల్లల్ని మరీ పిన్న వయసులో ఫాక్తరీలకు పంపకుండా ఆపుతుంది. ఈ మొత్తం పుస్తకం కాల పరిమితి లేని పనిరోజుని సమర్ధిస్తుంది. పార్లమెంటు 13 ఎల్లా లోపు పిల్లల్ని 12 గంటల పనితో అలిసి పోయేట్లు పనిలో పెట్టకూడదు అనే చట్టాన్ని ఒప్పుకో కూడదు అంటాడు. ఉదారవాద వ్యక్తికి మధ్య యుగాల చీకటి రోజుల్ని గుర్తుకొస్తున్నాయి.
వచ్చే పోస్ట్-యంత్రాలు తొలిగించిన కార్మికులకు  నష్టపరిహారం గురించిన సిద్ధాంతం.